Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంప్రదాయ వాదులు, దైవ విశ్వాసం గలవారు, అన్ని మతాల బోధకులు, ప్రవచనకారులు వగైరాలంతా అసలు నీతి నిజాయితీ అనే మాటలు ఉచ్ఛరించగూడదు. ఎందుకంటే వారు నిరూపణలేని దైవం మీద విశ్వాసం ఉంచుకోవడంతో పాటు జనాన్ని కూడా కుట్రపూరితంగా మోసం చేస్తున్నారు. వాస్తవాలు, నిజాలు మాట్లాడని వారు తమకు నీతి నిజాయితీ ఉందని, ఇతరుల్లో అవి ఉండాలని బోధించడం హాస్యాస్పదం. అది అబద్ధాలు ప్రచారం చేసేవాడు ఇతరులకు నిజం మాట్లాడమని చెప్పినట్టుగా ఉంటుంది. చిత్తుగా తాగిన తాగుబోతు తడబాటు లేకుండా అడుగులేయాలని హితబోధ చేసినట్టు ఉంటుంది. ఆత్మ ద్రోహం చేసుకుని బతుకుతూ, ఇతరులకు ద్రోహం చేస్తూ, నైతికత గురించి, నీతి నిజాయితీ గురించి ఉపన్యాసాలిస్తే వాటికి అసలు విలువ ఉంటుందా? ఒకసారి ఆలోచించండి!
నిజానికి ఇస్లాం మతం ప్రమాదంలో లేదు. క్రైస్తవం ప్రమాదంలో లేదు. హిందూమతం కూడా ప్రమాదంలో లేదు. మత పిచ్చిలో పడ్డ మనిషే ప్రమాదంలో ఉన్నాడు. చనిపోయిన వాడికి తను చనిపోయినట్టు తెలియదు. దగ్గరి వాళ్ళంతా విలవిలాడుతారు. మూర్ఖత్వంలో ఉన్న వాడికి కూడా తను మూర్ఖత్వంలో ఉన్నాడని తెలియదు. ఇతరులు జాలిగా బాధపడతారు. మూర్ఖత్వం మరణం కంటే తక్కువది కాదు. అందుకే విశ్వ విఖ్యాత రచయిత మార్క్ ట్వెయిన్ ఇలా అన్నారు. ''వాళ్ళు పిచ్చివాళ్ళయి పోతున్నారని వాళ్ళకు తెలియకుండా, జనాన్ని పిచ్చి వాళ్ళను చేయొచ్చు.. ఒక వాస్తవాన్ని చెప్పి ఒప్పించడం కష్టం!'' అని! ఉగ్రవాదులకీ వీరికీ తేడా ఏమిటంటే వారికి మత పిచ్చి మాత్రమే ఉంటుంది. మూర్ఖత్వంలో కొట్టుమిట్టాడే వీరికి కులపిచ్చి, వర్ణ పిచ్చి, వర్గ పిచ్చి, ప్రాంతీయపిచ్చి లాంటివి ఎన్నో ఉంటాయి. మత పిచ్చి ఉన్నవాడు ఇతర మతస్థుల్ని ద్వేషిస్తాడు. కుల పిచ్చిగాడు మాత్రం స్వంత మతంలోని మనుషుల్నే అంటరానివాళ్ళుగా దూరం పెట్టి అవమానిస్తాడు. తన ఆధిక్యత చూపుకోవడమే వాడికి ముఖ్యం. ఇలాంటి పరిస్థితి గమనించే రాహుల్ సాంకృత్యాయన్ ఏనాడో ఓ మాట చెప్పారు. ''ప్రతి మతం ఇతర మతానికి వ్యతిరేకం. కానీ, ప్రజల్ని పీడించడానికి అన్నీ ఏకమవుతాయి.'' అని - నిజమే కదా? ఈనాటికీ పరిస్థితి మారలేదు - ఉగ్రవాదిమతం పేరుతో బయటి నుంచి మనపై దాడి చేస్తాడు. వీడు మన అగ్రవాది - మతం పేరుతోనే స్వదేశీయులపైనే దాడులు చేస్తాడు. ఇద్దరి ఉన్మాదం ఒకటే కదా? ఇదే విషయం మీద ఒక ఇమామ్ ఏమన్నాడో చూడండి.. ''ఆత్మాహుతి ద్వారా స్వర్గానికి వెళ్ళడం ఖాయం అని విశ్వసిస్తూ ఉంటే గనక, వారు తమను మాత్రమే పేల్చుకోవాలి. అంతేగాని, ఇతరులను కాల్చడం దేనికీ? అది న్యాయమా?'' అని ప్రశ్నించాడు ఇమామ్ తవ్హిడి. అంటే, ఇలా ఉచితంగా జనానిన 'స్వర్గాని'కి పంపడం న్యాయమా?
