Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికా ప్రజాస్వామ్య సౌధం కేపిటల్ భవనంపై స్వయాన సిట్టింగ్ అధ్యక్షుడు ట్రంప్ ఉసికొల్పి దాడిచేయించారు. కొత్త అధ్యక్షుడిగా జోబైడెన్ ఎన్నికను ధృవీకరించేందుకు జరుగుతున్న ప్రతినిధుల సభ, సెనెట్ సంయుక్త సమావేశంపై ఆయుధాలు ధరించిన ట్రంప్ గుండాలు తెగబడ్డారు. ఐదుగురు మృతిచెందారు. 200ఏండ్ల అమెరికన్ చరిత్రలో ఇదే మొదటిసారి. అమెరికాలో ప్రజాస్వామ్యం డొల్లతనం ప్రస్పుటమైంది. దాడి నాలుగు గంటలపాటు జరిగినా సమావేశం తన కార్యక్రమాన్ని పూర్తిచేసి బైడెన్ ఎన్నికను ఆమోదముద్ర వేసింది. తన ట్వీటర్ నుంచి దాడి చేయండని ఉసికొల్పి మొత్తం వ్యవహారాన్ని వీడియోలో చూసి, ఒకదశలో ఇక ఆపండని, హింసవద్దు చట్టాన్ని గౌరవించండని మళ్ళీ ట్రంప్ ట్వీట్ చేయడం ఆయన బరితెగింపునకు తాజా ఉదాహరణ. దేశ విదేశాల నుంచి విమర్శలు రావడంతో ట్రంప్ వెనకడుగు వేసి ఓటమిని అంగీకరించారు. దాడి సమయంలో నిండు సభలో ఉన్న ప్రతినిధులు టేబుళ్ల కింద, సొరంగంలో దాక్కుని తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ట్రంప్ కుమార్తె ఇవాంకా ఓ ట్వీట్ చేస్తూ కేపిటల్లోకి ప్రవేశించిన వారంతా దేశభక్తులుగా కొనియాడారు.
అయితే కేపిటల్ భవనంపై దాడిని అమెరికా చట్టసభల సభ్యులు ఖండిస్తూ.. ఇది హేయమైన చర్యగా పేర్కొన్నారు. చట్టసభకు ఎంపికైన సభ్యులుగా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలుపును దృవీకరించాల్సిన బాధ్యతను పూర్తి చేయడాన్ని ట్రంప్ మమ్మల్ని అడ్డుకునేందుకు యత్నించడం ప్రజాస్వామ్య ప్రక్రియకు అంతరాయం కలిగించారు. కాబట్టి ఆయనపై తక్షణం అభిశంసన ప్రకటించి, అధ్యక్ష పదవి నుంచి తొలగించాలి అనే వాదన ముందుకు వచ్చింది. దానితో రాజ్యాంగంలోని 25వ సవరణను ఉపయోగించుకోవాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కేబినెట్కు సూచించారు. ఇలా అన్ని వైపుల నుంచి ట్రంప్కు చుక్కెదురైంది.
హింస జరగకుండా అమెరికా అధ్యక్ష పదవి నుంచి డొనాల్డ్ ట్రంప్ సులభంగా దిగరన్న అంచనాలు చివరికు నిజమైనాయి. మెజారిటీ ప్రజలు పట్టంగట్టిన బైడెన్ను అధికారంలోకి రానివ్వకుండా ఆయన విజయాన్ని తారుమారు చేసేందుకు ట్రంప్, ఆయన మద్దతుదారులు చేసిన చిట్టచివరి ప్రయత్నం విఫలమైంది. ప్రపంచం ముందు అమెరికా పరువు ప్రతిష్టలను అధికారంలో ఉన్న ట్రంప్ దిగజార్చారు.
భద్రతకు మారుపేరుగా ఉండాల్సిన ప్రాంతంలో ఏకంగా మిలిటరీని దించాల్సిన దుస్థితి రావడం గమనించాల్సిన విషయం. ఈ ఉన్మాద ఘటనలో పాల్గొన్న ట్రంప్ మద్దతుదారులలో శ్వేతజాత్యా హంకారులు, కుట్ర సిద్ధాంత సమర్ధకులు, నల్లజాతి వ్యతిరేకులే ఎక్కువగా ఉన్నారు. నల్లజాతివారు ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నారు. శ్వేతజాత్యాహంకార పోలీసులు అనేక మంది నల్లజాతీయులను ఈ మధ్య అకారణంగా హత్యచేసారు. ఇంత దాడి జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు స్పందించలేదని? ఇది చాలా న్యాయమైన ప్రశ్న. అమెరికా సమాజం ఎంత చీలిపోయి ఉందో ఈ సంఘటన స్పష్టం చేస్తున్నది.
ఎన్నికలు జరిగిన నాటి నుంచి ట్రంప్ ఎన్నికలలో అవకతవకలు జరిగాయని చెపుతూవచ్చారు. ఓట్ల లెక్కింపులో మెయిల్స్ ద్వారా వచ్చిన ఓట్లను లెక్కించకూడదని డిమాండ్ చేశారు. తను గెలిచినట్టు తనే ప్రకటించుకున్నారు. తన గెలుపును దొంగిలించారని గగ్గోలు పెట్టారు. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేసుకోవాలి. అధికారంలో ఉన్నది ట్రంప్, ఆరోపణలు చేస్తున్నది ట్రంప్. అంటే ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన స్థానంలో ఉండి కూడా ఓటమిపాలవుతానని గ్రహించి వ్యవస్థనే బదనాము చేయడానికి పూనుకున్నారు. ఇది ట్రంప్ వ్యక్తిగత విషయం అనుకుంటే సరిపోదు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితి మధ్యతరగతి ప్రజలలో అసంతృప్తిని రగిలించింది. దానితో వలసవచ్చేవారిపై ద్వేషం అమెరికా సమాజంలో తీవ్రంగా పెరిగిపోయింది. ట్రంప్ ద్వేషపూరిత సోషల్ మీడియా పోస్టులు పరిస్థితి ఆజ్యం పోస్తూ అగ్నిగుండంగా మార్చివేశాయి. అందుకే ఫేస్బుక్, ట్వీటర్లు ట్రంప్ ఖాతాలను నిలిపివేయడం ఒక సముచిత చర్య.
ఎన్నికల కంటే రెండు నెలల ముందే స్టీగ్లిజ్ నోబుల్ బహుమతి గ్రహీత, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త రిపబ్లికన్ల నంచే అమెరికాకు ప్రమాదం పొంచి ఉన్నదన్న మాటలు అక్షర సత్యం అని తేలిపోయింది.
- టి.ఎన్.వి.రమణ
సెల్: 8985628662