Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కులమేరా అన్నిటికీ మూలం,
ఆ కులము మలిన మిడువనంత కాలం
నడవదురా ముందుకు ఈ లోకం''.
ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న యువతీ యువకులను నడిరోడ్డుమీద నరికి, కారు చీకట్లో గొంతునులిమి, కర్కశంతో కిరోసిన్ పోసి తగులబెట్టి చంపేసే తల్లిదండ్రుల హత్యలను ''పరువు హత్యలు, హానర్ కిల్లింగ్'' అంటూ గౌరవప్రదమైన పేర్లతో ప్రచారం చేసే ప్రతిఒక్కరూ అట్టి హత్యలు మళ్లీమళ్లీ జరగడానికి అప్రయత్నంగా, అవసరానికి మించిన ఆజ్యం పోస్తున్న వాళ్లే. ఇవి కులమనే గజ్జితో కుళ్ళిన ''కుల దురహంకార హత్యలు.'' ఇవి పరువు కోసం జరుగుతున్న హత్యలేనాడూ కావు. సమాజం ప్రజలపై రుద్దిన మూర్ఖత్వపు మూఢాచారాల ఫలితాలివి. ఇట్టి మూఢాచారాలను పెంచి పోషించే వారందరూ ఈ హత్యలలో భాగస్తులే. ''ఇలా చేయమని మేము చెప్పామా?'' అని ఎవరైనా అనుకుంటే ''అవును చెప్పారు'' అన్నదే సమాధానం. రాజ్యాలను ఏలుతున్న మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, పెద్దపెద్ద చదువులు ఉన్న అధికారులు ఒక్క మాట - ఒకటే ఒక్క మాట, ''కులాల పేరుతో హత్యలు చేసుకోవద్దు, కులాంతర వివాహాలూ సమర్దనీయమైనవే, ఈ విషయాన్ని ఐదేండ్ల చర్చానంతరం 1955లో హిందూ కోడ్ బిల్లు ద్వారా అమోదించుకున్నాం, కులాల అంతరాలు నామ మాత్రమే'' అని ఒక్క మాట చెప్పడానికి ఎందుకు మొహం చాటేస్తున్నారు? ''కులమేరా అన్నిటికీ మూలం, ఈ కులం గజ్జి విడువనంతకాలం కదలదురా ముందుకు ఈ కాలం'' అని ఒక్కడైనా పలకరెందుకు? బర్డ్ ఫ్లూ/స్వైన్ ఫ్లూ రోగాలు, కరోనా వచ్చి చికెన్ రేటు తగ్గిపోతే, ప్రెస్మీట్ పెట్టి మరి ''చికెన్ తినండి ఏమీ కాదు'' అని ప్రకటించే మంత్రులు ముఖ్యమంత్రులు ప్రేమ పెళ్లిళ్ల ద్వారా ఒక్కటైన వాళ్లని కిరాతకంగా నరికి చంపుతుంటే మాట మాట్లాడరు ఎందుకో? ఎందుకంటే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళెవరూ ఎన్నికల్లో గెలువడానికి పార్టీలకు నోట్లకట్టలు సమకూర్చే పెట్టుబడి దారులు కాదుగా! అంతే కాకుండా, సామాజిక వర్గాలతో ముడిపడి ఉన్న వారి రాజకీయ లబ్ది అందుకు సహకరించడం లేదు. హైదరాబాద్లో ఇప్పుడు జరిగిన హత్యలో దోషులు రెడ్డి సామాజికవర్గం, బాధితుడు వైశ్య కుటుంబీకుడు. ''ఈ హత్య తప్పు'' అని ప్రభుత్వ పెద్దలెవరైనా చెప్పారంటే ఆ సామాజికవర్గా దూరమౌతాయి. సంకుచితత్వం వారి మూతికి తాళం వేస్తున్నది. మిర్యాలగుడ ప్రణరు హత్యకేసులో దోషి వైశ్య సామాజిక వర్గస్తుడు, అప్పుడు కూడా బాధితులైన దళితవర్గాన్ని పరామర్శించడానికి సైతం ఈ స్వార్థ రాజకీయం ఎలుకలా కలుగులో దూరింది. కుల చీలికలను నవారా పట్టలా చేసి చక్కగా అల్లుకున్న అధికారమనే మంచంపై తడిగుడ్డ వేసి పడుకున్న ఈ నాయకులకు ఇంతకన్నా సామాజిక స్పహ ఉంటుందని ఆశించడం అత్యాశే కదా!
