Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జననం, మరణం ఒకే రోజు. ఆ జననానికీ మరణానికీ మధ్య తాను అనుభవించిన జీవితమే ఆయన కవిత్వం. చెరచబడ్డ చెల్లినీ, ఎక్కుపెట్టిన తుపాకీన కవిత్వీకరించిన శక్తి అతడు. వేశ్యకి నిజమైన అర్థం చెప్పి. కుందేలు చర్మం కప్పుకున్న తోడేళ్ల నిజరూపం బయటపెట్టిన వాడు. అక్షరాలకు ఆయుష్షు పోసి, తన కుంచెతో పేదల బతుకు చిత్రాన్ని గీసి పోరాటానికి రంగులద్దినవాడు. క్యాన్సర్ కబలిస్తున్నా అక్షరాలను తాకట్టు పెట్టకుండా ''మరణం నా చివరి చరణం కాదు'' అని ప్రకటించిన నిఖార్సయిన ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్.
ప్రస్తుత జగిత్యాల జిల్లాలో అలిశెట్టి ప్రభాకర్ 12 జనవరి 1954లో జన్మించాడు. అలిశెట్టి చిన్నరాజం, లక్ష్మిలు ప్రభాకర్ తల్లిదండ్రులు. 12 జనవరి 1993లో మరణించాడు. తను బతికింది కేవలం 39 సంవత్సరాలు మాత్రమే.. కానీ తన రచనలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడు. చదువుకుంది ఇంటరే అయినా సమాజాన్ని చాలా నిశితంగా పరిశీలించాడు. కష్టాలను ఎదుర్కొవడంలో పీహెచ్డీలే చేశాడు. అందుకేనేమో బూజు పట్టిన పుస్తకాల్లో ఉన్న చెత్తను తలకు ఎక్కించుకోకుండా తనదైన శైలిలో సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాన్ని అక్షరాలతో కడిగాడు. తాను రాసిన ప్రతీ కవిత ఓ ఆయుధం అయితే ఆ కవితలోని అక్షరాలు బులెట్ల కంటే పదునైనవి.
బతుకుదెరువులో భాగంగా తొలుత కరీంనగర్లో ఫొటో స్టూడియోను ప్రారంభించాడు. అలాగే చిత్రాలు కూడా గీసేవాడు. అప్పట్లో కరీంనగర్లో దొరల పెత్తనం విపరీతంగా ఉండేది. ఈ క్రమంలో రైతుకూలీలు, రైతులు దొరలపై తిరగబడ్డారు. జగిత్యాల జైత్రయాత్ర పోరు నడిపారు. ఈ పోరులో అలిశెట్టి ప్రభాకర్ ముందు నిలిచాడు. ఆ పోరాటం విజయం సాధించింది. ఆ తరువాత అలిశెట్టి కరీంనగర్ నుంచి హైదరాబాద్కు మకార మార్చాడు. నగరంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కనీసం పూట గడవడమే కష్టంగా ఉన్న సమయంలో కూడా తన అక్షరాలను తాకట్టు పెట్టలేదు. పైగా తనలోని కవిని మరింతగా తట్టిలేపాడు. అలిశెట్టి చివరి రోజుల్లో క్యాన్సర్తో బాధపడుతూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రిలో చూపించుకోవడానికి డబ్బులు లేని సమయంలో కూడా తన జ్ఞానాన్ని కాసులకు తాకట్టు పెట్టలేదు. సినిమాల్లో రాసే అవకాశం వచ్చినా అటువైపు తొంగి చూడలేదు. జబ్బుతో మంచంపై ఉండి కూడా సమాజాన్ని చైతన్యం చేసే కవితలే రాశాడు కానీ తన ప్రాణాలను కాపాడుకోవాలని ఏ రోజు పరితపించలేదు. ఇందుకు నిదర్శనమే తాను రాసిన కవితా సంపుటిలు.
