Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజల ప్రయోజనాలు కాపాడటంలో రాష్ట్ర పాలకులకు చిత్తశుద్ధి ఉన్నదా?
రాష్ట్రాల హక్కుల కోసం నిలబడే నిజాయితీ ప్రదర్శిస్తున్నారా?
ప్రజాస్వామ్య హక్కులు తిరస్కరిస్తున్న రాష్ట్రపాలకులు... కేంద్రం బాటలోనే నడుస్తున్నారా?
ఈమధ్య కొన్ని కీలక విషయాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. రెండు సందర్భాలలో రాష్ట్ర శాసనసభలో కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా తీర్మానాలు కూడా చేసారు. మార్చిలో జరిగిన శాసనసభ సమావేశాలలో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా తీర్మానం చేసారు. ఈమధ్య జరిగిన సమావేశాలలో జీఎస్టీ పరిహారం విషయంలో తీర్మానం చేసారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధిత బిల్లులను వ్యతిరేకించారు. రాజ్యసభలో అప్రజాస్వామికంగా వ్యవహరించిన తీరునూ ప్రశ్నించారు. డిప్యూటీ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. కోటి మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు దిగుమతి చేయడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రం పట్ల ఈ మాత్రం విమర్శనాత్మక దృష్టి ప్రదర్శించటం ఈమధ్యనే! కానీ రాష్ట్రాలకు నిధుల పంపకం కోసం 2011 జనాభాలెక్కలు తీసుకున్నప్పుడు కూడా సరైంది కాదన్నారు తప్ప ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి కేంద్రం మీద వత్తిడికి సిద్ధపడలేదు. కరోనా సమస్యను ఎదుర్కోడానికి అదనపు నిధుల కోసం ప్రతిపాదనలైతే చేసారు, కానీ కేంద్రం మీద వత్తిడిపెంచలేదు. లేఖలు రాసి చేతులు దులుపుకున్నారు.
చట్టవిరుద్ధంగా జీఎస్టీ బకాయిలు ఎగవేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా శాసనసభలో ముఖ్యమంత్రే స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టారు. ఇది సరైంది. సభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఇప్పుడు కాగ్ బయటపెట్టిన వివరాలు కేంద్రం మోసపూరిత ధోరణిని స్పష్టం చేస్తున్నాయి. రూ.47వేల కోట్లు జీఎస్టీ నిధులు, రాష్ట్రాలకు పంచకుండా, చట్టవిరుద్ధంగా కేంద్రం ఖజానాలో కలుపుకున్నదని కాగ్ ఎత్తి చూపింది. జీఎస్టీ సెస్ వసూళ్ళ వివరాలు మాత్రం అడ్డగోలు లెక్కలు చూపిందని తేలింది. రాష్ట్రాలకు చెల్లించవల్సిన నిధులు కేంద్రం ఖజానాలో వేసుకోవటం ఒక తప్పు. ద్రవ్యలోటును తక్కువ చూపేందుకు, ఆదాయం ఎక్కువ చేసి చూపేందుకు దొడ్డిదారి వెతకటం మరో తప్పు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు రెండున్నర లక్షల కోట్ల పరిహారం ఎగవేసే ప్రయత్నం చేస్తున్నది. వీటికితోడు 15వ ఆర్థికసంఘం నుంచి మునిసిపల్ పట్టణాలకు కేటాయించిన రూ.794కోట్లు, 14వ ఆర్థిక సంఘం కేటాయింపులలో రూ.650కోట్లు కేంద్రం తెలంగాణకు బకాయిపడింది. మొత్తం రూ.1444 కోట్లు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇప్పటికే కేంద్రానికి లేఖరాసారు. మరోవైపు ఐజీఎస్టీ నిధులు తెలంగాణకు రూ.2,641కోట్లు కేంద్రం చెల్లించాల్సి ఉన్నది. వీటి గురించి రాష్ట్ర మంత్రి హరీశ్రావు కేంద్రానికి లేఖ రాసారు. కేంద్ర మంత్రుల బృందం సమావేశంలో కూడా ఈ విషయం లేవనెత్తారు. అయినా కేంద్రానికి చీమకుట్టినట్టు కూడా లేదు.
