Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని మాటలు పాములెక్క రొండుకోరలతో పుడతరు రా.. గవ్వీటికి అర్థాలు సుత గట్నే ఉంటరు.. గదెర్కబట్టిగా కోరల్ని పీకిపారెయ్యాలె... అంతేగానీ మందిమాటలిని మారుమానం బోతె మళ్ళొచ్చెటాల్కె ఇల్లాగమైందన్నట్టైతది వారి గీ ఒప్పందానికి ఒప్పుకుంటే... రాగిశెట్టరుగుకాడ సుట్టముక్కెలి గిచ్చుకుంట సెపుతాండు యాదయ్య... ఊళ్ళె అంతో ఇంతో సదువుకున్నోడు... టీ వోటెల్ కాడికొచ్చి రోజు పేపర్ సదువుతడు. అండ్ల ఇషయాల గురించి ఊరోళ్ళతోని ముచ్చటజేస్తడు... ఊరోళ్ళకు సుత యాదయ్య మాటలమీద కొద్దోగొప్పో గురున్నది..
ముతక లుంగీలు ముతక పంచెలు బాడీలేసుకొని భుజాన కండువ పైపంచేసుకొని శేతుల్ల ముల్లుగర్రో, కొడవలో, లిక్కో, బువ్వ క్యారేజో పట్టుకొని కూకున్నరు పొలం బోయెటోళ్ళచ్చెటోళ్ళు... పోతపోతనో, అచ్చుకుంటనో యాదయ్య అవుపడేటాల్కె శెట్టు నీడకస్తున్నరు... సాకలోళ్ళ రాజ్జెం తలకు ఏలాడేసుకున్న మూట బరువైతన్నా పట్టిచ్చుకోకుంట గట్లనే ఇనవట్టిందిందాకట్నుంచి... బాడవల ఆళ్ళకీ మూడెకరాల వొరిమొత్తున్నది... చర్చ జరుగుతన్నది ఎగసాయానికి సమ్మందించింది గాబట్టి కాలవకుబోయేటిపని బందువెట్టి ఇంటాంది..
గదేందె.. ఓ.. గట్లంటవు యాడికెల్లి యాడికన్నబోయి అమ్ముకోవచ్చంటగదా... మల్ల ఎక్వదరేడస్తే ఆడికిబోవుడు రొక్కం ఎవళు ఎక్కువిస్తే ఆళ్ళకి అమ్ముడు మంచిదేగదా..
అన్నడు తుటారెంకయ్య పంచె అంచులొకశేత గొడుగొకశేత బిగబట్టుకుంటూ.... గామాటలినంగనే సుట్టసొంగ కాండ్రకిచ్చి తుపుక్కున ఊసుకుంట
రామాయనమంతిని రాముడికి సీతేమైద్దంట వేందిరా.. యాడికన్నా బోయి అమ్ముకో అన్నదాంట్లెనే ఎవుడన్నొచ్చి ఎక్కడన్న కొనుక్కోవచ్చనిరా.. యాపారులకు తలుపులు బార్లా తియ్యటం అన్నమాట.. ఎక్కడైనా వాలి ఇష్టమొచ్చినట్టు పీక్కుతినండని రాబందుల రెక్కలు పొడుగు జేసినట్టు.. బడా కార్పొరేటోళ్ళు అగ్రి బిజినెస్ పైన కన్నేశిన్లు గదా ఎన్నికల్లో వేలకోట్లు అందిచ్చినోళ్ళ రుణం తీర్సుకునేందుకు ఆళ్ళకీ ఇనామిచ్చుడన్నమాట
యాదయ్య గామాటనటంతోటే ఎంకయ్య ఇంగేమంటె ఏమంటడో అని..ఎవలు మాట్లాడక పోతండెపాల్కి సటుక్కున అందుకుంది రాజ్యం..
