Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ.బీ. బర్ధన్ (అర్ధేందు భూషణ్ బర్ధన్)... సంక్షుభిత సంకీర్ణ రాజకీయాల శకంలో సీపీఐ ప్రధాన కార్యదర్శిగా పార్టీని సమర్థవంతంగా నడిపించిన నేత. ఆయన సెప్టెంబరు 25, 1924న ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీకి చెందిన బరిసాల్లో జన్మించారు. ఆయన తన 15వ యేట నుంచే కమ్యూనిస్టు భావాలతో నాగపూర్ వెళ్ళారు. 1940లో నాగపూర్ విశ్వవిద్యాలయంలోని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో చేరారు. ఆ కాలంలో నిషేదింపబడిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలోనూ అదే సంవత్సరం చేరారు. నాగపూర్ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘ అధ్యక్షునిగా కూడా వ్యవహరించారు. ఆయన ఆర్థికశాస్త్రం, న్యాయశాస్త్రాలలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలను పొందారు.
తర్వాత కార్మికనేతగా పలు ఉద్యమాలు చేపట్టారు. ఆ సమయంలో 25సార్లు అరెస్టయ్యారు. నాలుగేండ్లకుపైగా జైలు జీవితం గడిపారు. 1957లో ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించిన బర్ధన్.. అదే ఏడాది మహారాష్ట్ర శాసనసభకు నాగ్పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1967, 1980 సంవత్సరాల్లో విదర్భ నుంచి పార్లమెంటుకు పోటీ చేసినా గెలుపొందలేక పోయారు. 1990లో ఢిల్లీ రాజకీయాల్లోకి వచ్చిన బర్ధన్.. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఏఐటీయూసీ అధ్యక్షునిగానూ పనిచేశారు. 1996లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా.. ఇంద్రజిత్గుప్తా నుంచి బాధ్యతలు చేపట్టారు. ఆ ఏడాది కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర మూడో కూటమితో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో.. సీపీఎం నేత హరికిషన్సింగ్ సూర్జిత్తో కలిసి బర్ధన్ కీలక పాత్ర పోషించారు. ఆ ప్రభుత్వంలో సీపీఐ చేరటంలోనూ బర్ధన్ పాత్ర కీలకమైనది. ఆ సర్కారులో ఇంద్రజిత్గుప్తా కేంద్ర హౌంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతర కాలంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ-1 ప్రభుత్వం ఏర్పడటం లోనూ, దానికి వెలుపలి నుంచి మద్దతు ఇవ్వటం ద్వారా సూర్జిత్, బర్ధన్లు కీలకపాత్ర పోషించారు. పదహారేండ్ల పాటు వరుసగా నాలుగు పర్యాయాలు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన బర్ధన్.. 2012లో ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఆ తర్వాత కూడా పార్టీ సభ్యులకు మార్గదర్శనం కొనసాగించారు.
ఢిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయంలో నివసిస్తున్న వీరు మెదడునాడిలో పూడిక కారణంగా బ్రెయిన్ స్ట్రోక్కు గురవటంతో ఆయనను జి.బి.పంత్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న బర్ధన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి 2016 జనవరి 2న తుదిశ్వాస విడిచారు.
బర్ధన్కు కుమారుడు అశోక్ (కాలిఫోర్నియా యూనివర్సిటీలో అర్థశాస్త్ర బోధకుడు), కుమార్తె అల్కా (అహ్మదాబాద్లో వైద్యురాలు) ఉన్నారు. ఆయన భార్య నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసే వారు. ఆమె 1986లో చనిపోయారు. కమ్యునిస్టు పార్టీకి వెలుగు తెచ్చిన నేత. ఆయన జీవన విధానం అందరికి స్ఫూర్తిగా నిలుస్తుంది. పార్టీలో పెద్దన్న పాత్ర పోషిస్తూ నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా పోరాడిన కమ్యూనిస్టు యోధుడిగా ఆయన చిరకాలం గుర్తిండి పోతారు.
- కామిడి సతీశ్రెడ్డి,
సెల్: 9848445134