Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధర్మపాలకుడు, ధర్మ పరిరక్షకుడు, ధర్మం నాలుగుపాదాలా నడిచింది - అనే మాటలు తరచూ వింటూ ఉంటాం! అంటే ఏమిటి? ధర్మం నాలుగు పాదాలా నడవడంకాదు, అది సమాజాన్ని నాలుగు వర్ణాలుగా విడగొట్టడం! ధర్మం అనేది ఏమైనా నాలుగు కాళ్ళమీద నడిచే జంతువా? కాదుగదా? సమాజాన్ని నాలుగు వర్ణాలుగా విడగొట్టిన వైదిక ధర్మం, అంతా సజావుగా ఉంది - అని తనను తానే పొగడుకోవడం. నాలుగు కులాలకు నిర్దేశించిన వృత్తులు ఎవరికి వారు చేస్తూ ఉండటం. అంటే స్వధర్మాలైన కుల వృత్తులుచేసుకుంటూ ఉండటం, వర్ణసంకరం లేకుండా ఉండటం - ధర్మం నాలుగు పాదాల మీద నడవడమంటే ఇదే!! బ్రాహ్మణ కులానికి చెందిన పుష్యమిత్ర శృంగుడి నుండి శూద్ర కులస్తుడైన శ్రీకృష్ణ దేవరాయలు దాకా అందరూ 'ఆగమ ప్రియుడు' అనే బిరుదు కూడా వారికి వారే ప్రకటించుకున్నారు. 'ఆగమశాస్త్ర'మంటే - వర్ణవ్యవస్థను బలపరిచేది. దానికి ప్రియుడుకావడమంటే - సమాజంలోని నిచ్చెనమెట్ల వ్యవస్థను బలపరచడం.. దాన్ని ఇంకా కొనసాగించడం! 'స్వధర్మం - నిధనం - శ్రేయం' అని గొప్పగా చెప్పుకున్నారు. ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను బౌద్ధ, జైన ధర్మాలు నిరసించాయి. అంతే కాదు, ఆధునిక వైజ్ఞానిక - జన్యుశాస్త్ర పరిశోధనలు కూడా ''మానవ జాతి అంతా ఒక్కటే''నని ఘోషిస్తున్నాయి. ధర్మం పేరుతో బానిసత్వం కాదు, న్యాయం, సచ్ఛీలత, నిబద్దతా, సమానత్వం కావాలి!
1927 డిసెంబర్ 25న మహారాష్ట్రలోని మహద్ గ్రామంలో వేలాది మంది వాలంటీర్ల సమక్షంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 'మనుస్మృతి' గ్రంథం ప్రతుల్ని దహనం చేశారు. ఆ సందర్భంలో అక్కడ వారు చేసిన ప్రతిజ్ఞ ఇలా ఉంది.
1.చాతుర్వర్ణ వ్యవస్థను విశ్వసించను. 2. కుల వ్యత్యాసాలను అంగీకరించను. 3. హిందూ సమాజానికి శాపంగా ఉన్న అంటరానితనాన్ని అంతం చేసేందుకు కృషి చేస్తాను. 4. హిందువుల్లో ఆహారం - పానీయం వంటి విషయాల్లో ఎలాంటి నిషేధాలను పాటించను. 5. ఆలయాలు, నీటి వనరులు, పాఠశాలలు వంటి సదుపాయాల విషయంలో అస్పృశ్యులు అనబడే వారితో సహా అందరికీ సమాన హక్కులు ఉంటాయని నమ్ముతున్నాను.
