Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే కాని గెలిచిందంతా న్యాయం కాదు అన్నాడు మహాకవి శ్రీశ్రీ. బాబ్రీమసీదు కూల్చివేతపై తీర్పు వెలువడిన అనంతరం రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ 'ఎట్టకేలకు న్యాయం గెలిచింది' అనడంతో శ్రీశ్రీ మాట స్ఫురించింది. 28ఏండ్ల విచారణ అనంతరం బాబ్రీ మసీదు కేసులో నిందితులు నిర్దోషులని సీబీఐ కోర్టు తీర్పు చెప్పడం గమనిస్తే ''చట్టానికి కళ్ళు లేవు... న్యాయానికి ఇల్లు లేదు'' అనే సినీ గేయమూ గుర్తుకొస్తుంది. మరోవైపున చట్టం ఉన్నవాళ్ళ చుట్టం అనే మాట ఎంత నిజమో హత్రాస్ రేప్ కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసుల అమానుష వ్యవహారసరళి చెప్పకనే చెబుతోంది. హంతకులు క్షేమంగా ఉంటారు, కుట్రదారులు నిర్దోషులుగా చిద్విలాసంతో దర్శనమిస్తారు. న్యాయం-చట్టం నగుబాటు పాలయి వర్తమాన భారతం నివ్వెరపోతున్నది. చట్టం ముందు అందరూ సమానమే అనే మాట సారం కోల్పోయింది. సమన్యాయం అంటే సంపన్నులకు మాత్రమే న్యాయం అనేది రూఢిగా చలామణయ్యే మరో ఘటన నమోదయింది.
సెప్టెంబర్ 30 చరిత్రలో చీకటిరోజు
బాబ్రీ మసీదు ఎవరూ కుట్రలు పన్నకుండానే, ఎవరూ రెచ్చగొట్టకుండానే తనంతట తాను కూలిపోయిందా? బాబ్రీమసీదు కూల్చివేతలో న్యాయస్థానానికి నేరస్థులు కనిపించలేదు. మరోచోట అన్యాయానికి లోనయి శోకంలో ఉన్న తల్లిదండ్రులకు చనిపోయిన కూతురుని కడసారి చూసుకునే అవకాశం దక్కలేదు. అర్ధరాత్రి రెండు గంటలకు కన్నవారినే బంధించి పోలీసులే సామూహిక అత్యాచార బాధితురాలి మృతదేహానికి అంత్యక్రియలు చేయడం అత్యంత దుర్మార్గం. రెండు ఘటనలు ఉత్తరప్రదేశ్లోనే జరిగాయి. అటవిక నీతి, ఆధునిక మనువు రాజ్యం చేసేచోట న్యాయం నగుబాటు పాలయింది. అన్యాయానికి లోనయిన వారి పట్ల యూపీ పాలక యంత్రాంగం దౌష్ట్యం దేశం కళ్ళెదుట నగంగా తాండవించింది.
ఇరవయ్యోకటో శతాబ్దపు ఆధునిక భారతంలో సెప్టెంబర్ 30 ఒక చీకటి రోజు. బాబ్రీమసీదు మాత్రమే కాదు న్యాయం కూడా కూల్చివేతకు లోనయింది. హత్రస్ ఘటనలో బాధితురాలికి న్యాయం చేస్తామంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెబుతున్నారు, కానీ అర్ధరాత్రి అంత్యక్రియల ఉదంతంతోనే న్యాయం మరోసారి రేప్కు గురయింది. కూతురుని కోల్పోయి గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రుల నిమిత్తం లేకుండానే బాధితురాలి మృతదేహాన్ని దహనం చేయడం పాలక యంత్రాంగపు పాశవికత్వానికి పరాకాష్ట.
యావత్ జాతి సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ రెండు సంఘటనలు చూసిన దరిమిలా స్పందించిన ప్రముఖ రచయిత్రి మీనా కందస్వామి ''మందిర నిర్మాణానికి బాటలు పరిచిన న్యాయవ్యవస్థ నుంచి ఇంతకు మించి ఇంకేదైనా ఆశించగలమా, దళితుల గ్రామాల్లో మారణహౌమం సష్టించిన వారికి క్లీన్ చిట్ ఇస్తున్న న్యాయవ్యవస్థ, మనుధర్మానికి మద్దతు పలుకుతున్న న్యాయవ్యవస్థ నుంచి ఆశించేది మరేదైనా ఉంటుందా?'' అని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న ఈ ప్రశ్నల పరంపర మహా ఉద్యమంగా రూపు దాలుస్తుందా? న్యాయం పక్షాన నిలబడేవారి గొంతులు సంఘటితమవుతాయా? చట్టాలను, న్యాయవ్యవస్థను, రాజ్యాంగాన్ని పరిహసించే కాషాయ కుట్రల్ని ప్రతిఘటించే శక్తులు ఏకమవుతాయా? జవాబులు అంత సులువుగా దొరకవు.
