Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవ పరిణామం మూడు వందల యాభైకోట్ల సంవత్సరాల పాటు సాగిన సుదీర్ఘ ప్రక్రియ. అయినప్పటికీ ఈనాడు మనం ఆశ్చర్యపోయే రీతిలో జీవపరిణామ ఫలితాలు కనిపిస్తున్నాయి. కంటికి కనిపించని ఏకకణ సూక్ష్మజీవు లయ్యాయి. పరిణామ ఫలితంగా చేపలై సముద్రాలు కలయతిరుగుతున్నాయి. భారీ డైనోసార్లయి ఈ విశ్వం మీద తమ యుగాన్ని స్థాపించుకున్నాయి. కొంత కాలానికి అంతరించిపోయాయి. కొన్ని జీవులు పక్షులై గాలిని ఈదాయి. మరికొన్ని తిమింగలాలై నీటిని ఈదాయి. ఒంటెలై ఎడారులనీదాయి. గుర్రాలై సుదూర మైదానాలు దాటాయి. పులులై క్రూరత్వాన్ని చాటాయి. సింహాలై గర్జనకు సంకేతమయ్యాయి. ఏనుగులై కండబలం ప్రదర్శించాయి. కొన్ని జీవులు పెంగ్విన్లై మంచును జయించాయి. మరికొన్ని గబ్బిలాలై చీకటిని జయించాయి. కోతులై అరణ్యాల్ని అలరించాయి. అలాంటి జీవులే కొన్ని మనుషులై గుహలు చేరాయి. నింపాదిగా ఆలోచించడం ప్రారంభించాయి. ప్రకృతిని అర్థం చేసుకుంటూ అన్వేషించాయి. సంకల్పించాయి. సృజించాయి. చివరకు గ్రహాల్ని జయించాయి. ఇంకా జయిస్తూనే ఉన్నాయి. అస్థిత్వాన్ని నిలుపుకుంటూ, ఇతర ప్రాణాలన్నింటి కంటే తాము భిన్నమని గ్రహించాయి. నిరంతరం కొత్త ద్వారాలు తెరుచుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇంతటి జీవన సంఘర్షణ- ఒక శాస్త్రంలో ఒక అధ్యాయంగా మిగిలిపోతుందా? పోదు!
జీవ పరిణామం ఒక నిరంతర ప్రక్రియ! సులభంగా నాలుగు మాటల్లో కోట్ల సంవత్సరాల పరిణామం చెప్పుకున్నాం. కానీ, అది అంత సులభంగా ఏమీ జరగలేదు. ఒక చిన్న మొక్క ఎదిగి వృక్షం కావడమంటేనే ఒక గొప్ప సంఘర్షణ. మనం కండ్ల ముందు చూస్తున్నదే - మట్టిలో ఉండగానే చీమలు, పురుగులు విత్తనాన్ని తినేయాలని చూస్తాయి. వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటే.. పక్షులు దాన్ని పసిగట్టి, పొడిచి తినేయాలని చూస్తాయి. అదీ తప్పించుకుని పెరుగుతూ ఉంటే, పశువులు దానిపని పట్టడానికి ఉరికొస్తాయి. అయినా తట్టుకుని అది ఎదిగి వృక్షంగా మారితే, పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఇంత కాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులే - నాశనం చేయాలని ప్రయత్నించిన ఆ 'ప్రాణులే' మళ్ళీ ఆ వృక్షాన్నే వెతుక్కుంటూ వస్తాయి. తల్లి ఒడిలో తలదూర్చినట్టు ఆ ప్రాణులే దాని నీడలో తలదాచుకుంటాయి. విచిత్రం కదా? వీటన్నిటితో పాటు ఆ మొక్క - ఆ వృక్షం.. వాతావరణ తీవ్రతల్ని కూడా తట్టుకుంటూ నిలబడాలి. కొందరు మహానుభావుల ఎదుగుదల కూడా అలాగే ఉంటుంది. వీరు వాతావరణ తీవ్రతల్నే కాదు, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, ఆరోగ్య, రాజకీయ ఒత్తిళ్ళను కూడా తట్టుకుని సగర్వంగా నిలబడాల్సి ఉంటుంది. అయితే ఆ జీవన సంఘర్షణ వారికి ఎంతో సంతృప్తినిస్తుంది. ఎంతో మందికి స్ఫూర్తి దాయకమౌతుంది.