''మతం ఒక ప్రమాదకరమైన మూర్ఖత్వాన్ని నేర్పుతూ ఉంటుంది. అది చావుతో కూడా ముగిసిపోదు'' అని అన్నారు ప్రముఖ జీవ పరిణామ శాస్త్రవేత్త రిచర్డ్ డాకిన్స్. ఆయన హేతువాది కూడా కాబట్టి అలా అన్నాడని అనుకుందాం. మరి హేతువాదంతోనూ, విజ్ఞాన శాస్త్రంతోనూ అంతగా సంబంధం లేని ప్రఖ్యాత ప్రకృతి కవి విలియం వర్డ్స్ వర్త్ కూడా అదే అభిప్రాయం ఎందుకు వెలిబుచ్చాడు.. ఆలోచించాలి కదా? పైగా ఇద్దరూ బ్రిటిష్వారే. వర్డ్స్ వర్త్ చెప్పిన మాట ఏమిటంటే.. ''శాంతి సౌఖ్యం, విశ్రాంతి ఇవ్వలేని మతం కంటే, ప్రకృతి ఆరాధనే ఉత్తమం!'' అని. విశ్వవిఖ్యాత బ్రిటిష్ శాస్త్రవేత్త ఛార్లెస్ డార్విన్ తన మిత్రుడికి రాసిన ఒక ఉత్తరంలో మతం పట్ల తన అభిప్రాయం తెలియజేశాడు. జీసస్ మీద గాని, బైబిల్ మీద గాని, తనకు విశ్వాసం లేదని ఆయన తన మిత్రుడు ప్రాన్సిస్ మెక్ డెర్మొట్ అనే యువ బారిస్టర్కు రాశాడు. ''న్యూ టెస్ట్మెంట్ మీద మీకు విశ్వాసం ఉందో లేదో దయచేసి తెలియజేయండి - నేను దాన్ని బహిర్గతం చేయను'' అని ఆ యువ బారిస్టర్ లేఖ రాస్తే - దానికి జవాబుగా డార్విన్ అలా రాశాడు. అయితే చాలా కాలానికి డార్విన్ చేతి రాతతో ఉన్న ఆ ఉత్తరం న్యూయార్క్లో వేలం వేశారు. అప్పుడు అది లక్షా తొంభయి ఏడువేలు పలికింది. ఆ లేఖ రాసింది 23 నవంబర్ 1880న అయితే, ఓ యాభై సంవత్సరాల తర్వాత అది వేలం వేయబడింది. డార్విన్ వ్యక్తిత్వానికి, చేతిరాతకు, అభిప్రాయానికి ఎంత విలువ ఉంటే, ఆ రోజుల్లోనే అంత డబ్బుకు వేలం వేయబడాలీ? డార్విన్ మతం గురించి, దేవుడి గురించి ఎక్కడా ఏమీ చెప్పలేదు. జీవ పరిణామం ఎలా జరిగిందో రుజువులతో సహా తన సిద్ధాంతం ప్రతిపాదించాడు. అంతే, ప్రపంచ వైజ్ఞానిక జగత్తు జేజేలు పలికింది. అదే క్రమంగా దైవ విశ్వాసకుల్ని ఆలోచనలో పడేస్తూ వస్తోంది.