తిలా పాపం తలా పిడికెడు
బాబ్రీమసీదు-అయోధ్య ఉదంతంలో బీజేపీ వ్యవహారసరళి ఇలాగే ఉంటుందనే అవగాహన వామపక్షాలకు మాత్రమే ఉంది. అందువల్లనే లౌకికవాద శక్తుల ఐక్యత గురించి అనేకసార్లు వక్కాణిస్తూ వచ్చాయి. మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక, ప్రజాతంత్రశక్తుల నిరంతరాయ పోరాటం గురించి చెబుతూ వచ్చాయి. సూడో లౌకికవాదం అనే పేరిట కాషాయ పరివారం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేశాయి.
1986లో అయోధ్యలో తాళాలు తెరవడమే రాజీవ్గాంధీ ప్రభుత్వం చేసిన అది పెద్ద తప్పు. షాబానో ఉదంతం తరువాత మెజారిటీ హిందువులకు చేరువ కావాలనే వ్యూహంతో చేసిన తప్పిదం సంఫ్ుపరివార్కు లాభించింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం పేరిట ఎల్.కె. అద్వానీ రథయాత్ర బీజేపీ బలపడటానికి మార్గాన్ని సుగమం చేసింది. ఆ రథయాత్ర ఎంత ప్రమాదకరమో తెలిసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాలు చోద్యం చూశాయి. కేవలం ఒకే ఒక్కడు లాలూప్రసాద్ యాదవ్ బీహార్లోని సమస్తిపూర్లో రథయాత్రని అడ్డుకున్నారు. అద్వానీ ని అరెస్టు చేసి రథయాత్రని నిలువరించడానికి ప్రయత్నించారు. ఇవాళ 'నిర్దోషి'గా అద్వానీ జైశ్రీరామ్ అంటూ నినదిస్తుంటే లాలూప్రసాద్ యాదవ్ కటకటాల వెనుక ఉన్నారు -కారణాలు ఏవైనా సరే.
సైద్ధాంతికంగా సంఘ్ పరివార్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు క్రమేణా బీజేపీకి దగ్గర కావటం పదేండ్ల కాలం నుంచి నెలకొన్న పరిణామం. కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో బీజేపీని ఆశ్రయించిన ఈ పార్టీల అస్తిత్వమే ఇవాళ ప్రమాదంలో పడింది. అవకాశవాదం, పదవీలాలస కారణంగా పూర్వపు జనతాదళ్లోని అనేక చిన్నాచితకా పార్టీలు బీజేపీని ఆశ్రయించి మౌనం దాల్చాయి. సిద్ధాంతాలు, సూత్రాలు లేని ఈ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో వ్యవహరించిన ధోరణి అంతిమంగా కాషాయ శక్తులకు ఉపకరించింది. అందుకే ఇవాళ్టి పరిణామాల పాపంలో కాంగ్రెస్తో సహా అనేక మధ్యేవాద పార్టీలకు భాగం ఉంది. రాజీవ్గాంధీ అయోధ్య తాళాలు తెరిస్తే, పి.వి.నరసింహారావుకు అవకాశం ఉండి కూడా బాబ్రీ కూల్చివేతను ఆపకుండా మౌనముద్ర దాల్చారు. ఈరకంగా కాంగ్రెస్పార్టీ, రాజీవ్గాంధీ, పి.వి.నరసింహారావు బాబ్రీమసీదు కూల్చివేత పాపంలో భాగస్వాములే అన్నది నిస్సందేహం. అందుకే నిందితులు నిర్దోషులే అన్న సిబిఐ కోర్టు తీర్పు మీద కాంగ్రెస్ ఎన్ని మాటలు చెప్పినప్పటికీ ఆ పార్టీ దోషం సమసిపోదు.
ఒక్కసారి అవకాశమిస్తే...