పెరుగుతున్న దశలో చిన్న మొక్కకే ఇన్ని అవరోధాలు ఏర్పడితే, కోట్ల సంవత్సరాలు సాగిన జీవ పరిణామ దశల్లో ఇన్ని కోట్ల ప్రాణులకు ఎన్నెన్ని అవరోధాలు ఎదురై ఉంటాయీ? డైనోసార్లు అంటే రాక్షసబల్లులు రాజ్యమేలుతున్నప్పటికి ఈ మనిషి ఎంత? వీడి అస్థిత్వమేమిటీ? అంటే ఏమీలేదనే చెప్పాలి. అత్యంత బలహీనుడు. వాటికి కనబడకుండా నక్కినక్కి దాక్కుంటూ, బిక్కుబిక్కుమని బతకాల్సిన స్థితి. అయినా సరే, బతకలేదా? అప్పటి పరిస్థితుల్ని ఎదుర్కోలేదా? ఈ నేల మీద క్రమంగా తన సామ్రాజ్యం స్థాపించుకుంటూ రాలేదా? ఆ పరిణామ ఘట్టాల్ని అర్థం చేసుకుంటూ వస్తే అవెంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. మానసిక బలహీనులు రాసుకున్న అన్ని దేశాల పురాణ గాథలు వీటి ముందు ఎందుకు పనికొస్తాయీ? కల్పనలతో, ఊహలతో పొందే అనుభూతి గొప్పదే కావొచ్చు. ఎంతైనా అది అబద్ధమే కదా? కానీ, వాస్తవం ఇచ్చే జ్ఞానం అబద్ధం కాదు-నిజం! నిజంలో నిజాయితీ ఉంటుంది. నిబద్ధత ఉంటుంది. అందుకే సత్యాన్వేషకులంతా మానవ జీవన పరిణామ క్రమాన్ని శోధిస్తూ వచ్చారు. ఇంకా ఇంకా శోధిస్తూనే ఉన్నారు. మనిషైన వాడికి ఆ శోధన గూర్చి తెలుసుకోవాలని కనీసం కొంత ఉత్సుకత ఉండాలి. లేనివారు కొందరు ఉంటే ఉండొచ్చు. జీవ పరిణామాన్ని, వైజ్ఞానిక దృక్పథాన్ని అవహేళన చేస్తే చేయొచ్చు. తాము బతికే కల్పనలు, భ్రమలు గొప్పవి అని డప్పు కొట్టుకుంటూ తిరగొచ్చు. కానీ, వారు కాలం ముందు దోషులుగా నిలబడతారు. మానవ జాతి ద్రోహులుగా మిగిలిపోతారు. మానసిక బలహీనులుగా, మానవ రూపంలో ఉన్న ఎదగని జంతు దశల్లా గుర్తింపబడతారు.
