Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1990వ దశకం తరువాత, భారతదేశ రాజకీయ, ఆర్థిక వైఖరిలో చెప్పుకోదగిన మార్పు జరిగింది. ఆ తరువాత దశకాలలో రాజకీయ, ఆర్థిక రంగాలలో నయా ఉదారవాద విధానాల తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు మొదలయ్యాయి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సుదీర్ఘ కాలంపాటు చేసిన స్వాతంత్య్ర పోరాట విలువలు, దేశ సార్వభౌమత్వం, లౌకికతత్వం, ఫెడరలిజం ప్రశ్నార్థకంగా మారాయి.
వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, విద్యా వైద్య రంగాల ఆర్థిక వ్యవస్థల్లో చోటు చేసుకున్న విధానాలు, ఆచరణాత్మక మార్పులు సామాన్య ప్రజలు ముఖ్యంగా సమాజంలో సగభాగంగా ఉన్న మహిళల జీవితాలపై విధ్వంసకరమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. రాజ్యాంగంలో పొందుపరిచిన రాష్ట్రాల హక్కులు, సామాజిక భిన్నత్వాన్ని కలుపుకొని పోయేతత్వం, అన్ని భాషలకు సమాన గౌరవం, లౌకిక తత్వాలు నిత్యం ఉల్లంఘనలకు గురవుతున్నాయి. మతం, కులం, భాష, జాతి ఆధారంగా ప్రజల మనసులు ద్వేషభావంతో నిండిపోతున్నాయి. ఆమోదయోగ్యం కాని సాంప్రదాయ బద్ధమైన సమర్దనలు ఆ చర్యలను ముందుకు తీసుకొని పోతున్నాయి. వైభవోపేతమైన గత సాంప్రదాయాలు, దేశం కోసం చేసిన త్యాగాలను, వాస్తవాలకు విరుద్ధంగా అప్రధాన మైనవిగా చూపిస్తున్నారు. వాడుకలో లేని సనాతన మనుస్మృతిని, భారత రాజ్యాంగ విలువలకు ప్రత్యామ్నాయంగా ముందుకు తీసుకొస్తున్నారు.
దృష్టిని మళ్ళించే ప్రయత్నాలు
అనేక రంగాలలో ఆర్థిక బాధలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కార్మికవర్గ పోరాటాలు విస్తరిస్తున్నాయి. తమ జీవనోపాధి కోసం, న్యాయం కోసం పోరాడుతున్న కార్మికులను విభజించి, అదుపు చేయాలని పాలక వర్గాలు చూస్తున్నాయి. 'ఆధ్యాత్మిక రాజకీయాలు' లాంటి పదాలను మీడియా ద్వారా వ్యాప్తిలోకి తీసుకొస్తూ, ప్రజల రాజకీయ, ఆర్థిక సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు. నేటి ఈ పరిస్థితులలో, ఉద్యోగ విరమణ చేసిన జడ్జీలు, ఐఏఎస్, ఐపీఎస్, మిలిటరీ అధికారులు, ఇతర అధికారులు, త్వరలో ఉద్యోగ విరమణ పొందే అధికారులు, సినీ నటులు ఈ రాజకీయ కదనరంగంలోకి దూకుతున్నారు. సాంస్కతికంగా దిగజారిన స్థితికి, నేటి భయంకర పరిస్థితులకు తాము కూడా బాధ్యులే అన్న వాస్తవాన్ని వారు మర్చిపోతున్నారు. కానీ వారు రాజకీయాలను శుద్ధి చేసి, ప్రజలను, ఈ వ్యవస్థను కాపాడే రక్షకులుగా నటిస్తున్నారు. మీడియా ఇటువంటి వారికి మరింత ప్రచారం ఇస్తున్నది. ప్రస్తుత సామాజిక వ్యవస్థలో మార్పును కోరుకుంటున్న యువతరం, ఈ చెడు పద్ధతులలో రెచ్చగొట్టే వర్గాల ఉచ్చులో పడి పోవడం దిగ్భ్రాంతిని కలిగించే విషయం. ఆర్ఎస్ఎస్ అనుబంధ రాజకీయ విభాగంగా ఉన్న బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, స్వాతంత్య్ర పోరాటాన్ని వక్రీకరించడం, ప్రజాస్వామిక విలువలను, ప్రజల ఐక్యతను నాశనం చేయడం, రాజ్యాంగ విలువలను బలహీన పర్చడం, దుర్మార్గంగా రాష్ట్రాల హక్కులను లాక్కొంటున్న తీరును మనం చూస్తున్నాం.
