Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి, ప్రాణాలను హరించడానికన్నా, ప్రాణాలను కాపాడు కోవడానికి ఆధారమైన ''పని''ని కొల్లగొట్టింది. లాక్డౌన్ అనబడే పద్మవ్యూహంలో నుంచి బయటపడడానికి కనీసం మార్గాన్ని చూపించే దశలో పని కల్పించే వారు (యాజమాన్యం) లేరు, అట్టి దిశా నిర్దేశాన్ని చేసే ఆలోచన కూడా ప్రభుత్వం చేయడం లేదు. పని కల్పించలేకపోతున్న పెట్టుబడిదారుల కన్నా, ప్రభుత్వం ద్వారా విపరీతమైన దాడి కార్మికులపై జరుగుతున్నది. పనిని పునరుద్ధరించే ప్రక్రియని వదిలి, సదరు సంస్థల ఉనికే లేకుండా చేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నవి. మార్కెట్లో అసలు పనియే లేదు, ఉన్న పనికి ఎంతో పోటీ ఉన్నది, ఇటువంటి పరిస్థితుల్లో జీతభత్యాలు పనిగంటలు వంటివాటిని రెగ్యులేట్ చేయవలసిన ప్రభుత్వం, కార్మిక చట్టాలను సవరిస్తూ, పని గంటలను పెంచుతూ, అంతర్రాష్ట్ర కార్మిక వలసలపై నిషేధాలు విధిస్తూ, చర్యలు తీసుకుంటే బతుకులు ఎట్లా సాగుతాయి? మూతబడి పోతున్న సంస్థలను పునరుద్ధరించడాన్ని వదిలేసి ప్రభుత్వ ఆధీనంలో నడిచే సంస్థలను కూడా మూసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క ఉదుటన 26 ప్రభుత్వ రంగాల్లో వాటాల ఉపసంహరణకు ప్రభుత్వం సిద్దపడుతున్నదన్న వార్త బిజినెస్ స్టాండార్డ్ పత్రిక ద్వారా బహిర్గతమైంది. 135కోట్ల జనాభాలో 2కోట్లు కూడా లేని సంఘటిత రంగ కార్మికులు స్థూల జాతీయ ఉత్పత్తిలో కొనియాడదగిన పాత్ర పోషిస్తున్నారు, ఇందులో ప్రభుత్వ రంగ పాత్ర గణనీయమైనది. సంఘటిత రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ రంగాల అన్నింటిని మూకుమ్మడిగా అమ్మి వేయాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటే, వాటి పర్యవసానాలను ప్రజలకు వివరించే అవకాశమే లేకుండా పోయింది. భారతదేశ మీడియా మొత్తం సంచలనాల మీద ఘనమైన శవ యాత్ర చేస్తూ సుశాంత్ సింగ్ రాజ్పుత్, రియా చక్రవర్తి, కంగనా రనౌత్ వంటి వ్యక్తిగత వ్యవహారాలపై కేంద్రీకరించింది. ప్రభుత్వం వేసే తప్పటడుగులను కనీసం గుర్తించే సోయిలో కూడా భారత మీడియా లేదు. కార్మిక సంఘాలు, అభ్యుదయవాదులు ఎవరైనా అట్టి ప్రయత్నం చేస్తే ప్రధాన మీడియాలో స్థానమే లేదు. పైగా ప్రభుత్వాల నుంచి నిషేధాజ్ఞలు ఉంటున్నవి. నిరసనలు నినాదాలు ఒకప్పుడు వార్తల్లో మొదటి స్థానాన్ని పొందేవి. ఇప్పుడు కనీసం గుర్తింపుకు కూడా నోచుకోవడం లేదు. దీనికితోడు దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిరసనల, నినాదాల పీక నొక్కేస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో నిరసనలను తెలంగాణ వంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు నిషేధించాయి. కార్మిక వర్గ దక్పథంతో రోడ్లపైకి వచ్చి నినదించే వామపక్షాల పిలుపులను ముందే పసిగట్టి ముందురోజే గహనిర్బంధం చేయడమో లేదా మరో రకమైన అణచివేతకో ప్రభుత్వాలు సిద్ధమవుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. ఒక సంస్థ పై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను, ఆ సంస్థపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు విడమరచి చెప్పగల సామర్థ్యం అందులోని ఉద్యోగ సంఘాలకు ఉద్యోగులకు ఉంటుంది. ప్రభుత్వ నిర్బంధం వలన ఈ అవకాశమే తగ్గిపోయిన సందర్భంలో కరోనా మహమ్మారి రూపంలో వాస్తవాల వెలుగు రేఖలపై పూర్తిగా చీకట్లు కమ్ముకున్నాయి. ఇదే అదునుగా యాజమాన్యాలూ చెప్పాపెట్టకుండా ఉద్యోగులను కుదించడం వంటి ఏకపక్ష నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి. తీవ్రంగా ప్రతిఘటిద్దామంటే అనువైన పరిస్థితులు లేవు. సంఘటిత పరిచేందుకు దిక్కు తోచని స్థితి నెలకొని ఉన్నది.
