Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకోవాలని 1981లో ఐక్యరాజ్య సమితి (ఐరాస) నిర్ణయించింది. ఆరోజున శాంతి ఆశయాలకు అంకిత మవ్వాలని 24గంటల పాటు కాల్పుల విరమణ చేయాలని నిర్దేశించింది. ఆరోజున న్యూయార్క్లోని ఐరాస ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో శాంతి గంటను మ్రోగించడంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించ బడతాయి.
ఈ సంవత్సరం కోవిడ్ మహమ్మారి ప్రపంచ మానవాళిని వణికిస్తూ మనుషులంతా ఒక్కటేననీ భూమండలం పై ఎక్కడ విపత్తు సంభవించినా అది దేశాలు, ప్రాంతాలు, మతాలు, భాషలకు అతీతంగా అందరినీ ప్రభావితం చేయగలదనీ నిరూపించింది. ఈ నేపథ్యంలో మార్చిలోనే ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఆయుధాలను వదిలి కోవిడ్ మహమ్మారిపై ఉమ్మడి పోరాటం కొనసాగించాలని, మన శక్తియుక్తులను దానిపై కేంద్రీకరించాలని అన్ని యుద్ధపు మోహరింపు సైన్యాలకు పిలుపునిచ్చారు. ఆ సందేశం కేవలం యుద్ధంలో ఉన్న వారికే గాక సమస్త మానవాళికి వర్తిస్తుంది.
ఈ అసాధారణ పరిస్థితుల్లోనే ఈ గండం గట్టెక్కడానికి, భూమిపై శాంతి నెలకొల్పడానికి, ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకోవడానికి గళం విప్పాల్సిన అవసరం ఉందని, మనం ఒకరినొకరు సమీపంలో నిలబడలేక పోయినా కలిసి కలలు కనడం ముమ్మాటికీ సాధ్యమేనని, ఈ సందర్బంగా దయ, కరుణ, దృఢవిశ్వాసాలను వ్యాప్తి చెందించడంతో బాటు కరోనా బారీనపడ్డవారి పట్ల ద్వేషాన్ని, వివక్షను వీడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐరాస నొక్కి వక్కాణించింది.
2020 సంవత్సరంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా చర్చించాల్సిన అంశం ''అందరం కలిసి శాంతిని సాధిద్దాం'' అని. 20వ శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాల్లో దాదాపు 10కోట్ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో నగరాలు నాశనమయ్యాయి. తదనంతరం ఏర్పడిన ఐక్యరాజ్యసమితి శాంతి కోసం పలు తీర్మానాలను ఆమోదించింది. ఐరాస 1981లో బ్రిటన్, కోస్టారికా దేశాల చొరవతో శాంతి దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. ప్రారంభరోజుల్లో సెప్టెంబరు మూడో మంగళవారం జరిపేవారు. తదనంతరం 2001లో సెప్టెంబర్ 21వ తేదీ జరపాలని నిర్ణయించారు. ఆ మేరకు 2002 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆరోజునే జరుపు తున్నారు.
అగ్ర రాజ్యాల వైఖరి
రెండు ప్రపంచ యుద్ధాల అనంతరం ఐరాస శాంతి కోసం ఎన్ని తీర్మానాలు చేసినా నాటి అగ్రరాజ్యలైన అమెరికా, సోవియట్ యూనియన్ దేశాలు శాంతి మాత్రం జపిస్తూనే అవసరానికి మించి అణ్వాయుధాలను తయారు చేశాయి. 1945లో హిరోషిమా - నాగసాకి నగరాలపై అణుబాంబు దాడి జరిపిన నాటి నుంచి రెండు వేలకు పైగా అణ్వాయుధ పరీక్షలు జరిపారు. 75 సంవత్సరాల అనంతరం నేటికీ అమెరికా వద్ద 6185, రష్యా వద్ద 6490 అణ్వాయుధాలు ఉన్నాయని ఆయుధ నియంత్రణ సంస్థ అంచనా వేసింది. 2020లో కేవలం అణ్వాయుధాలపై అమెరికా 5000 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నది. 2019లో అమెరికా సైనిక వ్యయం 73,200 కోట్ల డాలర్లు (సుమారు 50 లక్షల కోట్ల రూపాయలు) చైనా 26,100 కోట్ల డాలర్ల ఖర్చుతో రెండవ స్థానంలో ఉంది. 7,110 కోట్ల డాలర్ల ఖర్చుతో ఇండియా మూడవ స్థానంలో నిలిచింది. అమెరికా కమ్యూనిజాన్ని చాప చుట్టేయాలనే ఉద్దేశంతో క్యూబాను కబళించడానికి, వియత్నాంను నాశనం చేయడానికి ఎంతో ప్రయత్నించి విఫలం అయింది. సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్థాన్పై అనవసర దాడిచేసి చేతులు కాల్చుకుంది. తదనంతర కాలంలో అమెరికా ఇరాన్ ఇరాక్ల మధ్య యుద్ధానికి ఆజ్యం పోసింది. ఇటీవలి కాలంలో టెర్రరిజంపై యుద్ధం లక్ష్యంతో ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్లపై దాడి చేసి ఆసియా ప్రాంతంలో అస్థిరత సష్టించడంతో పాటు తన ఆర్థిక వ్యవస్థకూ తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు తెచ్చింది.
