Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజకీయార్థిక వ్యవస్థ గురించి చర్చించడమంటే, ఉత్పత్తి, వినిమయం, పంపిణీ, వినియోగం అనే నాలుగు కీలక విభాగాలను చర్చించడమంటే ఆ విభాగాల్లో ఉన్న మనుషుల గురించి, ఆ మనుషుల పరస్పర సంబంధాల గురించి చర్చించడమే. ఆ సంబంధాలలో ఆ మనుషులకు ఉండే సమాచారం, విజ్ఞానం, వివేకం, విలువలు అత్యంత కీలకపాత్ర వహిస్తాయి. ఆ సమాచారాన్నీ, విజ్ఞానాన్నీ, వివేకాన్నీ, విలువలనూ ప్రభావితం చేసేది విద్య. కేవలం లిఖిత, నియత విద్య మాత్రమే విద్యకు సూచిక కాదు గాని, ఆధునిక సమాజంలో నియత విద్య ప్రాధాన్యత సంతరించుకుంది. అందువల్ల ఒక సమాజంలో విద్యకు ఏ గౌరవం, స్థానం దక్కుతున్నాయనేదే ఆ సమాజపు విజ్ఞతా స్థాయికి సూచికగా ఉంటుంది. ఆ అర్థంలో విద్యారంగ పరిస్థితే ఆ సమాజపు రాజకీయార్థిక చర్చలో ప్రాముఖ్యత వహిస్తుంది.
తెలంగాణ సమాజానికి అవసరమైన విద్యావకాశాలను కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ పాలకులు నిర్లక్ష్యం వహించారని, తగిన విద్యావకాశాలను కల్పించలేదని, ఉన్న విద్యావకాశాలు మెరుగుపడడానికి అవసరమైన నిధుల కేటాయింపు జరగలేదని దాదాపు 1969 నుంచి 2014 దాకా ఉద్యమ భావజాలంలో ప్రధానమైన ఆరోపణగా వినబడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలు గడిచిన తర్వాత తెలంగాణ విద్యారంగ పరిస్థితి చూస్తే ఆ ఉద్యమ ఆకాంక్షలను పరిష్కరించే ప్రయత్నం కనీసంగా కూడ జరగలేదని తేటతెల్లమవుతుంది. అక్షరాస్యత, ప్రాథమిక విద్యావకాశాలు, పాఠశాలల స్థితి, ఉపాధ్యాయుల ఉద్యోగకల్పన, పాఠశాల విద్యారంగానికి నిధుల కేటాయింపులు, పాఠశాల విద్యారంగం మీద గత దుష్ప్రభావాల క్షాళన, కొత్త విలువలు ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు వంటి ఏ ఒక్క రంగం తీసుకున్నా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినందువల్ల తెలంగాణ భూమిపుత్రులకు ఒరిగిన చెప్పుకోదగిన మేలేమిటో చెప్పలేని స్థితే ఉంది. ఆ పాఠశాల విద్యారంగ దుస్థితి గురించి వివరమైన చర్చను మరొకసారికి వాయిదా వేసి, ఇప్పుడు మాత్రం ఉన్నత విద్యారంగం గురించి, ముఖ్యంగా విశ్వ విద్యాలయ విద్య గురించి చర్చించుకోవలసి ఉంది.
