Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుండె సంబంధ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలనే సదుద్దేశ్యంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 29న విశ్వవ్యాప్తంగా ''వరల్డ్ హార్ట్ డే'' నిర్వహించడం జరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహాయంతో 2016 నుంచి గ్లోబల్ హార్ట్ ఇనిషియేట్యువ్ (ప్రపంచ గుండె చొరవ) కార్యక్రమం ద్వారా హృదయ సంబంధ వ్యాధుల నివారణ, నియంత్రణ ప్రయత్నాలు విశ్వవ్యాప్తంగా ముమ్మరంగా జరుగుతున్నాయి. కోవిడ్-19 విజృంభన నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణపట్ల వైద్య సిబ్బంది (వైద్యులు, నర్సులు, సహాయకులు), జాతీయ స్థాయి వైద్య ఆరోగ్యశాఖ, స్వచ్ఛంధ సంస్థలు, వ్యక్తులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ముఖ్యంగా హృదయ సంబంధ వ్యాధులతో అతి జాగ్రత్తగా ఉండాలని ఈ ప్రయత్నాలు సూచిస్తున్నాయి.
కరోనా సోకిన ప్రతీ ఐదుగురిలో ఒకరికి గుండె జబ్బులు సర్వసాధారణంగా కనిపించడం, మరణించిన వారిలో హృదయ సంబంధ సమస్యలు కారణం కావడం జరుగుతోంది. కరోనా నుంచి బయట పడినవారిలో కొంత కాలం హృదయ సంబంధ సమస్యలు వెన్నాడటం గమనిస్తున్నాం. జీవనశైలిలో అజాగ్రత్తలతో బీపీ తగ్గడం, బ్లడ్ షుగర్ తగ్గడం, కొలెస్టరాల్ నియంత్రణలో లేకపోవడం, బరువు పెరగడం లాంటి రుగ్మతలు కూడా కలుగుతాయి. జాగ్రత్తగా మన జీవనశైలిని మార్పు చేసుకుంటూ, గుండె బలాన్ని పెంచుకొనుటలో దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. పోగాకు, మద్యం వాడకాలను నిషేధించడంతో పాటు గాలి కాలుష్యాన్ని తగ్గించే చర్యలను ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయుటతో హృదయ ఆరోగ్యం సంరక్షించబడుతుంది. విశ్వ మానవాళి దీర్ఘకాలం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడానికి (హృదయ సంబంధ వ్యాధులు రాకుండా) ఆరోగ్యకర పోషకాహారం, పొగాకు వాడకపోవడం, ఆల్కహాల్కు దూరంగా ఉండటం, నిత్యం శారీరక వ్యాయామం (కనీసం 30నిమిషాలు) చేయడం లాంటి జీవనశైలి మార్పులను అలవర్చుకోవాలి. ప్రపంచ హృదయ దినం రోజున పరుగు పోటీలు, మారథాన్లు, నడక, గుండె పట్ల అవగాహన, శారీరక వ్యాయామం, సైన్స్ ప్రదర్శనలు, ఉచిత బీపీ, షుగర్ చెకప్లు, ఉచిత వైద్య శిబిరాల వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్షలో 235మంది గుండె సంబంధ వ్యాధులతో మరణించగా, ఇండియాలో 272మరణాలు సంభవిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లో 70లోపు వయస్సుగల వారు 23శాతం మరణించగా, ఇండియాలో 52శాతం గుండె జబ్బుల కారణంగా మరణాలు నమోదు అవుతున్నాయి. 1990లో ఇండియాలో 23.3 మిలియన్ల మరణాలు గుండె వ్యాధుల వల్లనే జరిగాయని, 2010లో 59శాతం పెరిగి 37 మిలియన్ల మరణాలు నమోదైనాయనే వాస్తవం భయాన్ని కలిగిస్తున్నది. గుండెజబ్బుల కారణ మరణాలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్లలో జాతీయ సగటుకన్న అధికంగా నమోదవుతున్నాయి. ఈశాన్య భారత దేశంలో హద్రోగాల సమస్య కొంత తక్కువగానే ఉంది. భారత ప్రజలలో అవగాహనాలేమి, తగు జీవనశైలి లోపం, పర్యావరణ కాలుష్యాల ఫలితంగా 54.5 మిలియన్ల ప్రజలు హుద్రోగాలతో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం ఇండియాలో గుండె సంబంధ వ్యాధుల కారణంగా ఒక దశాబ్ద కాలంలో 237 బిలియన్ డాలర్ల ఉత్పత్తి కోల్పోవడం జరుగుతోంది. భారతీయుల్లో గుండెకు సరిగా రక్తసరఫరా జరుగని కారణంగా వచ్చే ఇస్కిమిక్ హార్ట్ జబ్బు వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నాయని తేలింది. ఆర్థిక సామాజిక వెనుకబాటుతనం కూడా హుద్రోగ సమస్యలతో విడిదీయరాని సంబంధాన్ని కలిగి ఉంది. హృదయ సంబంధ వ్యాధులను ముందు జాగ్రత్తలు తీసుకుంటూ నిరోధించడం ప్రధానమని గుర్తుంచుకోవాలి. గుండె జబ్బులను తొలిదశలోనే గుర్తించడం, సంప్రదాయ, ఆధునిక చికిత్సలతో నయం చేయడం, వైద్య సదుపాయాలను పేదలకు అందుబాటులో ఉంచడం లాంటివి భవిష్యత్ తరాలను గుండె జబ్బుల నుంచి కాపాడుతాయి. పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగాల కారణంగా పలు ఆరోగ్య సమస్యలు భారత ప్రభుత్వ యంత్రాంగానికి సవాలుగా నిలుస్తున్నాయి. ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు, పలు సంస్థలు గుండె సంబంధ అనారోగ్యాలను ఆదిలోనే అదుపు చేస్తూ, ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పించాలని కోరుకుందాం. ప్రతీ ఒక్కరు గుండెను భద్రంగా చూసుకునేందుకు అవసరమైన జీవనశైలి మార్పులను చేసుకుంటూ హుద్రోగాలను దూరం పెడదాం.
- డాక్టర్ బుర్ర మధుసూదన్రెడ్డి
సెల్: 949700037