Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భీమాకోరేగాంను మనం మర్చిపోదామన్నా కేంద్రంలోని మనువాద ప్రతిరూప ప్రభుత్వం మర్చిపోనిచ్చేలా లేదు. 2018 జనవరి 1న భీమాకోరేగాం గ్రామంలో జరిగిన దళితుల మహాప్రదర్శన-ప్రతిగా హిందూత్వశక్తుల ప్రదర్శన సందర్భంగా జరిగిన విధ్వంసం, ఆ ముందు రోజు (2017 డిసెంబరు 31) పూనేలో ఈ ప్రదర్శన జయప్రదం చేయడానికి జరిగిన సభ - ఎల్గార్ పరిషద్, అందులో నాయకులు హిందూత్వంపై విరుచుకు పడ్డ తీరు, కబీర్ నాట్యమంచ్ తదితర సాంస్కృతిక సంస్థల ప్రదర్శనలు, నాట్యాలు, నాటికలూ, బీజేపీ నాయకత్వానికి చిర్రెత్తిచ్చాయి. పైగా అప్పటికి కేంద్రంలోనే కాదు, మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 500మంది మీద కేసులు బుక్అయ్యాయి. 110మందిని అరెస్ట్ చేశారు. అంతేకాదు. దీనంతటికీ ఎల్గార్ పరిషత్లో రెచ్చగొట్టుడు ఉపన్యాసాలు కారణమని, ఈ సభకి నిషేధిత మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, రాజీవ్ గాంధీ హత్య మోడల్లో ప్రస్తుత ప్రధాన మంత్రిని హత్య చేసే కుట్ర రూపొందించారని ఇప్పటి వరకు దేశంలోని 13మంది మేధావులూ, మానవ/పౌరహక్కుల నేతలూ, విద్యావేత్తలూ న్యాయవాదులూ సామాజిక కార్యకర్తల మీద 153ఎ, 120బి వంటి క్రిమినల్ కేసులు పెట్టి నిర్భందించారు. ఇంకా ఎంతమందిని అరెస్టు చేస్తారో తెలియదు. ప్రస్త్తుతం యూఏపీఏ (అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) కింద పై 13మందిని నిర్బంధించడం జరిగింది. వాస్తవానికి ఘటన జరిగినప్పుడు మహారాష్ట్రలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. విచిత్రమేమంటే జనవరి ప్రదర్శనను విచ్ఛిన్నం చేయడానికి పూనుకున్న హిందుత్వ శక్తులను వాటికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించిన 'శివప్రస్ధాన్ హిందూస్థాన్' నాయకుడు షాంబాజీ భిడే, 'సమస్త హిందు ఆఘాడి' నాయకుడు మిలింద్ ఏక్బోటేలను అరెస్ట్ చేసినట్టే చేసి వదిలేసారు. భిడే గతంలో జోదా అక్బర్ సినిమాపై దాడి చేయడం, సినిమా హాల్స్ని లూటీ చేసాడన్న నేరారోపణ కేసులు ఉన్న వ్యక్తి. మిలింద్ బీజేపీ కార్పొరేటర్గా పనిచేసాడు. కాని ఆ తరువాత కొద్ది నెలలకే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం పడిపోయింది. శివసేన-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. దేశవ్యాపితంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఆ రాష్ట్రంలో అనేక దళిత సమస్యలు, సీపీఐ(ఎం) వంటి వామపక్ష పార్టీలు ప్రత్యక్ష ఆందోళన సాగించాయి. కేంద్రంలో వున్న బీజేపీ పరిస్థితి చేయి జారుతుందని గ్రహించి మొత్తం వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ)కి అప్పగించింది. దీనితో యూఏపీఏ రంగంలోకి వచ్చింది. పైశాచిక వేట ప్రారంభమైంది. ఈ రాక్షస క్రీడ ఎప్పటిదాకా సాగుతుంది, ఎలా పరిణమిస్తుంది అన్నది ఊహించడం కష్టం కాదు. ఏమైనా ఇది హిందూత్వ శక్తులు విసురుతున్న ఓ పెద్ద సవాలు అని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. మహేష్ రౌత్ ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి అవార్డు గ్రహీత సుధా భరద్వాజ్ ప్రముఖ న్యాయవాది. అరుష్ ఫరేరా న్యాయవాది, మానవ హక్కుల ఉద్యమకారుడు. వెర్నాన్ గోన్సాల్వ్స్ రచయిత. వరవరరావు రచయిత, పౌరహక్కుల నేత, గౌతమ్ నవలఖ పాత్రికేయుడు. హానిమన్బాబు ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆనంద్ తేల్తుంబ్దే బి.ఆర్.అంబేద్కర్ మనవడు, అహమ్మదాబాద్ ఐఐఎంలో ప్రొఫెసర్. షోమా సేన్ ప్రముఖ విద్యావేత్త. సుధీర్ ధావలే ప్రచురణకర్త. సురేంద్ర గాడ్లింగ్ న్యాయవాది. రోశా హిల్సన్ సామాజిక కార్యకర్త. వీరందరి రాజకీయ, సైద్ధాంతిక అవగాహనలు ఎలా ఉన్నా మానవ హక్కులు ప్రత్యేకించి దళితులు, గిరిజనులూ, ముస్లిం మైనారిటీలూ, మహిళల హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈక్రమంలో అనివార్యంగా ప్రస్తుతం కేంద్రంలో కొలువుతీరి ఉన్న మనువాద శక్తులకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు. న్యాయస్థానాల్లో ధనస్వామ్యానికి, అగ్రకుల దురంహకారానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు.
