Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముస్లింలు, హిందువుల మధ్య జరిగే మతాంతర వివాహాలపై ఆదిత్యనాథ్ తన ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. 2017 ఏప్రిల్లో ముఖ్యమంత్రి అయిన వెంటనే మతాంతర వివాహాల పట్ల తన ఉద్దేశాలను స్పష్టం చేశాడు. కొన్ని రోజుల వ్యవధిలోనే, 'హిందూ యువ వాహిని'కి చెందిన తన ప్రయివేట్ సైన్యం మీరట్లో మతాంతర వివాహం చేసుకున్న ఒక జంటపై దాడి చేశారు. మే 2న బులాంద్ షహర్లో, ఒక ముస్లింతో ఒక హిందూ మహిళ లేచిపోయింది. ఈ సంఘటనతో ఆగ్రహించిన సంఘీయులు ఒక హింసాత్మక నిరసనను నిర్వహించి, ఈ సంఘటనతో ఏ సంబంధం లేని ఒక ముస్లింను హత్య చేశారు. బహుశా తమకు శిక్ష నుంచి మినహాయింపు ఉంటుందనే నమ్మకంతోనే ఆ పని చేసి ఉండవచ్చు. అప్పటినుంచి అసంఖ్యాకంగా జరుగుతున్న దాడులకు అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. తరువాత అకస్మాత్తుగా, కాన్పూర్ నుంచి పెద్ద సంఖ్యలో మతాంతర వివాహాలు జరిగినట్టు సమాచారం అందడంతో, ఆదిత్యనాథ్ ఆగ్రహావేశాలతో ఊగిపోతూ, (ఒక ప్రణాళికా బద్ధంగా, తగినన్ని నిధులతో నడుస్తుందని భావిస్తూ) ''లవ్ జీహాద్'' ఉద్యమానికి వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాడు. అనేక హిందీ వార్తా పత్రికలు ఈ అల్లర్లలో తలదూర్చి ఐఎస్ఐ ప్రమేయం, హవాలా లావాదేవీలు, ముస్లింలను హిందూ మహిళలు పెండ్లి చేసుకునేందుకు చూపే 'ఎర' వెనుక ఉండే కుట్రలకు అవసరమైన నిధుల గురించి రెచ్చగొట్టే వ్యాసాలు రాశాయి. ముస్లింలు అనేక మంది తాము హిందువులుగా నమ్మబలికి హిందూ మహిళలను ఆకర్షించారని రాశాయి. భజరంగ్దళ్ పాలనా యంత్రాంగం యొక్క నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా అనేక ప్రదర్శనలు నిర్వహించింది. సెప్టెంబర్ నెలలో అలాంటి 14 మతాంతర వివాహాలపై విచారణ చెయ్యాలని ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంను నియమించడం జరిగింది. నవంబర్లో దానిపై నివేదిక అందజేసిన తరువాత పోలీస్ ఐజీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ''లవ్ జిహాద్''కు సంబంధించిన ఎటువంటి ఆధారాలు దొరకలేదని ప్రకటించాడు.
