Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవంబర్ 26న ప్రారంభమైన ఢిల్లీ సరిహద్దుల దిగ్బంధనం 42 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్నది. ఢిల్లీ చుట్టూ ఉన్న జాతీయ రహదారులన్నీ జన సముద్రంగా మారాయి. రహదారులన్నీ నూతన గ్రామాలను తలపిస్తున్నాయి. ఆందోళనకారులకు మద్దతుగా ప్రతిరోజూ లక్షల మంది శిబిరాలను సందర్శిస్తూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాముల వుతున్నారు. వంటలు వండుతున్నారు, వడ్డిస్తున్నారు. విభిన్నవర్గాలైనా ధనిక, భూస్వాములతో పాటు, వ్యవసాయ కార్మికులూ ఈ ఉద్యమంలో అంతర్భాగంగా ఉన్నారు. స్కీం వర్కర్ల నుండి సంఘటిత కార్మికుల వరకు, సాధారణ ఉద్యోగుల నుండి సైంటిస్టుల వరకు, క్రీడాకారులు, కళాకారులు, మహిళలు, విద్యార్థులు, వ్యాపారులు ఒకరేమిటీ, సమస్త తరగతుల సంగమంగా ఆ శిబిరాలున్నాయి. జనవరి 26 రిపబ్లిక్డే రోజు ఢిల్లీలో ట్రాక్టర్లతో జరిగే రైతుల పెరేడ్కు వేలమంది యువ మహిళలు ట్రాక్టర్లు నడపడానికి శిక్షణ తీసుకుంటున్నారు. హర్యానాలోని ఒక్క కేంద్రంలోనే 500 మంది యువతులు ట్రైనింగ్ శిబిరంలో శిక్షణ పొందుతున్నారు. మాజీ సైనికులే శిక్షణలిస్తున్నారట. పంజాబ్, హర్యాన, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైన రైతాంగ ఉద్యమం దేశవ్యాపితంగా ధారావాహికంగా విస్తరించింది. ప్రజా ఉద్యమంగా మారింది. స్వాతంత్య్రానంతరం జరిగిన మహౌన్నత ఘట్టాల్లో ఒకటిగా లిఖించబడుతోంది.
ఏకకాలంలో మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ బిల్లును ఎందుకు తెచ్చారు? ఈ బిల్లులకు ఉన్న అ:తసంబంధమేమిటి? అన్ని తరగతుల ప్రజలు రైతాంగ ఉద్యమంలో ఎందుకు అంతర్భాగమవుతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో చట్టాల వల్ల జరిగే విపత్తు ఏమిటి? ఈ ఉద్యమానికి అధికార టీఆర్ఎస్ మద్దతివ్వకపోతే బీజేపీ చట్టాల వల్ల తెలంగాణకు జరిగే విధ్వంసం ఏమిటి?
బీజేపీ చట్టాల వల్ల కలిగే వినాశనం అర్థం కావాలంటే దేశ, రాష్ట్ర వ్యవసాయ భౌతిక నేపథ్యం గుర్తు చేసుకోవాలి. దేశంలో 51 కోట్ల మంది ప్రత్యక్ష్యంగా, మరో 20 కోట్ల మంది పరోక్షంగా, మొత్తంగా 71 కోట్ల మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు. 40 కోట్ల ఎకరాల సాగు భూమి, 15 కోట్ల కమతాలతో, 68 శాతం చిన్న సన్నకారు రైతులతో నిండి ఉన్నది మన వ్యవసాయం. అలాగే రాష్ట్రంలో కోటి 60 లక్షల ఎకరాలు, 59 లక్షల కమతాలతో, 70 శాతం స్వయం ఉపాధి, స్వయం పోషకంగా తెలంగాణ వ్యవసాయం ఉన్నది. దళిత, గిరిజనులు సామాజిక అణచివేత వల్ల అత్యధికశాతం వ్యవసాయ కార్మికులుగా ఉన్నా, వారిలో కొద్ది మొత్తంగా ఉన్న రైతులు కూడా చిన్న, సన్నకారులే. పేదరైతులు ఆదాయాలు సగం వ్యవసాయం ద్వారా, మరో సగం కూలి, ఇతర ఉపాధి ద్వారా పొందుతారు. మన రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ అత్యధిక శాతం రైతులకు వ్యవసాయమనేది వ్యాపారం కాకుండా, జీవనోపాధిగా ఉన్నది. ప్రభుత్వాలు ఎన్నికల అవసరాల కోసమే అయినా.. రైతాంగానికి ఇస్తున్న రాయితీలు, మద్దతు లేకపోతే భారత వ్యవసాయ రంగం మనగలగడం అసంభవం, అసాధ్యం.
