Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిండి తినాలంటే పంట పండించాలి... పంట పండించాలంటే రైతు బత కాలి... రైతును బతికించు కుంటేనే మనం బతు కుతాం. దేశం బతుకు తుంది.
ఈ జ్ఞాన సూక్ష్మం పాలకులకు బోధపడటం లేదంటే ఏమనుకోవాలి?
అందుకే బాలబాలికలు సైతం ఎక్కడికక్కడ 'నోఫార్మర్స్-నోఫుడ్' (రైతులు లేకపోతే తిండి ఉండదు) అని ప్లేకార్డ్స్ పట్టుకుని నినదిస్తూ ఉద్యమ బాటన ఉరుకుతున్నారు.
గడ్డకట్టే చలిలో రైతులు ఢిల్లీ ఉద్యమ బాటపట్టి నలబై దినాలకు పైగా కావస్తున్నది. దాదాపు 50మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. జబ్బుల్ని, బాధల్ని లెక్కచేయడం లేదు. లాఠీ దెబ్బల్ని, నీటి ఫిరంగుల్ని తట్టుకుంటున్నారు. వర్షం వచ్చి నిలువనీడలేకుండా నేలను చిత్తడి చేసినా వెనుతిరగమంటున్నారు. అయినా పాలకులు సిగ్గుపడకపోవడం శోచనీయం.
తమను మరణశయ్యపై పరుండబెట్టే మూడు వ్యవసాయ చట్టాలను భేషరతుగా వెనక్కి తీసుకునేంతవరకు మడమతిప్పేది లేదని రైతులు ఎప్పటికప్పుడు తెగేసి చెపుతున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి -రైతునేతలకు ఎనిమిదో దఫా జరిగిన చర్చలు కూడా ప్రతిష్టంబనతో అటకెక్కాయి. దొంగే 'దొంగ దొంగ' అని అరిచినట్లు.. రైతులు మొండిపట్టుతో ఉన్నారని మంత్రులు వితండవాదం చేస్తున్నారు. పెంపుడు కుక్క మీడియా కూడా తానా అంటే తందానా అంటున్నది.. కొన్ని పత్రికలు, చానళ్ళు అసలు ఇది వార్తే కాదన్నట్టు వ్యవహరిస్తున్నాయి.
2000 సంవత్సరంలో విద్యుత్ ఉద్యమం జరుగుతున్నప్పుడు నాటి చంద్రబాబునాయుడు జరిపిన విద్యుత్ కాల్పుల్లో ముగ్గురు వీరులు బలైపోయిన విషయం తెలిసిందే. అప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షనేతలు.. ''విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ ముగ్గురి బలిదానం జరిగింది. అత్యున్నతమైన ప్రాణత్యాగం (సుప్రీం శాక్రిఫైజ్) చేశారు. అయినా చార్జీలు తగ్గించవా? ఇంకా ఏంచేస్తే మరి తగ్గిస్తావ్?'' అని నిలదీశారు. అయినా అప్పటి ప్రభుత్వం చలించలేదు.
అలాగే ఇప్పుడు పార్లమెంటు లేకపోయినా వామపక్ష ప్రజాస్వామ్య నేతలు ఎక్కడికక్కడ ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యం అవుతూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. రైతు ఉద్యమానికి మద్దతుగా ధర్నాలు, ఊరేగింపులు, బస్యాత్రలు, ట్రాక్టర్ ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూనే ఉన్నారు. అయినా పాలకుల్లో చలనం కలగడం లేదు.
స్వాతంత్య్రానంతరం ఇంతటి అహంకార ప్రభుత్వం ఎప్పుడూ లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మండిపడ్డారు. భేషరతుగా నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడమే చనిపోయిన రైతులకు మనం అర్పించే నివాళి అని అన్నారు. అదే రాజధర్మం అని కూడా ప్రకటించారు.
కోతులు ఎక్కడున్నా వాటి మూతులు ఒక్కటే అన్నట్టు నియంతలు ఎక్కడున్నా వారి ఆలోచనలు ఒక్కటిగానే ఉంటాయి. మానవీయ భావాలకు, ప్రజాస్వామ్య భావాలకు విలువ ఇవ్వరు. కపటనాటకాలు ఆడతారు. అందుకే నోబుల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ అన్నారు... భావి ప్రజాస్వామ్య ఉద్యమాలకు ఈ కిసాన్ ఉద్యమం మార్గదర్శిగా నిలుస్తుందని. అలా ఎంతోమంది మేధావులు, న్యాయవాదులు, పాత్రికేయులు, ఆర్థిక శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ఢిల్లీ కిసాన్ ఉద్యమాన్ని బలపరుస్తూనే ఉన్నారు. రోజు రోజుకి ఈ సంఘీభావ ఉద్యమం కూడా పదునెక్కుతున్నది. ''ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ (దారులన్నీ రోమ్ నగరం వైపుకే)'' అన్నట్టు ఇప్పుడందరూ ఢిల్లీ వంకే చూస్తున్నారు. ఢిల్లీవైపుకే నడుస్తున్నారు.
అయితే నియంత రాజ్యం ఎప్పుడూ హింసాయుతంగా ఆలోచిస్తూనే ఉంటుంది. తేనెపూసిన కత్తిలా వ్యవహరిస్తూనే ఉంటుంది. మరోపక్క రైతు ఉద్యమ సహనం చెలియల కట్ట తెగేలా ఉన్నది. ఆ ఓర్పు హద్దుమీరిన క్షణం.. ఊహించడానికి సైతం భయం కొల్పుతున్నది. కొందరు నేతలు అన్నట్టు ఈ సారి 26న గణతంత్రవేడుకల్లో రాజధాని ఢిల్లీ వీధుల్లో ప్రభుత్వ నిర్వహణలో జరిగే ఆయుధ సైనిక కవాతుకు సమాంతరంగా ట్రాక్టర్ల రైతు కవాతు కూడా చూడవలసి ఉంటుందేమో! అప్పుడు నిజంగా భారత కిసాన్ ఉద్యమం ఆధునిక చరిత్ర పాఠమవుతుంది.
- కె.శాంతారావు
సెల్: 9959745723