అందువలన ఈ కక్ష్య సాధింపు. దాడి దళిత ఉద్యమం మీదే కాదు, దేశంలోని ప్రగతిశీల భావజాలం పైన, ప్రశ్నించే హక్కు మీద హిందుత్వ దాడిగా చూడాల్సి ఉంటుంది. 80ఏండ్లు దాటిన వరవరరావు లాంటి వారికి కోవిడ్ సోకినా, ఆయన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యంకోసం బెయిలిమ్మని కోరినా న్యాయస్థానం వినిపించుకోవడంలేదు. ఆశ్చర్యమేమంటే ఇప్పటి వరకు వీరిలో కొందరిపై ఛార్జిషీటు కూడా దాఖలు చేయలేదు. మరింత విస్మయం కలిగించే విషయం ఏమంటే బీజేపీ అఖిల భారత అధికార ప్రతినిధి సంవిద్ మహాపాత్రో ఎన్ఐఎకి దొరికిందని చెబుతున్న సదరు లేఖను మీడియాకు చూపడం. ఎన్ఐఏకు దొరికిన లేఖను బీజేపీ నేత మీడియా ముందు ఎలా ప్రదర్శించాడు? ఇదంత చూస్తుంటే వెర్నాన్ భార్య, న్యాయవాది అయిన షుశాన్ అబ్రహం అన్నట్టు ''వీరు బయటకు వస్తారన్న ఆశ కనబడుటలేదు. అరెస్టు చేయడం నెలల తరబడి బెయిలు యివ్వకపోవడం ఛార్జిషీటు దాఖలు కాకపోయినా న్యాయమూర్తులు పట్టించుకోకపోవడం చూస్తే అదే ఒక పెద్ద శిక్షలాగా ఉంది''. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా అధినేత ఒకరు ఫ్రంట్లైన్ పత్రికకు ఈ ఉదంతాన్ని వివరిస్తూ యూఏపీఏ అనేది ప్రభుత్వం చేతిలో ఒక ఆయుధంలాగా తయారయింది. సుదీర్ఘకాలం జైల్లో నిర్బంధించడం, కఠినమైన బెయిలు నిబంధనలు విధించడం, విచారణను వీలైనంత నింపాదిగా జరిగే అవకాశం కలిగివుడటం బట్టి చూస్తే నిందితులు బయకు రావడం దాదాపు అసాధ్యం. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం యూఏపీఏ కింద 2018 నుంచి 93శాతం కేసులు వివిధ కోర్టుల ముందు పెండింగ్లో ఉన్నాయి. నిర్థారించబడినవి కేవలం 27శాతం మాత్రమే. అరుణ్ ఫెరీరాను యూఏపీఏ కింద 2007లో నిర్భంధించారు. 5ఏండ్ల తరువాత ఆయనను నిర్దోషిగా తేలుస్తూ విడుదల చేశారు.
'భీమా కోరేగాం' గురించి...
