Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం నూతన జాతీయ విద్యా విధానాన్ని (NATIONAL EDUCATION POLICY) అవగాహన చేసు కోవాలంటే ఈ విషయాలను పరిశీలించాలి. అప్పుడు మనం భారతదేశ విద్యావిధానం తిరోగమనమైన, ప్రమాదకరమైన అంశాలతో కూడిన విద్యా నమూనాగా మార్పు చెందుతుందన్న నిర్దారణకు రాకుండా ఉండలేం. ఈ మార్పు 'జాతి నిర్మాణానికి' విద్య ఒక సాధనం అనే భావన నుంచి విద్యార్థులకు స్వదేశాభిమానం నుంచి జనించిన విదేశ ద్వేషానికి కొంచెం హిందూ మతతత్వాన్ని జోడిస్తూ, ఆ విద్యా నమూనా మార్పు విద్యార్థులను కేవలం నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థకు ఉపయోగపడే దాకా తయారు చేస్తుంది. ఆ విధంగా జాతీయ విద్యా విధానం, ప్రస్తుతం భారతదేశాన్ని పరిపాలిస్తున్న కార్పొరేట్- హిందూత్వ మైత్రీ రాజకీయాలతో ఏకకాలంలో పూర్తిగా కలిసి పనిచేసే విద్యావిధానంగా ఉండాలని భావిస్తుంది.
ప్రస్తుతం ఉనికిలో ఉన్న విద్యావిధానం లోపభూయిష్టంగా ఉన్నదనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది 'జాతి నిర్మాణం' లాంటి ఉన్నతమైన లక్ష్యాలను చాలా తక్కువగానే అందించింది. ఇది వాస్తవమే అయినప్పటికీ, ఈ విద్యావిధానంలో కొన్ని మార్గాలు చూపించే గుర్తులున్నాయి. వాటిని తొలగించాలని నూతన జాతీయ విద్యా విధానం చేస్తున్న సూచనలు దేశానికి తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తాయి. మొదటగా ప్రజలందరినీ కలుపుకుపోయే భావన తొలగింపు, నూతన జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న దానికి భిన్నంగా ఇంతకు ముందు కంటే ఇప్పుడే విద్యను ఎక్కువగా సామాజికంగా, ఆర్థికంగా ప్రత్యేకతలున్న ఉన్నత వర్గాలకు పరిమితం చేస్తుంది. నూతన జాతీయ విద్యా విధాన (డాక్యుమెంట్) పత్రంలో ''సామాజికంగా, ఆర్థికంగా అణచివేతకు గురవుతున్న బలహీన వర్గాల వారిని ఈ విద్యా పరివలయంలోకి తీసుకొని రావడానికి అవసరమైన తగిన స్థలాన్ని కేటాయించినప్పటికీ, దళితులకు, వెనుకబడిన తరగతుల వారికి, ఇతర బలహీన వర్గాలకు 'రిజర్వేషన్లు' కల్పించే విషయాన్ని పత్రంలో ఎక్కడా ప్రస్తావించలేదు. కాబట్టి ఉన్నత వర్గాలకు చెందిన వారికి మాత్రమే విద్యను పరిమితం చేసే చర్య నిజం అని భావించవచ్చు.
నూతన జాతీయ విద్యా విధానం మినహాయించే (తొలగించే) విధానం అని నమ్మేందుకు ఉన్న మరొక కారణం ఏమంటే, అత్యంత ఖరీదైన విద్యగా మార్చే విద్య ప్రయివేటీకరణను ఎన్ఈపీ ముందుగానే ఊహిస్తుంది. అదే విధంగా ఇది సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండదు. ఈ ఎన్ఈపీ ప్రయివేటు ఉన్నత విద్యా సంస్థలు ఇస్తున్న స్కాలర్షిప్స్ గురించి మాట్లాడుతుంది. కానీ ఈ స్కాలర్షిప్స్, తరువాత స్కాలర్షిప్స్ పొందని విద్యార్థుల ఫీజులను మరింత పెంచుతాయి. దీని వలన విద్యార్థుల మధ్య ఉండే స్నేహపూర్వక వాతావరణం నాశనమవుతుంది. ప్రయివేటు ఉన్నత విద్యా సంస్థలలో పేద పిల్లల విద్య ట్యాక్స్ ఫైనాన్స్ విద్యగా మారింది. కానీ ఎన్ఈపీ దీనిని గుర్తించదు.