బాబారు ఏమనుకోకపోతె నాదొక అనుమానమే.. అనగానే ఏందో అడుగు అని ప్రోత్సహించే యత్నం చేసిండు దూదేకుల మస్తాన్.. శేట్లే మనకాడికచ్చి పోవుడు మనకే సౌలత్ గదనే అంటుండగా.. ఆటోళ్ళల్ల, టాట్టర్లల్ల, ఎడ్లబండ్లల్ల పత్తి, మక్కలు, ఒడ్లు, మిరబగాయలు పెసలు శెంక్కాయలు మార్కొట్టుకు కొంచబోవుడు తప్పుద్దిగదా అన్నాడు మాదిగ అబ్బురాం రాజ్జెం సందేహానికి కొనసాగింపుగా.. మళ్ళా రాజ్జెం మాట్లాడుతూ..
యాపారులు యాడికెళ్ళో, యాడికెళ్ళో అస్తే మనకి నట్టమెట్లా..ఎక్వమంది సరుకుజూస్తే సూడనీ.. అండ్ల ఎవళెక్కువ రేటుసూప్తే ఆళ్ళకేగద ఇస్తం అంది నెత్తిగోక్కుంట.. నేనదే అనుకుంటన్నక్కా అన్నడు టైలర్ మస్తాను ..
ఏరు ఎక్కడిది బిడ్డా..ఆళ్లంత దొంగలే ఆళ్ళాళ్లు బదురుకుంటరు ఇంతకంటె పెట్టద్దనుకుంటరు.. గదేందో ఈ నామో బో నామో అని గిప్పటికె ఉన్నదిగదా.. గా దానివల్ల ఏం ఒరిగింది.. ఆళ్లెంతకు గొనాలో అంతకే గొంటరు.. రేటు తక్కువిస్తే గిప్పటిదాంక మనం మార్కొట్లల్ల లొల్లిగిట్ల జేస్తన్నం దర్నాల్ గిర్నాల్ జేసి రేటు కొద్దిగైన పెంచిపిచ్చుకుంటన్నంగదా అంటుండంగనే ఆ.. అవ్.. అవ్ అన్నరు ఆడ జేరినోళ్ళలో ఎవలెవలో..
ఆ అయితే ఇప్పుడేమైతది మల్ల అనుకుంట ముంగటికచ్చిండు తిరుమలి.. ఏమయ్యిద్దంటె మనం కిక్కురుమనే ఈలుండది అనంగనే అదెనే... అన్నడు మంగలెంకటి.. మనం అమ్మేది మార్కొట్లల్ల కాదుగదా.. పెబేటోళ్లకి. అమ్మితె అమ్ము లేకుంటెలేదని ఆడికెల్లి దెంకపోతరు, కొనుడు బందువెడతరు, సరుకు కొనే ఇంకో దిక్కులేక మనమే కాళ్ళ బేరానికొస్తమనుకుంటరు. ఆళ్లు ఈ అడ్తి యాపారుల లెక్క అతికార్ల శెప్పుశేతల్ల ఉండరు, ఆళ్లు కలెట్టరు జెప్పినా జాంటబారు అంటరు.. ఎమ్మెల్లే జెప్పినా ఇనరు తీస్ మార్కాన్ల లెక్కజేస్తరు అన్నడు యాదయ్య సుట్ట నుసిరాల్సుకుంట..
గిదేం అన్నాలం బాబారు అంది రాజ్జెం బుగ్గలొత్తుకుంట.. అదే మరి అన్నాడు యాదయ్య.. అన్నాలమని సిన్నగంటవేందక్కా అన్నడు మస్తాన్ లుంగి గట్టిగ గట్టుకుంట..
ఆ..ఇంగో ముచ్చెట అంటూ ఏదో గుర్తొచ్చి చెపుతున్నడు యాదయ్య.. మార్కెట్లల్ల యాపారులు మన పంటలకు మంచి దరియ్యకపోతె పెబుత్వం మార్క్ ఫెడ్, సివిల్ సపలై, నాఫెడ్, ఆయిల్ ఫెడ్, సీసీఐ శాఖలను రంగంలోకి దింపి కనీస మద్దతు ధరలపై కొనిపిస్తది గద అనంగనే ఆ అవును పర్చేజ్ సెంటర్లు ఏర్పాటు జేస్తరు గద అన్నడు మస్తాన్. ఆ.. ఈ ఇదానంలో పెబుత్వ కొనుగోలు బందైతది. కొంటె పెబేటోడెకొనాలె లేకుంటె లే అంటుండగా..
