Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి మాట్లాడే అర్హత బీజేపీ నాయకులకు ఉన్నదా? సెప్టెంబర్ 17 మీద వీరికి ఎందుకింత ప్రేమ? బైరాన్పల్లి అమరవీరుల స్థూపం ఎందుకు సందర్శించారు. ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ రాజ్యం విలీనం ప్రాధాన్యతను తక్కువ చేసి చూపటంలో మర్మం ఏమిటి? విలీనానికి ఇంత ప్రాధాన్యత ఉంటే.. సాయుధ పోరాటం 1951 వరకు ఎందుకు సాగింది? ఇవన్నీ పరిశీలించాల్సిన అంశాలే...
యూనియన్ సైన్యాలను గట్టిగా ప్రతిఘటించకుండానే.. నాలుగు రోజుల్లోనే నిజాం నవాబు సైన్యం చేతులెత్తేసింది. ఇందుకు కారణం కూడా చూడాలి. ఆ కీలక సమయంలో కాంగ్రెసు నాయకత్వంగానీ, ప్రధానిగా నెహ్రూ, హౌంమంత్రిగా సర్దార్ పటేల్ అనుసరించిన వైఖరిగానీ గమనించాలి.
ఐలమ్మ భూమి రక్షణ కోసం జరిగిన పోరాటం రైతాంగానికి స్ఫూర్తి నిచ్చింది. 1946, జూలై 4న దొడ్డి కొమరయ్య నేలకొరగటంతో రైతాంగం తిరుగుబాటు ప్రారంభమైంది. కమ్యూనిస్టుల నాయకత్వంలో సాయుధ పోరాట రూపం సంతరించుకున్నది. తెలంగాణ గడ్డమీద సాయుధ రైతాంగ పోరాటం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలోనే 1947, ఆగస్టు 15న స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించింది. బ్రిటిష్ ఇండియా వెలుపల కొనసాగుతున్న 565 సంస్థానాలలో మూడు మినహా మిగిలినవన్నీ ఇండియన్ యూనియన్లో విలీనానికి అంగీకరించాయి. హైదరాబాద్, కాశ్మీర్ సంస్థానాలు స్వతంత్ర దేశాలుగానే కొనసాగుతామని ప్రకటించుకున్నాయి. నైజాం నవాబు రైతాంగ పోరాటాన్ని అణచివేయగలడని జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ విశ్వసించారు. నిజాంరాజుతో ఇండియన్ యూనియన్ ప్రభుత్వం యథాతథ ఒప్పందం చేసుకున్నది. హైదరాబాద్ రాజ్యం స్వతంత్ర దేశంగా కొనసాగడానికీ, నిజాం పాలనకూ నెహ్రూ ప్రభుత్వం అభ్యంతర పెట్టలేదు. పోరాడుతున్న రైతాంగం మాత్రం ఇందుకు అంగీకరించలేదు. జమీందార్లు, జాగీర్దార్లకు అండగా ఉండి, తమను పీడిస్తున్న నిజాం పాలనకు గోరీ కట్టాలన్న దృఢ నిశ్చయంతో ప్రజలు తిరగబడ్డారు. నెహ్రూ - పటేల్ అంచనాలు తలకిందులయ్యాయి. నిజాం ప్రభుత్వం కూలిపోతే జరిగే పర్యవసానాల పట్ల నెహ్రూ ప్రభుత్వం ఆందోళన చెందింది. భారత ఉపఖండం నడిబొడ్డున కమ్యూనిస్టు ఉద్యమం బలపడితే ఏంజరుగుతుందో ఊహించుకున్నారు. నిజాం ప్రభుత్వంతోనైనా రాజీపడ్డారు గానీ, ఉవ్వెత్తున సాగుతున్న రైతాంగ పోరాటాన్ని మాత్రం అంగీకరించలేక పోయారు. యథాతథ ఒప్పందాన్ని పక్కన బెట్టి 1948 సెప్టెంబరు 13న యూనియన్ సైన్యాలు హైదరాబాద్లో అడుగుపెట్టాయి. అప్పటికే పునాదులు కదిలి ఉన్న నిజాం ప్రభుత్వం నాలుగు రోజుల్లోనే చేతులెత్తేసింది. సెప్టెంబర్ 17న ఇండియన్ యూనియన్లో విలీనానికి నిజాం అంగీకరించాడు.