కార్పొరేట్, బహుళజాతి కంపెనీల కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం నిరంతరాయంగా కొనసాగుతుంది. సంవత్సరాల పాటు ప్రజలు కష్టపడి పన్నులు చెల్లించి, జాతీయ పొదుపు ద్వారా నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను వారు వ్యూహాత్మకంగా అమ్ముతున్నారు. ఇప్పుడు 'వ్యవసాయ చట్టాలను' చట్ట విరుద్ధంగా ఆమోదింపచేసుకొని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంకింగ్, రైల్వే, ఇన్యూరెన్స్, సేవా రంగాలను వేగంగా ప్రయివేటీకరిస్తున్నారు.
ద్రవిడ పార్టీలు తమిళనాడు రాష్ట్రాన్ని 1967 నుంచి పాలిస్తున్నాయి. ప్రభుత్వ స్థాయిలో వారి పాలనా తీరు పట్ల చాలా విమర్శలు ఉన్నాయి. కానీ గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే అనేక రంగాలలో తమిళనాడు చాలా ముందున్న వాస్తవాన్ని కాదనలేం. కానీ ప్రస్తుతం ఆ రాష్ట్ర పాలక పార్టీ అయిన AIADMK, ద్రవిడ పార్టీ భావ బంధాల నుంచి నెమ్మదిగా దూరం అవుతున్నది. బీజేపీ దయాదాక్షిణ్యాలపై అధికార పీఠంపై కూర్చుని, తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం పూర్తిగా రాజీ పడుతూ, బీజేపీ రాష్ట్రంలోకి అడుగు పెట్టే అవకాశం ఇస్తుంది.
దగ్గర మార్గాల రాజకీయ నాయకులు
ఈ నేపథ్యంలో, రజనీకాంత్, కమల్హాసన్ లాంటి సినీ నటులు రాజకీయాలలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కమల్హాసన్ ఇప్పటికే 'మక్కల్ నీధి మైయామ్ (MNM)' అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. రజనీకాంత్ సంకోచిస్తూనే, అనేక ప్రకటనల తరువాత డిసెంబర్ 31,2020 లో పార్టీని స్థాపిస్తానని తేదీ ఖరారు చేశాడు. కానీ అనారోగ్యం కారణంగా పార్టీని స్థాపించనని డిసెంబర్ 29నాడు ప్రకటించాడు. తరువాత తనది ఆధ్యాత్మిక రాజకీయవిధానం అని ప్రకటించాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా రాజకీయ పార్టీని పెట్టుకునే హక్కుంటుంది, రజనీకాంత్ కూడా అదే పని చేయొచ్చు. కానీ మీడియా ఆయనకు అధిక ప్రాధాన్యతనిచ్చి, 'రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నాడు' అనేదే పెద్ద వార్త అయినట్టు బాకా ఊదారు. అది ఇప్పుడు నిరుత్సాహపరిచింది. కమల్హాసన్ హిందూత్వ రాజకీయాలను విభేదిస్తున్నప్పటికీ, ఆయన రాజకీయ ప్రచారం అస్పష్టంగా ఉంది.