ఓరెక్క ఇంతకతుందా అన్నడు అబ్బురాం...మనకేం దెలుసురా గీ ఇకమతులు అన్నడు ఎంకటి తలకు చుట్టుకున్న కండువా విప్పుకుంటూ..
యాదయ్య గీ బిల్లు వల్ల రాష్ట్రానికీ నష్టమే అంటుండగానే రాష్ట్రానికె నట్టమెట్ల బాబారు అని అడిగిండు మస్తాన్.
ఏముంది పెబేటోళ్ళూ యాడబడితే ఆడ కొనుడు సురూజేస్తే మార్కొట్లు ఆగమైతరు. మార్కొట్ యార్డుల ద్వారా, చెక్ పోస్ట్ల ద్వారా రావాల్సిన వేలకోట్ల మార్కెట్ ఫీజు ఆదాయం రాకుండాపోతుంది. ఇది పెబుత్వానికి నట్టమే కనుక ముక్కెమంత్రి గట్టిగనే కొట్లాడతడు.. ఇంగోయేపు పార్లమెంట్ల బయటా, సీపీఎం, కాంగ్రెస్, తణమాల్ కాంగ్రెస్ కూడా బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు, అర్తాళ్ళకు దిగారు... అని చెబుతుండగా..
గీ యాష్టలన్నీ లేకుండ రైతులు పెబేటు కంపెనీ యాపారులతో ఒప్పందం కుదుర్సుకోవచ్చటగదా, పండించబొయే పంటకు ఎంత ధర గావాల్నో అని పంట ఎయ్యకమునుపే మాట్లాడుకోవచ్చ నుందట గదా ఇంకో బిల్లులో.. అని తన సందేహం వ్యక్తం చేశాడు సర్వయ్య మోకు వదులు జేసుకుంటూ..
అదింకా ప్రమాదం కామ్రేడ్స్ అంటూ అక్కడికొస్తున్నారు వామపక్షపార్టీలకు చెందిన ఐక్య కార్యకర్తలు.. ఎట్లంటవన్నా అంటూ మస్తాన్ అడగగానే.. కార్పొరేట్ సంస్థల ఒప్పందం విడివిడి రైతులతో ఉండదు గ్రామం యూనిట్ గా అయిదెకరాల లోపు రైతులతో ఎంఓయూ చేసు కుంటారు.. అలా పదేళ్ళో ఇరవయ్యేళ్ళో మనపొలాలను వాళ్ళ గుప్పిట్లోపెట్టుకుంటారు పొలం గల రైతుకు ఎకరానికి ఇంత అని ముట్ట చెపుతారు, ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే.. అని చెప్పబోతు ఎందుకో ఒక్కసారి ఆగాడు ఎర్ర చొక్కా మెడకు వేళాడే బ్యాగు వేసుకున్న మండల నాయకుడు.. తననోటిలోని మాట చెప్పబోతుండగా అతని కళ్ళలో సన్నని తడితెర.. మూడు సెకన్లలో తమాయించుకొని తిరిగి చెప్పటం మొదలెట్టాడు..
