Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాజాగా జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన లెక్కల ప్రకారం దినసరి కూలీల ఆత్మహత్యలు పెరుగు తున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం. గతంలో దినసరి కూలీల ఆత్మహత్యలను ప్రమాద మరణాలు, ఆత్మహత్యల విభాగంలో లెక్కకట్టేవారు. కరోనా కాలంలో రోజువారీ కూలీలు తాము పని చేస్తున్న స్థలాల నుంచి పిల్లా పాలపలను ఎత్తుకుని పుట్టిన ఊరుకు కాలినడకన వెళ్లి నిశబ్ద విప్లవం పుట్టించారు. ఇది సమాజంలో అందరినీ కదిలించిన విషయం. బహుశా అందుకేనేమో ఈ సారి దినసరి కూలీల ఆత్మహత్యలను ప్రత్యేకంగా బయటపెట్టారు.
2019లో దేశంలో 1,39,123 మంది ఆత్మహత్యలకు పూనుకుంటే అందులో 32,563మంది రోజు కూలీలు. అంటే 23.4శాతం మంది. 2014లో ఇది 12శాతం, 2015లో 17.8శాతం, 2016లో 19.2శాతం, 2017- 2018లో 22.4శాతం, 2019లో 23.4శాతానికి వరుసగా పెరుగుతూ వస్తున్నది. 2014 నుంచి 2019కి వచ్చేటప్పటికి రెండింతలు అయింది.
ఈ ఆత్మహత్యల పర్వంలో రైతుల ఆత్మహత్యలకంటే రోజుకూలీల ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటున్నాయనేది గమనించాల్సిన కీలక అంశం. 15 సంవత్సరాల్లో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా పాలక వర్గాలు కానీ, ప్రభుత్వం కానీ ప్రత్యేక దృష్టి పెట్టలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్లక్ష్యం చూపినాయి. కార్పొరేట్ మీడియా కూడా రైతుల ఆత్మహత్యలను పట్టించుకోలేదు. అదే విధంగా రోజు కూలీల ఆత్మహత్యలను కూడా పాలకవర్గాలు పట్టించుకో కుండా గాలికి వదిలేశాయి.
ఆత్మహత్య చేసుకోవడానికి తక్షణ కారణం ఏమైనప్పటికీ సంవత్సర ఆదాయం ఒక లక్ష రూపాయలలోపు ఉన్నవారే 2/3వంతు మంది ఉన్నారు. సంవత్సర ఆదాయం ఐదులక్షల రూపాయలు ఉన్నవారు 5శాతంలోపే ఉన్నారు. 1995 నుంచి ఈ లెక్కల సేకరణ జరుగుతున్నది. అయితే నిరుద్యోగులలో ఆత్మహత్యల సంఖ్య ఈ కాలంలోనే రెండంకెలకు చేరుకున్నది. అందులో 10వ తరగతి వరకు చదివినవారు 23.6శాతం మంది ఉన్నారు. ఇది ఆందోళన కలిగిస్తున్నది.
దేశంలో సంపదను సృష్టించే లక్షలాది మంది కష్టజీవులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు నిరాశ నిసృహలకు నెట్టబడి ఆత్మహత్య చేసుకోవడమే పరిష్కారం అనే మానసిక స్థితికి చేరుకోవడం దారుణమైన విషయం. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబం, స్నేహితులు మాత్రమే నష్టపోరు. ఇది మొత్తం సమాజానికే నష్టం అనేది గుర్తించాలి. సంపదను సృష్టించేవారి పట్ల పాలకవర్గాలు చూపే నిర్లక్ష్యం దీనితో అర్థం అవుతున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ సహజంగానే సంపద సృష్టికర్తలైన కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులను పట్టించుకోదు. మోడీ ప్రభుత్వం దృష్టిలో సంపద సృష్టికర్తలు కష్టజీవులు కాదు. కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులే సంపద సృష్టికర్తలు. పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు కార్మికుల కష్టార్జితాన్ని దోచుకుని వారి లాభాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుంటున్నారు. ఇదే సంక్షోభానికి మూలకారణం. దీనికి మోడీ ప్రభుత్వం పూర్తి అండదండలు ఉన్నాయి. కార్మికులు, కష్టజీవులు సోమరిపోతులనీ, అందుకనే వారి జీతాలు తగ్గంచి, హక్కులు తీసేసి వారికి గుణపాఠం నేర్పాలి అనేది మోడీ సిద్ధాంతం.