జీవ పరిణామం కొన్ని కోట్ల సంవత్సరాలలో జరుగుతూ వచ్చిందని చెపుతున్నారు కదా? మరి ఏ సమయంలో ఏం జరిగింది. ఏ సమయంలో ఏఏ వృక్షాలు, ఏఏ జంతువులు ఉద్భవించాయి? మళ్ళీ ఏ సమయంలో అంతరించాయి? ఇలా ఈ వివరాలన్నీ శాస్త్రజ్ఞులు ఎలా లెక్కగట్టారూ? మనకు నాలుగు రోజుల కింద జరిగిందే గుర్తుండదు. మరి కోట్ల సంవత్సరాలలో ఏం జరిగిందో ఎలా తెలుస్తుందీ? అని ప్రతి సామాన్యుడికీ అనుమానం వస్తుంది. అది సహజం - దానికి ఒక లెక్క, పద్ధతీ ఉన్నాయి. ఇప్పుడు మనం సమకాలీనంలో 7 రోజుల్ని వారంగా, నాలుగు వారాల్ని నెలగా, పన్నెండు నెలల్ని సంవత్సరంగా విభజించుకున్నాం కదా? అలా విభజించుకోవడం వల్లనే చరిత్రలో ఎప్పుడు ఏమైంది గుర్తు చేసుకోగలుగుతున్నాం. క్రీస్తు పూర్వం జరిగిందా? క్రీస్తు తర్వాత జరిగిందా? అని చూస్తున్నాం (దీన్ని మనం ఇప్పుడు మార్చుకున్నాం. క్రీస్తు అనేది వాడడం లేదు. లోగడ క్రీ.పూ. అని వాడిన దాన్ని బిఫోర్ కామన్ ఎరా (బీసీఈ) అని అంటున్నాం. క్రీస్తు తర్వాత - కాలాన్ని కామన్ ఎరా (సీ.ఈ) అని అంటున్నాం. ఇది అలా ఉండనిద్దాం) ఇక చరిత్రలోను, సామాన్య శాస్త్రంలోను మనం కొన్ని పదాలు వాడుతున్నాం. ఆధునిక యుగం (1450 సీ.ఈ తర్వాతి కాలం) ఆ తర్వాత పారిశ్రామిక యుగం (1760-1840 సీ.ఈ) అని చెప్పాం. ఇంకా ముందుకు వెళ్ళి చెప్పాలంటే లోహయుగం (1050 బీ.సీ.ఈ - 500 సీ.ఈ) అంతకు ముందు కాలాన్ని రాతియుగం (3000-1050 బీసీఈ) అని చెప్పాం. కొన్ని సందర్భాల్లో మధ్యయుగం, పురాతన యుగం అని చెప్తాం. ఇవి అందరికీ తెలిసినవే. ఇవి కాకుండా ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళి చెప్పాలంటే, మన శాస్త్రజ్ఞులు దాన్ని కూడా కాల విభజన చేశారు. దీని ప్రకారం కొన్ని మిలియన్ల కాలాన్నైనా, కొన్ని బిలియన్ల కాలాన్నైనా గుర్తుపట్టొచ్చు - ఉదాహరణకు కొన్ని ఎపోక్ (EPOCH)లు కలిసి పీరియడ్స్ (PERIODS) అవుతాయి. కొన్ని పీరియడ్స్ కలసి ఎరా (ERA) లవుతాయి. ఎరాలు కలిసి ఇయాన్ (EON) అవుతుంది. ఇయాన్పైన సూపర్ ఇయాన్ కూడా ఉంది. ఇందులో మనం తెలుసుకోవలసింది ఎరా, ఇయాన్ల కాలపరిమితి ఎంత? అని. ఎరా - అంటే కొన్ని వందల మిలియన్ల కాలం. ఇయాన్ అంటే ఒక బిలియన్ సంవత్సరాల కాలం. లేదా వెయ్యి మిలియన్ల కాలం.