వాస్తవానికి ఈ విధంగా అర్థాంతరంగా చదువు మానేసే ప్రక్రియను ఎన్ఈపీలో కృతజ్ఞతా భావంతో అంగీకరిస్తారు. అత్యుత్సాహంతో అది(ఎన్ఈపీ) ఉదహరించిన 'ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్', 'వృత్తి విద్య'లు మినహాయింపు (తొలగింపు)ను దాచిపెట్టే చర్యలు. రాష్ట్రంలో నిర్వహించే పరీక్షలతో పాటు ఇప్పుడు మూడు, ఐదు, ఎనిమిదో స్థాయి తరగతులకు కూడా పరీక్షలు నిర్వహించే విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ పరీక్షా ఫలితాల్లో సరియైన స్థాయి పొందనివారు, అర్థాంతరంగా చదువు మానేయాల్సివచ్చిన (డ్రాపౌట్స్) విద్యార్థులకు పైన ఉదహరించిన ప్రత్యామ్నాయ కోర్సులలో 'సర్దుబాటు' చేస్తారు . కానీ ఈ ప్రత్యామ్నాయ కోర్సులు ఎకడమిక్ విద్యకు ప్రత్యామ్నాయంగా ఉండలేవు. కనీసం కొంత ఎకడమిక్ విద్యా స్థాయిని పూర్తి చేసిన తరువాత మాత్రమే వృత్తి శిక్షణా కోర్సులు అభ్యసించాల్సి ఉంటుంది. సాంప్రదాయబద్ధమైన విద్యా విధానంలో అభ్యసనానికి కీలకమైన సామాజిక పరస్పర చర్యలు ఉంటాయి కాబట్టి, ఓపెన్ డిస్టాన్స్ లెర్నింగ్ సాంప్రదాయబద్ధమైన విద్యకు బదులుగా ప్రత్యామ్నాయంగా ఉండలేదు. అదేవిధంగా కళాశాల నుంచి ఒకటి, రెండు సంవత్సరాల తరువాత చదువు మానేసే ఒక వ్యక్తికి ఎన్ఈపీ కింద ఒక ''సర్టిఫికేట్'' లేక ఒక ''డిప్లొమా'' అని పిలువబడే ఒక కన్సోలేషన్ (ఓదార్పు) కాగితాన్ని ఇస్తారు. ఈ కాగితాన్ని ఇచ్చినప్పటికీ అతడు/ఆమె ఇప్పటికీ డ్రాపౌట్గానే మిగులుతారు.
ఆ విధంగా మినహాయింపు (తొలగింపు) ఎన్ఈపీ యొక్క ప్రధానమైన లక్షణంగా ఉంటుంది. మినహాయింపబడిన వారికి వృత్తిపరమైన విద్యలో 'నైపుణ్యాలపై' శిక్షణ ఇస్తారు, కానీ వారు విద్యను అభ్యసించరు. ఎన్ఈపీ దార్శనికత ఏమంటే, నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అవసరాలపై ఆధారపడిన కొద్ది మంది కార్యనిర్వహక స్థాయి (ఎగ్జిక్యూటివ్), అధికారుల స్థాయిలో ఉన్న స్థానాలను అధిష్టించగలగడానికి అవసరమైన విద్యను పొందుతారు. అటువంటి విద్య నుంచి మినహాయించబడిన వారికి నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. వారు విస్తారంగా పెరుగుతున్న కార్మికశక్తిలో చేరుతారు. తలసరి ఆదాయాలు తగ్గడంతో అందుబాటులో ఉన్న పరిమితమైన ఉద్యోగాలపై నియంత్రణ ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలను చెప్పే ద్విభావనా సిద్ధాంతం ఇప్పుడు విద్యా విధానం యొక్క లక్షణాలను వాస్తవంగానే కాక చట్ట ప్రకారం కూడా చెపుతుంది.