ఈ క్రమంలో, సెప్టెంబర్ 24న అలహాబాద్ హైకోర్టు జస్టిస్ త్రిపాఠి, ఒక ముస్లిం మహిళ హిందూ మతంలోకి మారిన తర్వాత మతాంతర వివాహం చేసుకున్న కేసులో ఒక విచిత్రమైన తీర్పు చెప్పాడు. ఆ జంట తమకు రక్షణ కల్పించాలని న్యాయస్థానానికి వెళ్లారు. కానీ జస్టిస్ త్రిపాఠి వారి విజ్ఞప్తిని పూర్తిగా పట్టించుకోకుండా, పెండ్లి కోసం మత మార్పిడిని అంగీకరించడం కుదరదని, కాబట్టి ఈ పెండ్లికి విలువ లేదని చెప్పాడు. ఈ ప్రత్యేకమైన సంబంధాన్ని సంఫ్ుపరివార్ ప్రోత్సహిస్తుంటే, ఆదిత్యనాథ్ మాత్రం బహిరంగ సభల్లో, హిందూ మహిళలతో సంబంధం పెట్టుకునే వారిని అరెస్ట్ చేస్తామని, చంపుతామని కూడా ప్రకటించాడు. యాదచ్ఛికంగా, తరువాత నెల రోజుల లోపే, అదే హైకోర్టుకు సంబంధించిన ఇతర జడ్జీలు మాత్రం జస్టిస్ త్రిపాఠి చెప్పిన తీర్పుకు భిన్నమైన తీర్పులు చెప్పారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఒక స్వలింగ జంట కోర్టుకు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని, వారి సంబంధం పూర్తిగా చట్ట సమ్మతమని, వారికి పాలనా యంత్రాంగం, పోలీసులు రక్షణ కల్పించాలని నవంబర్ 2న జడ్జి ఆదేశాలు జారీచేశాడు. నవంబర్ 11న, మతాంతర వివాహం చేసుకున్న ఒక జంట తమకు రక్షణ కల్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఇద్దరు జడ్జీల బెంచ్ జారీ చేసిన ఒక సమగ్రమైన ఆజ్ఞ ఈ విధంగా ఉంది: ''మేము ప్రియాంక ఖర్వార్, సలామత్లను హిందూ, ముస్లింలుగా చూడడం కన్నా ఎదిగిన ఇద్దరు వ్యక్తులు తమ ఇష్టప్రకారం, సంతోషంగా, ప్రశాంతంగా కలిసి జీవించాలని అనుకుంటున్నారనేది చూస్తున్నాం. న్యాయస్థానాలు, ముఖ్యంగా సుప్రీంకోర్టు, హైకోర్టులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఒక వ్యక్తి తన జీవితాన్ని, స్వేచ్ఛగా గడిపే హక్కును సమర్దిస్తాయి. అతడు/ఆమె ఇష్ట ప్రకారం ఏ వ్యక్తితో నైనా (మతానికి సంబంధం లేకుండా) జీవించే హక్కును కల్పించడం అంటే అంతర్గతంగా జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను పొందే హక్కును కలిగి ఉండడమే''.
''ఒక వ్యక్తిగతమైన సంబంధంలో జోక్యం అనేది, ఇద్దరు వ్యక్తుల స్వేచ్ఛా హక్కుపై దురాక్రమణ చేయడం లాంటిది. అంటే ఏ వ్యక్తి, కుటుంబం, ఆఖరికి ప్రభుత్వానికి కూడా, ఇద్దరు వ్యక్తులు తమ ఇష్టపూర్వకంగా కలిసి జీవించాలని అనుకునే వారి స్వేచ్చను ఆక్షేపించలేవు. తనకిష్టమైన వ్యక్తితో కలిసి జీవించాలని అనుకునే మేజరైన ఏ వ్యక్తి నిర్ణయమైనా వ్యక్తిగత స్వేచ్ఛను పొందే హక్కును కలిగి ఉండడమే అవుతుంది. ఈ హక్కును ఉల్లంఘిస్తే, అతడు/ఆమె యొక్క జీవించే, వ్యక్తిగత స్వేచ్ఛను కలిగి ఉండే ప్రాథమిక హక్కును ఉల్లంఘించడం కిందికే వస్తుంది''.
కానీ రాజ్యాంగ నిబంధనలు ఏవీ ఆదిత్యనాథ్కు పట్టవు. ఆయన, తన సంఘ్ పరివార్లు అత్యంత హేయమైన నేరాలుగా పరిగణించే మత మార్పిడి (హిందూ మతం నుంచి ఇతర మతాలకు), హిందూ మహిళలు, ముస్లిం పురుషుల మధ్య జరిగే మతాంతర వివాహాలకు కట్టుబడి ఉండే వారిపై క్రూరమైన శిక్షలను విధిస్తూ ఇబ్బందుల పాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. దాని ఫలితంగానే, నవంబర్ 28న The Uttar Pradesh Prohibition of Unlawful Conversion of Religion Ordinance, 2020ను అధికారికంగా ప్రకటించారు.