ఇంకొంచెం వివరాల్లోకి పోతే ఇయాన్ (EON) లు నాలుగు. 1.హాడియన్ - అంటే 4 వేల మిలియన్ సంవత్సరాలకు పూర్వం - భూమి ఏర్పడ్డప్పటి కాలం. 2. ఆర్కియెన్ (2.8 నుంచి 4వేల మిలియన్ సంవత్సరాలకు మధ్య కాలం) 3.ప్రొటిరోజోయిక్ (1-2.5 వేల మిలియన్ సంవత్సరాలకు మధ్యకాలం) 4. ఫానరో జోయిక్ (66-1000 మిలియన్ సంవత్సరాల మధ్య కాలం. జీవులు పుట్టక ముందు ఉన్న వేల మిలియన్ల కాలాన్ని పక్కన పెట్టి, ఫాన రోజోయిక్ ఇయాన్ను పరిశీలిద్దాం - ఇది పేలియో జోయిక్ (541-251 మి.సంవత్సరాల మధ్య కాలం) మీజో జోయిక్ (251-66 మి.సంవత్సరాల మధ్య) సీనోజోయిక్ (66-మిలియన్ సంవత్సరాల పూర్వం నుంచి ఇప్పటి వరకున్న కాలం).. ఈ విభజనలన్నీ ఎంతో మంది భూగర్భ శాస్త్రవేత్తలు (GEOLOGISTS) పురాజీవ శాస్త్రజ్ఞులు (PALEONTOLOGISTS) భూ విజ్ఞాన శాస్త్రజ్ఞులు (EARTH SCIENTISTS) కలిసి చేసినవి. వీటికి సంబంధించిన సాంకేతిక పదాలకు వారే రూపకల్పన చేస్తూ వచ్చారు. ప్రపంచ శాస్త్రవేత్తలంతా వీటిని పరిశీలించి, నిగ్గుతేల్చి, కొత్తవి చేర్చుతూ అభివృద్ధి చేశారు. ఇక ఇప్పుడు, ఏఏ జంతువులు ఏఏ కాలంలో రాజ్యమేలాయో చూద్దాం - రాజ్యమేలడ మంటే - మిగతా జీవరాసుల కన్నా అధిక సంఖ్యలో ఉండి, బాగా వ్యాపించడమన్న మాట! పైన చెప్పుకున్న పేలియో జోయిక్ ఎరా - కేంబ్రియన్, ఓర్డ వీసియన్, సైలూరియన్, డివోనియన్, కార్బొని ఫెరస్, పర్మియన్ - అనే ఆరు జియలాజికల్ పీరియడ్స్గా విభజింపబడింది. ఇందులో డివోనియన్ పీరియడ్:419-358 మిలియన్ల మధ్య కాలం.. చేపల రాజ్యంగా విలసిల్లింది. అలాగే ఆ తర్వాత వచ్చిన మిసోజోయిక్ ఎరాలోని జురాసిక్ పీరియడ్లో అంటే 199.6-145.5 మిలియన్ల మధ్య కాలంలో రాక్షస బల్లులు (DINOSAURS) సుమారు 56 మిలియన్ల పాటు వర్థిల్లాయి. జురాసిక్ పార్క్ అనే అద్భుతమైన హాలివుడ్ సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ జురాసిక్ - అనేది మిసోసాయిక్ ఎరాలోని మూడు పీరియడ్స్లో మధ్యది. దాన్నే సినిమా పేరుగా పెట్టారు.
ఆ తర్వాత చాలా చాలా కాలానికి పేలియోలిథిక్ (PALEOLITHIC) అంటే పాత రాతి యుగం మధ్య భాగం నుంచి ఇప్పటికి రెండు లక్షల సంవత్సరాలకు పూర్వం, నాటి ఆఫ్రికా - ఇథోపియా ప్రాంతం నుంచి మానవుడి శిలాజాలు లభ్యమవుతూ వచ్చాయి. అంటే, మానవ పరిణామ క్రమం అక్కడి నుంచే ప్రారంభమైందనడానికి గుర్తు. మళ్ళీ అదంతా వేరే కథ!! ఇక్కడ చెప్పిన శాస్త్రీయనామాలు జీవ శాస్త్రంతో కొద్దిగా పరిచయం ఉన్నవారికి సులభంగా అర్థమవుతాయి. కాని సంబంధం లేని వారికి ఈ పేర్లు- (సాంకేతిక పదాలు)కొత్తగా అనిపిస్తాయి. పేర్లు కొత్తగా అనిపించినా, పక్కనే సూచించిన సంవత్సరాలు శ్రద్ధగా గమనిస్తే, ఇప్పటికి ఎన్నెన్ని మిలియన్ సంవత్సరాలకు పూర్వం భూమిమీద ఏవేవి విస్తృతంగా వ్యాపించాయో సులభంగానే అర్థం చేసుకోవచ్చు -
