Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెలంతా పనిచేస్తే ఎన్ని డబ్బులు చేతికి వస్తాయో తెలియని బతుకులు ఆశాలవి. కరోనా వచ్చాక గతం కంటే ఆశాలకు పనిభారం బాగా పెరిగింది. కానీ పెరిగిన పనికి అనుగుణంగా ప్రభుత్వం ఇన్సెంటివ్ చెల్లించటం లేదు. ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ఆశాలతో కరోనా పనులు చేయిస్తున్నారు. కానీ పారితోషికాలు చెల్లించే సమయం వచ్చేసరికి కరోనా పనికి బిల్లులకు సంబంధం లేదంటున్నారు. దీంతో ఆశాలకు అతితక్కువ పారితోషికాలు వస్తున్నాయి. వీటితో పాటు ఇంకా అనేక సమస్యలతో ఆషాలు సతమతమవుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆశాలు పోరాటమార్గం పట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టు తెలంగాణలోనూ ఆశాలకు రూ.10 వేలు ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇప్పటికే సెప్టెంబర్ 21, 22 తేదీలలో మండల కేంద్రాలలో నిరాహార దీక్షలు చేపట్టిన ఆశాలు సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో మూడు రోజులు రాష్ట్ర వ్యాప్త సమ్మెకు సన్నద్ధం అవుతున్నారు.
రాష్ట్రంలో ఆశా వర్కర్లు సుమారు 26వేల మంది పని చేస్తున్నారు. వీరంతా మహిళలు, బడుగు బలహీన వర్గాలకు చెందినవారు. 2005 నుంచి రాష్ట్రంలో పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు కరోనాను కట్టడి చేయడంలో కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. కానీ వీరికి రాష్ట్రంలో ఫిక్స్డ్ వేతనం లేదు. పనిని బట్టి పారితోషికాలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ పద్ధతిని వ్యతిరేకిస్తూ కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలని, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 106రోజులు ఆశాలు సమ్మె చేశారు. సమ్మె అనంతరం 5.5.2017న ప్రగతిభవన్లో సమావేశం ఏర్పాటు చేసి రూ.6,000 ఫిక్స్డ్ వేతనం చెల్లిస్తామని స్వయంగా ముఖ్యమంత్రిగారే ప్రకటించారు. తర్వాత ఇచ్చిన హామీకి భిన్నంగా కేవలం పారితోషికాలను మాత్రమే పెంచుతూ జీఓ నెం.167ను ప్రభుత్వం జారీ చేసింది.
2018 సెప్టెంబర్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మరొకసారి రూ.1,500 పారితోషికాలు పెంచారు. మొత్తం రాష్ట్రంలో రూ.7,500 వేతనం ఇస్తున్నామని ప్రభుత్వం చెపుతున్నది. ఇది పచ్చి అబద్ధం. ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం నిర్ణయించలేదు. కేవలం పనిని బట్టి పారితోషికాలు మాత్రమే చెల్లిస్తున్నది. ఈ విషయాన్ని మరుగున పరచి పదే పదే చెల్లించేది వేతనమని మంత్రులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో 90శాతం మంది ఆశాలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు మాత్రమే పారితోషికాలు వస్తున్నాయి. ఈ పద్ధతి ఫిక్స్డ్ వేతనం ఎలా అవుతుందో చెప్పాలని ఆశాలు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి హామికే గ్యారంటీ లేకపోతే ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఫిక్స్డ్ వేతనం రూ.10 వేలు నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆశాలు గత 6 నెలల నుంచి కరోనా పనులు నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరిగి సర్వేలు చేయడం, కేసులు గుర్తించడం, ఇంటిలోనే ట్రీట్మెంట్ తీసుకునే వారిని ప్రతిరోజు ఫాలో చేయడం... ఇంకా అనేక పనులు ప్రతిరోజు ఉదయం నుంచి అర్థరాత్రి వరకూ గతం కంటే రెట్టింపు శ్రమ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం పెరిగిన పనికి అనుగుణంగా ఇన్సెంటీవ్ చెల్లించడం లేదు. కేంద్రం రూ.1,000లు, రాష్ట్రం రూ.750లు రెండు కలిపి రూ.1,750లు చెల్లిస్తామని నిర్ణయం చేశారు. ఈ డబ్బులు కూడా అనేక జిల్లాల్లో పెండింగ్లో ఉన్నాయి. ఇన్సెంటీవ్ విషయంలో కూడా ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆశాలు అంటున్నారు.