''గతమంతా నిండింది / పురాణాల బూజులతో / బూతు కథల మోజులతో / ఆలినెవడొ ఎత్తుకెలితే / అంగలార్చె అర్ఛకుని / దేవుడంటూ కొలిచే / మతవాది మారాలి / హేతువాది కావాలి / అతడు చీరెలెత్తుకెళ్ళే పాట / చిత్రంగా పాడుకుంటూ / వెర్రి మొర్రి కథలకు / బుర్రలమ్ముకొన్నట్టి / వేదాంతి మారాలి / హేతువాది కావాలి'' - అని ఆకాంక్షించారు కవి, ఉద్యమకారుడైన కత్తి పద్మారావు. రామకోటి, విష్ణు సహస్ర నామాల వంటి విషయాలు దాటి అయ్యవార్లు రాలేకపోతున్నారు. అంతకు మించిన జ్ఞానం వారికి లేదని సామాన్య జనం గ్రహించుకోవాలి. ఎక్కువ శాతం ఉన్న చెడుని దాచేసి, కొద్దిగా ఉన్న మంచిని చూపి మత బోధకులు తమ మత గ్రంథాల డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. పైగా తమకు తామే, తాము అభ్యుదయ వాదులమని రొమ్ము విరుచుకుంటూ ఉంటారు. మిత్ - నుంచి పుట్టిందే మైథాలజీ అయినప్పుడు అది చరిత్ర అని నిరూపించటానికి కొందరు విఫలయత్నం చేస్తుంటారు. అందుకే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అన్నారు.. ''హేతువాదానికి నిలబడని వాదనలు విశ్వసించగూడదు. సమాజం చైతన్యవంతంగా పురోగమించా లంటే కాలాన్ని అనుసరించి నడుచుకోవాలి'' అని! అంతే కాదు ఇదే విషయాన్ని బ్రిటిష్ అమెరికన్ వక్త, జర్నలిస్ట్, విశ్వ విఖ్యాత రచయిత క్రిస్టోఫర్ హిచ్చెన్స్ మరింత స్పష్టంగా చెప్పాడు. ''ఆధారం లేకుండా చెప్పబడుతున్న దేనినైనా.. ఆధారం లేకుండానే తోసిపుచ్చవచ్చు'' అని!
దేశంలో మూఢనమ్మకాలు లేని జీవన విధానం ఏదైనా ఉంటే అది బౌద్ధమే! నిజానికి అది మతం కాదు. కొంతలో కొంత హింసను తగ్గించి, శాంతిని స్థాపించింది బుద్ధుడే. హిందూ పరిపాలకులెవరూ శాంతిని కోరుకోలేదు. హిందూమతాన్ని, వేదాలను నమ్మని చార్వాకుల్ని ధర్మరాజు (మహాభారతంలోని పాత్రకాదు) అనే పరిపాలకుడు నిర్దాక్షిణ్యంగా హత్యలు చేయించాడు. ఆ చార్వాకుల స్ఫూర్తితోనే బుద్ధుడు నాస్తికత్వాన్ని ప్రచారం చేశాడు. బుద్ధుడు నేర్చిన నాస్తికత్వం అజిత కేశ కంబళి అనే భౌతికవాదితో జరిగిన చర్చలో నేర్చుకున్నదే! అందువల్ల బుద్దుణ్ణి ఒక సామాజిక వాదిగా చూడాలి. దేవుడే లేడన్న బుద్ధుణ్ణి ఈ దేశంలో దుర్మార్గంగా దేవుణ్ణి చేశారు. ఆయన జీవిత కథని, ఆయన బోధనల్ని మార్చి రాశారు. చివరకు ఆయననే దశావతారాల్లో చేర్చుకున్నారు. భగవంతుడు అబద్ధం గనక, బుద్ధుణ్ణి 'భగవంతుడు' అని అనగూడదు. కొన్నేండ్ల క్రితం ఈ నేల మీద నడయాడిన చారిత్రక పురుషుడు. మహౌన్నత వ్యక్తిత్వం గల గొప్ప సంఘ సంస్కర్త! బౌద్ధంలోని అహింసని హైజాక్ చేసిన మనువాదులు తాము అహింసావాదులమని ప్రకటించు కుంటూ ఉంటారు. అదే నిజమైతే మరి వారు పూజించే దేవుళ్ళ చేతుల్లో అన్నన్ని ఆయుధాలు ఎందుకున్నాయి? వారి సంప్రదాయంలో జంతు బలులు, నరబలులు ఎందుకున్నాయి? శతాబ్దాలు గడిచినా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఎందుకు దొరకడం లేదూ? ఏ మానవత్వాన్ని నిలుపడానికి ఇవి సంస్కృతిలో భాగమయ్యాయి? దుష్టులను శిక్షిస్తున్నాడనే నెపం మీద ఎందుకు హింసను ప్రోత్సహించడం జరిగింది? సృష్టించగల సత్తానే దేవుడికి ఉంటే మరి దుష్టులను సృష్టించడం దేనికీ? మానవులందరినీ సద్భుద్ధితో సృష్టిస్తే సరిపోయేది కదా? ఈ కలహాలు, హత్యలు, దోపిడీలు, లైంగిక వేదింపులు, యుద్ధాలు ఉండేవి కావు కదా? అంటే, అలాంటి సద్భుద్ధి దేవుడికే లేదన్న మాట! అలాంటప్పుడు ఇక మనుషులకేం ఇవ్వగలడూ?