ఈ కాల విభజన అంతా టూకీగా ఎందుకు గుర్తు చేశానంటే - మనిషి మనిషిగా ఎదగడానికి ఎంత కాలం పట్టిందో అంచనా వేసుకోవడానికి. అన్ని అవరోధాల్ని ఎదుర్కొంటూ తన సంతతిని తాను కాపాడుకుంటూ ఈ అత్యాధునిక యుగంలోకి మనిషి ఎలా వచ్చాడో తెలుసుకోవడానికి. ఈ భూమి మీదనే కాకుండా ఈ విశాల విశ్వంలో తనదైన ముద్రను ఎలా వేసుకున్నాడో, కొంతలో కొంతైనా అర్థం చేసుకోవడానికి. పరిణామ సిద్ధాంతం జీవశాస్త్రంలో మాత్రమే ఒక భాగం కాదని, ఇది ప్రపంచ వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక వ్యవస్థలలో అంతర్భాగమైందని గ్రహించడానికి. అలాగే నరుడై పుట్టిన ప్రతివాడు నరశాస్త్రం తెలుసుకోవాల్సిన అవసరం తప్పక ఉందని... నిన్ను నువ్వు తెలుసుకోవడమంటే ముక్కు మూసుకుని సమాధిలోకి పోవడం కాదని తెలియజేప్పడానికి! ఇంత పకడ్బందీగా లెక్కలు, వివరాలు, నిరూపణలూ ఉంటే, వాటినన్నింటినీ పక్కకు నెట్టేసి - ఎవరో ఒక దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడని చెపుతారా? అదే నిజమైతే మనిషి ఇలా మిలియన్ సంవత్సరాలు ఎందుకు సంఘర్షించాల్సి వచ్చిందీ? విజ్ఞులైన మత బోధకులు వివరణలివ్వాలి కదా? శతాబ్దాలుగా నోరుపెగలని వీరికి ఇక ఇప్పుడు ఏం పెగుల్తుందీ? జీవ పరిణామం ఎలా జరుగుతూ వచ్చిందో శాస్త్రజ్ఞులు చెప్పినట్టుగా - సృష్టి సిద్ధాంతాన్ని విశ్వసించేవారు అంటే ఇదంతా దేవుడి సృష్టి అని నమ్మేవారు ఎందుకు వారి వివరాలు ఇవ్వరూ? సత్యాన్వేషకులైన శాస్త్రజ్ఞుల్ని తమ మత న్యాయస్థానాల్లో చిత్రహింసలు పెట్టడం తప్పిస్తే - సరైన వివరణలు ఎందుకివ్వలేకపోయారూ? ఇవ్వడానికి వారి దగ్గర మూఢ విశ్వాసం తప్ప మరేదీ లేకపోయిందే? విశ్వాసం ఉన్నచోట విశ్లేషణ ఉండదు. ఇప్పుడు కాలం మారింది. మూఢనమ్మకాల చ్ఛేదన కోసం వైజ్ఞానిక దృక్పథమనే ఆయుధంతో నవతరం ముందుకు వస్తోంది. అన్ని మతాల మత పెద్దలు ఆడే నాటకాలు ఎంత దిగజారుడు స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకుంటోంది. సైన్సును వాడుకుంటూ, సైన్సును సైన్సుగా చదువుకుంటూ... అదే సమయంలో మూఢ విశ్వాసాల వ్యాప్తిలో ప్రధాన పాత్ర వహిస్తున్న పాలకులు, నాయకులు, మత బోధకుల ద్వంద ప్రవృత్తిని ఎండగడుతూ వస్తోంది. తప్పదు - ఇప్పుడొస్తున్న యువతరం మోసపూరితమైన పాత ఛాందస విలువల్ని బద్దలు కొట్టక తప్పదు! నూతన వైజ్ఞానిక మా'నవ'వాదానికి ద్వారాలు తెరవక తప్పదు!!
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్.