ఇప్పటికే అనేక వివరాలు పత్రికల ద్వారా తెలిసినవే. భీమ నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం కోరేగావ్. 1818 జనవరి 1వ తేదీన పూనా రాజధానిగా పరిపాలన చేస్తున్న చిత్ పవన్ బ్రాహ్మలైన పీష్వాలకు ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో ఒక భాగమైన మహర్ (దళిత కులం) రెజిమెంట్కు జరిగిన యుద్ధంలో అత్యంత శక్తివంతమైన పీష్వా సైన్యం వెనుదిరిగింది. ఈ యుద్ధంలో 27 మంది మహర్ సైనికులు మరణించారు. ఈ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఈస్ట్ ఇండియా కంపెనీ కోరేగావ్లో ఓ స్థూపాన్ని నిర్మించింది. ఈ యుద్ధం వలస పాలకులకు, స్థానిక రాజ్యానికి మధ్య జరిగిన యుద్ధంగా మాత్రమే చూడకూడదు. ఇక్కడ విస్మరించరాని మరో అంశం ఇమిడి ఉంది. అదే కులం. నాటి పీష్వాల కుల దురహంకార పాలనపై మహర్లు చేసిన ఓ తిరుగుబాటుగా కూడా చూడాల్సి ఉంటుంది. కారణం నాటి పీష్వా పాలన శూద్రులు, అతి శూద్రుల మీద అత్యంత నిరంకుశంగా ఉండింది. అయితే ఈ యుద్ధం అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ అంటరాని కులాల విషయంలో తన వైఖరి మార్చుకుంది. వీరిని సైన్యంలో చేర్చుకోవడం ఆపేసింది. వాస్తవానికి కోరేగావ్ లోనే కాదు. 1826 ఖతియవాడ్లో, 1846 ముల్తాన్, 1880 రెండవ ఆఫ్ఘన్ యుద్ధంలో ఈ మహర్ రెజిమెంటు చాలా వీరోచితంగా పోరాడింది. అయితే 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో అనేక రాష్ట్రాల్లో దళితులు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేసే క్రమంలో బ్రిటిష్ ప్రభుత్వం తన వైఖరిని పూర్తిగా మార్చుకుని వారిని సైన్యంలోకి తీసుకోవటం ఆపేసింది. దీనిపై మహర్ రెజిమెంటులో పని చేసిన గోపాల్ బాబా వాలంకర్, శివరాం జన్బా కాంబ్లే వంటి వారు తమ జాతుల వీరత్వాన్ని బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించాలని, ఇతర కులస్తులతో పాటు తమను కూడా సైన్యంలో చేర్చుకోవాలని అనేక విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. అలాగే అంబేద్కర్ తండ్రి రాంజీ అంబేదర్కర్ కూడా తమ జాతి వీరత్యాన్ని గుర్తించాలని అనేక పిటిషన్లు పెట్టడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభం నుంచే తిరిగి బ్రిటిషు వారు ఇతన కులస్తులతో పాటుగా దళితులను సైన్యంలో రిక్రూట్ చేసుకోవడం ప్రారంబించారు. 1927 జనవరి 1న భీమా కోరేగావ్ 'రణ స్థూపం' నిర్వాహకులుగా వున్న కాంబ్లే వంటి వారి ఆహ్వానంపై డా|| బి.ఆర్ అంబేద్కర్ సందర్శించడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన ఆనంద్ తేల్తుంబ్డే చెప్పినట్లు దళిత ఉద్యమానికి ఒక ఊపు, ఉత్సాహాన్ని ఇవ్వటానికి మహర్ల పూర్వీకులు జరిపిన ఆ యుద్ధాన్ని దేశమంతా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రకటించారు. అందువలన ఈ రోజు హిందూత్వ సిద్ధాంతకారులు ఆ చరిత్ర మొత్తాన్ని, అందులో ఇమిడి వున్న సాంఘిక పార్శ్వాన్ని వక్రీకరించి భారతీయులపై బ్రిటిషు సైన్యం చేసిన యుద్ధంగా దాన్ని వర్ణించారు. తద్వారా దళిత ఉద్యమంపై తమ దాడిని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నాటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి1వ తేదీన అనేక మంది దళితులు, బౌద్ధులు, అంబేద్కరిస్టులు అక్కడికి చేరుకోవటం, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు సభలు నిర్వహించడం పరిపాటిగా వస్తున్నది. 2018 జనవరి 1కి 200 సంవత్సరాలు నిండుతాయి కాబట్టి భారీగా కార్యక్రమం నిర్వహించడానికి 2017 డిసెంబర్ 31న (ఎల్గార్ పరిషత్) సభ నిర్వహించటం జరిగింది. దీనిని ప్రధానంగా ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులైన బి.