శరణ్యమైన ప్రత్యామ్నాయ పోరాటాలు
గత్యంతరం లేని ఇట్లాంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు కూడా ప్రత్యామ్నాయ విధానాలపై దష్టి పెట్టి సోషల్ మీడియాను ఆసరాగా ఎంచుకొని తమ పోరాటాన్ని ప్రచారాల ద్వారా నిర్వహించడం ప్రారంభించాయి. అభిప్రాయ వ్యక్తీకరణకు సోషల్ మీడియా ఇప్పుడు ప్రధాన వేదికగా మారింది. సాధారణ మీటింగుల్లో హాజరు శాతం కన్నా ఫేసుబుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ద్వారా నిర్వహించబడే వెబినార్ లేదా ఆన్లైన్ బహిరంగ సభలకు విపరీతమైన ఆదరణ లభిస్తున్నది. తమకు ఊడిగం చేసేవరకూ ఎంజారు చేసిన ప్రభుత్వం తమపై నిరసన వ్యక్తం చేయడానికి వేదిక అయ్యేసరికి ఫేసుబుక్ లాంటి సదరు సోషల్ మీడియాను కూడా తమ గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నాలకు దిగుతున్నారు. ''సోషల్ మీడియాపై ప్రభుత్వ అజమాయిషీ ఉండాలి'' అంటూ ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించడం వీరి ఎత్తులకు బలం చేకూరుస్తున్నది. ఇప్పటికే ఫేస్బుక్లో ప్రభుత్వ విధానాలపై గాని లేదా పాలిస్తున్న వారి పేర్లపై గాని నిరసనలు వ్యక్తం అయితే, ఫేసుబుక్ దానిని తొలగిస్తుంది. సోషల్ మీడియా వేదికలపై వ్యాఖ్యల ద్వారా లేదా వీడియోల ద్వారా జరుపుతున్న నిరసనను సదరు సంస్థలు తొలగించడం ఒకపక్క చేస్తుంటే, దీనిని అధిగమిస్తూ మరో రూపంలో ప్ల కార్డుల ద్వారా ఒక ఫోటో దిగి, ఆ ఫొటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ కొత్త తరహాలో తమ నిరసనను వ్యక్తపరచడంలో కార్మిక పోరాట యోధులు ఉండడం అభినందనీయం. ప్ల కార్డుల ప్రదర్శన దారులను కూడా యాజమాన్యం, ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నదని తెలుస్తున్నది. ఇది తెలుసుకున్న వాళ్లు తాము ధరించే టీ షర్టు వెనక భాగంపై వాస్తవాలను ముద్రించి, వీపు కనిపించే విధంగా ఫొటోలు దిగి, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించడానికి మరోమార్గం ఎన్నుకుంటున్నారు. అక్షరం రాయకుండా, మాట పలకకుండా, ఫొటో ద్వారానే తమ నిరసనలు తెలుపుతున్న వారిని కూడా నిషేధించే ప్రయత్నం ప్రభుత్వం చేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే నిరంకుశ ధోరణిలో ముందుకెళ్తున్న వాళ్లు నిరసనను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించరు. ఈ ధోరణి కొంతకాలం మాత్రమే మనగలుగు తుందన్న విషయాన్ని మర్చిపోయి వేస్తున్న ఈ తప్పటడుగులు కొన్ని తరాల వారిని నష్టపరుస్తాయి. విచక్షణారహిత దోపిడిలోంచే విప్లవాలు పెల్లుబికి వస్తాయన్నది చరిత్ర చెప్పిన సత్యం.
