Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగింట అలరించే సంక్రాంతి పండుగ భిన్న వాతావరణంలో సాగిపో తున్నది. కరోనా, స్ట్రెయిన్ లాంటి వైరస్ల భయాలు వెన్నంటిన వేళ పండుగ మనకెన్నో మెలకువలను నేర్పుతోంది. సంప్రదాయాలు వెలవెల పోతున్న ఈ కాలంలో పండుగ చేసుకోవాలన్న తపన ఉన్నా సమస్యలెన్నోసాక్ష్యాత్క రిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం, చేతినిండా సంపాదన లేక డబ్బుల గలగలలు కరువై పండుగ పరిమళాన్ని చిదిమేస్తున్నాయి. సరికొత్త సమస్యల సమాహారంతో సంక్రాంతి తెరపైకొచ్చింది.
సంక్రాంతి తెలుగు లోగిళ్లలో పెద్ద పండుగ. అదో గొప్ప అనుభూతి. మన పండుగల్లో ఆంగ్ల సంవత్సరాది ఆరంభంలో వచ్చే తొలి పండుగ కావడంతో సకల జనులు ఉత్సాహంగా జరుపుకుంటారు. గడచిన ఏడాదికి గురుతుగా భిన్నరుచులను, ఆస్వాదిస్తూ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. నిరుడు మార్చిలో పడగెత్తిన మహమ్మారి కరోనా పుణ్యామాని పండుగ వాసనలు ఈ ఏడాది అంతంత మాత్రంగానే ఉన్నాయనేది కాల గమనం లో అందరికెరుకే. 2020లో దాదాపుగా సింహభాగం ప్రపంచవ్యాప్తంగా కరోనా కార్చిచ్చు... పండుగ అనుభూతులపై ప్రభావం చూపింది. రోజువారీ జనజీవనమే నెలల తరబడి స్థంభించి లాక్డౌన్లు, లాఠిన్యాల్లో చిక్కిన జనం ఇప్పుడిప్పుడే కోలుకోవడంతో పండుగ 'క్రాంతి' అంతంత మాత్రమే.
వాస్తవ పరిశీలనలో మన సంప్రదాయాలను తరచిచూస్తే... ప్రతి సంక్రాంతికి మార్పులు అనివార్యమౌతున్నాయి. ప్రకృతి ప్రకోపాలు, జన బాహుళ్యం ఆలోచనల్లో రూపాంతరం, వేగంగా దూసుకెళుతున్న సాంకేతికతల మేళవింపు పండుగల సంస్కృతుల్లోనూ ఎన్నో మార్పులు తెచ్చాయి. సంక్రాంతి వచ్చిందంటే.... ముత్యాల ముగ్గులతో లోగిళ్లు కలకలలాడేవి. ఇప్పుడు ఈ ప్రభ చాలా మటుకు తగ్గిపోయింది. ఊళ్లన్నీ, బజార్లన్నీ తెల్లారే సరికి రంగవల్లులతో అలరించేవి. హరిదాసుల ఊసులు నామమాత్రం అయ్యాయి. ఎడ్ల పందాలు చూస్తే ఎక్కడోచోట తప్పించి కనుమరుగయ్యాయి. నిజానికి సంక్రాంతి నాటికి ఊళ్లల్లో ధాన్యపురాశులు ప్రతి ఇంటా ఉండేవి. గాదెల్లో, పురుల్లో తమపంటను ఇంటి ముందు చూసుకుని మురిసేవారు. ఇప్పుడు ఆ ధాన్యపురాశుల్లేవు. కారణం... యాంత్రీకరణతో వచ్చిన మార్పులే. మిషన్ కోతలు ముందుకొచ్చాయి. కుప్పలు, నూర్పిళ్లు ఇక దాదాపుగా లేనట్లే. ధాన్యాన్ని ఇంటికి చేర్చాలంటేనే రైతులకు గగనమైపోతోంది. పెరిగిన ఖర్చులు, శ్రమకు అన్నదాతలు విసుగెత్తి పోయారు. సూక్ష్మంలో మోక్షంలా సులభ పద్దతులే శరణ్యమని భావిస్తున్నారు. పండిన పంటను చేలల్లోనే అమ్మకం చేస్తున్నారు. చడీ చప్పుడు లేకుండా ముంచుకొస్తున్న వానలు తీరా పంట చేతికొచ్చే తరుణంలో చేస్తున్న చేటు కూడా దీనికి ఆజ్యం పోస్తున్నది. ఈ సంక్రాంతికి ముందుగా నవంబరు మాసంలో విరుచుకుపడిన వర్షాలతో రైతు కుదేలయ్యాడు. పంట చేతికొచ్చే సమయం లో