Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమైఖ్య రాష్ట్రంలో గిరిజనులు అన్ని రంగాలలో నష్టపోయారని, తెలంగాణ వస్తే, గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆశ చూపి, రెచ్చగొట్టి గిరిజనుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్. నీళ్ళు, నిధులు, నియామకాలు మాటేమోగానీ, ఆర్భాటంగా ప్రకటించిన మిషన్ కాకతీయ కూడా నేటికి గిరిజనుల దరిచేరలేదు. మిషన్ భగీరథ నీళ్ళకోసం అనేక తండాలు ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నాయి. గిరిజనులకు 15రకాల హామీలు ఇచ్చి అభివృద్ధి పనులు చేపడతామని అనేక సభలల్లో చెప్పి గిరిజనులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నారు. ఓడ ఎక్కేముందు ఓడ మల్లయ్య ఓడ దిగినాక బోడిమల్లయ్య అన్న చందంగా తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల పరిస్థితి ఉన్నది.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి నిర్లక్ష్యానికి గురయిందనీ, ఆర్థిక, సామాజిక అభివృద్ధిలేక పౌష్టిక ఆహారం అందక రోగాల బారినపడి గిరిజనులు పిట్టల్లా రాలిపోతున్నారనీ, చివరకు పోషించుకునే స్థోమతలేక మార్కెట్లో సరుకుల్లా ఆడ పిల్లలను అమ్ముకునే దుస్థితి ఉందని ఆవేదన చెందిన పెద్దాయన నేడు పట్టించుకునే పరిస్థితేలేదు. ప్రాజెక్టుల పేరుతో గిరిజన గ్రామాలను ముంపునకు గురిచేస్తున్నారు. 2.60లక్షలమంది పోలవరం ముంపులో నిరాశ్రయులు అవుతుంటే నాడు ఆంధ్ర పాలకులు పట్టించుకోవడం లేదని మొసలి కన్నీరు కార్చిన వారు నేడు ఎక్కడా ఒక్కమాట మాట్లాడటంలేదు. తెలంగాణ వస్తే తమను తామే పరిపాలించుకునే విధంగా పాలన ఉంటుందని నమ్మబలికారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు రక్షించుకునే బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. నేడు ఆ బాసలన్నీ మరిచారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గిరిజనులకిచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటున్నది. గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ అమలు చేస్తామనీ, గిరిజన తండాలకు మౌలిక వసతులు కల్పించి అభివృద్ధివైపు తీసుకెళుతామనీ అన్నారు. ఇప్పటికీ గిరిజన తండాలు అభివృద్ధికి దూరంగానే ఉన్నాయి. రోడ్లు, కరెంటు, మంచినీళ్ళు అందక అవస్థలు పడుతున్నాయి. గిరిజన జనాభా ఆధారంగా నిధులు విడుదల కాకపోవడంతో ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. గిరిజనులకు 3ఎకరాల భూమి, 1/70చట్టం అమలు చేస్తూ భూమికి రక్షణగా ఉంటూ సాగుకు యోగ్యమైన వసతులు కల్పిస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ గిరిజనులకు ఒక్కఎకరం కూడా పంచలేదు. మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధి కోసం ఐటీడీఏ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి అభివృద్ధికి పూనుకుంటామని చెప్పి మాట తప్పారు. గిరిజన విద్యార్థులకు పోటీ పరీక్షలకు, ఉద్యోగ ఎంట్రన్స్ పరీక్షలకు స్పెషల్ కోచింగ్ ఉచితంగా అందిస్తామని చెప్పి యూనివర్సిటీలో రిజర్వేషన్ కూడా లేకుండా చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది! గిరిజన భాషను కాపాడడం కోసం ఆర్టికల్ 8 ప్రకారం లిపి కనుగొని పాఠ్య పుస్తకాలు ప్రచురణ చేసి విద్యను అందిస్తామని చెప్పినా అమలుకు నోచుకోలేదు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు విభజన చట్టంలో ఉన్నా ఏనాడూ పట్టించుకోలేదు. ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు విదేశాల్లో చదువులకు ఆదాయంతో సంబంధం లేకుండా 25లక్షల వరకు సహాయం అందించి ప్రోత్సహిస్తామని విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామని చెప్పి అసెంబ్లీసాక్షిగా మాట మార్చారు.
తెలంగాణ రాష్ట్రంలో 3146 గ్రామ పంచాయతీలు ఉంటే మరో 3765 గిరిజన ఆవాసాలు ఉన్నాయి. 53శాతం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. 46శాతం మైదాన ప్రాంతంలో జీవిస్తున్నారు. ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా గిరిజనుల హామీలను అమలు చేయడం కోసం, వాస్తవ ప్రమాణ పూర్వక విశ్వాసంతో ఆయా అంశాలను నెరవేర్చాలని భారత రాజ్యాంగం చెపుతున్నది. ఆర్టికల్ 14 గిరిజనుల ముందడుగుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. ఆర్టికల్ 15(4) ఉద్యోగ సమాన అవకాశాలు, ఆర్టికల్ 16 రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించింది. వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూ రక్షించాలని మన చట్టసభలు కూడా చెపుతున్నాయి. కానీ ఆచరణలో మాత్రం అన్నీ పక్కన పెట్టి కాలయాపన చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం.