ఈ విద్యావిధానాన్ని పొంది, యోగ్యతాయుతమైన ఉద్యోగాలలో నియమింపబడే వారికి మహానగరాలకు (మెట్రోపాలిటన్) చెందిన విశ్వవిద్యాలయాలను అనుకరించే పాఠ్యాంశాలు ఉంటాయి. ప్రపంచీకరణ చేయబడిన నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలలో సజాతీయ విద్య అవసరమయ్యే ప్రపంచ లేబర్ (కార్మిక) మార్కెట్ను కూడా సష్టిస్తుంది. ఈ విద్యా విధానం భారతదేశంలో విద్యను భారతీయ పరిసరాలు, చట్రం, నేపథ్యం నుంచి వేరు చేస్తుంది. ఉదాహరణకు, ఒక అర్థశాస్త్రం చదివే విద్యార్థి, వలసవాదం యొక్క వారసత్వాన్ని ఒక ప్రధానమైన సమస్యగా పరిగణించకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోలేడు. కానీ ఒక దేశ రాజధాని అయిన మహానగరంలో (మెట్రోపాలిస్) చదివే ఒక విద్యార్థి, డెవలప్మెంట్ ఎకనామిక్స్ చదివే విద్యార్థి అయినా, వలసవాదం గురించి ఒక్క విషయం కూడా నేర్చుకోడు. వారు 'మిగులు నిర్గమనం' (Drain of surplus) లేదా 'పారిశ్రామికీకరణ లేమి' గురించి వినలేదు. ఎన్ఈపీ ఊహించిన విధంగా విదేశీ విశ్వవిద్యాలయాలను భారతదేశంలో దుకాణాలు నెలకొల్పేందుకు ఆహ్వానిస్తే, వారికి అవసరమైన అనుకరణ పాఠ్యాంశాలు భారతీయ విద్యార్థులను తమ గతం గురించి తెలుసుకోకుండా, తమ వర్తమానం గురించి అర్థం చేసుకోలేని అసమర్దులుగా తయారు చేస్తుంది.
ఈ అనుకరణ విధానాన్ని దాచి ఉంచేందుకు, విద్యార్థుల్లో హిందూ మతతత్వం లాంటి స్వదేశీ అభిమానంతో జనించిన విదేశీ వ్యతిరేక దుందుడుకు స్వభావాన్ని నింపాలని ఎన్ఈపీ సూచిస్తుంది. పాఠ్యాంశాలు అన్నీ పురాతన భారతదేశం యొక్క వైభవం గురించి విసుగు పుట్టించే విధంగా మాట్లాడి, తాము భారతీయులుగా ఉన్నందుకు గర్వంగా ఉందనే విధంగా విద్యార్థుల మనసులలో నాటుకొని పోయేట్టు చెప్పాల్సి ఉంటుంది. కానీ భారతీయ సమాజం కూడా ఎవ్వరూ గర్వించని విధంగా అంటరానితనం లాంటి భయంకరమైన ఆచారాలతో గుర్తింపు పొందింది. ఇలాంటి ఆచారాలను అధిగమించేందుకు, విద్యార్థులు వాటిపట్ల ద్వేషపూరిత స్వభావం కలిగి ఉండడం నేర్చుకోవాలి. భారతీయులుగా ఉన్నందుకు గర్వపడుతున్నామని అనుకునే విధంగా వారిమనసులలో నాటుకొనేట్టు చెప్పడం వలన భయంకరమైన ఆచారాల పట్ల వారికున్న ద్వేషం అడ్డుకోబడు తుంది. కుల అణచివేత, ఇతర అన్యాయాలు పట్టించుకోదగనివిగా నిర్లక్ష్యానికి గురవుతాయి. ఇది అణచివేత, దోపిడీచే గుర్తింపు పొందిన ప్రపంచంలో విద్యార్థులను సాంప్రదాయానుసార వాదులుగా(Conformists) తయారు చేస్తుంది.