2020 మార్చి 22 నుంచి ఆశాలందరూ కరోనా పనిలో ఉండాలని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం చెప్పినట్టు ఆశాలు కూడా కరోనా పనులు నిర్వహిస్తున్నారు. కానీ నెల చివర పారితోషికాలు చెల్లించే సమయం వచ్చేసరికి కరోనా పనికి బిల్లులకు సంబంధం లేదంటున్నారు. సంబంధం లేనప్పుడు ఆశాలతో కరోనా పనులు ఎందుకు చేయిస్తున్నదీ ప్రభుత్వం? కరోనా పనిలో ఉన్న తర్వాత ఇతర పనులు చేసే అవకాశం లేదని ప్రభుత్వానికి కూడా తెలుసు కదా? అలాంటప్పుడు ఇతర పనులు చేస్తేనే పారితోషికాలు చెల్లిస్తామని, పారితోషికాలలో కోతలు పెట్టడం ఎంతవరకు సమంజసం. ఇది ఆశా వర్కర్లను మోసం చేయడం తప్ప మరొకటి కాదు. అందుకే ఈ విధానాన్ని ఆశాలు వ్యతిరేకిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చేంతవరకు ప్రతినెల రాష్ట్రవ్యాప్తంగా ఆశాలందరికీ రూ.7,500లు పారితోషికాలు తగ్గించకుండా మొత్తం చెల్లించాలి.
కరోనా విజంభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఆశాలు కరోనా బారిన పడ్డారు. కరోనా సోకిన ఆశాలకు ఉచిత వైద్యం, పోషక విలువలున్న ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది. కానీ ఈ పనులు ప్రభుత్వం చేయడం లేదు. పైగా కరోనా సోకిన ఆశాలు పనిలో లేరు కాబట్టి పారితోషికాలు చెల్లించేది లేదని వాదన చేస్తున్నది. కరోనా సోకిన ఆశాలు పనిలో ఉండే అవకాశం ఎలా ఉంటుంది? మానవత్వం ఉన్న వారెవరైనా ఇలా మాట్లాడతారా? కానీ తెలంగాణ ప్రభుత్వం ఆశాలను కనీసం మనుషుల్లాగా కూడా చూడటం లేదు. ఈ దుర్మార్గమైన పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. కరోనా సోకిన ఆశాలకు పారితోషికాలు యదావిధిగా చెల్లించాలి.
ఆశాలకు రక్షణ పరికరాలు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు ఇవ్వటంలేదు. అనేకచోట్ల ఆషాలే సొంత డబ్బులతో వీటిని కొంటున్నారు. కరోనా పేషెంట్స్ దగ్గర పనిచేసేవారికి పీపీఈ కిట్స్ ఇవ్వడం లేదు. ఈ సౌకర్యాలు లేక ఆశాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆషాలందరికీ కరోనా టెస్టులు చేయడం లేదు. దీనివల్ల ఈ కాలంలో చాలామంది ఆశాలు చనిపోయారు. చనిపోయిన వారికి రూ.50 లక్షల కరోనా ఇన్సూరెన్స్ కూడా రాష్ట్రంలో చెల్లించడం లేదు. చాలాకాలం నుంచి ఖాళీ పోస్టులు భర్తీ చేయడం లేదు. దీనివల్ల ఈ పని భారమంతా ఉన్నవారిపైనే పడుతున్నది. అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ సర్వేల డబ్బులు చెల్లించడం లేదు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 12జతల యూనిఫామ్స్ ఆశాలకు ఇవ్వాలి. కానీ కేవలం మూడు జతలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. వీటికి తోడు పారితోషికంలేని అనేక పనులను ఆశాలతో చేయిస్తున్నారు. జాబ్ చార్ట్ నేటికీ ఇవ్వలేదు. రిజిస్టర్స్, రిపోర్ట్స్, జిరాక్స్ ఖర్చులన్నీ ఆశాలతోనే పెట్టిస్తున్నారు. 18ఏండ్ల నుంచి పనిచేస్తున్న ఆశాలకు ఏఎన్ఎం పోస్టుల్లో వెయిటేజి మార్కులు నేటికీ నిర్ణయించ లేదు. ఆశాలకు సెలవులు కూడా ఇవ్వట్లేదు. ఆరోగ్యం సహకరించక పోయినా, కుటుంబంలో అత్యవసరమైన పనులు వచ్చినా, సెలవుల కోసం అధికారులను వేడుకునే దుస్థితికి ఆశాలు నెట్టబడ్డారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనేకసార్లు అధికారులకు ఆశాలు వినతి పత్రాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. కానీ నేటికీ ప్రభుత్వం ఆశాల సమస్యలు పరిష్కరించలేదు. యూనియన్లతో చర్చించే అలవాటును ఈ ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయింది. కార్మిక హక్కులను కాలరాస్తున్నది. ఆశాల మనోభావాలను పరిగణలోకి తీసుకోవటం లేదు. ఆశాలకు వ్యతిరేకంగా ఏకపక్ష నిర్ణయాలు చేస్తున్నది. బెదిరించి మరీ వెట్టిచాకిరి చేయించుకుంటున్నది. దీంతో విసిగివేసారిన ఆశాలు సమస్యల పరిష్కారం కోసం పోరాట మార్గం పట్టారు. సెప్టెంబర్ 21, 22 తేదీలలో మండల కేంద్రాలలో నిరాహారదీక్షలు ఇప్పటికే అత్యంత విజయవంతంగా నిర్వహించిన ఆశాలు, సెప్టెంబర్ 28, 29,30 తేదీలలో మూడు రోజులు రాష్ట్రవ్యాప్త సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆశాల సమస్యల పైన స్పందించాలి.
- పి. జయలక్ష్మి
సెల్: 9490098605