దిక్కులు చూడాల్సి వచ్చింది. సంక్రాంతి ముంగిట సందడి చేసే కోడి పందాలు ప్రస్తుతం కరోనా కట్టడిలో చిక్కాయి. అయినా పండుగ వేళ ఈ పందాలాట అనివార్యమే. వీటిని న్యాయస్థానాలు నిషేధించినా షరా మామూలే. రాజకీయ నాయకుల వెన్నుదన్నులతో సాగుతున్న ఈ పందాలను నిలువరించే ధైర్యం ఎవరికీ లేదనేది తెలిసిందే. ఇక చేతినిండా డబ్బున్నా ధరల దండయాత్ర చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. నిత్యావసరాల రేట్లు ఆకాశాన్నంటాయి. కూరగాయలు కొరకొర చూస్తున్నాయి. పిండి వంటలకు గ్రామాల్లో సంక్రాంతికి ప్రాధాన్యమిస్తుంటారు. సంక్రాంతికి అరిసెల వాసన, చక్రాలు జంతికల కరకరలూ సహజం. కానీ, చాలా చోట్ల ఇళ్లలో సంక్రాంతి వంటకాలు మునుపు ఉన్నట్లు లేవనే చెప్పుకోవచ్చు. ఉదాహరణకు వంటనూనెల ధరలు, పప్పుల రేట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. కేవలం ఒక్క నెల వ్యవధిలోనే డిసెంబరు నుంచి నూనెలు కాగిపోతున్నాయి. మార్కెట్ల్లో వస్తువుల ధరల మూలంగా సామాన్యులు విలవిలలాడిపోతున్నారు. సంప్రదాయాల గుర్తుగా వాడే మామిడి తోరణాలు గుమ్మడి కాయలు కనిపించటం అరుదే. అందరినీ ఆహ్లాదపరిచే ముగ్గుల్లో వాడే రసాయనాలు, అరటి ఆకులు ఇత్యాది ఖర్చులు అదనపు బరువే.
సంక్రాంతి వచ్చిందంటే ముందుగా ప్రయాణ ప్రణాళికలతోనే ఆలోచనలు మొదలవుతాయి. ఆఫీసులు, సెలవులు, ఆర్థిక వ్యయప్రయాసలపై లెక్కవేసుకుంటారు. నిజానికి ఈ నెల మొదటినుంచే ఊళ్లకెళ్లే టైం టేబుల్ రెడీ అవుతుంది. బస్సులు, రైళ్లు సొంత వాహనాలు సిద్ధం చేసుకుంటారు. అయితే ఈ సంక్రాంతిలో ఈ సందడి చాలా వరకు తగ్గిపోయింది. కరోనా కాటు, సగటు జీవి సంపాదనపై ప్రతికూల ప్రభావం, రాకపోకలపై స్పష్టతకు లేక పోవడం, వైరస్లపై ఎనలేని భయాందోళనలూ ఊరెళ్లటానికి అవరోధంగా మారాయి. మునుపటి జ్ఞాపకాలతో తరచి చూస్తే... చేసేపని, ప్రదేశం వేరైనా పండుగ పూటయినా కనీసం ఇంటి పట్ట్టున పదుగురిని కలవాలని అభిలషిస్తుంటారు. ఎక్కడెక్కడో ఉన్న ఊరి జనమంతా ఎక్కువ భాగం ఇళ్లకొస్తారు. బంధువులు, పిల్లా పాపలతో పల్లెలు శోభిల్లుతాయి. కబుర్లు, కాలక్షేపాలతో ఇంటింటా ఉండే సందడి చెప్పనలవి కాదు. కొత్త బట్టలు, వస్తువుల కొనుగోలుతో ప్రతి ఇంటా ఏదో ఒక అనుభూతిని ప్రోది చేస్తుంటారు. ఉన్నంతలో ఖర్చుకు వెనుకాడరు. ఇక ఈ ఏడాది సంక్రాంతి ఆఫర్లెన్ని ఉన్నా గతంలోలా ఆ ఉరవడి తగ్గిందనే సంకేతాలున్నాయన్నది వ్యాపార వర్గాల వాదన. కరోనా, పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం, ఆర్ధిక ఒడి దుడుకులు, ధరలమోత... ఇలా ఎన్నో కారణాలను వ్యాపారులు వెల్లడి స్తున్నారు. గడచిపోతున్న ఈ పండుగ ప్రభ.... గతానికన్నా భిన్నమే. ఎన్నో ప్రతికూలతల నడుమ సాగిన సంవత్సర కాలం అందరినీ ఆలోచింపజేసింది. ఏతావాతా సకల జనులకూ సం'క్రాంతే' !!
- చెన్నుపాటి రామారావు
సెల్: 9959021483