అప్పటి నుంచి, రాష్ట్రంలో ఆర్డినెన్సును తీసుకొని రావడానికి ముందే మతాంతర వివాహాలు చేసుకున్న వారితో పాటు ప్రస్తుతం మతాంతర వివాహాలు చేసుకునే వారిని కూడా వర్ణనాతీతమైన బాధలకు గురి చేస్తున్నారు. మతాంతర వివాహాలు చేసుకున్న జంటలపైన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ముస్లిం మతానికి చెందిన పురుషులు, వారి బంధువులపై చెయ్యి చేసుకుంటూ, వారిని జైళ్ళకు పంపు తున్నారు. అలాంటి అనాగరిక చర్యలకు గురైన గర్భిణి స్త్రీలు గురై, గర్భ స్రావం ద్వారా బిడ్డలను కోల్పోయారు. వీధుల్లో బంధువులు ఈడ్చుకుంటూ తీసుకొని వస్తున్న మహిళలు, కొట్టుకుంటూ, తన్నుకుంటూ ఈడ్చుకొని తీసుకొస్తున్న యువకుల చిత్రాలు తీవ్రమైన ఆందోళనను కలిగిస్తున్నాయి.
ముస్లింలను లక్ష్యం చేస్తున్న క్రమంలో, ఆదిత్యనాథ్ ఇటీవలి చర్యలు అనేక మంది హిందూ మహిళలను ఊహకందని విధంగా కష్టాలు, బాధలకు గురి చేశాయి. వారు ఒక విరుద్ధమైన సామాజిక వాతావరణాన్ని, వారి కుటుంబాల నుంచి దాడులను, ఒత్తిడులను, భజరంగ్ దళ్ నుంచి హింసాత్మక ముప్పును ఎదుర్కొనడంలో ప్రదర్శించిన ధైర్యం ఆశ్చర్యకరంగా ఉంది. వారు భాగస్వామిని ఎంపిక చేసుకునే తమ స్వంత హక్కును రక్షించుకోవడం కోసం మాత్రమే పోరాడడం కాకుండా, వారు మొత్తం భారతీయ మహిళల హక్కుల పరిరక్షణ కోసం కూడా పోరాటం చేస్తున్నారు. చారిత్రాత్మకంగా, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే మహిళల హక్కు చాలా సమాజాలలో పరిమితం చేయబడింది, కానీ అది భారతీయ సమాజంలో అత్యంత క్రూరమైన, అప్పుడప్పుడు హత్యాపూరితమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. ఇది రాజ్యాంగం ద్వారా కష్టపడి సాధించుకున్న హక్కు, కానీ నేటికి కూడా ఈ హక్కును భారతీయ మహిళలు అనుభవించడానికి ఇబ్బందిగా, ప్రమాదకరంగా మారిపోయింది. భారతీయ సమాజం కుల వ్యవస్థ (అంటే వర్ణాశ్రమధర్మం) అదుపులోనే కొనసాగు తుంది. మహిళలు వారి కులాలకు చెందిన వారిని పెండ్లి చేసుకుంటేనే ఈ వర్ణాశ్రమ ధర్మం ఉనికిలో ఉంటుంది.
అనేక మంది భారతీయులతో పాటు వారి సొంత అసమానతలకు హామీ ఇచ్చే ఈ లోపభూయిష్టమైన వ్యవస్థను సంరక్షించే భారం భారతీయ మహిళలపై మోపడం జరిగింది. వారి హక్కుల అమలుపై అనేక పరిమితులు విధించేందుకు ఈ వ్యవస్థ హామీ ఇస్తుంది.
సంఫ్ు పరివార్ రాజ్యాంగం పట్ల ప్రదర్శిస్తున్న విముఖత, మనుస్మతి పట్ల కనపరుస్తున్న ఆరాధన, ఈ తప్పుడు వ్యవస్థను మహిళా హక్కుల పట్ల భయంకరమైన వ్యతిరేకిగా మార్చింది. మహిళల హక్కులను అడ్డుకొనే మనువు సిద్ధాంతం, భారతీయ సమాజంలోని కులాల పట్ల ఉన్న విస్తతమైన అంగీకారం, రాజ్యాంగ హక్కులపై దాడులు చేయడానికి సంఘ్ పరివార్కు సామాజిక అనుమతిని సమకూర్చుతున్నాయి. ఈ అనుమతులు కేంద్రంలో, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక బాగా తీవ్రమవుతున్నాయి.