భీకారాకరంలో ఉన్న పులిని నమ్మడం సులువు. దాని నైజం, దుర్మార్గం తెలిసినందున దూరంగా ఉంటాం, లేదా ఏదో ఉపాయంతో దానిని తప్పించుకు బతికేస్తాం. కానీ సాధువేషంలో ఉన్న పులిని నమ్మడం ఆత్మహత్యా సదృశం. ఒకే ఒక్కసారి అవకాశమివ్వండి భారత దేశపు తలరాత మారుస్తామని బీజేపీ నేతలు 2014కు ముందు అనేకసార్లు చెబుతూ వచ్చారు. ఆ మాటని నమ్మినందున సాధువేషంలో ఉన్న పులిమీద స్వారీ చేయడం ఎలా ఉంటుందో ఇవాళ ఈ దేశప్రజలు స్వయంగా చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. అది నగరాలకు, పట్టణాలకు మాత్రం పరిమితమై ఆగిపోలేదు. పల్లెలని కూడా చుట్టుముట్టింది. భూముల్ని కబళించే కుత్రంతానికి తెరతీసింది. చట్టం, న్యాయం, రాజ్యాంగం అంటే గౌరవంలేని వారికి ఒక్క అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో దేశంలో ఉన్న అనేక వ్యవస్థలు, సంస్థలు నీరుగారిపోతున్న వైనం చెబుతున్నది. ఈ క్రమానికి కొనసాగింపుగానే బాబ్రీమసీదుకూల్చివేతలో ప్రత్యేకకోర్టు తీర్పును పరిగణించాలి.
చొద్యం చూసిన పాలకులు
1992 డిసెంబర్ 6న వేలాదిమంది కరసేవకులు బాబ్రీమసీదును పట్టపగలు అందరూ చూస్తుండగా కూల్చివేశారు. ఏదో జరగబోతుందనే ప్రమాదం గురించి అప్పటికే దేశం యావత్ పసిగట్టింది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జరిగేదేదో జరగనీ అన్నట్టుగా వ్యవహరించింది. ఆనాడు ఉత్తరప్రదేశ్లో కల్యాణ్సింగ్ ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. అందుకే ఆ రోజున కరసేవకులకు అంత ధైర్యం వచ్చింది... లాఠీచార్జి చేయకుండా, కాల్పులు జరపకుండా కరసేవకులను ఆపగలిగితే ఆపండని ముఖ్యమంత్రి కల్యాణ్సింగ్ జిల్లా అధికారులతో అన్నారు. ఆ సంఘటనకు ప్రత్యక్షసాక్షులుగా ఉన్న జర్నలిస్టుల కథనం ప్రకారం పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలది కేవలం ప్రేక్షకపాత్ర. అక్కడ రామాలయం నిర్మించి తీరాల్సిందేన్న ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, నరేంద్రమోదీల ప్రసంగాలు అబద్ధం కావు. ఎవరూ ఎవరిని రెచ్చగొట్టకుండానే వందలాది మంది క్షణికావేశంలో మసీదు కూల్చివేశారన్న మాట ఎంత అసత్యమో తెలియంది కాదు. కానీ న్యాయస్థానాలకు మాత్రం అది సత్యంగానే గోచరించింది. సదరు న్యాయస్థానానికి ఆనాడు అక్కడ ఉన్న బీజేపీ అధినాయకులంతా నిర్దోషులుగా కనిపించారు. ఆధునిక మనువులు అధికార పీఠాల మీద ఆసీనులైన పర్యవసానమిది.
ఆధిపత్యకులాల దాష్టీకం
ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో 19ఏండ్ల దళిత యువతిపై ఆధిపత్యకులానికి చెందిన నలుగురు యువకులు సామూహికంగా అత్యాచారం చేసిన దారుణ సంఘటన మీద మీడియా స్పందన కూడా అంతంత మాత్రం. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన పట్ల వెల్లువెత్తినంత నిరసన ఈ అమ్మాయి పట్ల కనిపించలేదు. ఆ అమ్మాయి మరణించడం, ఉత్తరప్రదేశ్ పోలీసుల పాశవిక వైఖరితో ఇప్పుడు అనేకరకాల నిరనసలు, స్పందనలు కనిపిస్తున్నాయి. కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా నిర్భయ చట్టం తెచ్చినప్పటికీ 'మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం' వినిపిస్తూనే ఉన్నది. హత్రాస్లో సామూహిక అత్యాచారానికి గురయి మరణించిన అమ్మాయి గురించిన వార్తలు వింటుండగానే దేశంలో మహిళలపై నేరాల పర్వం మీద నివేదికలు వెలువడ్డాయి. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో తాజా నివేదిక ప్రకారం గత ఏడాది (2019) సగటున రోజుకు 87మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. మహిళల మీద హింసాత్మక దాడులకు సంబంధించి 4,05,861 కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తమ్మీద 2019లో మహిళల మీద అత్యాచారాలకు సంబంధించి 32,033 కేసులు నమోదయ్యాయి. 2018 సంవత్సరంతో పోలిస్తే మహిళల మీద జరుగుతున్న దాడుల ఘటనలు ఏడు శాతం పెరిగాయని ఈ నివేదిక తెలియజేసింది. ఇవి పోలీసుల దాకా వచ్చిన ఘటనల వివరాలు మాత్రమే. ఠాణాలకెక్కని ఘటనలు ఎన్నో అనూహ్యం.