నిజాం సర్కారుతో పోరాడుతున్న రైతాంగం కానీ, కమ్యూనిస్టుపార్టీ కానీ యూనియన్ సైన్యాలను వ్యతిరేకించలేదు. నెహ్రూ సైన్యాలు మాత్రం హైదరాబాద్ రాజ్యాన్ని విలీనం చేయడానికి అంగీకరించటంతో వెనుతిరుగలేదు. తెలంగాణ ప్రజలు ఛీత్కరించిన నిజాం రాజునే హైదరాబాద్ స్టేట్ రాజ ప్రముఖ్గా నియమించింది. యూనియన్ సైన్యాలు రైతాంగం మీద విరుచుకుపడ్డారు. నిజాం ప్రభుత్వ దాడిలో మరణించింది 1500మంది కాగా, నెహ్రూ సైన్యాలు 2500 మందిని పొట్టన పెట్టుకున్నాయి. పేదలకు పంచిన భూములు గుంజుకుని జమీందార్లకు అప్పగించే పనిలో పడ్డాయి. పట్టణాలకు పారిపోయిన భూస్వాములను గ్రామాలకు చేర్చి అండగా నిలిచే పనిలో నిమగమయ్యాయి. ఇదీ కాంగ్రెసు పాలకుల నైజం. దేశమంతా స్వాతంత్య్రం సాధించుకున్న సంబురాల్లో ఉన్న సమయంలో తెలంగాణలో రైతులు రక్తం చిందించవల్సి వచ్చింది. జమీందారీ వ్యతిరేక పోరాటంలో సాధించుకున్న భూములు, హక్కులు కాపాడుకునేందుకు సాయుధ పోరాటం కొనసాగించాల్సి వచ్చింది. భూసంస్కరణలకు, కౌలుదార్ల హక్కులు కాపాడేందుకు కేంద్రం ఒప్పుకోవటంతో సాయుధ పోరాటం విరమించారు.
తెలంగాణలో కమ్యూనిస్టు నాయకత్వంలో రైతాంగ పోరాటం జరుగుతున్న కాలంలోనే కాశ్మీర్ రైతాంగం కూడా షేక్ అబ్దుల్లా నాయకత్వంలో పోరాడారు. భూమికోసం, ప్రజాస్వామ్యం కోసం, రాచరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు. మరోవైపు అదే రైతాంగం పాకిస్థాన్ సైన్యాలనూ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే కాశ్మీర్ కూడా ఇండియన్ యూనియన్లో విలీనమైంది. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తినీ, సాంస్కృతిక వైవిధ్యం పరిరక్షణకూ, ఆస్తుల రక్షణకూ గ్యారంటీ ఇచ్చిన నేపథ్యంలో విలీనానికి మార్గం సుగమమైంది.
హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైందే తప్ప ఆనాటి కర్తవ్యాలు మాత్రం పూర్తికాలేదు. భూమి సమస్య పరిష్కారం కాలేదు. ఫామ్హౌజ్ల పేరుతో వందల ఎకరాల భూస్వాములు కొనసాగుతున్నారు. సుమారు 65శాతం మంది రైతు కుటుంబాలకు 2.2 ఎకరాలలోపే భూమి ఉన్నది. శాసనసభలో ముఖ్యమంత్రి చెప్పిన లెక్క ప్రకారమే కేవలం 6679 మంది దగ్గర రెండున్నర లక్షల ఎకరాల భూమి ఉన్నది. భూస్వాములూ, ధనిక రైతుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పాలకులు వ్యవహరిస్తున్నారు. స్వాతంత్య్రోద్యమ కాలం నుంచీ టాటా, బిర్లాలాంటి బడా పారిశ్రామిక వేత్తలతో పెనవేసుకున్న బంధంతో సాగుతున్న కాంగ్రెసు పాలకులు భూస్వాములనీ చేరదీసారు. లైంగికదాడులూ, కుల దురహంకార దాడులూ నేటికీ పెరుగుతూనే ఉన్నాయి. నిరుద్యోగం, ఉపాధి సమస్యలు తారస్థాయికి చేరుకున్నాయి. వ్యయసాయేతర, పారిశ్రామిక కార్మికవర్గం సంఖ్యలో బాగా విస్తరించింది. వారి శ్రమ దోపిడీ కూడా అంతకంటే పెరిగింది. వృత్తులు ధ్వంసమవుతున్నాయి. ప్రత్యామ్నాయం చూపే బాధ్యతల నుంచి పాలకులు తప్పుకున్నారు. ఇలాంటి సమయంలో ప్రజాసమస్యలు పక్కనబెట్టి బీజేపీ, ఆరెస్సెస్ పరివారం విలీనమా? విమోచనమా? అన్న చర్చను ముందుకు తెస్తున్నారు. విలీనం ప్రాధాన్యతను తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. హిందూ ముస్లిం ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు. ముస్లిం రాజు నుంచి హిందువుల విమోచనగా వక్రీకరిస్తున్నారు.
హైదరాబాద్ రాజ్యం గానీ, కాశ్మీర్ సంస్థానం గానీ ప్రత్యేక చారిత్రక నేపథ్యంలో విలీనమైన విషయం బీజేపీ నాయకత్వానికి మింగుడుపడదు. సాంస్కృతిక వైవిధ్య భరితమైన సువిశాల భారతదేశం ఎట్లా ఆవిర్భవించిందో గమనించాలి. ఇండియన్ యూనియన్గా ఎందుకు పిలిచారో కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యయుత పరిణామ క్రమం బీజేపీకి ఎందుకు మింగుడుపడదో కూడా అర్థమవుతుంది. అనేక భాషలూ, సంస్కృతులు కలిగిన ప్రాంతాలను, రాజ్యాలను తెల్లదొరలు హస్తగతం చేసుకోవటం ద్వారా బ్రిటిష్ ఇండియా అవతరించింది. బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలోనే ఈ ప్రజల మధ్య సమైక్య భావం పెంపొందింది. భాషలు, ప్రాంతాలు, మతాలు వేరైనా భారతీయులుగా రూపొందారు. ఈ క్రమంలో ఆవిర్భవించిందే స్వతంత్ర భారతదేశం. అనేక భాషలు, జాతులు, మతాలకు చెందిన ప్రాంతాల ప్రజలు స్వాతంత్య్రోద్యమ స్రవంతిలో ఏకమై పోరాడిన ఫలితమే ఇది. అనేక సాంస్కృతిక సమూహాల సమాహారం ఇది. అందుకే ఇండియన్ యూనియన్ అని పిలిచారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, కాశ్మీర్ సంస్థానాలు కూడా విలీనమయ్యాయి. ఆయా ప్రాంతాల ప్రజలు తమ ఆశలూ, అవసరాలూ, సాంస్కృతిక వారసత్వాల కోసం పోరాడుతూనే జాతీయోద్యమంలో పాల్గొన్నారు. భిన్న జాతుల సమాహారంగా, వైవిధ్య భరితమైన భారతదేశం ఆవిర్భవించింది. అందుకే రాజ్యాంగంలో కూడా యూనియన్ ఆఫ్ స్టేట్స్ (రాష్ట్రాల సమాఖ్య)గా పేర్కొన్నారు. ఫెడరల్ రాజ్యాంగం ప్రత్యేక చారిత్రక పరిణామ క్రమంలో రూపుదిద్దుకున్నది. ఇదీ చరిత్ర. అందుకే.. విలీనాన్ని అంగీకరిస్తే, ఫెడరల్ స్ఫూర్తిని గౌరవించాలి. సమాఖ్య స్ఫూర్తిని అంగీకరించని బీజేపీ నేతలకు 'విలీనం' అన్న మాట వినసొంపుగా ఉండదు.