జి కోల్సే పాటిల్, పి.బి సావంత్లు. బాధ్యత తీసుకోవడం జరిగింది. ఆనాటి వేదిక పైన, బ్యానర్లు కాని, నాయకుల ఉపన్యాసాలు కాని, సాంస్కృతిక కళారూపాలు కాని అన్నీ ప్రమాద స్థాయికి పెరిగిన హిందూత్వం శక్తుల గురించి, దళితులు, గిరిజనలు, మైనారిటీలు, మహిళాలపై పెరుగుతున్న అత్యాచారాల గురించి పెద్ద యెత్తున పేర్కొనటంతో కేంద్రంలోని బీజేపీ సర్కార్కి, ఆర్ఎస్ఎస్కు కంపరం పుట్టించాయి. మొత్తం దాడికి ఇది ప్రధాన కారణం. అందువలన ప్రత్యక్షంగా పాల్గొన్న న్యాయమూర్తులు సృష్టంగా ప్రకటించినా, మీడియా ఆధారాలున్నా పట్టించుకోకుండా అనేక మంది మేధావులు, రచయితల మీద పైశాచిక దాడిని ప్రారంభించింది బీజేపీ. మార్క్సిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు సుబోధ్ మోరే ''ఇంత తీవ్రమైన ఆరోపణలున్న వ్యక్తులను 5,6 నెలలపాటు అరెస్టులు ఎందుకు చేయలేదు. వారిపై పెట్టిన ఛార్జిషీట్లను ఎందుకు బహిర్గతం చేయడం లేదు. బీజేపీ నాయకులకు అందిన ప్రధాన మంత్రి హత్య కుట్ర పత్రాలు ప్రెస్కి ఎందుకు ఇవ్వరు. వారు చూపిస్తున్న ఒక కాగితంలో ఇంతమంది పేర్లు ఎల్గార్ పరిషత్కి నిధులిచ్చిన వారి పేర్లు, సంస్థల పేర్లు ఉండటం అసాధ్యం. మాకు ఎల్గార్ని నిర్వహించడానికి అనుమతి ఇవ్వని పోలీసులు ఈ మధ్య కోల్హాపూర్లో బజరంగ్దళ్ విశ్వహింద్ పరిషత్వారు కత్తులు, తుపాకులతో బహిరంగంగా ప్రదర్శన చేయడానికి అనుమతులు ఎలా ఇచ్చారు?' అని ప్రెస్ ముందు ప్రశ్నించడం జరిగింది.
హెచ్చరికలు... సవాళ్ళు...
స్వతంత్రం వచ్చిన ఐదు నెలల్లోనే జాతిపిత మహాత్మా గాంధీని చంపిన హిందుత్వ సంస్థల కార్యకర్త నాధూరాం గాడ్సే తన మరణ వాంగ్మూలంలో గాంధీజీ హత్య దేశానికి ఒక హెచ్చరిక వంటిదని ప్రకటించాడు. ఈ రోజు అత్యంత బలం చేకూరిన నేపథ్యంలో గాడ్సే వారసులు ఇటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 1992 డిసెంబర్ 6 డా||బి.ఆర్. అంబేద్కర్ వర్థంతి రోజు బాబ్రీ మసీదును కూల్చారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారత రాజ్యాంగాన్ని అనేక నగరాల్లో బహిరంగంగా తగులబెట్టారు. అంబేద్కర్ జయంతి రోజు ఆయన మనవడిని (ఆనంద్ తేల్తుంబ్డే) అరెస్టు చేశారు. క్రిస్మస్ సెలవు దినాన్ని వాజ్పేయి జన్మదినంగా మార్చాలని ప్రయత్నించారు. ప్రపంచ కార్మికదినం మేడే కాకుండా విశ్వకర్మదినం జరపాలని ప్రకటనలు మొదలు పెట్టారు. అసలు రిజర్వేషన్లే ఎత్తేయాలని దానిని సమీక్షించాలనే పేరిట కుట్ర ప్రారంభించింది ఆర్ఎస్ఎస్. అందువలన ఈ హెచ్చరికలను గుదిగుచ్చి చూస్తే హిందుత్వ శక్తుల దాడి మన లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, ప్రగతిశీల శక్తుల మీద, చివరకు వామపక్షాల మీద, విప్లవ శక్తుల మీద దాడికి ప్రయత్నాలుగా గమనించాలి. ఒకపక్క అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి సాగిల పడుతూ, దేశంలో అంబానీ, అదానీ వంటి బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ మరో పక్క ఈ వివాదాలపై పెరుగుతున్న కార్మిక వర్గ పోరాటాలను, ప్రజా క్రోధాన్ని ఎదుర్కోవడానికి హిందుత్వ శక్తులు అణగారిన తరగతుల పైన దాడిని పెంచుతున్నాయి. జర్మన్ కమ్యూనిస్టు యోధురాలు క్లారాజెట్కిన్ చెప్పినట్లు ఫాసిస్టు శక్తులు ద్రవ్య పెట్టుబడి చేతుల్లో కావలి కుక్క వంటివి. అందువలన ఉదారవాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులు సాంఘిక పార్వ్శంలో హిందుత్వ శక్తులను మట్టుబెట్టడానికి జరిగే పోరాటంతో మిళితం కావాలి.
- ఆర్.రఘు