Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్యాలెండర్ మార్పుతో, 2020ని గుర్తుంచుకోదగిన సంవత్సరంగానూ, మర్చిపోదగిన సంవత్సరంగానూ మనం గమనించవచ్చు. బతకడానికి అవసరమైన కనీస వస్తువులను స్థిరంగా పొందినవారు మాత్రమే అదృష్టవంతులు. మిగిలిన వారు కేవలం తిండి, గూడు, చదువు కోసమే కాక, కోవిడ్కు సంబంధించిన భౌతిక దూరం లాంటి ముందు జాగ్రత్త చర్యలు, వ్యాధి సోకినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో కూడా చాలా పోరాడారు. కరోనా వైరస్ మానవ శరీర నిర్మాణాన్నే కాకుండా సామాజిక ఆర్థిక నిర్మాణాలకు కూడా అంతరాయం కలిగించింది. భారతదేశంలో 10.2 మిలియన్లుగా నమోదైన కేసులలో దాదాపు 1,49,000 మరణాలు సంభవించాయి.
కోవిడ్-19తో కోట్లాది మంది ప్రజలు చేసిన పోరాటం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. అంతేకాక మనం దానితో సమానంగా తీవ్రమైన నష్టాన్ని కూడా చవిచూశాం. ఫలితంగా భారతదేశం మరింత ఎక్కువగా నష్టపోయింది. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చేయగలిగింది చేస్తుందన్న విశ్వాసాన్ని, న్యాయ వ్యవస్థ పౌర హక్కులు, పౌర స్వేచ్ఛ కోసం సహాయం చేస్తుందన్న నమ్మకాన్ని కోల్పోయాయి.
భయంకరమైన కోవిడ్-19 నీడలో కూడా... మరింత ఆశ్రిత పక్షపాతిగా మారిన ప్రభుత్వం... అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజను ధైర్యంగా నిర్వహించింది. అంతకు మించిన ధైర్యంతో తప్పుడు సలహాలతో తలపెట్టిన సెంట్రల్ విస్టా నిర్మాణం కోసం ఢిల్లీలోని ముఖ్యమైన స్థలాలను, స్వాతంత్య్ర భారతదేశంలో గుర్తించదగిన ప్రజాస్వామిక ఆనవాళ్ళను కూల్చివేసింది. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, విద్యావేత్తలు, కార్యకర్తలపైన అనాగరిక చట్టాలను నిస్సిగ్గుగా ప్రయోగిం చింది. ఒకవైపు ఎన్నికల ప్రచారం నడుస్తుండగా... పార్లమెంటు సమావేశాలను, క్వశ్చన్ అవర్ను రద్దు చేసింది. దేశంలో కఠినమైన లాక్డౌన్ విధించడానికి ముందు భారత శ్రామిక ప్రజా సమూహానికి నాలుగు గంటల సమయం మాత్రమే ఇచ్చింది. న్యాయవ్యవస్థ పాలనా యంత్రాంగం పట్ల తన విశ్వాసాన్ని చూపింది. మీడియా ఉండాల్సిన తీరులో కాకుండా, అధికారానికి కాపలా కుక్కలా మారింది. భారతదేశంలోని అత్యంత సంపన్నులు మరింత ఉన్నత స్థాయికి చేరారు. ప్రజలు తమ ఉద్యోగాలనూ, ఆదాయాలనూ కోల్పోయారు. గృహ హింస విపరీతంగా పెరిగింది.
కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్ తెల్తుంబ్దే, గౌతమ్ నవలఖ తదితరులను జైళ్ళలో నిర్భంధించడం వలన వారి ఆరోగ్యాలు అక్కడే దిగజారుతున్నాయి. వీరి నిర్భంధం వెనుక ఎటువంటి హేతుబద్ధత లేకుండా పోయింది. ఈ నిర్బంధంలో ఉన్న వారికి కనీస అవసరాలైన కళ్ళజోడు, మంచినీటి సౌకర్యాన్ని సమకూర్చేందుకు కూడా జైలు అధికారులు నిరాకరిస్తున్నారు. పి.ఎం. కేర్స్ పేరుతో ప్రధాన మంత్రి కోట్ల రూపాయలను వసూలు చేశారు. కానీ ఏమాత్రం పారదర్శకత లేకపోవడంతో ఆ నిధులు అవసరంలో వున్నవారికి అందకుండా పోతున్నాయి. దీనివల్ల ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోవడం జరుగుతున్నది. మానవ సమాజంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యాపించి ఉన్న అసమానతల మధ్య పాటించాల్సిన సమతూకాన్ని కూడా కోల్పోవడం జరుగుతుంది.
విశ్వాసం ఒక కొత్త అంశం. ఈదురు గాలిలో దీపం వెలుతురును కాపాడినట్టుగా, దృఢ విశ్వాసం ఇతరులకు ప్రేరణగా నిలుస్తుంది. అననుకూల సమయాలలో కూడా దానిని ఎవ్వరూ నాశనం చేయలేరు. ఈ రోజు కంటే, నిన్నటి కంటే రేపు మెరుగ్గా ఉంటుందనే వాగ్దానాన్ని ఇస్తుంది దృఢ విశ్వాసం. ఇది నిరాశా వాదానికి వ్యతిరేకంగా లేచి, ఎంత చీకటి రాత్రైనా మారుతుందనే విశ్వాసాన్ని తిరిగి చేజిక్కించు కుంటుంది.
అతి తక్కువ సమయంలో అభివృద్ధి చేసి, మార్కెట్ అవుతున్న వ్యాక్సిన్... కోవిడ్-19 వైరస్కు వ్యతిరేకంగా విశ్వాసాన్ని అందిస్తుంది. అమెరికన్లు, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన అధికార పీఠాన్ని వదిలిపోయే విధంగా ఓటు వేయడం మనకు విశ్వాసాన్ని ఇచ్చింది. వియత్నాం, న్యూజిలాండ్ దేశాల్లో కరోనా వైరస్ను అదుపు చేసిన నిర్వహణ తీరు విశ్వాసాన్ని ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణలో ఉన్నవారు కరోనా మహమ్మారిని అదుపు చేయడంలో కనబరచిన అంకితభావం విశ్వాసాన్ని కనబరిచింది. నగరాలు, దేశాలను సంరక్షించేందుకు వారి జీవితాలను పణంగాపెట్టి, తమ నిబద్ధతను ప్రదర్శించిన అత్యవసర కార్మికులు విశ్వాసాన్ని కలిగించారు. దయాగుణంతో ఆహారం, ధన సహాయాన్ని అందించిన అపరిచిత వ్యక్తులు, వాటిని అందుకున్న ప్రజల జీవితాల్లో విశ్వాసాన్ని సజీవంగా వుంచారు.
నగరాలను వదిలేసి తమ తమ గ్రామాలకు కాలినడకన కుటుంబాలతో సహా కలిసి తిరిగి వెళ్ళిన కోట్లాది మంది వలస కార్మికుల ముఖాలలోనూ విశ్వాసమే దాగి ఉంది. నగరాలను వారు వదిలి వెళ్ళలేదు. నగరాలే వారిని వదిలి వెళ్లేలా చేశాయి. వాటికి వారి శ్రమ, నైపుణ్యాలు కావాల్సి వచ్చాయి కానీ, వారికి ఏ విధమైన సౌకర్యాలు కల్పించలేదు కాబట్టి, తాత్కాలిక ఇండ్లను వదలి వెళ్ళే విధంగా, వేల కిలోమీటర్లు నడిచే విధంగా వారిని ఒత్తిడి చేశాయి. నమ్మడానికి వీలులేని విధంగా 10మిలియన్లకు పైగా భారతీయులు ఆ పరిస్థితిని ఎదుర్కొన్నారు. కాంట్రాక్టర్లు, యజమానులు వారిని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఎటువంటి సహాయం చేయకుండా, డబ్బును సమకూర్చకుండా వదిలేసినప్పుడు... ప్రభుత్వం ఒక్కసారిగా రవాణా సౌకర్యాలను నిలిపివేసి నప్పుడు... రేషన్పై, దానధర్మాలపై ఆధారపడి జీవించాలని కార్మికులను ఒత్తిడి చేసినప్పుడు కూడా వారు తమ గ్రామాలకు చేరుకొని, తమ వారితో కలిసి ఉండాలని ఆశించారు. వందల, వేల కిలోమీటర్ల కాలినడక ప్రయాణంలో, ఎటువంటి మౌలిక సదుపాయాల హామీ లేకపోయినప్పటికీ, వారిలో విశ్వాసం స్పష్టంగా కనిపించింది.