మొదట దుష్టులను సృష్టించడం, మళ్ళీ వాళ్ళను సంహరించడానికి ఆయుధాలు ఉపయోగించడం, హింసను ప్రేరేపించడం.. సున్నిత మనస్కులైన మానవులు, శాంతి కాముకులు భరించలేరు కదా? జనాన్ని భయపెట్టి, అందులోంచి భక్తి పుట్టిస్తాడా? భయపెట్టే తండ్రిని ఏ పిల్లలూ ప్రేమించరు. తొలినాళ్ళలో దేవుణ్ణి సృష్టించి, ఒక్కొక్కటిగా కట్టుకథలు రాసిన ఆనాటి రచయితలకు మెదడుసరిగా పెరిగినట్టు లేదు. వారిచ్చే వివరాలు, వివరణలు హేతుబద్ధంగా లేవు. అసంబద్ధంగా ఉన్నాయి. అందుకే పునః సమీక్షించుకోవాల్సి వస్తోంది! విశ్వ మానవ సౌబ్రాతృత్వం గురించి ఏ దేవుడైనా చెప్పాడా? లేదే? అవగాహనా రాహిత్యం తప్ప, అజ్ఞానం తప్ప మత గ్రంథాల్లో జ్ఞానమెక్కడుందీ? ఇవి సర్వకాల సర్వావస్థలకు ప్రామాణికం ఎలా అవుతాయి? ''ఏ మతమైనా నరకం పేరుతో భయపెట్టి, స్వర్గం పేరుతో ఆశపెట్టి భక్తులను లొంగదీసుకునేదే'' అని అన్నాడు రాబర్ట్ జి. ఇంగర్సాల్ అనే అమెరికన్ రచయిత. 'స్వేచ్ఛాలోచన'కు ప్రంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినవాడతడు. బలులు, యజ్ఞాలు, యాగాలు హిందూ ధర్మంలో భాగమై ఉన్నప్పుడు, వేల ఏండ్ల క్రితమే బుద్ధుడు వాటిని ఎందుకు వ్యతిరేకించాడో ఒకసారి ఆలోచించండి. వాటి వల్ల కొంత మంది అగ్రవర్ణాలకు ఏం మేలు జరిగేదో కాని, సామాన్యులు తీవ్రంగా నష్టపోయేవారు. వాటివల్ల వ్యవసాయం బాగా దెబ్బతినేది. పశువులపై ఆధారపడ్డ ఇతర వృత్తుల వారికి తీవ్రనష్టం కలిగేది. ఇది కేవలం హిందూ మతానికే పరిమితమైలేదు. ఇతర మతాలలో కూడా హింస ఉంది. ఉదాహరణకు 'నరహత్య చేయవద్దు' అన్న వాక్యం బైబిల్లో ఒకసారి కనిపిస్తే, 'నరహత్య చెయ్యి' అన్న వాక్యం వందసార్లు కనిపిస్తుంది.
''దేవుడి పట్ల సమర్పణ భావం లేకపోతే జరిగే నష్టం ఏమీ ఉండదు. కాని, నైతికత లేకపోతే... అన్నీ కోల్పోయినట్టే. నైతికత అనేది ప్రజల ఆస్థి'' అని అన్నారు పెరియార్ ఇ.వి. రామస్వామి. తమిళనాడులోని శ్రీరంగపట్నంలో శ్రీరంగనాథ ఆలయం ఎదురుగా ఉన్న పెరియార్ విగ్రహం కింద పాలరాయి మీద చెక్కబడి ఉన్న సందేహం ఈ విధంగా ఉంది -
దేవుణ్ణి మరిచి మనిషికి కృతజ్ఞతలు చెప్పు
దేవుడు లేడు. దేవుడు లేడు. దేవుడు అసలే లేడు!!
సమర్పణ భావం వ్యక్తిగత విషయం
నైతికత ప్రజల సొత్తు - ఇ.వి. రామస్వామి (17 సెప్టెంబర్ జయంతి)
దేశం నిండా వేల దేవాలయాలు కడితే నాస్తికుల మనోభావాలు దెబ్బతినలేదు. కాని ఒక దేవాలయం ఎదురుగా ఉన్న పెరియార్ సందేశం వల్ల ఆస్థికుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకు కొందరు కోర్టుకెక్కారు. ''భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎవరి అభిప్రాయం వారు కలిగి ఉండొచ్చు. అది నేరం కాదు'' అని కోర్టు చెప్పడంతో కోర్టుకెక్కిన వారి నోళ్ళు మూతపడ్డాయి.
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్.