ప్రముఖ వ్యక్తులు చేసుకున్న ఆత్మహత్యల వార్తలను టీవీలు, పత్రికలు పదే పదే చూపించి ప్రజల దృష్టిని మల్లిస్తున్నాయి. కష్టాలతో వేగలేక కష్టజీవులు చేసుకున్న ఆత్మహత్యలను మాత్రం చూపించడం లేదు. ఆత్మహత్యలకు పురికొల్పే నిరుద్యోగం, ఉద్యోగాలు పోవడం, ఆదాయం లేకపోవడం, దారిద్య్రం, కుటుంబాలను పోషించు కోలేకపోవడం, అప్పుతీర్చుకోలేక పోవడం లాంటి సమస్యలను టీవీలు అసలే చూపించవు. ఇవే జీవన్మరణ సమస్యలు. వీటిని పక్కకునెట్టి సంస్కరణలను సమాజంపై రుద్దుతున్నారు. తద్వారా కార్పొరేట్ సంస్థల, పెట్టుబడిదారుల లాభాలు పెంచేందుకు బాటలు వేస్తున్నారు. ఉదారవాద ఆర్థిక విధానాలు మనిషికి భరోసా లేకుండా నిస్సహాయు లను చేస్తున్నాయి. ట్రేడ్ యూనియన్లను లేకుండా చేసి ఐక్యంగా పోరాడేశక్తినీ నిర్వీర్యం చేస్తున్నాయి.
తాజా లెక్కలను గమనించినా, వలస కూలీలు కాలినడకన రైలుపట్టాలు, రహదారుల వెంట నడుస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయే చిత్రాలను టీవీలలో చూస్తే లాక్డౌన్కి ముందే వారు నిర్లక్ష్యానికి గురై ఒకమూలకు నెట్టబడి ఉన్నారనేది అర్థమవుతున్నది. వారి జీవితాలను అస్థిరత అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేసింది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ప్రపంచ వ్యాపిత ఆర్థిక సంక్షోభం కూడా వారి జీవితాలపై తీవ్రమైన ప్రభావం పడేసింది. బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, లాక్డౌన్ కష్టాలు వారి జీవితాలను మరింత దారుణంగా మార్చివేసినాయి. జీడీపీ 24శాతానికి పడిపోవడం ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని బట్టబయలు చేసింది. ప్రపంచ పెద్ద దేశాలలో భారత్దే దారుణమైన ఉదాహరణ. సంక్షోభం అన్ని వైపుల వ్యాపించిన ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రికి ఆమె సలహాదారులకు ఆర్థిక వ్యవస్థ చిగురిస్తున్నట్టు కనబడుతున్నది. ఇంతకన్నా ఘోరం ఏముంటుంది? కార్మికులు, కష్టజీవులకు కలలో కూడా చిగురిస్తున్నట్టు కనబడటం లేదు. ఉద్యోగాలు ఊడిపోయి, కార్మిక చట్టాలు కాలరాయబడి, శాశ్వత ఉద్యోగాలు పోయి, పట్టణ, గ్రామీణ ఉపాధి కుచించుకుపోవడం, జీతాల కోతలాంటివి కార్మికులకు వారి ముఖంపై కొట్టినట్టు ఎదురొస్తున్న పరిస్థితి.
బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఉపశమనం కల్పించే ఆలోచనే చేయటం లేదు. ట్రేడ్యూనియన్స్ కార్మికులకు ఇతర కష్టజీవులకు ఆర్థిక సహాయం అందించాలని, ఆహార ధాన్యాలు ఇవ్వాలని కోరుతున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది.
మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడికి నమ్మిన బంటులా ఉంటూ, నయా ఉదారవాద విధానాలకు కట్టుబడి నందున ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది. లాక్డౌన్ కాలంలో దేశ సహజ వనరులను స్వదేశీ విదేశీ కార్పొరేట్ సంస్థలకు పల్లెంలో పెట్టి ఇచ్చేస్తున్నది. ప్రజలను దోచుకోవడానికి వీలు కల్పిస్తున్నది. ప్రజాస్వామ్య, రాజ్యాంగపరంగ ఉన్న హక్కులను నిర్వీర్యం చేసి ప్రతిఘటన లేకుండా చేస్తున్నది. ప్రగతి శీల, హేతువాద, నిరసన తెలిపే గొంతులను లక్ష్యంగా చేసుకుని అణచివేత చర్యలకు పూనుకుంటున్నది. దీనితోపాటు నిత్య జీవిత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రజలమధ్య మతపరమైన చీలికను తేవడానికి కుట్రలు పన్నుతున్నది. దీనికి బీజేపీ దాని గురువు ఆర్ఎస్ఎస్ ఇతర అనుబంధ సంఘాలు పూనుకుంటున్నాయి. కుల, మత విభజనను వారు ఆయుధంగా వాడుకుని ప్రజలు ఐక్యం అయి ప్రతిఘటించే అవకాశానికి అడ్డుకట్ట వేస్తున్నారు. కేంద్రంలో ఉన్న అధికారంతో అన్ని సంస్థలను, వ్యవస్థలను ప్రభావితంచేసి తన హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకుపోతున్నారు.
మోడీ ప్రభుత్వం నిరసన గళాలను తొక్కేయడానికి అరెస్టులు, తప్పుడు కేసులు, బెదిరింపులకు పాల్పడుతున్నా వేలాది మంది రోడ్లపైకి వచ్చి వారి డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నారు. కార్మికులు, ఉద్యోగులు వారి వారి రంగాలలో తొలగింపులు, జీతాలకోత, కార్మిక చట్టాల సవరణతో పాటు కనీస హక్కులపై జరుగుతున్న అమానుష దాడులకు వ్యతిరేకంగా పోరాడుతూ సమ్మెలకు పూనుకుంటున్నారు. రైతు వ్యతిరేక ఆర్డినెన్స్లకు వ్యతిరేకంగా రైతులు ఐక్యంగా పోరాడుతున్నారు. కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు ఐక్యంగా అందరికి వర్తించే సమస్యలపై పోరాడుతున్నారు.
ఈ ఐక్యపోరాటాలను బలపరుచుకుంటూ, ప్రతిఘటన స్థాయికి తీసుకుపోతే అప్పుడు కార్మికులు, ఇతర వర్గాలలో బరోసా ఏర్పడుతుంది. తద్వారా నయా ఉదారవాదాన్ని ఓడించి ప్రజానుకూల, కార్మిక అనుకూల విధానాలు సాధించవచ్చు అనే నమ్మకం ఏర్పడుతుంది. అన్ని రంగాల ప్రజల మధ్య ఐక్యత, సంఘీభావం వలన కష్టజీవులలో ఉన్న నిస్పృహ తొలగిపోయి, పోరాటాలకు పూనుకోవాలనే నమ్మకం బలపడుతుంది. పాలకవర్గాల ఆధ్వర్యంలో జరుగుతున్న ముప్పేటదాడిని ఎదుర్కోవడానికి ఇదే సరైన మార్గం. అందుకే నిరాశకు లోనుకావొద్దు! ప్రాణాలు తీసుకోవొద్దు! అందరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీసి అడగాలి. బతుకులను మార్చుకునేందుకు పోరాడి గెలవాలి.
- డాక్టర్ కె. హేమలత
అనువాదం: టిఎన్వి రమణ.
సెల్: 8985628662