Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా విపత్తు నేపథ్యంలో అనేకరంగాల్లో పునర్వివేచన, పునర్నిర్మాణాలకు సంబంధించిన ఆలోచనలు సాగుతున్నాయి. విధివిధానాలకు సంబంధించిన పునర్విశ్లేషణలు మొదలయి చాలా కాలమైంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చినప్పటికీ మార్చి 22కు ముందు నాటి జీవితం, ఆలోచనా సరళి యథాతథంగా నెలకొనే అవకాశం లేదు. జీవన విధానాలే కాదు, సకల రంగాలు సరికొత్త రీతిలో రూపొందాల్సిన అవసరం ఉంది. ఇందుకు తగినట్టుగా వ్యవస్థలు, విధానాలు వినూత్నరీతిని సంతరించుకోవాలి. దీనికి అధికారంలో ఉన్నవారు సిద్ధపడాలి. జనావళిని సంసిద్ధం చేయాలి. ఇందుకు భిన్నంగా కార్పొరేట్లకు లాభం చేకూర్చే విధానాలకు ప్రభుత్వాలు మొగ్గు చూపడం గమనార్హం. ప్రజల ఓట్లతో ఎన్నికయిన ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా కార్పొరేట్ల సేవలో తరించడం విషాద వాస్తవం.
మందబలంతో ఆమోదం
తాజాగా వ్యవసాయరంగంలో సంస్కరణల పేరిట రైతుల పొట్టకొట్టే విధానాలకు తెరదీసింది బీజేపీ ప్రభుత్వం. మందబలంతో వ్యవసాయ బిల్లుల్ని లోక్సభలో ఆమోదింపజేసుకుంది. ఎన్డీఏ పక్షమైన అకాలీదళ్ కు చెందిన కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ రాజీనామా చివరి నిమిషంలోని పరిణామం. జూన్ నెలలో వ్యవసాయ రంగ సంస్కరణలు చేపట్టినప్పుడే అన్నిపక్షాల నుంచి వ్యతిరేకత రావాలి. కానీ కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి అనేక రాజకీయపక్షాలు. వ్యవసాయ రంగ సంస్కరణలు దేశంలోని రైతుల పాలిట శరాఘాతమనే సంగతిని వామపక్షాలు మాత్రమే నొక్కిచెప్పాయి. వీటిని వ్యతిరేకిస్తూ ఉద్యమబాటని పట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేశాయి. కానీ ఓటర్లుగా తప్ప ప్రజల ఉనికిని గుర్తించ నిరాకరించే రాజకీయ పార్టీల వైఖరి ప్రశ్నార్థకంగా నిలిచింది.
ఏదీ ప్రతిఘటన?
ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే వ్యవసాయ బిల్లుల ఆమోదానికి బీజేపీ ప్రభుత్వం సన్నాహాలు చేసుకున్న విషయం తెలియందేమీ కాదు. ప్రభుత్వం వ్యవసాయరంగ సంస్కరణలకు సంబంధించిన ఆర్డినెన్స్ ప్రకటించిన నాటి నుంచే నిరసనలకు సిద్ధపడాలి. ఈ బిల్లుల్ని నిరసిస్తూ పంజాబ్, హర్యానాలలో రైతులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఎన్డీఏలో కొనసాగితే తమకు పుట్టగతులు ఉండవని గ్రహించినందునే అకాలీదళ్ బిల్లుల పట్ల ఇప్పుడు తన వ్యతిరేకతని వ్యక్తం చేసింది. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలంటే రైతుల మద్దతు అవసరం. అందుకే బిల్లు ఆమోదానంతరం బిల్లుకు వ్యతిరేకంగా అకాలీదళ్ మాట్లాడుతున్నది. ఈ వివేచన ముందే ఎందుకు లేదన్నది అసలు ప్రశ్న. ఓట్ల లెక్కల్ని పరిగణనలోకి తీసుకున్నాకనే పంజాబ్లోని రైతుల విలాపం వారికి వినిపించింది.