రాజకీయాలు, ఆధ్యాత్మికం రెండూ భిన్నమైన పరిధులలో ఉండే అంశాలు. రజనీకాంత్ ముందుకు తీసుకొస్తున్న ఆధ్యాత్మిక రాజకీయాలు గందరగోళంగా ఉన్నాయి. ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగత ప్రశాంతత, శ్రేయస్సు కోసం చేసే ఒక కాలక్షేప కార్యక్రమం. ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక విశ్వాసాలు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. సాధారణంగా మానవుల పుట్టుకకు ముందు, మరణం తరువాత ఏమి జరుగుతుంది అనే విషయాలకు సంబంధించిన నమ్మకాలను వారు కలిగి ఉంటారు. అలాంటి భావజాలం అన్ని మతాలలో, విశ్వాసాలలో ఉంటుంది. వారు ఈ ప్రపంచాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో వివరిస్తారు. ఆధ్యాత్మికతకు, మతానికి మధ్య కొన్ని సారూప్యతలు, కొన్ని భేదాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మికత, రాజకీయాలు రెండు భిన్నమైన పద్ధతులను కలిగి ఉంటాయి కాబట్టి ఆధ్యాత్మికతకు రాజకీయాలతో ఏ విధమైన సంబంధం ఉండదు. రజనీకాంత్ సూచించిన ఆధ్యాత్మిక రాజకీయాలకు, బీజేపీ రాజకీయాలకు సారూప్యత ఉంది, బీజేపీ అభివృద్ధి నిరోధక రాజకీయాలకు రజనీకాంత్ సూచించిన రాజకీయాలు ప్రత్యేక ఆకర్షణనిస్తాయి.
ఆధ్యాత్మికత అంటే ఏమిటి?
అద్వైతను బోధించిన ఆదిశంకరుడు, ఈ ప్రపంచం అంతా ఒక భ్రమ అని పేర్కొన్నాడు. మన కండ్లు చూసినది ఏదైనా భ్రమే అన్నాడు. ''మనం చూసిన దానినే గట్టిగా విశ్వసిస్తాం, చూడని దానిని విశ్వ సించం. మనం చూసేదంతా శక్తి. ఈ వాస్తవం శాశ్వతమైనదని'', ప్రముఖ కవి, భారతీయార్ ఆస్తికుడైనప్పటికీ, భ్రమ సిద్ధాంతాన్ని కొట్టిపారేశాడు. ఈ మత విశ్వాసాల నేపథ్యాన్ని మార్క్సిజం అర్థం చేసుకుంటుంది. కానీ, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను మార్చడం ద్వారా మాత్రమే మొత్తం ప్రపంచ ప్రజల శ్రేయస్సును సాధించవచ్చు అనే స్పష్టత మార్స్కిజం కలిగి ఉంటుంది. ఆధ్యాత్మిక రాజకీయాలను ప్రవేశ పెట్టడం ద్వారా ప్రజలను గందరగోళపరిచే ఏ ప్రయత్నమైనా, లౌకిక తత్వాన్ని బలహీన పరచి, రాజకీయాలలో, ప్రభుత్వ పాలనలో మతతత్వ ఎజెండాను బలపరుస్తుంది. ఈ చర్య ద్వారా, కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే సేవలు చేస్తున్న వాస్తవాన్ని సామాన్య ప్రజల కండ్లు కప్పి రహస్యంగా ఉంచే ప్రయత్నం హిందూత్వ శక్తులు చేస్తాయి. రజనీకాంత్ కమల్హాసన్ అవినీతికి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు. అవినీతి, పెట్టుబడిదారీ వ్యవస్థలో అనివార్యంగా ఉత్పన్నమయ్యే పరిణామాలలో ఒకటి. కమ్యూనిస్టులు ఈ అవినీతికి, దానిని సష్టించే పెట్టుబడిదారీ వ్యవస్థకు కూడా వ్యతిరేకంగా పోరాడుతారు. అవినీతిని సులభతరం చేసి, దానిని ప్రోత్సహించే అంశాలను నిర్మూలించకుండా అవినీతిని నిర్మూలించలేం.