అరెకరమో పావెకరమో ఇన్నేళ్ళూ మనం రైతు అనే గౌరవ హౌదాను అనుభవిస్తున్నాం. జై జవాన్ అనే కీర్తివాక్యంలో భాగమయ్యాం.. మనకు మనం స్వతంత్రంగా బతుకుతున్నాం.. వ్యవసాయం చేస్తున్నా కొన్నిసార్లు కౌలుకిచ్చినా అంతా మన ఇష్ట పూర్తిగా జరిగింది. కానీ ఈ ఒప్పందానికి తలొగ్గితే మనపొలాల్లో పనోళ్ళలా మరతాం. కార్పొరేట్ కంపెనీ బానిసలవుతాం. రైతు అనే గౌరవ హౌదాను కోల్పోతాం. పంట పండించి ఒకరికి దానం ధర్మం చేసిన చేతులే కార్పొరేట్ ముందు చేతులు సాచాల్సొస్తొంది, మన తల కండువా మన వేషం మన అరక ఏవీ ఇక ఉండకపోవచ్చు కార్పొరేటోళ్ళ యూనిఫారాలేసుకొని వాళ్ళ బ్యాడ్జ్లు, టోపీలు తగించుకోవాల్సి రావచ్చు.. బహుశా మనల్ని ఏ ఫీల్డ్ సూపర్ వైజరనో ఫాం అసిస్టెంట్ అనో పిలవచ్చు. మొత్తంగా రైతు మాయమవొచ్చు, ఆధునిక పొలం యంత్ర పనిగాళ్లు తప్ప సంప్రదాయ రైతు మన ముందుతరాలకు కనిపించకపోవచ్చు.. అంటుండగా.. అక్కడున్నోళ్లలో ఒకరకమైన బాధ, ఏదో తెలియని ప్రకంపన కలిగాయి..
తఅయితే గిప్పుడెట్ల.. మనమేం జేయాలె దీన్నాపెటందుకు అని అబ్బురాం అనగానె నేను చెప్పానని గాదులే గానీ.. ఈ బిల్లులమీద ఇంకా ఎక్కువపరిజ్ఞానం పెంచుకోండి. మేధావుల ప్రసంగాలు, విద్యావంతుల అభిప్రాయాలు, పబ్లిక్ చర్చలు వినండి, పత్రికలు చదవండి. బిల్లులు రైతు వ్యతిరేకమైనవే అని మీరు భావిస్తే మీరే ప్రత్యక్ష ఆందోళణకు దిగండి. సానుకూల పార్టీల మద్దతుంటుంది.. సంప్రదాయ వ్యవసాయం పంటల విక్రయం అనగనగా ఒక రైతు కథగా మిగలకూడదనుకుంటే.. రైతు ప్రత్యేకత కొనసాగాలంటే మండలకేంద్రంలో ఎల్లుండి జరిగే ధర్నాలో పాల్గొనండి అంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు..
ఆ మరుసటి రోజు పెసలు, పత్తి అమ్మేందుకు మార్కెట్కు వెళ్లినపుడు.. ఇదుగో తక్పట్టీ అంటూ కమిషన్ ఏజెంట్ అందించగానే ఆ కాగితాన్నందుకొని పలుమార్లు పరిశీలిస్తున్నారు కొందరు రైతులు... తక్ పట్టీ చూడటం వాళ్ళకు కొత్తేం కాదు. కమిషన్ ఏజెంటు గుమస్తా తక్ పట్టీ చేతులో పెట్టాడంటే సాయంత్రమొచ్చి రావలసిన డబ్బు అడ్తీలో పట్టుకెళ్ళమని అర్థం...ఎప్పుడు తక్ పట్టీ పొందినా ప్రతిరైతూ ఓసారి పరిశీలనచేసుకొని జేబులో పెట్టుకుంటారు కానీ ఇప్పుడు వాళ్లు చేస్తున్న పరిశీలనకు అర్థం వేరే.. వచ్చే సీజన్కు మార్కెట్ను మళ్ళీ చూస్తామో లేదో అని వాళ్ల భావన.. మార్కెట్ లో క్రయ విక్రయాలపై ఎన్ని విరుద్ధ అభిప్రాయాలున్నా యార్డులతో రైతుల అనుబంధం విడదీయలేంది.. పిల్లలు తల్లులదగ్గర ఎలా అలుగుతారో పోరాడి ఎలా కావలసింది పొందుతారో అలాంటి అనుబంధం మార్కెట్లతో రైతులది..ఎన్ని అనుకున్నా అమ్మతోనే పిల్లలున్నట్టు.. ఆలోచిస్తున్న వాళ్ళ పిడికిళ్ళు బిగుసుకున్నారు...
- కె. శ్రీనివాస్
సెల్: 9346611455