ఈ కాలంలోనే ఆయుధాల అమ్మకం కూడా అగ్రరాజ్యాల ప్రయోజనాల్లో భాగంగా ప్రధానంగా మనకు కనబడు తున్నది. అందునా ముఖ్యంగా అమెరికా తన ఆయుధాలను అమ్ముకునేందుకు ఆసియాలోని వివిధ దేశాల మధ్య వివాదాలను యుద్ధాలుగా రూపొందించిన ఘనత దక్కించుకుంది. అరబ్-ఇజ్రాయిల్ యుద్ధానంతరం ఆ ప్రాంతం నిరంతరం రావణాసురుడి కాష్టంలా కాలుతూనే ఉంది. భారత ఉపఖండంలో భారత్-పాకిస్థాన్ల మధ్య జరిగిన యుద్ధాల్లో అమెరికా నిర్వహించిన పాత్ర, అదేవిధంగా పాకిస్థాన్ టెర్రరిస్ట్ క్యాంపుల నిర్వహణకు ఆయుధాలను అందించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ప్రాంతీయ యుద్ధాలేకాక అనేక ఆఫ్రికా దేశాల్లో అంతర్యుద్ధాలు ఏండ్ల తరబడి కొనసాగుతున్నాయి. అంతేకాదు యుద్ధాల వలన ప్రజలు నష్ట పోవడమే కాక ప్రకృతికి ఎంతో విఘాతం కలుగుతున్నది. అణ్వాయుధాల ఉత్పత్తిలో వచ్చే వ్యర్థాలను పారవేయడం ద్వారా కలిగే అణుధార్మికత, జీవ రసాయన ఆయుధాల ప్రయోగాల సమయంలో కలిగే వాతావరణ కాలుష్యాల ప్రభావం ప్రజల ఆరోగ్యంపై నిత్యం చూపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతి ఆవశ్యకత ఏమిటో అర్థం చేసుకోవాలి.
నేటికీ ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు కనీస అవసరాలైన స్వచ్ఛమైన గాలి, మంచినీరు, వైద్యం, గృహవసతి, రవాణా సదుపాయం, ఉపాధి మొదలైనవి అందక దుర్భర జీవితాలను గడుపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాపితంగా మిలిటరీపై పెట్టే రెండు లక్షల కోట్ల డాలర్ల (సుమారు 150 లక్షల కోట్ల రూపాయలు) ఖర్చుతో పైన పేర్కొన్న కనీస అవసరాలన్నింటిని ఏంతో సులువుగా తక్షణమే తీర్చవచ్చు. కానీ ఆ దేశాధి నేతలకు ఆ రాజకీయ సంకల్పం లేదనే విషయం సర్వ జన విధితమే..
నేటి కోవిడ్ సంక్షోభ కాలంలో ఎన్ని అణ్వాయుధాలు వున్నా ఒక్క వైరస్ నుంచీ ఆయా దేశాల ప్రజల మాన ప్రాణాలను అవి కాపాడలేవు అనే నిజం అందరికీ అర్థమైంది. ఈ నేపథ్యంలో ఐరాస 75వ వార్షికోత్సవ సందర్భంలో సభ్యదేశాలు తమ రక్షణ వ్యవస్థలపై క్రమేణా ఖర్చుని తగ్గించే ప్రతిపాదనను తీసుకు రావాల్సిన అవసరం ఉంది.
మనం ఏం చేయాలి?
శాంతి అంటే యుద్ధం లేకపోవడమే కాదు, హింస ఏ రూపంలో వున్నా మనం దాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉన్నదని ఐరాస ఎన్నోసార్లు పేర్కొంది. మన సమాజంలో మహిళలు, బాలలు, మైనారిటీలు, బలహీన వర్గాలు, వలస కూలీలు, వికలాంగులపై నిరంతరం జరిగే హింసను కూడా మనం నివారిం చాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ప్రధానమైనది సకల జీవరాసులకు మూలాధారమైన ప్రకృతిపై హింసను ప్రతిఘటించాల్సిన గురుతర బాధ్యత మానవులందరిపై ఉంది.
శాంతి విద్య
పై లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలందరినీ జాగతం చేయాలి. ప్రధానం గా భావి భారత పౌరులైన పాఠశాల విద్యార్థులకు ''శాంతి''ని విద్యా బోధనలో పాఠ్యంశంగా చేర్చి వారిలో చైతన్యం కలిగించాలి. అలాగే కాలేజీ విద్యార్థులతో శాంతి అనే అంశంపై వక్తత్వ పోటీలు, కళా ప్రదర్శనలతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి. మహిళలు సమాన హక్కుల సాధన కోసం జరిగే పోరాటంలో భాగంగా శాంతి సాధన ఒక ఉద్యమంగా కొనసాగించాలి. స్వచ్ఛంద సంస్థలు తమ తమ ప్రాంతాల్లో శాంతిని గురించిన చైతన్యాన్ని కలిగించాలి. మానవ హక్కుల్లో శాంతి కూడా ఒక భాగమని గుర్తించాలి. ఈ శాంతి ఉద్యమం ప్రపంచవ్యాప్త ప్రజా ఉద్యమంగా రూపొందితేనే వివిధ దేశాధినేతలు యుద్ధ వాతావరణాన్నిసృష్టించడానికి వెనకడుగు వేస్తారు. రాబోయే రోజుల్లో అణ్వా యుధాలు, ఇతర రకాల రక్షణ వ్యవస్థలపై చేయబోయే ఖర్చు కొంతమేరకైనా సామాజిక ప్రయోజనా లకు మళ్ళించ వీలవుతుందని మనం అంతా గుర్తించ గలగాలి.
- డాక్టర్ పి. నారాయణరావు
సెల్: 9247385331