లాక్డౌన్ ఆకస్మికంగా, తప్పుడు సలహాలతో విధించినపుడు... 74శాతం మంది వారు పొందే రోజువారీ వేతనంలో సగం కన్నా తక్కువ వేతనాన్ని (లాక్డౌన్ కాలంలో జీవించడానికి)... 50శాతం మంది ఒక్క రోజుకు కూడా సరిపోని రేషన్ను పొందారు. 89శాతం మందికి లాక్డౌన్ కాలానికి వారి యాజమాన్యం వేతనాలు చెల్లించలేదని 'కలెక్టివ్ స్ట్రాండెడ్ వర్కర్స్ యాక్షన్ నెట్వర్క్' తెలిపింది. భారతదేశంలోని ఉద్యోగులలో 21శాతం మంది వేతనాలు పొందే వైట్కాలర్ కార్మికులు వున్నప్పటికీ, 20మిలియన్ల ఉద్యోగాలు ఈ లాక్డౌన్ కాలంలో తీసివేసి, దేశాన్ని దారుణంగా నిరుద్యోగ సంక్షోభంలోకి నెట్టేయడం జరిగింది. అయినా ప్రజలు తమ విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. దాదాపుగా 250 మిలియన్ల కార్మికులు దేశ వ్యాపిత సమ్మెలో పాల్గొన్నారు.
విశ్వాసం అనేది... నేడు ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద పెద్ద కార్పొరేట్లను, కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న రైతుల నిరసనోద్యమంలోనూ ఉంది. వారి సమిష్టి బలం, పట్టుదల, మోడీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, ఆదరా బాదరాగా ఆమోదించి విధించిన మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసే విధంగా ఒత్తిడి చేసే విశ్వాసం ప్రదర్శిస్తున్నాయి..
గత సంవత్సరం షాహిన్బాగ్లో వద్ధ మహిళలు ప్రతిఘటించినప్పుడు ప్రదర్శించిన దృఢ విశ్వాసాన్నే ఈ రైతు ఉద్యమం పోలి ఉంది. అంతర్జాతీయ మీడియాలో తనను ఒక ప్రముఖ వ్యక్తిగా చూపించడంతో బిల్కిస్ దాదీ చాలా సంతోషపడింది. భారతదేశ వ్యాప్తంగా షాహిన్బాగ్తో పాటు ఇతర బాగ్లన్నీ సంఘీభావాలతో కనిపించడంతో, గత సంవత్సరం స్వీయ అభినందనలతో నిండిపోయిన మోడీ ప్రభుత్వ కథనాలు మారిపోయాయి. దీన్నంతా ఈ చలి కాలంలో వేల సంఖ్యలో మహిళలతో పాటు రైతులు నెరవేర్చారు. ఈ ప్రతిఘటన ప్రభుత్వానికి మాత్రమే వ్యతిరేకం కాక దేశంలోని శక్తివంతమైన కార్పొరేట్లకు కూడా వ్యతిరేకంగా జరిగుతున్నది. కొన్ని రాష్ట్రాలు మతాంతర వివాహాలను చట్ట వ్యతిరేకమైనవిగా, నేరపూరితమైనవిగా ప్రకటించినప్పుడు, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలు ద్వేషపూరితమైన ''లవ్ జిహాద్'' కథనాలను వెనక్కి నెట్టేసి, ప్రజాక్షేత్రంలో వారి సంతోషకరమైన కథనాలను వివరించాయి.