హైదరాబాద్, కాశ్మీర్ రాచరికాలను కూలదోయటం గొప్ప ప్రజాస్వామ్య ప్రక్రియ. ఈ రెండు ప్రాంతాలలోనూ రైతాంగ పోరాటాలతో సాధించుకున్న ప్రజాస్వామ్య విలువలే, స్వాతంత్య్రోద్యమ సంప్రదాయాల ఫలితంగా ఏర్పడిన ఇండియన్ యూనియన్లో విలీనానికి పునాది. ఇక్కడ జమీందారీ వ్యతిరేక పోరాటంతో అణుమాత్రం కూడా ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదు. పైగా కాశ్మీర్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనం కావద్దనీ, రాచరికమే కొనసాగాలనీ చెప్పిన సంస్థ ఆర్ఎస్ఎస్. అటు స్వాతంత్య్రోద్యమంతోనూ సంబంధం లేకపోగా తెల్లదొరల సేవలో తరించిన సంస్థ ఆర్ఎస్ఎస్. రాచరికాన్ని సమర్థించిన ఈ ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగమే బీజేపీ కదా! రాచరికపు నియంతృత్వం, ఛాందసవాదం కలగలిసిన వీరికి సహజంగానే ప్రజాస్వామ్యం అంటే గిట్టదు. రాజ్యాంగ విలువలూ గిట్టవు.
తెలంగాణలో ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాగిన సాంస్కృతికోద్యమం కూడా అది. తెలుగు భాష అభివృద్ధి కోసం, సాంస్కృతిక హక్కుల కోసం సాగిన పోరాటమది. భాషాపరమైన హక్కుల కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమాన్నీ, భూమికోసం సాగిన వర్గ పోరాటాన్నీ మతపరమైన ఉద్యమంగా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ నాయకత్వం. మతపరమైన భావోద్వేగాలుగా చిత్రీకరించటం ద్వారా ప్రాంతీయ భాష ప్రాధాన్యతను నిరాకరిస్తున్నారు. ఒకే దేశం, ఒకే జాతి, ఒకే భాష పేరుతో పెరుగుతున్న నిరంకుశ పోకడలే ఇందుకు కారణం. దేశ సమగ్రత కాపాడే శక్తి హిందీభాషకే ఉన్నదన్న అమిత్షా ప్రకటన అంతరార్థం కూడా ఇదే!
భూమికోసం నిజాం పాలనతో తలపడిన తొలి అమరుడు బందగి. ముస్లిం రాజుతో పోరాడి అమరుడైన బందగి కూడా ముస్లిం. నిజాం రాచరికపు దౌర్జన్యాలను ఎండగట్టిన కలం యోధుడు షోయబుల్లాఖాన్. నిజాంమూకల దాడిలోనే కన్నుమూసిన వీరుడు. రాచరికపు నిర్బంధాన్ని లెక్కచేయక, 1938లోనే ఔరంగాబాద్లో శ్రామిక మహాసభలో పాల్గొని మఖ్దూం మొహియుద్దీన్, హబీబ్లు కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. భూస్వామ్య, పెట్టుబడిదారీ దోపిడీలకు వ్యతిరేకంగా, రాచరికానికి వ్యతిరేకంగా 1939లోనే హైదరాబాద్లో కామ్రేడ్స్ అసోసియేషన్ ప్రారంభించిన వారిలో ఆలం ఖుంద్మిరీ ఒకరు. ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనిన్ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు మఖ్దూం మొహియుద్దీన్. 