నగర ప్రజలు పడుతున్న బాధలను ఆంధ్రజ్యోతిలో 'సీటి లైఫ్' పేరుతో ప్రజల ముందుకు తేచ్చాడు. అలిశెట్టి రాసిన పుస్తకాల్లో ఇది ఎంతో ప్రసిద్ధి చెందింది. అప్పట్లో నగర ప్రజలు అనేకులు నిద్రలేవడమే ఆలస్యం ఆ సిటీలైఫ్ కోసం ఎదురుచూసేవారంటే అతిశయోక్తి కాదు. ఎర్ర పావురాలు, రక్తరేఖ, చురకలు, మంటల జెండాలు, మరణం నా చివరి చరణం కాదు ఇలా అనేక పుస్తకాలు అలిశెట్టి కలం నుంచి జాలువారినవే.
తను శవమై.. ఒకరికి వశమై..
తనువు పుండై. ఒకరికి పండై
ఎప్పుడూ ఎడారై.. ఎందరికో ఒయాసిస్సయి
అంటూ ఆకలి తీర్చుకోవడం కోసం ఓ మహిళ వేశ్యగా మారిన స్థితిని అలిశెట్టి కండ్లకు కట్టినట్టు వివరించాడు.
నగరాల్లో అత్యధికంగా అత్యద్భుతంగా
ఆస్తి పంజరాల్నీ చెక్కే ఉలి ఆకలి.
అంటూ పల్లె నుంచి పట్నం వచ్చిన పేద ప్రజల వలస జీవిత చిత్రాన్ని తన అక్షరాల్లో వివరించాడు.
న్యాయాన్ని ఏ కీలుకు ఆ కీలు
విరిచేవాడే వకీలు.
అంటూ న్యాయవ్యవస్థలో ఉన్న డొల్లతనాన్ని బట్టబయలు చేశాడు.
ఒక నక్క
ప్రమాణస్వీకారం చేసిందంట
ఇంకెవ్వరినీ వంచించనని
ఒక పులి
పశ్చాత్తాపం ప్రకటించిందంట
తోటి జంతువుల్ని సంహరించినందుకు
ఈ కట్టు కథ విని
గొర్రెలు ఇంకా పుర్రెలూపుతూనే ఉన్నాయి..
అంటూ ప్రజాస్వామ్యం ముసుగులో రాజ్యమేలుతున్న భారత పార్లమెంట్ వ్యవస్థను కడిగిపారేశాడు.
ఇలా అలిశెట్టి కలం నుంచి జాలువారిన ప్రతీ అక్షరం సమాజంలో ఉన్న డొల్లతానాన్ని ఎత్తిచూపినదే. సమాజంలో అణగారిన ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను కండ్ల ముందు ఉంచినదే. ఎన్నికల పేరుతో ఏలికలు సామాన్య ప్రజలను ఎలా మభ్య పెడుతున్నారో వివరించి చెప్పినదే. మొద్దు బారిన మెదళ్లలో ఆలోచనలను రేకిత్తించి ఉద్యమ దారి చూపినదే. అందుకే అలిశెట్టి మరణించి దాదాపు 27ఏండ్లు అయినా ఇంకా ప్రజల గుండెల్లో నిలిచే ఉన్నాడు. సమాజం కోసం కలం పట్టుకున్న ప్రతీ కవికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాడు. విప్లవోద్యోమం వైపు నడిచే వారికి వేగుచుక్క అయ్యాడు. కానీ నేటి ఆధనిక యుగంలో కాసులకు కుక్కుర్తి పడి పాలకులకు ఆస్థాన కవులుగా మారుతున్న వారు ఎందరో... పదవులకు ఆశపడి ఏలికలకు వంగి వంగి దండాలు పెడుతున్న వారు ఎందరో... నేటికీ ఆనాటి అసమానతలు, అవినీతి, అన్యాయాలు, ప్రజలను ముంచే పాలకులు, ఎండిన డొక్కలతో పట్నం వలస వచ్చే పేదలు, ఆకలి తీర్చుకోవడం కోసం ఒళ్లు అమ్ముకునే వేశ్యలు, న్యాయాన్ని నడి బజారులో అమ్మే వకీళ్లు సమసిపోలేదు. కనుక ఇప్పటికీ ఈ సమాజానికి కావాల్సింది అలిశెట్టి ప్రభాకర్లే. నేడు అలిశెట్టి ప్రభాకర్ జయంతీ, వర్థంతి కూడా. ఈ సందర్భంగా ఆ అక్షర శిల్పికి అశ్రు నివాళి.
- అజయ్ కుమార్
సెల్:8297630110