వీధిలో నడిచిపోయే సాధారణ వ్యక్తి ఇప్పుడు ''గోడీ మీడియా'' గురించి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ప్రధానమంత్రి నెలవారీ ''మన్ కీ బాత్''ను ఎగతాళి చేస్తున్నాడు. దానికి సామాజిక మాధ్యమాల్లో ''లైక్''ల కన్నా ''డిజ్ లైక్''లే ఎక్కువగా నమోదవుతున్నాయి. తీరిక సమయాన్ని చిలుకలు, నెమళ్లతో గడపడం, అతని వస్త్రధారణ, గడ్డం ఇప్పుడు డజన్ల సంఖ్యలో కార్టూనిస్టులలో ఆసక్తిని ప్రేరేపిస్తున్నాయి. స్వతంత్ర మాధ్యమాలు, వారి కార్పొరేట్ల గురించి అల్లిన కథనాలను అవిశ్రాంతంగా సవాల్ చేస్తున్నాయి.
భిన్నాభిప్రాయాల శక్తిసామర్థ్యాలు, అనేక రూపాలలో వాటి వ్యక్తీకరణల గురించి యువత తెలుసుకుంటున్నారు. 21సంవత్సరాల వయసులో ఉన్న ఆదర్శవంతమైన యువతీ యువకులు కేరళ రాష్ట్రంలో మేయర్లుగా ఎన్నికవుతున్నారు. భారతదేశ ప్రతిపక్ష పార్టీ లక్ష్యసాధనకు అనుగుణంగా లేకుంటే, భారతీయులు ఖచ్ఛితంగా వ్యతిరేకిస్తారు. హత్రాస్లో జరిగిన అత్యాచార ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అనేక రూపాలలో జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా భారతీయ మహిళల పోరాటాన్ని మేల్కొలిపాయి. విద్య, ఆరోగ్య సంరక్షణా వ్యవస్థల్లో ఉన్న లోపాలు కరోనా వైరస్ వ్యాప్తి కాలంలో ప్రజల దృష్టిని ఆకర్షించాయి. అదే మార్పుకు ఆరంభం.
వలస కార్మికులు నగరాలకు వెళ్ళడం నెమ్మదిగా మొదలైంది. ఇంతకు ముందు సంవత్సరం వారు తమ ఇంటిగా పరిగణించలేని ప్రాంతానికి మళ్ళీ వారిని తీసుకుని వెళ్లింది వారి విశ్వాసమే. వారికి అక్కడ పని దొరుకుతుందని, డబ్బు సంపాదించుకుంటామని, తమ వారికి డబ్బు పంపిస్తామని, తిరిగి మళ్ళీ తమ స్వంత ఇంటికి వెళ్తామనే విశ్వాసం ఉంది. వారు ఆ నగరానికి చెందిన వారమని, ఆ నగరం తమను ఆదరిస్తుందన్న విశ్వాసం కూడా వారికి ఉంది. ఆ విశ్వాసం పట్టణ, నగర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలలో మార్పుల కోసం కాకపోవచ్చు, కానీ కొన్ని మిలియన్ల మంది లాగే వారు కూడా దృఢ విశ్వాసంపైనే జీవిస్తున్నారు.
- స్మృతీ కొప్పికర్
వ్యాసకర్త ముంబైకి చెందిన సీనియర్ జర్నలిస్ట్
అనువాదం: నీహాగౌతమ్, సెల్:9848412451