విశ్వవిద్యాలయమనేది గొప్ప పేరు పెట్టుకున్న కళాశాల మాత్రమే కాదు. అది కళాశాలను మించిన విశాలమైన విద్యా, పరిశోధనా, సంభాషణా, చర్చా, అన్వేషణా కేంద్రం. అక్కడ భిన్నమైన విజ్ఞాన శాస్త్ర, సామాజిక శాస్త్ర, మానవీయ అధ్యయనాలలో ఉన్నత విద్యకు అవకాశాలుంటాయి. ఆ భిన్నమైన శాస్త్రశాఖల మధ్య ఆదాన ప్రదానాలుంటాయి. మౌలిక, అన్వయ పరిశోధన జరుగుతుంది. కొత్త నిర్ధారణలు జరుగుతాయి. వాటి మీద చర్చ జరుగుతుంది. ప్రకృతి గురించీ, సమాజం గురించీ, మనిషి గురించీ శాస్త్రీయ సత్యాలు నిగ్గు తేలుతాయి. సమాజంలో పరీక్షకు పెట్టదగిన, పెట్టగలిగిన అన్వేషణలు జరుగుతాయి. సమాజానికీ విశ్వవిద్యాలయానికీ ఒక సన్నిహిత, మేధో సంబంధం కొనసాగుతుంది. ఒక విశ్వవిద్యాలయం ఎంతగా విస్తరిస్తే అది నెలకొన్న సమాజం అంతగా సంపన్నమవుతుంది. ప్రపంచవ్యాప్తంగానే జ్ఞాన సంపన్న, అనుభవ సంపన్న సమాజాలన్నీ వాటి విస్తతికి విశ్వవిద్యాలయాల మీదనే ఆధారపడ్డాయి. అందువల్ల విశ్వ విద్యాలయాలను గౌరవించాయి. అధ్యాపకులను, విద్యను, పరిశోధనను సగౌరవంగా చూశాయి. సువిశాలమైన ప్రాంగణాలు, బోధనా, పరిశోధనా భవనాలు, భారీ గ్రంథాలయాలు, ప్రయోగ శాలలు, అవసరమైనంత మంది అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది నియామకం, అధ్యాపకులకూ, విద్యార్థులకూ వసతి గృహాలు, రవాణా సౌకర్యాలు, వినోద, ఆహ్లాద సౌకర్యాలు వంటి అవసరమైన వనరులన్నీ కల్పించాయి. తగిన నిధుల వనరులు ఏర్పాటు చేశాయి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం బహుశా ప్రపంచ చరిత్రలోనే విశ్వవిద్యాలయాలను గౌరవించని, ఉద్దేశపూర్వకంగా, చేజేతులా విశ్వవిద్యాలయాలను చంపేస్తున్న రాష్ట్రంగా ఘనకీర్తి సంపాదించదలచుకున్నట్టుంది. నిధుల కేటాయింపులో అలసత్వం, పాత విశ్వవిద్యాలయ భవనాల మరమ్మతులకు గాని, కొత్త విశ్వవిద్యాలయాల భవన నిర్మాణానికి గాని ఎటువంటి ప్రణాళికలు అమలు కాకపోవడం, వైస్ చాన్సలర్లతో సహా కీలక నిర్ణయాధికార స్థానాలు భర్తీ చేయడంలో తాత్సారం, వేలాది అధ్యాపక ఖాళీలను ఏండ్లు గడిచినా భర్తీ చేయకపోవడం, అనేక శాఖల్లో అధ్యాపకుల కొరతతో విద్యా ప్రమాణాలు, నాణ్యత క్షీణిస్తున్నా పట్టించుకోకపోవడం, విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలను సరిదిద్దే చర్యలు తీసుకోకపోవడం, విద్యార్థుల మీద కక్షసాధింపు వైఖరి ప్రదర్శించడం వంటి ఎన్నెన్నో రకాలుగా యూనివర్సిటీలను చంపడమే బంగారు తెలంగాణ లక్ష్యంగా మారిన స్థితి కనబడుతున్నది.
గడిచిన ఆరు సంవత్సరాలలో రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఏ ఒక్క విశ్వవిద్యాలయానికీ తగిన నిధుల కేటాయింపు జరగలేదు. బడ్జెట్లో ప్రతిపాదించిన కేటాయింపులు కూడ వాస్తవంగా విడుదల కాలేదని అవే బడ్జెట్ పత్రాలలోని సవరించిన అంచనాలు, వాస్తవ గణాంకాలు చూపు తున్నాయి. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదు సంవత్సరాలకు ఆ స్వరాష్ట్ర భావనకు ఐదు దశాబ్దాలపాటు ఊపిరులూదిన ఉస్మానియా విశ్వవిద్యాలయ శతజయంతి ఉత్సవాల సందర్భం వచ్చింది. కాని ఆ సందర్భం ఎంత పేలవంగా, నామమాత్రంగా, తూతూమంత్రంగా ముగిసిపోయిందో కండ్లముందరి చరిత్రే. ఆ ఉత్సవాలకే ప్రత్యేకంగా రెండు వందల కోట్ల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసి, 2017-18 బడ్జెట్ ప్రతిపాదనల్లో రెండు వందల కోట్లు రాసి, 2019-20 బడ్జెట్ వచ్చేనాటికి వాస్తవ గణాంకాలలో అందులో పావు వంతు, యాబై కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చినట్టు నిస్సిగ్గుగా ధైర్యంగా ప్రకటించిన ప్రభుత్వం ఇది. ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. మరొక్క ఉదాహరణ చెప్పాలంటే, నల్లగొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి బడ్జెట్ ప్రతిపాదనల్లో నలబై కోట్ల రూపాయలు కేటాయించి, దాన్ని సవరించిన అంచనాల నాటికి ముప్పై ఐదు కోట్లకు తగ్గించి, వాస్తవ గణాంకాల నాటికి పన్నెండు కోట్లుగా చూపారు. సాధారణంగా ఏ పద్దుకైనా గత బడ్జెట్ కన్న ఐదు శాతమో పది శాతమో ఎక్కువ కేటాయింపు ప్రతిపాదించడం ఆనవాయితీ కాగా, ఉన్నత విద్యారంగానికి, ప్రత్యేకించి విశ్వవిద్యా లయాలకు గత సంవత్సరం ప్రతిపాదించిన కేటాయింపు కన్న తక్కువ కేటాయింపులు ప్రతి పాదించడం, సవరించిన అంచనాల నాటికీ, వాస్తవ గణాంకాల నాటికీ ఆ అంకెకు కూడ కట్టుబడకపోవడం తెలంగాణ సాధించిన ఘనత.
