Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మహిళలపై లైంగికదాడులు. 9నెలల పసికందును కూడా వదిలిపెట్టని కామాంధులు సమాజంలో నిర్భయంగా తిరుగుతున్నారంటే, ఎంత సిగ్గుచేటు! ఒక దారుణం జరిగిన తరువాత టీవీలు, వార్తాపత్రికలు, మీడియా ఛానెల్స్ తమ ప్రసారాలతో హోరెత్తించడం, మహిళా సంఘాలు, ప్రజలు ఆగ్రహావేశాలు ప్రదర్శించడం మామూలై పోయింది. యువతైతే కొవ్వొత్తుల నీరాజనాలతో తమ సంతాపాన్ని తెలియజేయడం కూడా సర్వ సాధారణంగా మారింది. నేరస్తుల్ని ఉరి తీయాలని పబ్లిక్ డిమాండ్ చేయడం కొత్త దోరణి. ప్రభుత్వం కేసు దర్యాప్తు చేస్తోందని ప్రకటించ గానే హడావిడి తగ్గి పోవడం, తరువాత విషయం మరుగునపడిపోవడం, మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరిగేదాకా షరా మామూలే!. ఇలా ఎంతకాలం? మహిళలు మనుగడ సాగించడం ఎలా? ఇటు వంటి సంఘటనలు జరిగినప్పుడు మహిళలకు భయమే నీడలావెంటాడుతోంది. .
లైంగిక దాడి ఒక పాశవికచర్య. ఎప్పుడు ఏ ప్రమాదం మ(మృ)గాడి రూపంలో జీవితాన్ని కబళిస్తుందో తెలియని అగమ్యగోచర పరిస్థితి. కొన్ని సందర్భాలలో అత్యాచారానికి గురైన మహిళనే నిందిస్తున్నారు. ఇది ఇంకా భాధాకరమైన విషయం. హైద్రాబాద్ శివార్లలో జరిగిన దిశ సంఘటన మానవత్వమున్న అందరి హృదయాలను కలచివేసింది. ఐదుగురు కన్నతల్లులకి గర్భ శోకాన్ని మిగిల్చింది. నేరం చేసిన వారిని న్యాయపరంగా శిక్షించవలసిన ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసి.. ఇక, నేరాలు జరగవన్నట్టు సంకేతాలు ఇచ్చిన తీరు చూస్తుంటే హాస్యాస్పదంగా లేదూ!. మరి, దిశ సంఘటన తరువాత నేటి వరకు జరుగుతూనే వున్న అకృత్యాల మాటేమిటీ? ఇటీవల తొమ్మిది నెలల గర్భిణీపై జరిగిన అత్యాచారం ఎంత అమానుషం? అంతెందుకు పోయిన ఏడాది ఇదే మాసం డిసెంబర్లో లిఫ్ట్ ఇస్తానని విదేశీ మహిళపై లైంగిక దాడికి తెగబడిన ఘటన ఎంత దారుణం? ఇటీవల ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ ప్రాంతంలో జరిగిన సంఘటన హృదయాన్ని ఎంత కలచివేసిందో అందరికీ తెలిసిన విషయమే. ఇలా చెప్పుకుంటూపోతే కోకొల్లలు. అసలు వెలుగులోకే రాని నేరాలెన్నో. ఈ అఘాయిత్యాలకి అంతం లేదా?! ఇటువంటి కీచకులు, కామాంధులు ఉన్నంతకాలం స్త్రీలకు రక్షణ, స్వేచ్ఛ ఎక్కడుంటాయి? చట్టాలెన్నివచ్చినా, అమలులో చిత్తశుద్ధిలేని ప్రభుత్వాలతో ఏం ప్రయోజనం !?
మనలోనూ మార్పు రావాలి. స్త్రీల పట్ల గౌరవభావాన్నిపెంపొందించే విధంగా పిల్లల జీవితాన్ని తీర్చిదిద్దాలి. సినిమాలు, టీవీ సీరియళ్లు, వ్యాపార ప్రకటనల దోరణి మారాలి. స్త్రీ విలాస వస్తువు కాదని, మార్కెట్ సరుకు అంతకంటే కాదని చాటి చెప్పాలి. పిల్లలకు విద్యార్ధి దశ నుంచే ఈ విలువలు బోధించాలి. ప్రభుత్వాలు ఇలాంటి నేర ప్రవృత్తికి తావులేని విధంగా చర్యలు తీసుకోవాలి. నేరం జరిగిన తరువాత తీసుకునే చర్యలకంటే, నేరాలకే అవకాశమివ్వని చర్యలు చేపట్టాలి.
- సుజాత. పి.వి. ఎల్.
సైనిక్ పురి, సికిందరాబాద్.