Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పండిత పామరుల హృదయాలను రంజింపచేసిన స్వర చక్రవర్తి.. సంగీత ప్రపంచంలో స్వరతరంగం.. సుశ్రుతి శిఖరం.. రూపుకట్టిన స్వరామృతం... 16 భాషలకు ప్రాణమయ్యాడు... నిదురలో కూడా మరవలేని మధురమైన గానమయ్యాడు. 50 వసంతాలుగా అమృతాన్ని పంచుతున్న అతని స్వరపేటిక అక్షరాల ఆస్వర భారతి కొలువుదీరిన రత్నపీఠిక. ప్రపంచ సంగీతానికే ఆయన స్వరం ఓ వరం. అతనే తెలుగు వారి ఆరాధ్య స్వరం.. వేల పాటలు పాడిన మధుర గాయకుడు బాలు అని పిలవబడే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.
సంగీతమే ఊపిరిగా జీవించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) కన్నుమూశాడు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో వస్తాడనుకున్న అభిమానులను శోకసంద్రంలో ముంచేసి తిరిగిరాని లోకాలకు బాలు వెళ్లిపోయాడు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. 50రోజులుగా వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్న బాలు మృతి చెందాడు. ప్రపంచ సంగీత చరిత్రలో ఇదొక చీకటి రోజు. బాలు మృతితో ఒక శకం ముగిసిపోయింది. ఘంటసాల తర్వాత అంతటి గాయకుడు మళ్లీ బాలునే. బాలు స్థాయిని భర్తీ చేయాలంటే అంత సులువు కాదు. భారతదేశ చలనచిత్ర రంగంలో కేవలం తన గాత్రంతోనే కాకుండా నటనలోనూ ఎనలేని ముద్ర వేసిన బాలు మరణంతో భారతీయ చలనచిత్ర రంగం తన ముద్దు బిడ్డను కోల్పోయింది.
1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేట గ్రామంలో జన్మించాడు. ఈయన సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతుల రెండో సంతానం. ఇంజనీర్ కావాలని కలలుకని గాయకుడయ్యాడు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. ఎవరి దగ్గరా సంగీతం నేర్చుకోకపోయినా రాగ తాళ జ్ఞానం పుష్కలంగా ఉండడంతో అనేక పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. ఒక అర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేసుకుని మిత్రులతో కలిసి ప్రదర్శనలు ఇచ్చేవాడు. మరోవైపు చదువులోనూ చురుగ్గా ఉండేవాడు. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరినా, ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ఉండగానే బాలుకు పాట పాడే అవకాశం వచ్చింది. 1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలు ప్రథమ బహుమతి గెలుచు కున్నారు. బాలు పాటను సంగీత దర్శకుడు కోదండపాణి కూడా విన్నారు. బాలు పాడిన విధానాన్ని మెచ్చుకుని సినిమాల్లో పాడే అవకాశం కల్పిస్తానని మాటిచ్చారు. అన్నట్టుగానే అవకాశం ఇచ్చారు.
1966లో పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంతో నేపథ్య గాయకుడిగా బాలు ప్రస్థానం ప్రారంభమైంది. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవారు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్కు ''కోదండపాణి ఆడియో ల్యాబ్స్'' అని అతని పేరే పెట్టుకున్నాడు బాలు. పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్ఛారణ అతని పాటను పండిత పామరులకి చేరువచేసింది. శంకరాభరణం, సాగర సంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా 'ఏక్ దుజేకేలియే' లాంటి హిందీ చిత్రాలకు బాలు పాడిన పాటలు దేశమంతా ఉర్రూత లూగించాయి. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలోనూ ఆయన పాడిన పాటలకు ఎన్నో జాతీయ పురస్కారాలు లభించాయి. కమల్హాసన్కు చేతిలో సినిమాలు లేని సమయంలో ఆయన మీద వున్న ప్రేమతో బాలు నిర్మాతగా మారారు. అలా తీసిని 'శుభ సంకల్పం' ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది. గాన మాధుర్యంతోనే కాదు, నటనతోనూ బాలు ప్రేక్షకులను కట్టిపడేశారు. ఐదు దశాబ్దాలకు పైగా, 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డును సాధించారు. గాయకుడిగా, నటుడిగా, 40సినిమాలకు సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ కళాకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాడు.
బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పల్లవి, ఎస్.పి. చరణ్. కొడుకు ఎస్.పి. చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి, తర్వాత సినీ నిర్మాతగా కూడా మారాడు. బాలు సోదరి ఎస్.పి. శైలజ, ఎస్.పి. వసంత ఇద్దరు కూడా సినీ నేపథ్య గాయనిలే. శైలజ సోదరునితో కలిసి పలు చిత్రాల్లో పాటలు పాడింది. ఈమె నటుడు శుభలేఖ సుధాకర్ను వివాహమాడింది.
బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశాడు. కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మధలీలతో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారి 100కు పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. కమల్హాసన్, రజనీకాంత్, సుమన్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేశ్, రఘువరన్ లాంటి వాళ్ళకి గాత్రదానం చేసాడు.
1969లో 'పెళ్ళంటే నూరేళ్ళ పంట' అనే చిత్రంలో మొదటిసారి నటుడిగా కనిపించారు. తమిళ 'కేలడి కన్మణి'లో కథానాయకుడి పాత్ర పోషించారు. ఈ సినిమా తెలుగులో 'ఓ పాప లాలీ' పేరుతో అనువాదం అయింది. తర్వాత ప్రేమ, ప్రేమికుడు, పవిత్రబంధం, ఆరోప్రాణం, దేవుళ్లు, దేవదాస్, రక్షకుడు, ధీర్ఘ సుమంగళీభవ వంటి సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రల్లో నటించాడు. 2012లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాలో కథానాయకుడిగా కనిపించాడు బాలు. ఇందులో లక్ష్మి నాయికగా నటించింది. ఈ సినిమాకు నంది ప్రత్యేక పురస్కారం లభించింది.
సినిమాల్లోనే కాక టీవీ రంగంలో ఆయన 'పాడుతా తీయగా' 'పాడాలని ఉంది' లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశారు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించాడీ గాన గాంధర్వుడు.
బాలు భారత ప్రభుత్వం నుంచి 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 29సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్నాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు. 2016 నవంబరులో గోవాలో జరిగిన 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అతనికి శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని (సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్) ప్రదానం చేసారు. 1999లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ గవర్నరు రంగరాజన్ చేతులమీదుగా డాక్టరేట్ అందచేసింది.
పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణ వార్త ఆయన అభిమానులను తీవ్రంగా కలచివేసింది. సామాన్య జనానికి పాటని చేరువ చేసిన అమత కంఠం మూగబోయినందుకు విలపిస్తోంది. ఆయన మాట్లాడినా, పాట పాడిన తెలుగు భాష, తెలుగుజాతి సగర్వంగా చెప్పుకునే ఎస్పీ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చిత్రసీమలో ఆయన కృషి, సంపాదించిన కీర్తి కళాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటుదనడంలో అతిశయోక్తి లేదు.- పొన్నం రవిచంద్ర
సెల్:9440077499