మళ్ళీ మళ్ళీ అదే తప్పు. సామాజిక కార్యకర్తల అరణ్య రోదన, పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు వగైరా తతంగాలు తప్ప మరో మార్పులేని హత్యలు ఎన్నాళ్ళు పునరావతమైతాయి? ఇలాంటి హత్యలను పరువు హత్యలనడంతో, ''చంపకపోతే మనకు పరువు లేదని, చంపితేనే మన కులగౌరవాన్ని నిలబెట్టిన వాళ్ళుమౌతామని'' ఈ హత్యలకు తెగిస్తున్న వారూ ఉన్నారు సుమా! కానీ ఇవి ముమ్మాటికీ కులాల గౌరవం కాపాడుకునే హత్యలు అసలే కావు. మన మతం-పర మతం అంటూ చీలిక మంటలు రేపుతున్న నాయకులు కూడా ఇలాంటి హత్యలపై ఒక్కసారైనా స్పందించరు ఎందుకు? దేవుడి పూజకు వచ్చేవాడు ఏ మతస్థుడో డిక్లరేషన్ ఇచ్చి రావాలంటూ కొందరు రోడ్డెక్కి నినాదాలు చేస్తుంటే, మరికొందరు తిరుమల దేవాలయానికో లేదా రామమందిరానికో సతీసమేతంగా వచ్చారా రాలేదా అన్నది సమస్యగా చూస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళకి మన మతంలోనే యువతీ యువకులను చంపేస్తున్నారు కదా! దానిపైన స్పందించాలన్న ఇంగిత జ్ఞానం లేకపోవడాన్ని ఏమనాలి? మఠాలు ఆశ్రమాల పేరుతో కబ్జా చేసుకొని, పీఠాలపై కూర్చున్న పండితులను ఇలాంటి హత్యలు కదిలించడం లేదా? లేక వారు కపటనిద్ర ప్రదర్శిస్తున్నారా? అసలు విషయమేమంటే ఇలాంటి హత్యలు వీరి మనుగడకు అవసరం. అందుకే నోరుమెదపకుండా, జరగనీ అని లోలోపల జుగుప్సాకర పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. లేదంటే ఖచ్చితంగా స్పందించే వారే. ఇప్పుడైనా మేల్కొనాలి. కులాభిమానం చాటుకోవాలనుకున్న వాళ్ళ కండ్లకి తమ కులంలోని అట్టడుగు పేదల కష్టాలు కనపడక పోవడం, కనపడినా సహకరిద్దామనే ఆలోచన తట్టకపోవడం వారి భావ దారిద్య్రానికి నిదర్శనం.