మరీ ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాలకు సంబంధించిన మహిళల మీద నానాటికీ నేరాలు పెరుగుతున్నాయి. ఈ నేరాల ఘటనలు ఉత్తర భారతంలో మరింత అధికం కావడం గమనార్హం. ఆధిపత్యకులాల పెత్తనాల్ని కాపాడే మనువాదుల పాలన మహిళల పట్ల ఎంత సున్నితంగా ఉన్నదో ఈ ఘటనలు చెబుతున్నాయి. నిర్భయ చట్టం తెచ్చినప్పటికీ, రేప్ నేరానికి ఉరిశిక్షలు ఖాయమని చట్టం చెప్పినప్పటికీ అత్యాచారాలు ఎందుకు ఆగడం లేదన్నది ప్రశ్న. పెత్తందారీ కులాల వారు చట్టం తమ చుట్టంగా భావిస్తున్నందునే చట్టాలు ఎన్ని ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు.
ఇదేనా గౌరవం, భద్రత?
భారతీయ సంస్కృతి గురించి గొంతు చించుకునే కాషాయ పాలకుల హయాంలో నేరాలు పెరగడం దేనికి సూచిక. మహిళల్ని దేవతలుగా పూజించే నేల అంటారు. మరి వారి మీద జరుగుతున్న దాడులకు వత్తాసు పలికే ఆధునిక మనువుల పాలన మహిళలకు ఇస్తున్న గౌరవం, కల్పించే భద్రత ఇదేనా? హత్రాస్ జిల్లాలో సెప్టెంబర్ 14న దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో మొదట దానిని రేప్కేసుగా నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించారు. నేరానికి పాల్పడిన వారు ఆధిపత్యకులమైన ఠాకూర్ వర్గంవారు. కనుకనే వారిపై పోలీసులు ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. చావుబతుకులతో కొట్టుమిట్టాడుతూ తనపై జరిగిన దారుణం గురించి చెప్పాకనే పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు.
అమ్మాయికి న్యాయం చేస్తామన్న ఆ రాష్ట్రముఖ్యమంత్రి సాధుపుంగవుని మాటలు నమ్మడానికి ఇప్పుడు ఎవరూ సిద్ధంగా లేరు. అమ్మాయి తల్లిదండ్రుల్ని పరామర్శించడానికి వెళ్ళే వివిధ సంఘాల వారిని పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించడం గమనార్హం. న్యాయం కోసం ప్రశ్నించేవాళ్ళని కటకటాల వెనక్కి నెట్టే ఈ దుర్మార్గం గర్హనీయం. ప్రశ్నల్ని సహించలేని కాషాయ పాలకవ్యవస్థలో మానవహక్కుల సంఘాలు పనిచేయలేవు. అందుకే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన కార్యాలయాన్ని మూసివేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
రాజ్యాంగం ప్రసాదించిన నిరసన తెలిపే హక్కును కూడా కాలరాసే ధోరణి క్షమార్హం కాదు. రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు ద్వారానే అధికారంలోకి వచ్చిన సంఘ పరివారం రాజ్యాంగాన్ని అపహాస్యం పాల్జేసింది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు అందుకు భిన్నంగా ప్రవర్తిస్తే సరిదిద్దాల్సిన న్యాయవ్యవస్థలు తమ విధిని విస్మరించాయి. ఒక్కొక్క వ్యవస్థని తన గుప్పిట్లో పెట్టుకున్న ఈ దుర్మార్గం ఇలాగే సాగుతుందా? ఇంకానా ఇక సాగదు అని ఎలుగెత్తి చాటేవారు ఒక్కటయి గళమెత్తాల్సిన సందర్భమిది. న్యాయం, చట్టం సారంలో, సారాంశంలో నిలిచి వెలగాలంటే ఈ ఎరుక, చైతన్యం పదునెక్కాల్సిన సమయమిది.
- గుడిపాటి