Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ యూనివర్సిటీ లకు నిధులు కేటాయించి అభివద్ధి చేయడం చేతకాక ప్రయివేటు యూనివర్సిటీలను స్థాపించి విద్య అందిస్తామని చెప్పటం ఎవరిని మోసం చేయడం..? కొత్తగా రాష్ట్రంలో ఐదు ప్రయివేట్ యూనివర్సిటీ లకు అనుమతివ్వడం ఎంత వరకు సమంజసం? రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలలో ఈనాటికీ 1800 (ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కలిపి) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూనివర్సిటీలకు ఉపకులపతులు కూడా లేరు. అంటే ప్రభుత్వ విద్యారంగం ఎంత తీవ్రమైన సంక్షోభంలో పడిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 11 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ఒప్పంద (కాంట్రాక్టు) అధ్యాపకులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులందర్నీ క్రమబద్ధీకరించాలని నాలుగేండ్ల క్రితం ఆందోళనా పోరాటాలు చేసిన ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి విశ్వ విద్యాలయాల్లో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకులు, తాత్కాలిక సిబ్బంది సమస్యలపై ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు సంబంధించి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు అందరికీ 75శాతం వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ జీఓ11 విడుదల చేసింది. అన్ని యూనివర్సిటీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ ఒక మెలిక పెట్టింది. శాంక్షన్ బడ్జెట్ వేకెన్సీ పొజిషన్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు మాత్రమే అని మెన్షన్ చేసింది. ఈ జీఓ 11 ద్వారా కేవలం నాలుగు యూనివర్సిటీలలో మాత్రమే 75శాతం వేతనాలు చెల్లించడం జరిగింది. ఇప్పటికీ ఏడు విశ్వవిద్యాలయాలలో వేతనాలు చెల్లించడం లేదు. వీటిపై ప్రభుత్వం పరిశీలన చేయాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో గత ఐదేండ్ల నుంచి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్లలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు కూడా జీతాలు పెరగలేదు. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. కొన్ని విశ్వవిద్యాలయాలలో కాంట్రాక్టు లెక్చరర్గా పనిచేస్తున్న వారికి సుమారు రూ.19 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి నెట్/ సెట్టు/ పీహెచ్డీ ఉన్నా కానీ కేవలం ఈ వేతనం చెల్లిస్తున్నారు. 2016 సంవత్సరం అక్టోబర్లో నెలలో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న ఆ తీర్పు నేటికీ విశ్వవిద్యాలయాల్లో అమలు కావటం లేదు. అలాగే 11 రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో 2797 పోస్ట్లు ఉంటే వాటిలో (ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ కలిపి) 997మంది(ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ కలిపి) మాత్రమే పని చేస్తున్నారు. 1800 పోస్టులు (ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ కలిపి)ఖాళీగా ఉన్నాయి. ఖాళీలశాతం పరిశీలించి నట్టయితే 65శాతం. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది. కాబట్టి ఇప్పటికైనా ఆ హామీని నెరవేరుస్తూ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులందర్నీ క్రమబద్ధీకరించాలి. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసిన తర్వాత కూడా ఇంకా సుమారు వెయ్యి పోస్టులు ఖాళీగా ఉంటాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో సుమారు రెండు వేల పోస్టులకు పైగా అవసరం పడుతున్నవి. ఈ పోస్టులను కూడా మంజూరు చేయాలి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకారం ఐదేండ్ల కోర్సు సక్సెస్ఫుల్గా నడిస్తే ఆటోమేటిక్గా రెగ్యులర్ కోర్సు కింద చేయాలి. కానీ పాలకులు అనేక విశ్వవిద్యాలయాలలో నేటికీ దీన్ని ఆచరించడం లేదు. ఈ సెల్ ఫైనాన్స్ కోర్సులపై ప్రభుత్వ వివక్షకు ఇది నిదర్శనం. విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులు సుమారు 600మంది ఉన్నారు. వివిధ విశ్వవిద్యాలయా లలో వీరికి కూడా నేటికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. ఈ లోపాలను సరిచేసి విశ్వవిద్యాలయాలను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వం ప్రయివేటు యూనివర్సిటీ లకు అనుమతివ్వడం ఏ ప్రయోజనల కోసం..?!
- డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్
సెల్:9063015016