నిజాయితీ ప్రశ్నార్థకం
మౌలికంగా ఆర్థిక సంస్కరణలకు సానుకూలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కనబరిచే వ్యతిరేకతలోనూ నిజాయితీ అంతంతమాత్రం. అందుకే ఆర్డినెన్స్ వచ్చాక కూడా బిల్లుకు వ్యతిరేకంగా బలమైన గళం వినిపించడానికి ఆ పార్టీ సిద్ధం కాలేదు. బీజేపీయేతర పక్షాలలో ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి, ఎవరి ప్రయోజనాలు వారివి. నిన్నమొన్నటి దాకా కౌలు రైతులని రైతులుగా గుర్తించడానికి నిరాకరించిన టీఆర్ఎస్ అధినేత, చివరి నిమిషంలో వ్యవసాయ బిల్లును తేనెపూసిన కత్తిగా అభివర్ణించారు. నిజమే, వ్యవసాయ బిల్లులు రైతుల్ని వంచించడమే, ఎక్కడయినా, ఎంతకయినా పంటని అమ్ముకోవచ్చనే పేరిట కార్పొరేట్లకు లాభం చేకూర్చే పన్నాగాలే. కాంటాక్ట్ వ్యవసాయం పేరిట దేశంలోని సన్నకారు రైతులని భూముల నుంచి వెళ్ళగొట్టే కుతంత్రమే. ఈ విషయమై టీఆర్ఎస్ పార్టీ ముందునుంచి మాట్లాడలేదు. ఉద్యమపథంలో ప్రయాణించడానికి సిద్ధపడలేదు. కనీసం ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఐక్యంగా పనిచేద్దామనే ప్రతిపాదన కూడా టీఆర్ఎస్ అధినేత ఇతర పార్టీల ముందు పెట్టలేకపోయారు. 2019లో ఎన్నికలకు ముందు 'ఫెడరల్ ఫ్రంట్' గురించి ఎంతో మాట్లాడిన నేత ఫెడరలిజానికి విఘాతం కల్పించే కేంద్రం విధానాలపై వ్యతిరేకతని కేవలం మాటలకే పరిమితం చేయడం గమనార్హం.
తమది రైతుల పక్షాన నిలిచే ప్రభుత్వమని చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం వ్యవసాయబిల్లులపై మౌనం వహించింది. ఒరిస్సాలో అధికారంలో ఉన్న బీజేడీది సైతం ప్రేక్షకపాత్రే. ఈ దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీలు రైతుల పక్షం నిలిచేవారమని చెప్పుకుంటాయి. కానీ ఇవాళ రైతు జీవితాన్ని చిన్నాభిన్నం చేసే కేంద్రం విధానాల పట్ల గళమెత్తలేని నీరస స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.
ఫెడరలిజానికి విఘాతం
గత ఏడాది రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం వరుసగా ప్రజావ్యతిరేక విధానాలని అనుసరిస్తోంది. కాశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ రద్దు నుంచి మొదలయిన ఈ విధానాల పరంపర కోవిడ్-19 కల్లోల కాలంలోనూ ఆగలేదు. జీఎస్టీ బకాయిల గురించి రాష్ట్రాలు మాట్లాడలేని పరిస్థితికి నెట్టివేసింది. గతంలో జీఎస్టీని స్వాగతించిన అనేక పార్టీలు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో లోటుబడ్జెట్లతో కొట్టుమిట్టాడుతున్నాయి. జీఎస్టీ బకాయిల కోసం కేంద్రాన్ని దేబిరించాల్సిన పరిస్థితి ఏమిటని వాపోతున్నాయి. జీఎస్టీ రాష్ట్రాల ఆదాయ వనరులని దెబ్బతీయడమే కాదు, జనం బతుకుల్ని, ఉపాధిని దెబ్బతీస్తాయని వామపక్షాలు సోదాహరణంగా వివరించాయి. కానీ అత్యుత్సాహంతో జీఎస్టీని స్వాగతించిన పార్టీలే ఇవాళ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి.
విద్యుత్ రంగ సంస్కరణల పేరుతో రాష్ట్రాల హక్కులకు, సబ్సిడీ విధానాలకు చెక్ పెడుతున్నది కేంద్రం. ఇప్పుడు వ్యవసాయ సంస్కరణల పేరిట రైతుల వీపులపై పెద్ద బండ మోపుతున్నది. విద్యుత్, వ్యవసాయ మార్కెట్లు వంటి అంశాలలో రాష్ట్రాల హక్కుల్ని హరిస్తున్నది బీజేపీ ప్రభుత్వం. రాష్ట్రజాబితా, ఉభయజాబితాలలో ఉండే పలు అంశాలపై కేంద్రం చట్టాలు చేయడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. కానీ ఈ విషయమై సంఘటితంగా ప్రశ్నించే రీతి కనిపించడం లేదు.