పెట్టుబడి ప్రపంచీకరించబడినప్పుడు దానిని ధీటుగా ఎదుర్కోవడానికి ''గ్లోబల్ స్ట్రగుల్ ఆన్ గ్లోబలైజేషన్'' పేరున పోరాటాలు పాతికేండ్ల నుంచే ప్రపంచీకరించబడినవి. ఈ మధ్య కాలపు అలాంటి ఉదాహరణ- 2011లో అమెరికాలో మొదలైన వాల్స్ట్రీట్ ఉద్యమం-180 దేశాల్లో నిర్వహించ బడింది. ''మీరు దోపిడీని ప్రపంచీకరణ ఇస్తే మేము పోరాటాలను ప్రపంచీకరిస్తాం'' అంటూ రెండు దశాబ్దాల క్రితమే ఏసియన్ సోషల్ ఫోరం, వరల్డ్ సోషల్ ఫోరంలు నినదించాయి. 1945లో ప్రారంభమైన వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (డబ్ల్యూఎఫ్టియు) ప్రపంచ ఐక్య పోరాటాలకు వేదికగా ఉన్నది. నూతన సమాజాన్ని నిర్మించే క్రమంలో పెట్టుబడిదారీ వ్యవస్థ చక్రాల కింద నలిగిపోయే ప్రజానీకాన్ని ప్రభుత్వం గానీ సదరు వ్యవస్థ గానీ పట్టించుకోవు అని, అట్టి వ్యవస్థలను ఓడించే వరకు ఆ పాత్ర కార్మిక సంఘాలు తీసుకోవాలని డబ్ల్యూ ఎఫ్టీయు నిర్దేశిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన విద్యుత్ ఉద్యమం చారిత్రకం. ప్రభుత్వాల వెన్నులో వణుకు పుట్టించింది. ఆనాటి అమరుల త్యాగాల ఫలితాలను నేడు లక్షల మంది అనుభవిస్తున్నారు. ఇది మర్చిపోకూడదు. 1978-79 కాలపు రైల్వే పోరాటం-ఫలితాలు నేటికీ ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. భీమారంగాన్ని ప్రయివేటీకరించడం అన్న ఆలోచన 1993లోనే మల్హోత్రా కమిటీ ద్వారా ఏర్పడింది. బ్యాంకింగ్ రంగ నష్టపూరిత సంస్కరణలకై నరసింహన్ కమిటీ ద్వారా 1990ల్లోనే ఆజ్యం పోయబడింది. మూడు దశాబ్దాలుగా ఆ పని పూర్తికాకుండా ఆగిపోవడానికి కార్మిక సంఘాల నిరంతర పోరాటమే కారణం. ఆ స్ఫూర్తిని తీసుకుని ఎన్ని అవాంతరాలు ఏర్పడినా, ప్రభుత్వాలు పెట్టుబడి సంస్థలు ఎన్ని రకాల నిర్బంధాలను ముందుకు తెచ్చినా ప్రత్యామ్నాయ మార్గంలో పోరాటాలు చేయడమే కార్మిక వర్గ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని విడనాడకుండా మొక్కవోని విశ్వాసంతో అనేక మాధ్యమాల ద్వారా వినూత్న పద్ధతులతో నిరసనలు తెలుపుతున్న కార్మికవర్గానికి లాల్ సలాం.
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016