జీఎస్టీ నిధుల గురించి రాష్ట్ర శాసనసభ చర్చించేనాటికే రైతు వ్యతిరేక బిల్లులు కేంద్రం పార్లమెంటు ముందుంచింది. కానీ వాటి గురించి చర్చించడానికీ, వాటికి వ్యతిరేకంగా తీర్మానం చేయడానికి మాత్రం రాష్ట్ర పాలకులు సిద్ధపడలేదు. శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ బిల్లులను వ్యతిరేకించారు. నూతన జాతీయ విద్యావిధానం పేరుతో కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పటికీ రాష్ట్ర పాలకులు స్పందించలేదు. ఇంటర్మీడియట్ కోర్సులో సామాజికరంగంలో కృషి చేసిన జాతీయ నాయకుల జీవిత చరిత్రలు, గిరిజనుల పోరాటాలు, స్వాతంత్య్రోద్యమానికి సంబంధించిన కీలక ఘట్టాలు, సమాచార హక్కు వంటి ప్రజాస్వామ్య హక్కుల వివరాలు తెలిపే పాఠ్యాంశాలను తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇది భవిష్యత్ తరానికి చరిత్ర తెలియకుండా చేయటమే. అయినా టీఆర్ఎస్ నాయకత్వంగానీ, ప్రభుత్వంగానీ దీనిని వ్యతిరేకించలేదు. జాతీయనాయకుల చరిత్రలు తొలగించవద్దని మాత్రం ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. కేంద్రం చేస్తున్న ప్రయత్నాల ప్రమాదాన్ని గుర్తించటంలో, వ్యతిరేకించటంలో రాష్ట్ర పాలకులు విఫలమయ్యారు. మరోవైపు కార్మిక చట్టాలన్నీ నాలుగు కోడ్లుగా మార్చే ప్రయత్నం పేరుతో కార్మిక హక్కులను హరించింది కేంద్రం. రాష్ట్ర పాలకులు వ్యతిరేకించకపోగా ఇందుకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం నిధులు విడుదల చేయాలని కూడా శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి తీర్మానం ప్రవేశపెట్టి ఉండాల్సింది. రాష్ట్ర పాలకులు కేంద్రం ముందుంచిన ప్రతిపాదనలేవీ కేంద్రం అంగీకరించలేదు. అయినా శాసనసభలో తీర్మానం పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడలేదు.
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే కాదు, రాష్ట్రాల హక్కుల సమస్య కూడా వీటిలో ఇమిడి ఉన్నది. ఫెడరల్ రాజ్యాంగ మౌలిక సూత్రాలను కేంద్రం ఉల్లంఘిస్తున్నది. జీఎస్టీ నిధుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించటం మాత్రమే కాదు. వ్యవసాయ రంగం, విద్యావిధానం గానీ, కార్మికరంగం గానీ రాష్ట్ర జాబితాలోనిది. ఉమ్మడి జాబితాలోనివి. కానీ రాష్ట్రాలను ఏమాత్రం సంప్రదించకుండా, కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు చేస్తున్నది. ఇది ఫెడరల్స్ఫూర్తికి విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్య విరుద్ధం. రాష్ట్రాల హక్కులను హరించటమే. ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి కూడా తెలంగాణ ప్రభుత్వం మౌనం దాల్చటమే ఇక్కడ ఆందోళనకరం. కేంద్రం నిధుల కేటాయింపు విషయంలో 2011 జనాభా లెక్కలు ప్రాతిపదికగా ప్రకటించినప్పుడు కూడా మన రాష్ట్ర పాలకులు అవకాశవాదం ప్రదర్శించారు. కేంద్రం నిర్ణయం తెలంగాణకు గానీ, దక్షిణాది రాష్ట్రాలకు గానీ హానికరమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇతర రాష్ట్రాలతో కలసి కేంద్రం మీద వత్తిడి చేయడానికి మాత్రం సిద్ధపడలేదు. నిజానికి ఇప్పుడు ఆ ఒక్క సమస్యతో ఆగలేదు. క్రమంగా రాష్ట్రాలను డమ్మీచేసి, అధికారాలన్నీ కేంద్రం గుప్పిట్లోకి తీసుకుంటున్నది. టీఆర్ఎస్ నాయకత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఇప్పుడు కేంద్రం మీద ఐక్యంగా వత్తిడి పెంచేందుకు సిద్ధం కావాలి. ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమ శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో రాజకీయ శూన్యం ఉన్నదన్నారు. సమస్యల పరిష్కారంలో బీజేపీ విఫలమైందన్నారు. వీటిని ప్రశ్నించగల స్థితిలో కాంగ్రెసు లేదన్నారు. ఇవన్నీ నిజాయితీగానే చెప్పి ఉంటే, ఇప్పుడు కాక కేంద్రంతో ఇంకెప్పుడు తలపడతారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవల్సిన బాధ్యత టీఆర్ఎస్ అధినాయకత్వానిదే! నిశితంగా పరిశీలించినప్పుడు కేంద్రంతో నికరంగా పోరాడిన దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పుడు కేంద్ర బీజేపీ సర్కారు తప్పుడువిధానాలలో కొన్నింటిని ప్రశ్నిస్తున్నారు. అనేక నియోజకవర్గాలలో రైతులను సమీకరించి ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ సభల్లో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులను విమర్శిస్తూనే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేసిన రెవెన్యూ సవరణ చట్టాన్ని ఆకాశానికెత్తుతున్నారు. రెవెన్యూ సవరణ చట్టం కూడా పేద, మధ్యతరగతి, కౌలు రైతులకు హానికరమైందే కదా! ఈ వైరుధ్యమే రైతులను గందరగోళానికి గురిచేస్తున్నది. ఏమైనా... దేశ చరిత్రలో ప్రాంతీయ పార్టీలు కేంద్రంతో పోరాడినప్పుడు మాత్రమే వాటి గౌరవం ఇనుమడించింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడింది. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ నాయకత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం నికరమైన వైఖరి ప్రదర్శించాలి.