ఇలాంటి అవగాహన ప్రజల్లో విస్తృతంగా వ్యాపించడానికి 'మనుస్మృతి' వ్యతిరేక ఉద్యమం పనిచేసింది. పని చేస్తూనే ఉంది. ఇలాంటి స్థితిలో ఎవరైనా తమ కులం, తమ మతం గురించి మాట్లాడుతున్నారంటే - వారి మానసిక స్థితి సరిగా లేదనుకోవాలి! ఒకసారి పెరియార్ అన్నారు ''మతాన్ని పాటించే వ్యక్తి నుంచి ఎలాంటి హేతుబద్ధమైన ఆలోచనని ఆశించలేం. అతడు నీటిలో తేలుతూ అటూ ఇటూ ఊగే మొద్దులాంటివాడు'' - అని. మన వాళ్ళే కాదు, విదేశీయులు కూడా మతం గురించి హెచ్చరిస్తూనే వచ్చారు. ''మతాలను ప్రశ్నించే సాహసం చేయకపోతే చివరకు అవి మన స్వేచ్ఛా స్వాతంత్రాలను హరిస్తాయి'' - అని విలియం హెచ్. రెనాల్డ్స్ ప్రపంచ పౌరుల్ని హెచ్చరించాడు. ఇతను హేతువాద ఉద్యమాలతో సంబంధం ఉన్నవాడేమీ కాదు. అమెరికాలో ఫిల్మ్ ఎడిటర్. ఒక సామాన్యుడిగా తన భయాన్ని అలా వ్యక్తీకరించాడు. దేశానికి స్వాతంత్య్రం రాకముందు పరిస్థితి ఎలా ఉన్నా, వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలేవీ కుల, మతాలను, వాటి చుట్టూ అల్లుకున్న మూఢ నమ్మకాల్ని పట్టించుకోలేదు. కొందరు మహానుభావులు తమ పరిధిలో జీవితాలు త్యాగం చేస్తూ వచ్చారు. కొన్ని సంస్థలు కృషి చేస్తూ వచ్చాయి. ఈ సమాజ బలహీనతల్ని ఆసరా చేసుకుని, నిచ్చెన మెట్ల సంస్కృతిని,, మనుస్మృతిని మళ్ళీ బలోపేతం చేయాలని ప్రస్థుతం అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆ ప్రయత్నాన్ని వివేకవంతులైన ఈ దేశ ప్రజలు సాగనివ్వరు. సమర్థవంతంగా ఎదుర్కుంటారు. ఎందుకంటే, ఈ ''ధర్మ'' శాస్త్రాలు చెప్పేది అగ్రకులస్తులపట్ల నిమ్నకులాల వారు విధేయులుగా ఉండాలనీ.. బానిసత్వం వర్థిల్లుతూ ఉండాలనే కదా? ఈ 21వ శతాబ్ది వైజ్ఞానిక సమాజంలో అది సాధ్యమా?
''గదిలో చీకటిగా ఉంటే ఎంత ప్రార్థన చేసినా వెలుగురాదు. వెలుతురు కోసం లైటు వేసుకోవాల్సిందే!'' నని సింపుల్గా చెప్పాడు థామస్ ఫెడరిక్ లిమ్. ఆయన ప్రసిద్ధ సైకోథెరపిస్ట్. 'స్టేయింగ్ సేన్' - అనే ప్రసిద్ధ గ్రంథ రచయిత. అందరూ శారీరక దృఢత్వం కోసం వ్యాయామాలు చేస్తారు కానీ, మేధస్సుకు సంబంధించి, మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఎవరూ శ్రద్ధ వహించడం లేదని ఆయన ఆ గ్రంథంలో ప్రకటించారు. 'లైటు వేసుకోవాల్సిందే' - అని అనడంలో చాలా అర్థం ఉంది. సంకెళ్ళుంటే తెంపుకోవాల్సిందే - అణచివేతుంటే పోరాడాల్సిందే. అంధ విశ్వాసాలుంటే వదులుకోవాల్సిందే. అసమానతలుంటే నేలమట్టం చేయాల్సిందే. నిచ్చెన మెట్ల వ్యవస్థను విరగ్గొట్టాల్సిందే. రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు కదలాల్సిందే. ''లైటు వేసుకోవాల్సిందే'' - చీకట్లను పారద్రోలాల్సిందే - అన్నదాంట్లో చాలా అర్థాలున్నాయి.
