Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ ప్రజల సమగ్రాభి వృద్ధిలో విద్య ప్రముఖ పాత్ర వహిస్తుంది. దేశ ప్రగతికి సమాజాభివృద్ధికి అవసరమైన విద్యావిధానం కావాలని విద్యా వేత్తలు, ప్రగతిశీల వేదావులు, అభ్యుదయ వాదులు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఒకవైపు ముక్తకంఠంతో నినదిస్తూ డిమాండ్ చేస్తుంటే.. మరోవైపు మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని తమ దోపిడీ ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకుంటూ సామ్రాజ్య వాదులకు, విదేశీ పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రాథమిక స్థాయి నుంచి హైస్కూల్ స్థాయి వరకు ప్రయివేటు యాజమాన్యాలకు ధారా దత్తం చేశారు. ఇటివల కాలంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు లేరు అనే నెపంతో అనేక పాఠశాలలను మూసివేయడం మనం చూశాం. ఇలా విద్యారంగం నుంచి ప్రభుత్వాలు క్రమంగా తప్పుకుంటూ డబ్బున్నవారికే విద్యను పరిమితం చేసే విధానాలను కొనసాగి స్తున్నాయి. తొండ ముదిరి ఊసరవెల్లి అయిన విధంగా ప్రయివేటీకరణ దశను దాటి విద్యారంగం కార్పొరేట్ వాళ్ళ కబంధ హస్తాల్లో చిక్కుకున్నది. గత కొన్ని సంవత్సరాలుగా నిర్విరామ కసరత్తుతో విద్యను ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టిన పాలకులు నేడు ప్రయివేటు విశ్వవిద్యాలయాల బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా ఉన్నత విద్యారంగాన్ని సైతం విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఉన్నత విద్యను ఇలా ప్రయివేటీకరించడంలో పెట్టుబడిదారి శక్తుల ఆర్థిక ప్రయోజనాలతో పాటు పాలక పార్టీల రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణలో రెండుసార్లు అధికారం అందుకున్న కేసీఆర్ ప్రభుత్వం తన మ్యానిఫెస్టోలో నాణ్యమైన విద్యతో పాటు కేజీ నుంచి పీజీ వరకు అందరికి ఉచిత విద్య అందిస్తామని కామన్ స్కూల్ విద్యా విధానం తమ కల అని ప్రకటించింది. కానీ అధికారం లోకి వచ్చి ఏడేండ్లు గడుస్తున్నా ఏడవేసిన గొంగళి ఆడనే ఉన్నది. ఉచిత విద్య మాటేమో గాని ఉన్న విద్యకే ఎసరుపెట్టి శ్రామిక కులాలను విద్యకు దూరం చేసే కుట్రలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటు యూనివర్సిటీలకు ఆమోదం తెలుపుతూ బిల్లును పాస్ చేసింది. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు దేశంలో పేరెన్నికగన్న ప్రభుత్వ యూనివర్సిటీలను నెమ్మదిగా దెబ్బతీసే చర్యలే..! భవిష్యత్తులో దళిత, గిరిజన, వెనకబడిన, మైనార్టీ విద్యార్థు లకు ఉన్నత విద్య శాశ్వతంగా అందకుండా చేసే కుట్రలో భాగమే..!! రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న ప్రయివేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు ఉండవని! ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తించదని రాష్ట్ర ఉన్న విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి నిండు సభలో ప్రకటించారు. సంవత్సరాలు గడుస్తున్నా విశ్వవిద్యాలయాలలో అత్యున్నత స్థాయి వీసీ అధికారులను, ప్రొఫెసర్లను, సహాయక సిబ్బంది పోస్టులను భర్తీ చేయకుండా వదిలేశారు. కాలంచెల్లి శిథిలావస్థకు చేరిన భవనాలకు మెరుగులు దిద్దడం మానేశారు, కొత్త భవనాలను నిర్మించడం మర్చిపోయారు. కానీ పెట్టుబడిదారుల కరెన్సీ కట్టలకు గులాంగిరి చేస్తూ ప్రయివేటు యూనివర్సిటీ యాజమాన్యా లకు ఎర్రతివాచీలు పరిచి స్వాగతం పలుకుతున్నారు.
గతంలో ప్రయివేటు యూనివర్సిటీల బిల్లు పెట్టిన తరువాత మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ ప్రయివేటు యూనివర్సిటీల్లో స్థానికులకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించిన రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే అని చెప్పుకొచ్చారు. మరి ఆ స్థానికులు ఏ వర్గాల వారు ఉంటారనేది ఆయన ఎక్కడా చెప్పలేదు. కానీ ఇటీవలి రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణతో మనం అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడుతూ అణగారిన కులాలకు విద్యను దూరం చేసి ఆధిపత్య బావజాలంతో రాజ్యాంగ చట్టాలను కప్పిపుచ్చుతూ ప్రయివేటు యూనివర్సిటీలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఫీజు రీయింబర్స్ మెంట్ లేకుండా కొనసాగిస్తే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడిన శ్రామిక వర్గాలు ఉన్నత విద్యకు దూరం అవుతారు. ఈ ప్రభుత్వ నిర్ణయాలను తిప్పికొట్టకపోతే ప్రభుత్వ యూనివర్సిటీలు ప్రమాదంలో పడటమే కాకుండా ఉన్నత స్థాయి విద్యను కోల్పోతాము. కనుక విద్యార్థులు, బుద్ధిజీవులు, ప్రజాస్వామిక విలువలతోకూడిన ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం నాణ్యమైన శాస్త్రీయ విద్యావిధానం కోసం న్యాయ పోరాటం చేయాలి.
- ఎనుపోతుల వెంకటేష్
సెల్:9573318401