కార్పొరేట్ల సేవలో
ఉదారవాద ఆర్థిక విధానాలకు వామపక్షాలు తప్ప మిగతా పార్టీలన్ని మౌలికంగా మద్దతునే ఇస్తున్నాయి. సంపన్నులకు లాభం చేకూర్చే విధానాలనే అనుసరిస్తున్నాయి. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక సంస్కరణలు వేగం పుంజుకున్నాయి. సకల రంగాలని ప్రయివేట్ పరం చేసే క్రమాన రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని, వాటి హక్కులని కేంద్రం చూడ నిరాకరిస్తున్నది. బీజేపీ, కాంగ్రెస్కు సమదూరం అనే కొన్ని పార్టీలు కొంతవరకు బీజేపీకి సన్నిహితంగా ఉన్నాయి. వ్యతిరేకత కనబరచాల్సిన సమయంలో వ్యూహాత్మకంగా మౌనం దాల్చడం వాటి నైజం. మధ్యేవాదమన్నది మిథ్య. అటు కాంగ్రెస్కు లేదా ఇటు బీజేపీకి దగ్గరగా మెలగడం తప్ప విధివిధానాలకు సంబంధించిన స్వతంత్ర ఆలోచన చాలా రాజకీయ పార్టీలకు లేదు. ఆయా రాష్ట్రాలలో భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం ద్వారా కొన్ని పార్టీలు మనుగడలో ఉన్నాయి. లేదంటే అప్పటికే ఉన్న ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత కారణంగా తాము అధికారంలోకి వచ్చాయి. అంతే తప్ప ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన నిర్దిష్టమైన ఎజెండా చాలా పార్టీలకు లేదు. ఈ కారణంగా బీజేపీ చెప్పినట్టు వినడం తప్ప మరో గత్యంతరం లేని స్థితిలో అనేక పార్టీలు బీజేపీ అనుసరించే ఏకపక్ష విధానాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సమ్మతి తెలుపుతున్నాయి.
స్వావలంబన ఎలా సాధ్యం
తాజాగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు ఈ దేశంలో వ్యవసాయమే వృత్తిగా జీవించే డెబ్బయిశాతం మంది మనుగడని ప్రమాదంలో పడేసాయి. నేలని నమ్ముకున్న రైతుల బతుక్కి పెనుముప్పుగా పరిణమించిన బిల్లులు ఇవి. మొన్నటి దాకా స్వావలంబన, గ్రామాల స్వయంప్రతిపత్తి గురించి మాట్లా డిన ప్రధాని నరేంద్రమోడీ ఆ గ్రామాల ఉనికిని, వ్యవసాయం జీవనాధారంగా బతికే ప్రజల మనుగడని కార్పొరేట్ల దయాదాక్షి ణ్యాలకు అప్పగిస్తున్నారు. వ్యవసాయాన్ని అంటిపెట్టు కొని ఉన్న గ్రామీణ జీవన సంస్కృతి అంతా వ్యాపారమయం కాబో తున్నది. గ్రామాల్లోకి కార్పొరేట్ కంపెనీలవారు, మార్కెట్ల ఏజెంట్లు, కాంట్రాక్ట్ వ్యవసాయం కోసం వచ్చేవారితో రైతు జీవితం పరాధీనం కాబోతున్నది. కంపెనీలు చెప్పిన పంటలే పండించాల నడం రైతు ఆత్మగౌరవాన్ని దిగజార్చే కుట్ర. ఇప్పటికే అనేక రూపా ల్లో రైతు జీవితాన్ని ఛిద్రం చేశారు. ఇప్పుడిక కాంట్రాక్ట్ పేరుతో రైతుల భూమిని హస్తగతం చేసుకోబోయే మహాకుట్రకు రంగం సిద్ధమైంది. తన నేల తనది కాదు, తన పంట తనది కాదు, తన రెక్కలకష్టం ఎవరికో లాభాలు తెచ్చిపెట్టే సరుకుగా మారడం, తన భూమి లోనే తను కూలీగా మారడం రైతు జీవన విధ్వంసానికి పరాకాష్ట.
నయ వంచన
వ్యవసాయ బిల్లుల విషయంలో తప్పుడు సమాచారం నమ్మవద్దని నరేంద్రమోడీ చెబుతున్నారు. కానీ తప్పుడు మాటలు మాట్లాడుతున్నది, అబద్ధాలు చెబుతున్నది స్వయంగా ప్రధాని కావడం విడ్డూరం. ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా గ్రామాల స్వావలంబన గురించి ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. ఇప్పుడు గ్రామాలకు గ్రామాలు కార్పొరేట్ల దయ మీద ఆధారపడే స్థితికి నెట్టి వేస్తున్నారు. పంటలకు కనీసమద్దతు ధర గురించి చెప్పడం లేదు. రైతులు ఎంత ధరకయినా, ఎక్కడయినా పంటను అమ్ముకోవచ్చని చెబుతున్నారు. అదే సమయాన కనీస మద్దతు ధరకు తక్కువగా ఎవరూ కొనడానికి వీల్లేదని ఎందుకు గట్టిగా చెప్పడం లేదు. అలాంటి నిబంధనలయినా బిల్లులో చేర్చాల్సిందిగా కోరితే ఎందుకు నిరాకరిస్తున్నారు. స్వయంగా దేశాధినేతే రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఎంతధరకయినా అమ్ముకునే స్వేచ్ఛ పేరిట రైతుల పంటని అతి చౌకగా కొనుగోలు చేసి, పరిమితుల్లేకుండా నిల్వ చేసుకునే సదుపాయాన్ని కార్పొరేట్లకు కల్పిస్తున్నారు. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నికయి పాలించాల్సిన నేత అనుసరించాల్సిన విధానమేనా ఇది? నిరపేక్ష అధికారం నిరంకుశత్వానికి దారితీస్తుందన్నది నిజం.