కానీ, నరేంద్రమోడీ తెచ్చిన వ్యవసాయక చట్టాల వల్ల వ్యవసాయ రంగంలో ప్రభుత్వ జోక్యం క్రమంగా కనుమరుగవుతోంది. బ్యాంకు రుణాలు, మద్దతు ధరకు కొనుగోళ్ళు, ఎరువు మందుల సబ్సిడీలు, నీరు, విద్యుత్, మార్కెట్, రవాణాలాంటి మౌలిక వసతుల కల్పన నుండి ప్రభుత్వం తప్పుకుంటోంది. రుణాల రద్దు, విపత్కర పరిస్థితుల్లో అందించే సహాయం ఉండదు. క్రమంగా ప్రధానమంత్రి కిసాన్ యోజన, రైతుబంధు లాంటి పథకాలు కూడా మాయమవుతాయి. ప్రభుత్వ మద్దతు ఉపసంహరించుకోవడంతో రైతు అప్పులపాలవుతాడు. గతిలేని స్థితిలో కంపెనీలకు తన భూములిచ్చి కూలిగా మారుతాడు. మరోవైపు వ్యవసాయంపై ఆధారపడ్డ కూలీలు, కౌలుదారులు, వృత్తిదారులు ఉపాధిపోయి పొట్టచేత పట్టుకుని పట్టణాలకన్నా పోవాలి లేదా రైతులతో కలిసి ఆత్మహత్యలన్నా చేసుకోవాలి. కాబట్టే ''తరతరాలుగా మేము ఈ నేలకు మా నెత్తురు ధారపోసాము. అవసరమైతే ఇప్పుడు మా శరీరాన్ని కూడా ఈ భూమికి ఎరువుగా అర్పిస్తాము తప్ప అదానీ-అంబానీలకు మాత్రం అప్పగించం'' అంటూ రైతాంగం గర్జిస్తోంది. వ్యవసాయానికి ప్రభుత్వ మద్దతు ఇవ్వడమంటే రైతులకే కాదు, వినియోగదారులకూ రక్షణగా నిలబడటం. దేశంలో 23 కోట్ల రేషన్కార్డులు, 85 కోట్ల మంది లబ్దిదారులు ప్రభుత్వాలు ఇచ్చే ఆహార ధాన్యాలపై ఆధారపడి జీవిస్తున్న దుస్థితిలో మనం ఉన్నాం. ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా కొనుగోళ్లు ఆపివేస్త్తే ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రశ్నార్థకమవుతుంది. కార్పొరేట్ కంపెనీల నుండి ఆహార ధాన్యాలను కొనుగోలు చేసి రేషన్షాపుల ద్వారా సరఫరా చేయాలి. ఇది సాధ్యపడేదేనా? మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలు బలహీనపడతాయి. నూటికి తొంబై మంది తమ ఆదాయంలో ముఖ్యమైన భాగం ఆహార ధాన్యాల వినియోగానికి వెచ్చించాలి. ధరలపై ప్రభుత్వ నియంత్రణ కాకుండా కార్పొరేట్లకు హక్కు ఇస్తే జరిగే విపత్తు ఊహించలేము. కాబట్టి ఈ చట్టాలు రైతాంగానికే కాకుండా వినియోగదారులందరికీ నష్టదాయకమే.