అవినీతి మూలం
లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే నాయకత్వం వహించిన ఉద్యమానికి ఆరెస్సెస్తో పాటు అనేక సంస్థలు దాని వెనుక నిలిచాయి. దానికి మీడియా విస్తత ప్రచారాన్ని ఇచ్చింది. కానీ ఇప్పుడు బీజేపీ పాలనలో అవినీతి బాగా పెరిగింది. లోక్పాల్ బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ, బిల్లులో లంచం తీసుకున్న వారిని శిక్షించాలనే నిబంధన ఉంది. కానీ లంచం ఇచ్చిన వారికి ఏ శిక్ష లేదని, నాటి రాజ్యసభ ఛైర్మన్ దృష్టిని ఆకర్షించాడు. అవినీతి కేవలం కింది స్థాయిలోనే జరగ డంలేదని చెప్తూ, ఉన్నత స్థాయిలో అవినీతిని అరికట్టేం దుకు బిల్లులో ఏ నిబంధనలూ లేవని అన్నాడు. కార్పోరేట్ కంపెనీల యజమానులు మిలిటరీ పరికరాల కొనుగోలులో, ప్రభుత్వ కాంట్రాక్టులలో భారీగా లంచాలిచ్చారు. లంచాలు ఇచ్చినవారూ, తీసుకున్న వారు సామాన్య ప్రజలు కాదు. భారీ లంచాలను అందించి కార్పొరేట్లు, బహుళజాతి కంపెనీల వారు పనులు చేయించుకుంటున్నారు. అందువలన, లంచాలను ఇచ్చే వారిని కూడా శిక్షించే విధంగా బిల్లులో సవరణ చేయాలని ఏచూరి డిమాండ్ చేశాడు, కానీ ప్రభుత్వం దాన్ని అంగీకరించలేదు.
ఇప్పుడు బీజేపీ పాలనలో అవినీతికి 'చట్ట బద్దత' ఏర్పడింది. రాజకీయ పార్టీలు 'ఎలెక్టోరల్ బాండ్స్' పేరుతో భారతదేశంలోని ప్రముఖులు, బహుళజాతి కంపెనీల నుంచి ఎంత డబ్బైనా తీసుకోవచ్చు. దాని కోసం స్పష్టంగా చట్టపరమైన సౌకర్యాలు కల్పించారు. చారిటబుల్ ట్రస్ట్లు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని 2019లో ఒక సవరణ చేశారు. ఈ సవరణ ద్వారా, 'పవిత్రమైన దేవుని ట్రస్ట్' పేరుతో కార్పొరేట్ కంపెనీలు ఆదాయపు పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టవచ్చు.
ఒక్కసారిగా తెరపైకి వచ్చిన అవినీతి వ్యతిరేక కార్యకర్తలు ఈ విషయాల గురించి మాట్లాడరు. తమిళనాడును మారుస్తాం, అవినీతిని నిర్మూలిస్తాం అని మాట్లాడే రజనీకాంత్, కమల్హాసన్ లాంటి వారు ఈ తరహా అవినీతి గురించి మాట్లాడారా? వారి అవినీతి వ్యతిరేక మాటలలో నిజాయితీ ఉండదు కాబట్టి వారు మాట్లాడరు. రాజకీయాలంటే పోరాటాల యుద్ధభూమి. రాజకీయ, ఆర్థికవ్యవస్థలో నిర్మాణాత్మక మార్పుల గురించి మాట్లాడ కుంటే ఆధ్యాత్మిక రాజకీయాలు అభివృద్ధి నిరోధక విధానా లను (మతానికి, రాజకీయాలకు ముడిపెట్టడం ద్వారా) రహస్యంగా తీసుకొని వచ్చే వారికి సహాయం చేస్తాయి.
రాజకీయాలు, మతం విడివిడిగా ఉండాలి. ఈ రెండింటికీ సంబంధం లేదు. వాటిని కలిపి చూసే వారి లక్ష్యంలో నిజాయితీ ఉండదు. మానవజాతి విముక్తి, సోషలిస్ట్ వ్యవస్థ స్థాపన కోసం జరిగే పోరాటాల ద్వారానే సాధ్యమవుతుంది. ప్రస్తుత ప్రపంచం లో 'భూతల స్వర్గం' లాంటి సోషలిస్టు వ్యవస్థ స్థాపన కోసం మానవజాతికి మార్గం చూపేది మార్క్సిజమే. ఆ వ్యవస్థే అన్ని సమస్యలకు పరిష్కారం.
- టి.కె. రంగరాజన్
పీపుల్స్ డెమోక్రసీ సౌజన్యంతో
అనువాదం: బోడపట్ల రవీందర్
సెల్: 9848412451