నిధుల కేటాయింపులలో కొరత, కేటాయించిన మొత్తం కూడ ఖర్చు పెట్టకపోవడం గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే, ఆ నిధుల కొరత వల్ల విశ్వవిద్యాలయ నిర్వహణకూ, అభివృద్ధికీ, విస్తరణకూ ఆటంకాలు ఎదుర వుతాయి గనుక. నిధుల కొరత వల్ల భవనాలు అవసర మైనంతగా పెరగవు, గ్రంథాలయంలోకి కొత్త పుస్తకాలు రావు, ప్రయోగశాలల్లోకి కొత్త పరికరాలు రావు, కొత్త అధ్యాపకుల నియామకం జరగదు, కొత్త సిబ్బంది నియా మకం జరగదు. విద్యార్థులకు నాణ్యమైన, ప్రామాణికమైన విద్య అందదు. బంగారు తెలంగాణ బంగారానికి ఎవరు నిజమైన హక్కుదారులో, వారసులో, వారికి బంగారం కాదుగదా, మట్టి కూడ దొరకని స్థితి వస్తుంది.
నిజంగానే నిధుల కొరత వల్ల రాగల సమస్యలకు స్పష్టమైన ఉదాహరణ అధ్యాపకుల కొరతలో వ్యక్తీకరణ పొందుతున్నది. తెలంగాణ ఏర్పడేనాటికి వ్యవసాయ, ఆరోగ్య విశ్వవిద్యాలయాలు మినహాయించి, రాష్ట్ర ప్రభుత్వాధీనంలో ఉన్న మిగిలిన పదకొండు విశ్వవిద్యాలయాలలో మొత్తంగా 2,766 అధ్యాపకులు అవసరమవుతారని ప్రభుత్వమే వేసిన అంచనా. అందులో సగానికిపైగా ఖాళీలుండేవి. ఈ ఆరు సంవత్సరాలలో, అంతకు ముందున్న ఖాళీలు మాత్రమే కాక, పదవీ విరమణ పొందిన వారి సంఖ్య కూడ కలుపుకుని దాదాపు 1,800 ఖాళీలున్నాయి. అంటే ముగ్గురు అధ్యాపకులు ఉండవలసిన చోట ఒక్కరు మాత్రమే ఉన్నారన్నమాట. ఈ సగటు అంకె కూడ పరిస్థితి మెరుగ్గా ఉన్నదనే ఆభాసను కలిపిస్తుంది. వాస్తవానికి ఒక విశ్వవిద్యాలయంలో 125 మంది అధ్యాపకులుండవలసి ఉండగా, ఒక్కరు కూడ రెగ్యులర్ అధ్యాపకులు లేరు. కొన్ని విశ్వవిద్యాలయాలలో 70 శాతం దాకా ఖాళీలున్నాయి. అతి తక్కువ ఖాళీలున్నచోట కూడ సగం మంది మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులున్నారు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అనే మూడు స్థాయిల అధ్యాపకులు ఉండవలసి ఉండగా ఎన్నో శాఖలు ఒకే ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ మీద నడుస్తున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు లేక శాఖలను మూసివేసిన దుస్థితి వచ్చింది.