చిన్న పిల్లల కడుపు నొప్పికి అందుబాటులో ఆసుపత్రులు లేక ఒక మంత్రమైన లేదా తయత్తైనా వేయిద్దామని దగ్గరలో ఉన్న మహబూబ్ సాహెబ్ దగ్గరికి హిందువులు, మంతెన కుర్మన్న దగ్గరకి ముస్లింలు పరిగెత్తుతుంటే... ''అక్కర లేదు మన మతంలో మందులున్నాయని, మీ రోగాలని నయం చేసే చిట్కాలు మాదగ్గరున్నాయ''ని చెప్పడానికి దైర్య సాహసాలు చేయరెందుకు? హామీనిచ్చేంత సీను వాళ్ళదగ్గరలేక అవసరానికి అన్నింటినీ కాలరాస్తుంటారన్న మాట. కులమేదైనా మతమేదైనా సమస్యకు స్వాంతన ఇస్తే చాలని అనుకుంటారు. దీనినే హిప్పోక్రసీ అంటారు. ఇట్లాంటి కుల దుహంకార హత్యలు అన్ని కులాల్లోనూ జరుగుతున్నా, అగ్రకుల దురహంకారంతో జరుగుతున్నవే ఎక్కువ. మిర్యాలగూడ కేసులో మారుతీ రావుకు బాసటగా దర్నాలకు దిగిన కొందరు వైశ్య కార్యకర్తలను ప్రశ్నిస్తూ ''నేటి హైదరాబాద్ సంఘటనలో బలైన హేమంత్ హత్యనూ కూతురిపై ప్రేమగా భావించి సమర్దిస్తారా'' అంటూ నెటిజన్ లంతా ఎగతాళి చేస్తున్నారు. అప్పుడు తప్పుకు తాళం వేసిన వాళ్ళకిది ఖచ్చితంగా గుణపాఠం కావాలి. అయితే గుణపాఠం నేర్వాల్సింది ఈ హత్యలకు పాల్పడ్తున్నవారో లేక సాధారణ ప్రజలో కాదు. మూఢాచారాలను పెంచి పోషిస్తున్న కుల/మత పెద్దలు, కులమతాలకు సైకొడుతూ సన్యాసులుగా చెలామణి అవుతున్న స్వామీజీలు. అన్నిటినీ మించి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాధినేతలు. గుణపాఠం నేర్వడమంటే బాహాటంగా కులాంతర వివాహాలను సమర్దించాలి. కుల నిర్మూలన రాజకీయ పార్టీల మానిఫెస్టోల్లో భాగం కావాలి. అన్ని వేదికలపై అది ప్రకటించబడాలి. ప్రముఖులంతా పాటించి ఆదర్శంగా నిలబడాలి. దీనికి భిన్నమైన ఆలోచన ఉన్న వారంతా మానసిక హంతకులే.
కూతుర్ని నడిరోడ్డుపై కొబ్బరి బోండాం కత్తితో నరికిన ఒక మనోహరాచారి, పలమనేరులో నిండు చూలాల్ని చంపిన తండ్రీ, మంచిర్యాల, గుంటూరు, ప్రకాశం మొదలగు తెలుగు ప్రాంతాలే కాదు దేశమంతా ఈ జాడ్యపు దట్టమైన పొగలున్నాయంటే మనమెంత అనాగరికులమో కదా అని సిగ్గేయటం లేదూ! గత రెండు దశాబ్దాల్లో 44,412 హత్యలు ప్రేమ-పెళ్ళి వ్యవహారాల్లో జరిగాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గ్రామాల్లో ముప్పై శాతం, పట్టణాల్లో ఇరవై శాతం కుటుంబాలు అంటరాని తనాన్ని పాటిస్తున్నాయని, మొత్తం వివాహాల్లో కులాంతర వివాహాలు ఐదు శాతంలోపేనని నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్ఛ్ పరిశోధన వెల్లడించింది. బయట పడని కేసుల్ని లెక్కేస్తే వాస్తవ సంఖ్య ఎక్కువే సుమా! ఈ హత్యలను నివారించాలని సుప్రింకోర్టే సూచించినప్పటికీ ఖాఫ్ పంచాయతీల దరి చేరడానికి ప్రభుత్వాలు సాహసించడం లేదు. రాజకీయ లక్ష్యం లేకుండా కేవలం సామాజిక అభివద్ది ద్వారా మాత్రమే కుల నిర్మూల అసాధ్యమని అంబేద్కర్ ఏనాడో చెప్పాడు. ప్రస్తుతానికి ఆత్మ విమర్శతో కూడిన ఆచరణే అందరి మార్గం.
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016