ఏక కాలంలో మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ బిల్లును తీసుకురావడంలోనే కార్పొరేట్ల ప్రయోజనాలున్నాయి. ప్రయివేటు వ్యవసాయ మార్కెట్లకు అనుమతిస్తూ తెచ్చిన వ్యవసాయక చట్టం వల్ల అంబానీ, ఆదానీల్లాంటి కార్పొరేట్లు లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చనే మోసపూరిత ముసుగు వెనుక కంపెనీలు ఎక్కడినుండైనా, ఎంతైనా కొనుగోలు చేయవచ్చు అనేది దాగుంది. కానీ వాటిని నిల్వ ఉంచుకోవడానికి 1955 నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టం అడ్డుపడుతోంది. ఇప్పటివరకు నిత్యావసర సరుకులుగా ప్రకటించిన అన్నింటినీ రద్దు చేసి, ఇక ఏ సరుకూ నిత్యావసర సరుకుగా ఉండదని బీజేపీ చట్ట సవరణ చేసింది. దీనివలన ఆదాని, అంబానీలాంటి వారు ఇక లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తులను నిల్వ ఉంచుకోవచ్చు. స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలు వ్యవసాయంలోకి ప్రవేశించేది నిత్యావసర వస్తువులను గుప్పెట్లో పెట్టుకుని కోట్లు సంపాదించడానికీ, విదేశాలకు ఎగుమతులు చేసుకోవడానికే. అంటే విదేశీ మార్కెట్లకు అనుకూలమైన పంటలను పండించాలి. అందుకే రైతులు కంపెనీలతో ఒప్పందం చేసుకునే చట్టం తెచ్చారు. వారు చెప్పిన పంటలు వేయాలి లేదా రైతు తట్టుకోలేక భూములు కంపెనీలకు వదిలేయాలి. కాబట్టి ఈ మూడు చట్టాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. కార్పొరేట్ల ప్రయోజనాలను సంపూర్ణంగా నెరవేర్చాలంటే మోడీ చట్టాలు ఒకేసారి అమలు చేస్తేనే సాధ్యపడుతుంది.
ఈ చట్టాల వల్ల రైతులతో పాటు, అన్ని తరగతుల ప్రజలు నష్టపోతారు. ధరలు ఆకాశానికంటుతాయి. ప్రభుత్వ సంస్థ అయిన విజయ మంచినూనె కేజీ రు.140లు ఉంటే, అదే మంచి నూనె ఇతర బ్రాండ్లు రు.180 నుండి 200 వరకు అమ్ముతున్నారు. ప్రభుత్వం వైదొలిగితే ప్రతి ధర రెట్టింపవుతుంది. వ్యవసాయ కార్మికులు, అసంఘటిత కార్మికులే కాకుండా ఉద్యోగులూ ఈ ధరల భారాన్ని మోయాలి. ఆహార పంటల స్థానంలో వ్యాపార పంటలు వస్తాయి. ఆహార దిగుమతులు పెరుగుతాయి. కృత్రిమ కొరతను కూడా సృష్టిస్తారు. 100 రోజుల ఉపాధి హామి పనులన్నీ వ్యవసాయానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పనకే ఉద్దేశించబడ్డాయి. చెరువుల పూడిక, ల్యాండ్ లెవలింగ్, లింక్ రోడ్లు, మొక్కలు నాటడం లాంటివి ఉన్నాయి. ప్రభుత్వం వ్యవసాయ మద్దతు ఉపసంహరించుకుంటే ఉపాధి హామీ పథకం క్రమంగా రద్దవుతుంది. కార్పొరేట్లకు వారి ఉపాధే తప్ప జనం ఉపాధి పట్టదు. కార్పొరేట్ వ్యవసాయం యాంత్రీకరణను పెంచుతుంది. ఉన్న వ్యవసాయ పనులు తగ్గుతాయి. వ్యవసాయ కూలీల పోటీతో వేతనాలపై ప్రభావం పడుతుంది. కూలి రేట్లు తగ్గుతాయి. పట్టణాలకు వలసలు పెరిగి, ఉపాధికి డిమాండ్ వచ్చి అసంఘటిత కార్మికుల వేతనాలు పడిపోతాయి. పేద రైతుల భూములను కారుచౌకగా కొనేయడం, లాగేసుకోవడం సులభమవుతుంది. అసైన్మెంట్ భూములు కంపెనీల వశమవుతాయి. ప్రభుత్వ భూములు సాగుచేసుకునే వాళ్ళకు పట్టాలు లేవనే సాకుతో బయటకు