తెలంగాణలో ఐటీడీఏ ద్వారా గిరిజన ప్రాంతంలో సింగిల్లైన్ కార్యనిర్వహణ అమలు చేయబడుతుందని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. గిరిజన అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి పథకాలు ఏమీ తీసుకురాలేదు. భూ నియంత్రణ, రక్షణలు కరువైనాయి. ఏజెన్సీ హక్కులు కాలరాయబడుతున్నాయి. గ్రామసభ తీర్మానాలు, గిరిజన సలహా మండలి తీర్మానాలు లెక్కచేయడం లేదు. గిరిజన ప్రజాప్రతినిధుల స్థానంలో గిరిజనేతరులు పాలకులవుతున్నారు. గిరిజన సలహా మండలి పేరుకే తప్ప అది తీర్మానం చేసిన 10శాతం రిజర్వేషన్, ప్రతి గిరిజన తండాలకు రోడ్డు, కరెంటు, మంచినీటి సౌకర్యాలు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగానే ఉన్నాయి.
పోలీసులు, ఫారెస్టు అధికారులు, గిరిజనుల మధ్య టీఆర్ఎస్ ప్రభుత్వం నిత్యం గొడవలు సృష్టిస్తున్నది. సిరిసిల్ల జిల్లా, వీరనపల్లి మండలం, ఎర్రగడ్డ తండాలో 100ఎకరాల్లో వరి పంటను ధ్వంసం చేశారు. కామారెడ్డి జిల్లా, తిమ్మాజిపేట చత్రుతండాలో చేతికొచ్చిన 40ఎకరాల మొక్కజొన్న పంటను ట్రాక్టర్లతో దున్నారు. సూర్యాపేటజిల్లా మఠంపల్లిలో పత్తిచేను ధ్వంసం చేశారు. కొత్తగూడెం జిల్లాలో అటవీభూమిలో పంటలు వేయకుండా దాడిచేసి యుద్ధం సృష్టించారు. నాగర్కర్నూల్ జిల్లా మాధవానిపల్లిలో 100ఎకరాల్లో పంటలు వేయకుండా అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం డిబితండలో చేతికొచ్చిన వరిపంటను జేసీబీతో ధ్వంసం చేశారు. ముక్కిడి గుండం గిరిజనులపై అక్రమ కేసులు పెట్టారు. గిరిజనులపై ఇన్ని ఆఘాయిత్యాలు జరుగుతుంటే కేసీఆర్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నది.
గిరిజనులకు ప్రత్యేక పథకం క్రింద గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అటవీ ఉత్పత్తులను సేకరించి వాటికి మద్దతు ధర కల్పిస్తూ ఉపాధి అవకాశాలు కల్పించాలి. కానీ ఆ చర్యలన్నిటినీ నీరుగార్చుతున్నది. 29రకాల అటవీ ఉత్పత్తులు సేకరించి ఉపాధి పొందేవారు. సబ్బులు, పేపరు, చింతపండు శుద్ధిలాంటి చిన్న చిన్న పరిశ్రమలు కానీ ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి జీసీసీకి కేటాయించలేదు. 3 డివిజన్ కార్యాలయాలు, 18జీసీసీఎం, 300 డిపోలు, 176 ఉప డిపోలు కలిగివున్న సంస్థకు ఒక్క రూపాయి కేటాయించకుండా ప్రయివేటుపరం చేసే కుట్ర జరుగుతున్నది. అటవీ హక్కుల చట్టం అమలు, గిరిజనుల వృత్తి నైపుణ్యం పథకం, గిరిజనుల భూ అభివృద్ధి పథకం, ట్రైకార్ రంగాలకు 2019-20 నిధులు కేటాయించకపోవడం గిరిజనులను అభివృద్ధికి దూరం చేయడమే అవుతుంది. అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు 8 రాష్ట్రాలలో 5వ షెడ్యూల్ విస్తరించి ఉన్నది. చిట్టడవులను అభివృద్ధి చేయాల్సిన బాద్యత నుంచి తప్పుకొని, ఖనిజాలు, బాక్సైట్ గనులు, బొగ్గు, రంగురాళ్ళు, యురేనియం ఖనిజాల పేరుతో గిరిజనుల మనుగడకే ముప్పు తెచ్చేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది.
మరొక ఉపద్రవం దళిత, గిరిజనులపై తెచ్చిపెడుతున్నది. రెవెన్యూ చట్టం పేరుతో పేదల దగ్గర ఉన్న అసైన్డ్ భూములు, దేవాదాయ, ఇనాం భూములను పేదల నుంచి దూరం చేసే కుట్ర జరుగుతున్నది. ఎల్ఆర్ఎస్ పేరుతో పేదలను దోచుకొని పెద్దోళ్ళకు పెట్టే పెద్దకుట్ర సాగుతున్నది. వీటన్నిటినీ ఎండగట్టి హక్కులు సాధించాలంటే పోరాటమొక్కటే మార్గమని గిరిజనం గుర్తించాలి.
- ఎం. ధర్మానాయక్
సెల్:9490098685