కేంద్ర ప్రభుత్వ విధానాల్లో కొన్నింటిని ప్రశ్నిస్తూ మరోవైపు రాష్ట్రంలో తాముకూడా ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారు. అప్రజాస్వామిక ధోరణులు ప్రదర్శిస్తున్నారు. మరో జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెసు కేంద్రంలో బీజేపీ విధానాలను ప్రశ్నించగల స్థితిలో లేదు.ఆర్థిక విధానాలు, నియంతృత్వ ధోరణుల విషయంలో బీజేపీ, కాంగ్రెసుల విధానాలకు తేడాలేదు. మతోన్మాదం విషయంలో, మనువాద ధోరణుల విషయంలో కాంగ్రెసు అవకాశవాద ధోరణి ప్రదర్శిస్తున్నది. ఈ నేపథ్యంలో, ఒక ప్రాంతీయ పార్టీగా, రాష్ట్రాల హక్కులకూ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి పనిచేయటంలో టీఆర్ఎస్ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు పక్కనబెట్టకుండా ఇది సాధ్యం కాదు.
రాష్ట్ర శాసనసభ సమావేశాలు నిర్వహించిన తీరు పరిశీలిస్తే రాష్ట్ర పాలకుల డొల్లతనం స్పష్టమవుతుంది. పార్లమెంటు సమావేశాలను కేంద్ర పాలకులు కరోనాసాకుతో కుదించారు. ఇక్కడ శాసనసభ విషయంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అదే ధోరణి ప్రదర్శించింది. ప్రజా సమస్యలు పక్కన బెట్టి, ప్రభుత్వం అధికారయుత ఎజెండా పూర్తి చేసుకుని ముగించింది. సభలో కమ్యూనిస్టు పార్టీల శాసనసభ్యులు లేనిలోటు స్పష్టంగా కనిపించింది. ప్రజాసమస్యలు అధికార పక్షానికే కాదు.. ప్రతిపక్ష కాంగ్రెసు, బీజేపీ శాసనసభ్యులు కూడా పట్టించుకోలేదు. కరోనాను కట్టడి చేసే చర్యలు గానీ, ఆర్థికంగా ప్రజలను ఆదుకునే ప్రయత్నాల గురించి గానీ నిజాయితీగా చర్చ జరగలేదు. కరోనా వచ్చిన మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం కొంత శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసింది. కానీ క్రమంగా చేతులెత్తేసింది. కేంద్రం అనుసరించే వైఖరినే తానూ అమలు జరిపింది. అందువల్ల కరోనా విషయంలో ప్రజలను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫలమైంది. వివిధ రంగాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నాలూ, ప్రదర్శనలకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం అనుమతి నిరాకరిస్తున్నది. ఫలితంగా ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న కేంద్ర పాలకులే ఈ అసంతృప్తిని వాడుకునే అవకాశం ఉన్నది. బీజేపీ నేతలు ప్రజల అసంతృప్తిని భావోద్వే గాలవైపు మరలించి, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మతపరమైన విభజన సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందువల్ల టీఆర్ఎస్ నాయకత్వం తన చిత్తశుద్దీ, నిజాయితీ నిరూపించుకోవాలి. కేంద్రం తప్పుడు విధానాలను నిలదీయటంలో నికరంగా నిలబడాలి. ప్రజా వ్యతిరేక విధానాలు, అప్రజాస్వామిక ధోరణులు విడనాడాలి. కలిసొచ్చే రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకుని కేంద్రం మీద వత్తిడి చేయడానికి సిద్ధపడాలి.
- ఎస్. వీరయ్య