ఈ సాంప్రదాయానుసార వాదం (Conformism) యొక్క ప్రాముఖ్యత గురించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇచ్చే తర్ఫీదు నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యాప్తి చేస్తుంది. ఒకవేళ ఒక ఉపాధ్యాయుడు ప్రభుత్వ విధానాలకు లేదా విశ్వవిద్యాలయ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసిస్తే, అతని పదవీకాలాన్ని తిరస్కరించడం ద్వారా అతడ్ని బాధితునిగా మార్చే అవకాశాలకు తావిచ్చేటువంటి ''పదవీకాలపు మార్గదర్శకాలను'' (టెన్యూర్ ట్రాక్) ఉపాధ్యాయుల కోసం ఈ ఎన్ఈపీ సూచిస్తుంది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు సంబంధించిన విషయాలలో బోర్డ్ ఆఫ్ గవర్నర్లకు ఎక్కువ అధికారాలు ఉంటాయి. శాఖాధిపతులు, డీన్ల పదవులు అధ్యాపకులలో రొటేషన్ విధానం ఇకనుంచి ఉండబోదు. అంటే ఫ్యూడల్ కాలం నాటి సేవల నిమిత్తం ఉపయుక్తతగా ఉండే వారిని నియమించుకునే పాత రోజులకు తిరిగి వెళ్తున్నాం అని అర్థం చేసుకోవాలి. కాబట్టి మొత్తంగా, బోధనా సిబ్బంది మధ్య ఒక సమానత్వ భావాల వాతావరణం సృష్టించడం ద్వారా ఇంతకు ముందు విశ్వవిద్యాలయాలలో ఉన్న ప్రజాస్వామిక పద్ధతులను ఈ ఎన్ఈపీ వెనక్కి నెట్టివేస్తుంది.
విద్యార్థులలో మేథోపరమైన భావావేశాన్ని సృష్టించిన ప్రజాస్వామిక పద్ధతుల వల్ల ఆయా విద్యా సంస్థలు తిరిగి సష్టించిన మంచి నాణ్యమైన బోధన, పరిశోధనా పద్ధతులను ఇప్పుడు మనం ఈ ఎన్ఈపీ కారణంగా కోల్పోతున్నాం. ఈ బోధనా పద్ధతులు కొన్ని కొత్త విషయాల అధ్యయనానికి, బహుళ శిక్షణా విభాగాలైన దళిత అధ్యయనాలు, జనరల్ స్టడీస్, కార్మిక అధ్యయనాల ఆవిర్భావానికి దారి తీశాయి. ఈ విషయాల అధ్యయనాలు కనీసం అణచివేతకు గురవుతున్న ప్రజల గురించి చదివేందుకు అణచివేతకు సంబంధించిన అధ్యయనాన్ని విభాగాలుగా వేరుచేశాయి. ఎన్ఈపీ బహుళ విషయాల అధ్యయనాల ప్రాముఖ్యతను నొక్కి చెపుతున్నప్పటికీ పైన చెప్పిన విషయాల అధ్యయనం గురించి ఏ విధమైన ప్రస్తావన చేయనందువలన ఈ ఎన్ఈపీ సాంప్రదాయానుసార వాదాన్ని పెంచి పోషిస్తుందన్న అనుమానాన్ని కలుగజేస్తుంది.
విద్య మన రాజ్యాంగంలోని ఏకీభావ జాబితా (Concurrent List)కు చెందినది. కానీ నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రాలతో సంప్రదించకుండానే రూపొందించారు. ఇది విద్య కేంద్రీకరణ దిశను సూచిస్తున్నది. ప్రతిపాదిత పరిశోధన - పర్యవేక్షణా సంఘం అయిన జాతీయ పరిశోధనా సంస్థ (ద నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్)కు ప్రధానమంత్రి నేతత్వం వహిస్తాడు. ఉన్నత విద్యకు సంబంధించి అత్యున్నత నిర్ణయం తీసుకునే సంస్థ అయిన భారత ఉన్నత విద్యా సంస్థకు కేంద్ర విద్యాశాఖ మంత్రి నేతత్వం వహిస్తాడు. సిలబస్ను కేంద్రమే తయారు చేస్తుంది. రాష్ట్రాలు కేవలం స్థానికతను జోడిస్తాయి. రాష్ట్ర స్థాయిలో ఉన్న సెకండరీ బోర్డుల విలువ తగ్గించి, అండర్ గ్రాడ్యుయేట్లో ప్రవేశాలు కేంద్రం నిర్వహించే ప్రవేశ పరీక్షల ద్వారా నిర్ణయిస్తారు. కేంద్రీకరణ వైపు నిస్సందేహంగా మొగ్గు చూపే ఈ ధోరణి నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) యొక్క ప్రజాస్వామిక వ్యతిరేక విధానాన్ని శ్లాఘిస్తుంది.
''ద టెలిగ్రాఫ్'' సౌజన్యంతో
- ప్రభాత్ పట్నాయక్
అనువాదం:బోడపట్ల రవీందర్,
సెల్:848412451