నెడతారు. హార్టికల్చర్, ఎగుమతి ఆధారిత పంటలకు సౌలభ్యమైనవని చెప్పి, హక్కులు లేవని పోడు భూములనుండి ఆదివాసీలను, ఇతర పేదలను తొలగిస్తారు. పేదలకు భూములన్నీ కంపెనీల భూములుగా మారిపోతాయి. విద్యుత్ బిల్లు వల్ల సబ్సిడీలు పోతాయి. సామాజిక అంతరాలు విస్తరించి ఆధిపత్య కులాల పెత్తనం మరింత పెరుగుతుంది. చివరకు రాజ్యాంగంలో ఇచ్చిన జీవించే హక్కు హరించబడుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ చట్టాలు పెను ప్రమాదాన్ని తెస్తాయి. ఉమ్మడి జాబితాలో ఉన్న వ్యవసాయం, అనుబంధమైన విద్యుత్ లాంటివి కేంద్రం పెత్తనంలోకి పోతాయి. అన్ని రాష్ట్రాల లాగే మన రాష్ట్రం కూడా కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి గురవుతుంది. రాష్ట్రంలో 278 రెగ్యులేటరీ మార్కెట్లల్లో రైతులు స్వయంగా పంటలను అమ్ముతున్నారు. రైతులకు కొద్దో, గొప్పో సహాయపడడానికి 22వేల మంది మార్కెట్ సిబ్బంది ఉన్నారు. మార్కెట్ సెక్రటరీ ద్వారా రైతులకు ఎంఎస్పీ ఇప్పించడానికి కొంత అయినా జరుగుతోంది. ఒకశాతం మార్కెట్ సెస్ వల్ల వీరికి వేతనాలు ఇవ్వడంతో పాటు, ఇప్పుడు రు.300 కోట్ల మార్కెట్ నిధి నిల్వ ఉన్నది. ప్రయివేటు మార్కెట్లొస్తే బిఎస్ఎన్ఎల్ వలే ప్రభుత్వ మార్కెట్లన్నీ ధ్వంసమవుతాయి. ఐకేపీ కేంద్రాలు మూతపడతాయి. లక్షల మంది డ్వాక్రా మహిళల ఉపాధి పోతుంది. రైతులే కాదు, లక్షలాదిగా ఉన్న హమాలీల బతుకులు రోడ్లపాలవుతాయి. ప్రయివేట్ వారు మార్కెట్లపై ఆధారపడకుండా ఈ-ప్లాట్ఫారాల ద్వారా కొనుగోలు చేస్తారు. పూర్తి యాంత్రీకరణ జరుగుతుంది. ప్రభుత్వం వల్ల 60-70 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఎఫ్సీఐ కొనుగోలు చేస్తున్నది. పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తున్నది. తెలంగాణలో ప్రతి సంవత్సరం 7.5 లక్షల విలువైన వ్యవసాయక ఉత్పత్తులు వస్తున్నాయి. చాలా పంటల్లో ఇప్పటికే ఎంఎస్పీ 10శాతం తగ్గించి ఇస్తున్నారు. అంటే రు.7500 కోట్లు రైతులకు తెలంగాణలో నష్టం వస్తోంది. ప్రయివేట్ మార్కెట్లొస్తే రు.15 నుండి 20వేల కోట్ల నష్టం కనీసంగా ఉంటుందని వ్యవసాయక ఆర్థిక వేత్తలు విశ్లేషణ చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలను పెట్టుబడిదారులు పట్టించుకోరు. ఒప్పంద వ్యవసాయం వల్ల ఇప్పటికే తెలంగాణలో సీడ్ రైతుల అనుభవాలున్నాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో 50వేల ఎకరాల భూమిలో 25వేల మంది రైతులు సీడ్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. కంపెనీలు ఒక ప్రమోటర్ ద్వారా అప్పులిప్పించి 'ఐక్యం' పేరుతో రైతుల భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఒప్పందం మేరకు నాణ్యత లేదనే పేరుతో సగానికి సగం కత్తిరిస్తున్నారు. బీపీఎల్ పంట అంతా కొంటామని చేసుకున్న ఒప్పందాలు అమలు చేయడంలేదు. సుబాబులు, జామాయిల్ టన్నుకు రు.4500లు అని చెప్పి రు.2500 నుండి 3000లకే కొట్టేస్తున్న ఘటనలు అనేకం. పైరవీకారుల చేతివాటం ఎంతుందో తెలంగాణ రైతులకు తెలియంది కాదు.