విశ్వవిద్యాలయ ఆచార్యుల నియామకాలు ఎవరికో ఉద్యోగాలు కల్పించడం కోసం కాదు, విశ్వవిద్యాలయ విద్యా ప్రమాణాలు, నాణ్యత పెరగడం కోసం. కాని ఉన్నత విద్యారంగం మీద, ప్రత్యేకించి ఉస్మానియా విద్యార్థి లోకం మీద ఎందువల్లనో కోపం పెట్టుకున్న తెలంగాణాధీశులు ఈ నియామకాల పట్ల చిన్నచూపు ప్రదర్శించారు. అధికారానికి రాగానే ప్రథమ ప్రాధాన్యతాంశంగా ఉండవలసిన ఈ నియామకాల ప్రక్రియ మూడు సంవత్సరాల పాటు అంగుళం కూడ కదలలేదు. ఆ తర్వాత ఎట్టకేలకు వెయ్యి ఖాళీల భర్తీకి నామమాత్రపు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి గాని, కోర్టు వివాదాల పేరుతో, నిర్ణయాధికారంలో ఉండవలసిన వైస్ చాన్సలర్లు లేరనే పేరుతో, విశ్వవిద్యాలయాల ఎగ్జిక్యూటివ్ కమిటీల నియామకం కాలేదనే పేరుతో మరో మూడేండ్లయినా ఆ ప్రక్రియ ముందుకు కదలలేదు.
నిజానికి ఈ అభ్యంతరాలు కూడ సాకులే తప్ప, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అధిగమించలేని అవరోధాలేమీ కావు. సుప్రీం కోర్టులో రోస్టర్ విధానం మీద వచ్చిన వ్యాజ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వివాదానికి తావు లేని రీతిలో రోస్టర్ పాటించి నియామకాల ప్రక్రియ కొనసాగించవచ్చు. వైస్ చాన్సలర్ల నియామకం, ఎగ్జిక్యూటివ్ కమిటీ నియామకం ప్రభుత్వం చేతిలో పనులే గనుక అవి వీలైనంత త్వరగా పూర్తి చేయవచ్చు.
ఇంతకూ అసలు సమస్య ఉన్నత విద్యారంగాన్ని, ప్రత్యేకించి తన ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలను పునరుద్ధరించాలని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాలని, తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన, ప్రామాణికమైన, అంతర్జాతీయ స్థాయి విద్యను ఉచితంగా అందించాలని ఈ ప్రభుత్వానికి ఉన్నదా అనేదే. లేదా ఈ విశ్వవిద్యాలయాలను చేజేతులా చంపి, ఆశ్రితుల ఆధ్వర్యంలో నడిచే భయానకమైన ఫీజుల ప్రయివేట్ విశ్వవిద్యాలయాల వైపు తెలంగాణ బిడ్డలను నెట్టడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అయి ఉండాలి. అలా నెట్టినా ఆ విశ్వవిద్యాలయాలకు వెళ్లగలిగేవారు తక్కువమందే ఉంటారు.
ఈ విశ్వవిద్యాలయాల నిర్లక్ష్యం వెనుక ఒక సామాజిక అంశం కూడ ఉంది. ఇది నిజానికి నిధుల కొరత సమస్య కూడ కాకపోవచ్చు. ఇప్పుడు ఆధిపత్యవర్ణాల, సంపన్నవర్గాల పిల్లలు ఉన్నత విద్య కోసం విదేశాలకు, ప్రయివేటు విశ్వవిద్యాలయాలకు, ప్రతిష్టాత్మక ఉన్నత విద్యాసంస్థలకు వెళ్లిపోతున్న సమయంలో రాష్ట్రప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఎక్కువగా బడుగు, బలహీన వర్గాలకు, దళిత, బహుజన విద్యార్థులకు మాత్రమే నిలయంగా మారాయి. అసలు కొన్ని విశ్వవిద్యాలయాల్లో, కొన్ని శాఖల్లో కేవలం గ్రామీణ ప్రాంతాల నుంచి పేద వర్గాల పిల్లలు, ప్రధానంగా దళిత, బహుజన విద్యార్థులు మాత్రమే ఉంటున్నారు. శతాబ్దాలుగా విద్యకు దూరమైన ఈ వర్గాల పిల్లలు ఇవాళ అంతకంతకూ ఎక్కువగా ఉన్నత విద్యలో ప్రవేశించడం పట్ల ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా ఏలికకు ఉన్న నిర్లక్ష్యమే యూనివర్సిటీలను చంపడానికి అసలు కారణమా?
- ఎన్. వేణుగోపాల్
సెల్: 9848577028