1947 ఆగస్టు 15న ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కార్యాలయం మీద త్రివర్ణ పతాకం ఎగురవేసారు. నిజాం కాలేజీలో విద్యార్థి నాయకుడు రఫీ అహ్మద్ కూడా జాతీయ పతాకం ఆవిష్కరించారు. వీరంతా ముస్లింలే. నిజాం సంస్థానంలో తొలికార్మికవర్గ నాయకులలో హిందు, ముస్లిం, దళిత, అగ్రవర్ణ కుటుంబాల నుంచి వచ్చిన నేతలుండటం గమనార్హం. కుల మత భేదాలను పక్కనబెట్టిన వర్గ ఐక్యత ఫలితమే అది. నాటి నాయకులలో మఖ్దూం మొహియుద్దీన్, రాజ్ బహదూర్గౌర్, జవాద్ రజ్వీ, ఆలం ఖుంద్మిరీ, లింగారెడ్డి, శేషగిరి, కెఎల్ మహేంద్ర, పర్సా సత్యనారాయణ, అలీ అఖ్తర్, సాంబమూర్తి, లక్ష్మీదాస్, సయ్యద్ ఖాసిం, దేవరాజ్ తదితరులు ముఖ్యులు. మత భేదాలను పక్కన బెట్టి రైతాంగం ఐక్యంగా తిరగబడ్డది. ఈ పోరాటాన్ని అణచేందుకు హిందూ జమీందార్లూ, ముస్లిం రాజూ ఏకమయ్యారు. రైతాంగానికీ, జమీందార్లకు మధ్య సాగిన వర్గపోరాటం అది. ఈ వర్గ ఐక్యతను మరుగుపరచేందుకే బీజేపీ నేతలు ఇప్పుడు మతపరమైన ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు.
వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. భూమి సమస్యను తొలిసారిగా ఎజెండా మీదకు తెచ్చిన మహత్తర పోరాటమది. మాతృభాష అభివృద్ధి కోసం సాగిన సాంస్కృతికోద్యమం. కుల, మత భేదాలు వదిలి భూమికోసం, భుక్తి కోసం, వెట్టి నుంచి విముక్తి కోసం సాగిన వర్గపోరాటం. కొంగు నడుముకు చుట్టిన చెల్లెండ్లు, పురుషులతోబాటు కదనరంగంలోకి దూకిన మహౌద్యమం. సభలకూ, ప్రదర్శనలకూ సమీప గ్రామాల నుంచి తరలి వచ్చిన ప్రజలకు అతిధి గ్రామాల ప్రజలు సామూహిక బంతి భోజనాలు ఏర్పాటు చేసేవారు. అక్కడ కులం లేదు, మతంలేదు. వండేవారూ, వడ్డించేవారూ, తినేవారూ... ఎవరైనా, కులం పట్టించుకోలేదు. వేలాది గ్రామ రాజ్యాలలో మహిళల హక్కులు ఆమోదించారు. కులవివక్షను తిరస్కరించారు. నేటి సమస్యల పరిష్కారం కోసం దిశానిర్దేదశం చేస్తున్న స్ఫూర్తి దాయక పోరాటం. ఈ చరిత్ర నేటి తరానికి అర్థమైతే ఏం జరుగుతుందో బీజేపీ నేతలకు తెలుసు. మోడీ పాలన వైఫల్యాల మీద ప్రజలు పోరాడకుండా పక్కదారులు పట్టించటం కోసమే మతం రంగుపులమటం.
ఎర్రజెండా ఔన్నత్యాన్నీ, కమ్యూనిస్టుల ప్రత్యేకతనూ నేటితరం గుర్తిస్తే ప్రత్యామ్నాయ విధానాలవైపు యువత దృష్టి సారిస్తుంది. మోడీ పాలనను ప్రశ్నిస్తుంది. అందుకే చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. యువత మదిలో విషబీజాలు నాటేందుకూ, మతం రంగు పులిమేందుకు విఫలయత్నం చేస్తున్నారు.
- ఎస్. వీరయ్య