ప్రభుత్వ జోక్యం ఉండడం వల్ల రుణ ప్రణాళిక ద్వారా రు.53వేల కోట్లకు పైగా రైతులకు బ్యాంకు రుణాలు తెలంగాణలో వస్తున్నాయి. ఈ చట్టాలు వస్తే రుణాలు ఉండవు, ప్రణాళికలు ఉండవు. తెలంగాణ భూబాగం సముద్ర మట్టానికి ఎత్తులో ఉండడం వల్ల మనం గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారానే వినియోగించుకోవాలి. తెలంగాణకు కరెంట్ ఆయువు. ఇప్పటికే 55వేల మిలియన్ యూనిట్లు తెలంగాణలో వినియోగం అవుతుంటే, అందులో 12వేల మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నారు. కోటి 55 లక్షల కరెంట్ కనెక్షన్లు ఉంటే, అందులో 25 లక్షలకు పైగా వ్యవసాయ కనెక్షన్లే ఉన్నాయి. 55 లక్షల కనెకన్ల వినియోగదారులు కరెంటు బిల్లు యూనిట్కు రు.1.40 నుండి 2.50కి ఇప్పుడు చెల్లిస్తున్నారు. క్రాస్ సబ్సిడీ ఉండడం వల్ల ధనవంతుల నుండి కొంత ఎక్కువ వసూలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ బిల్లు వల్ల రాష్ట్ర రెగ్యులేటరీ అధికారాలు కేంద్రం చేతుల్లోకి పోతాయి. ఉచిత కరెంట్ ఇవ్వడానికి వీల్లేదు. మన రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుకే 5వేల మెగావాట్ల విద్యుత్ కావాలి. పాలమూరు ఎత్తిపోతల పథకానికి మరో రెండున్నర వేల మెగావాట్లు, సీతారాం ప్రాజెక్టుకు 1500 మెగావాట్లు, మొత్తంగా 13వేల మెగావాట్లు నీటి ఎత్తిపోతల పథకానికి అవసరముంది. చివరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం నిర్ణయించిన ధరకే విద్యుత్ కొని వినియోగించాలి. ఈ చట్టమే అమలులోకి వస్తే నీటి వనరుల ఎత్తిపోతల పథకాలకే సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు కావాలి. చివరకు ఈ ప్రాజెక్టుల మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. కాబట్టి ఈ చట్టం వల్ల భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రమే ఎక్కువ నష్టపోతుంది.
టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ బంద్కు మద్దతిచ్చి ఇప్పుడు మాట్లాడకుండా నోరు కుట్టేసుకుంటే బీజేపీ చట్టాల వల్ల విధ్వంసాలకు గురయ్యే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలోనే ఉంటుంది. రాష్ట్రం సాధించడంలో ముందున్నానని చెప్పుకోవడమే కాదు, ప్రజలకు మరణశాసనం రాస్తున్న ఈ చట్టాల రద్దుకు ముఖ్యమంత్రి ముందుండి పోరాడాలి. ప్రజలా, కార్పొరేట్లా ఎవరు కావాలో నిర్ణయించుకునే సమయం టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుంది. రైతులు చేపట్టిన ఉద్యమం రాజకీయ అనుబంధాలను పక్కన పెట్టి ఐక్య ఉద్యమంగా మారింది. జాతీయ ఉద్యమం ఘటనలను గుర్తుకు తెస్తోంది. దేశ భక్తిని ప్రేరేపిస్తోంది. మనుగడ కోసం సాగే ఈ మహౌద్యమంలో మనమూ ముందుండాలి.
- బి వెంకట్