ప్రమాదంలో ఆహార భద్రత
కరోనా కాలంలో ఆహార నిల్వలు కొంతవరకు ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు వ్యవసాయ బిల్లులు చట్టాలుగా ఆమోదించాక మునుపటిలా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) పంటల్ని కొనే అవకాశం లేదు. కాంట్రాక్ట్ వ్యవసాయానికి తలుపులు బార్లా తెరిచాక ఆహార పంటల కన్నా వాణిజ్య పంటల సాగుబడి పెరుగుతుంది. ఆహార ధాన్యాలని తగినవిధంగా పండించినా, పరిమితుల్లేకుండా నిల్వ పెట్టుకునే సౌకర్యం ఉండటంతో ప్రయివేటు కంపెనీలు, వ్యాపారులు చౌకగా కొని నిల్వ చేసుకుంటారు. ప్రభుత్వం అదుపు లేనందున ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తారు. ఈ కారణంగా పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర రాదు, అవసరాలకు కొనే వినియోగదారుకు చౌకలో సరుకులు లభించవు. కనీసం యాభైశాతం పంటయినా ఎఫ్సీఐ కొనకపోతే ఆహార ధాన్యాల నిల్వలు కొరవడుతాయి. ఈ కారణంగా ప్రజల ఆహార భద్రత ఎండమావిగా పరిణమిస్తుంది. పేదలు కనీసం రెండుపూటల తిండికయినా నోచుకోని దుర్భర పరిస్థితులు నెలకొంటాయి. ఈవిధంగా వ్యవసాయదారులకు మాత్రమే కాదు, సకల రంగాల ప్రజలు వ్యవసాయ సంస్కరణల వల్ల ఇక్కట్ల పాలవుతారు.
ఎందుకీ దూకుడు?
కరోనా విపత్తులోనూ కార్పొరేట్ల విశృంఖలతకు దారితీసే విధానాలను బీజేపీ అనుసరిస్తోంది. సంస్కరణల పేరిట బీజేపీ ఇంతగా దూకుడు ప్రదర్శించడానికి కారణం తమకు ఎదురులేదన్న ధోరణి. గత ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సంపాదించడంతో తాము చేయాలనుకున్నది చేసి తీరాలన్న మొండిపట్టుతో ముందుకు పోతున్నది. మరోవైపున ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేదు. కాంగ్రెస్పార్టీ అతి బలహీనంగా ఉంది. ప్రజాసమూహాల్ని కదిలించే శక్తులకు తగినంత బలం లేదు. మరీ ముఖ్యంగా మీడియాని తమ కనుసన్నల్లో ఉంచుకోగలిగింది. అసలు సమస్యలు ఎజెండా మీదకు రాకుండా చేయడంలో సమస్త మీడియా బీజేపీ నీడలో సేదదీరుతున్నది. దేశవ్యాప్తంగా రైతులే కాదు విభిన్న రంగాల ప్రజలు సంఘటితమై ప్రతిఘటించాల్సిన సందర్భమిది. ఈ సరికొత్త వ్యవసాయ బిల్లులు మొత్తం భారత ప్రజల ప్రయోజనాలకు శరాఘాతం. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మధ్యతరగతి శ్రేణుల, ఆలోచనాపరుల నిష్క్రియాపరత్వం, పట్టనితనం ఆ పార్టీకి లాభించింది. కానీ సామాన్య ప్రజల ఆగ్రహం నివురు లాంటిది. ప్రజాదరణతో నియంతలుగా పరిణమించిన వారు అదే ప్రజల చేతిలో పరాభవానికి లోనవుతారు. అందుకు రంగం సిద్ధం చేయడంలో ఏయే శక్తుల పాత్ర ఎలాంటిదన్నదే ఇవాళ కీలకం.
- గుడిపాటి
సెల్:9490099327