ఉన్నత కులానికి చెందిన మహిళలు, తక్కువ కులానికి చెందిన వారిని, లేదా ముస్లింలను కుల, మతాంతర వివాహాలు చేసుకున్న వారికి పుట్టే పిల్లల గురించి మనుస్మతికి స్పష్టమైన అభిప్రాయం ఉంది. ''ఇలాంటి కుల, మతాంతర వివాహాలు చేసుకున్న మహిళలను వారి తల్లిదండ్రులతో సహా క్రూరంగా శిక్షించాలి''. సంఘ్ పరివార్ హిందూ ఐక్యతను నిర్మించాలని తన నిబద్ధతను ప్రకటిస్తుంది, కానీ మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రతీరోజు 'పరువు' పేరుతో జరిగే నేరాలకు వ్యతిరేకంగా సమగ్రమైన శాసనాలను చేయడాన్ని మాత్రం సంఘ్ అడ్డుకుంటుంది. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలను, ఆదిత్యనాథ్ ఆర్డినెన్సు ద్వారా తెచ్చిన చట్టాలకు సంఘ్ పరివార్ అరుపులతో కూడిన మద్దతును ప్రకటిస్తుంది. కానీ హిందూ మతంలో అనేక కులాలకు చెందిన వారిపై 'పరువు' పేరుతో చేస్తున్న దాడులు, హత్యల గురించి మాట్లాడకుండా మౌనం వహిస్తుంది.
వర్ణాశ్రమ ధర్మాన్ని తన ఆదర్శవంతమైన సామాజిక ఏర్పాటుగా సంఫ్ుపరివార్ అంగీకరిస్తుంది. కానీ 'తక్కువ' కులానికి చెందిన హిందువులు మిలియన్ల సంఖ్యలో ఇస్లాం, క్రిస్టియన్ మతాలను స్వీకరించడానికి సంఫ్ు బాధ్యత వహించడాన్ని, వివేకానందుడు కూడా గుర్తించి, చాలా తీవ్రంగా విమర్శించాడన్న చారిత్రక సత్యాన్ని సంఘ్ పరివార్ ఖండిస్తుంది. మహిళలు, వారి పాత్ర అవగాహనపై మనుస్మతికి స్పష్టత ఉంది. ''మహిళలు ఎల్లవేళలా పురుషుని అదుపులో ఉండాలి, ఆస్తిపై వారికి ఏ విధమైన అదుపు ఉండ కూడదు, సరియైన నిర్ణయాలు చేయలేరు కాబట్టి వారిని పరిమితులలోనే ఉంచాలి''.
హిందూ మహిళలు తొందరగా మోసపోతారని, వారిలో మూర్ఖత్వం ఉంటుందని, చిన్న పిల్లల చేష్టలు ఉంటాయని, కుల, మతాంతర వివాహాల గురించి జరిగే ప్రచారంలో చిత్రీకరిస్తారని, మనుస్మతి చెపుతుంది. ఇంతకాలంగా ఉన్న ఉద్దేశ్యం ఏమంటే : హిందూ మహిళల హక్కులను నిరాకరిస్తే, కుల వ్యవస్థ యొక్క స్వచ్ఛతను కాపాడే ప్రాథమిక బాధ్యతా నిర్వహణను మహిళలు కొనసాగిస్తారు.
ఆదిత్యనాథ్, సంఘ్ పరివార్కు మనువు 'సిద్ధాంతాల' పట్ల ఉండే నిబద్ధతకు బలమైన మద్దతుదారుడు. అందుకే ఉత్తరప్రదేశ్ లో మహిళల హక్కులు, జీవనోపాధి, భద్రతపై క్రూరమైన దాడులు జరుగుతున్నాయి. ప్రజాస్వామిక హక్కులు, కార్మిక, కర్షక హక్కులపై జరిగే దాడుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. ద్వేషపూరిత గోడలు, మత సమీకరణాలు బలపడుతున్నాయి. ప్రజల బాధలకు వ్యతిరేకంగా జరిగే పోరాటం ఈ గోడలను బద్దలు కొట్టాలి.
- 'ద వైర్' సౌజన్యంతో
- సుబాషిణీ ఆలీ
అనువాదం:బోడపట్ల రవీందర్,
సెల్: 848412451.