ఒక్క హిందూ మతంలోనే కాదు, ఇతర మతాలలో కూడా మూర్ఖత్వం అదే స్థాయిలో ఉంది. ఉదాహరణకు ఇక్కడ ఒక పాస్టర్ చేసే గిమిక్కు చూడండి! - ఒక యువకుని గుండెకు గురిచూసి పిస్టల్ పేల్చినప్పుడు ఆయ యువకుడు కుప్పగూలి పోయాడు. అతను చనిపోయాడని అందరూ భావించారు. కానీ, ఆ యువకుడు తటాలున లేచి, తన గుండెపై ఉన్న బైబిల్ తెరచి చూశాడు. తుపాకీ గుండు బైబిల్ను చీల్చుకుంటూ వెళ్ళి ఒక పేజీ దగ్గర ఆగిపోయింది. ఆ పేజీలో ఈ విధంగా రాయబడి ఉంది.. ''నీ ఎడమ పక్క వేయి మంది పడిననూ, నీ కుడి పక్క పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు - ఆమెన్! హలేలూయా - ఇట్టి సాక్ష్యమును దేవుడు మనకందరికీ కలిగించు గాక-'' అని!
ఇదే నిజమైతే బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు తయారు చేసే ఫ్యాక్టరీలన్నీ మూసేయ్యాలి. అవెందుకూ దండగ? బుల్లెట్ పేలిన ధ్వని టేప్రికార్డర్లో పెట్టి ఒక సీన్ క్రియేట్ చేసి, డ్రామాలాడి - జనాన్ని మభ్యపెట్టినందువల్ల ఏం సాధించగలరూ? ఇలాంటి ప్రదర్శనలు పెద్ద పెద్ద హాళ్ళలో ఎందుకూ? చేతనైతే పోయి యుద్ధ భూమిలో చేయాలి. మన సైనికులు అమరులు కాకుండా ఉంటారు. లేదా పోలీసు ఎన్కౌంటర్లు జరిగేచోట చేసి చూపాలి. పాస్టర్ శక్తి సామర్థ్యాలు లోకానికి తెలుస్తాయి. చచ్చిన వాళ్ళను బతికించే ప్రక్రియ పెయిడ్ కళాకారులతో రక్తికట్టిస్తారు తప్ప, ఆస్పత్రులకు వెళ్ళి చావు బతుకుల్లో ఉన్న రోగులను బాగు చేయరు. అదివారి వల్ల కాదు. అబద్దపు బతుకులు బతికేవారు అబద్దపు నాటకాలాడి పొట్టపోసుకోవాల్సిందే! ఆకలి అయినప్పుడు బిచ్చగాళ్ళు నిజాయితీగా చిప్ప పట్టుకుని బిచ్చమెత్తుకుంటారు. వారి కాలిగోటికి సరిపోరు కదా? ఈ మత ప్రచారకులు? మత ప్రదర్శకులు? ఇలాంటివారిని, ఇలాంటి సంఘటనల్ని చూసే ఇంగ్లీషు నటి జానీ జోన్స్ ఇలా అన్నారు.. ''నేను పిచ్చాసుపత్రులను, చర్చిలను కూడా సందర్శించాను. రెండు చోట్లా మనం వాళ్ళుచెప్పింది వినాల్సిందే! మనం చెప్పేది వాళ్ళు వినరు!'' అని. భారత ప్రధాని 'మన్ కి బాత్' కూడా అలాంటిదే! ఆయన చెప్పింది వినాల్సిందే. దేశ ప్రజల మాట ఆయన వినరు. అయితే తను చెప్పేదంతా దేశ ప్రజలు వింటున్నారన్న భ్రమలో ఆయన ఉన్నారేమో - తను చేసే గిమిక్కు జనం నమ్ముతున్నారని పాస్టర్ అనుకున్నట్టుగా? నియోలాటిన్ కవి ఆంథోని ఆల్సోప్ అన్నట్టుగా నిజమే - ''మతమంటే మరణాంతర రక్షణ పేరుతో జరిగే ఒక పెద్ద స్కామ్!''
మతాలను నిలబెడుతున్న దేవుడు, స్వర్గం, నరకం, పుణ్యం, పాపం, మోక్షం, కర్మ, తలరాత, విధిరాత అన్నీ గుడ్డి నమ్మకాలే - అందుకే ప్రశ్నించడం ఈ మతాలకు నచ్చదు. అసలే జవాబులు వాటిదగ్గర ఉండవు. అందువల్ల ప్రశ్నలు ఎదుర్కోవడమంటే వాటికి చిరాకే కదా? జవాబుల్లేవని ఒప్పేసుకునే చిత్తశుద్ధి కూడా వాటికి ఉండదు. అందుకే, మహారాష్ట్రలోని రాజకీయ పార్టీ శివసేన వారి అధికారిక పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో ఈ మధ్య ఇలా రాసుకుంది.. ''ప్రజలు కోర్టుల్లో ప్రమాణం చేసేప్పుడు మత గ్రంథాలపై కాకుండా రాజ్యాంగంపై ప్రమాణం చేయాలనీ, అలా చేస్తే దేశం నుంచి మత రాజకీయాల్ని తరిమేయవచ్చని - రాజ్యాంగం అన్ని మతాల వారికీ విలువైంది కాబట్టి, మత గ్రంథాల కన్నా రాజ్యాంగమే ఉన్నతమైందన్న విషయం లోగడ బాల్థాక్రే కూడా చెప్పేవారనీ'' - ఆ పత్రిక రాసుకుంది. ఈ విషయంలో పూర్తి వాస్తముంది కానీ, అలాంటి రాజకీయ పార్టీయే తన ఆలోచనా ధోరణిలో మార్పులు చేసుకుని, ఇతర రాజకీయ పార్టీలకు ఆదర్శప్రాయంగా ఉంటే ఆనందించాల్సిన విషయమే!
ఈ మధ్య మనదేశంలో ఒక విచిత్రం జరిగింది. ''హిందూ పదానికి అర్థం ఏమిటని, నిర్వచనం ఏమిటని'' - మధ్యప్రదేశ్కు చెందిన ఒక ఉద్యమ కారుడు చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం ద్వారాకోరాడు. హిందూ అనే పదానికి ప్రభుత్వంలోని ఏ శాఖ వద్దా సరైన నిర్వచనంలేదనీ.. సెంట్రల్ పబ్లిక్ ఇన్నర్మేషన్ ఆఫీసర్ నుంచి సమాధానం వచ్చింది! హిందూ అనే పదానికి అర్థమే లేదని వచ్చిన సమాధానంతో అందరూ నోరెళ్ళబెట్టారు. హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని కుటిల రాజకీయాలు చేస్తున్న మనువాదులు - గతంలో రచించిన రక్తచరిత్రను భారతదేశ పౌరులు తిరస్కరించారు. అది ఇటీవలి పౌరసత్వ చట్టమైనా, ఇప్పటి రైతు వ్యతిరేక చట్టాలైనా జనం తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యతిరేకిస్తూనే ఉంటారు. బెంగాల్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఎవరైనా పొడుగ్గా గడ్డం పెంచినంత మాత్రాన వారు విశ్వకవులు కాలేరు. పది తప్పినవాడు పది తప్పినవాడిలాగానే ఉంటాడు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా పంజాబ్కు చెందిన శాస్త్రవేత్త వరీందర్ పాల్ సింగ్, సాయిల్ కెమిస్ట్ కేంద్ర మంత్రి సదానందగౌడ చేతుల మీదుగా సెప్టెంబర్ 11, 2020న న్యూఢిల్లీలో అందుకోవాల్సిన అవార్డును ఆ వేదికమీదే తిరస్కరించారు. రైతులకు తన సంఘీభావం తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు - ధర్మం నాలుగు పాదాలా నడుస్తూ ఉందన్న భ్రమలో ఉందామా? మనువాదుల అహంకారం - నిచ్చెనమెట్ల కుల సంస్కృతిని, మత సంప్రదాయాల్ని నిలబెట్టాలని చూస్తున్నప్పుడు - సామాన్య పౌరులు ఏం చేయాలీ? వారి ఆటలు అలాగే సాగనివ్వాలా? లేక 'మానవజాతి అంతా ఒక్కటే'నని నినదించాలా? మరీ ముఖ్యంగా సైన్సు ఉపకరణాలే లేకుంటే మతం, ఆధ్యాత్మికత, స్వస్థత - అంటూ మూఢత్వ ప్రవచనాలు చెప్పే వాళ్ళంతా ఏనాడో అడ్రసు లేకుండాపోయేవారు. అవునా? కాదా? ఎవరికి వారు నిజాయితీగా విశ్లేషించుకోవాలి!
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్.