Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందిన జిగటతో అతికించే మోడీ ప్రభుత్వ వ్యూహం అద్భుతం. లబ్ధి కోసం బంతిని కోర్టులో తోస్తుంది. 8వ విడత చర్చల్లో కేంద్ర మంత్రి సాగు చట్టాలను రద్దు చేయం. కావాలంటే సుప్రీంకోర్టుకు పొమ్మని రైతులను రెచ్చగొట్టారు. మంత్రి అలా అనవచ్చా? కోర్టుతో ఒప్పందానికి వచ్చి మంత్రి అలా అన్నారని ప్రజలు అనుకోరా? సుప్రీంకోర్టు 2021య జనవరి 12న చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపింది. సంప్రదింపుల కమిటీ నియమించింది. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రజలతో మాట్లాడమని కోర్టు చెప్పడం పాలనా వైఫల్యం.
''వృద్ధులు, స్త్రీలు ఉద్యమంలో ఎందుకున్నారు? వాళ్ళను ఇంటికి పంపండి. స్త్రీలు లేని ఉద్యమం నమోదుచేయాలి'' ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్య. ఈ ప్రశ్న గత ఉద్యమాల్లో ఉదయించలేదు. భారత వ్యవసాయదారుల్లో 33శాతం, వ్యవసాయ కూలీలలో 47శాతం స్త్రీలే. 84శాతం స్త్రీల బతుకుదెరువు వ్యవసాయమే. మరి ఉద్యమంలో ఎందుకుండరు? స్త్రీలులేని ఉద్యమాలు ఫలించవు. ఇది బాబ్డే భూస్వామ్య స్వభావ పురుషాధిక్య మనస్తత్వం. ''నేను స్త్రీని, వద్ధురాలిని, న్యాయవాదిని, న్యాయమైన ఉద్యమంలో పాల్గొంటాను'' పద్మశ్రీ పురస్కార గ్రహీత, మానవహక్కుల, లింగ సమానతా న్యాయవాది 80ఏండ్ల ఇందిరా జైసింఫ్ు బాబ్డేకు జవాబు చెప్పారు.
రాజ్యాంగం 5వ భాగం, 4వ అధ్యాయంలో సుప్రీంకోర్టు పరిధి, అధికారాలు నిర్వచించ బడ్డాయి. కార్యనిర్వాహక అతిశయాలను, అప్రస్తుత చట్టాలను అడ్డుకునే అధికారం సుప్రీంకోర్టుకుంది. రాజ్యాంగం 7వ షెడ్యూల్ ప్రకారం కేంద్రం వ్యవసాయ చట్టాలు చేయరాదు. చట్టాల రాజ్యాంగత్వంపై మాట్లాడని కోర్టు రాజకీయ, పాలన నిర్వహణలో జొరబడిందని విద్యావేత్త, అశోక విశ్వవిద్యాలయ పూర్వ ఉపాధ్యక్షులు ప్రతాప్ భాను మెహతా ఒక వ్యాసంలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రజాస్వామ్య సంస్థల అధికార విభజనను ఉల్లంఘించింది. రాజకీయ వివాద మధ్యవర్తిత్వం కోర్టు విధి కాదు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య రాజకీయ విధానాల మధ్యవర్తిత్వం దాని బాధ్యత. కేంద్ర సాగు చట్టాలతో దేశ సమాఖ్య స్వభావం ప్రమాదంలో పడింది. అన్నదాతలు అన్నార్తులుగా మారే దుస్థితి దాపురించింది. కోర్టు ఈ విషయాలను పట్టించుకోలేదు. సాగు చట్టాల రాజ్యాంగ వ్యతిరేకత, ఉల్లంఘనల తీర్మానం కోర్టు బాధ్యత. వ్యవసాయ సంస్కరణలు రైతు శ్రేయస్సుకు జరగాలి. కార్పొరేట్ల లాభాలకు కాదు. రైతుల ఉద్యమం వారి హక్కుల పరిధిలోనే ఉంది. ప్రభుత్వం వారిని ఎంతగా రెచ్చగొట్టినా, ఎన్ని అభాండాలు వేసినా ఉద్యమం దారితప్పలేదు. ప్రశాంతంగా అద్భుతంగా మానవీయ కోణాల్లో సాగుతోంది. ఈ మహత్తర సామాజిక విప్లవానికి సుప్రీంకోర్టు ఆదేశం కళ్ళెంవేసింది. ఇది ప్రజాద్రోహానికి దారితీయవచ్చు.
జనవరి 26న రైతు సంఘాల ట్రాక్టర్ ర్యాలీని ఆపమన్న కేంద్ర విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు రైతు సంఘాలకు నోటీసులిచ్చింది. చట్టాల అమలు స్టే, కమిటి రూపంలో అపరిమిత కాలహరణతో ప్రభుత్వానికి బహుమతి ఇచ్చింది. వివాదాస్పద చట్టాల వివరాల్లోకి పోలేదు. ఇరు వర్గాల భావాలు తెలుసుకోలేదు. రైతుల బాధలు వినలేదు. న్యాయ విచారణ విధానాలను అనుసరించలేదు. రాష్ట్రాల పరిధిలోని అంశాల్లో కేంద్రం చట్టాలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించలేదు. ప్రభుత్వం ఒక అవమానకర చర్య తీసుకోవలసిన అనూహ్య పరిస్థితికి నెట్టివేయబడింది. కోర్టు ఈ విచిత్ర స్థితి నుంచి ప్రభుత్వాన్ని కాపాడింది. చలి, కరోనా పేరుతో ఉద్యమానికి అడ్డుకట్టవేసే ప్రయత్నం చేసింది. రైతుల ఉద్యమం చట్టరహితమన్న భావనకు ఆస్కారమిచ్చింది. ఉద్యమానికి ప్రభుత్వాన్ని కాక రైతులను బాధ్యులను చేసింది. రైతు ఉద్యమం ఖలిస్థాన్ ఉద్యమ వాహకమన్న ప్రభుత్వ వాదనకు ఉతమిచ్చే విధంగా ప్రవర్తించింది.
తటస్తులు, వాదిప్రతివాదులకు ఆమోద్యులైన మధ్యవర్తులను అందరి అనుమతితో నియమించాలి. కమిటి ఉద్దేశం మధ్యవర్తిత్వం కాకపోతే కోర్టు ఇరువర్గాల వాదనలు విని నిజ నిర్ధారణతో తీర్పుచెప్పాలి. కోర్టు ఏకపక్షంగా నియమించిన సభ్యులు నలుగురూ మరో అభిప్రాయానికి తావులేని ధర్మోపదేశ చతుష్టయం. వివాదాస్పద సాగు చట్టాల ప్రగాఢ పక్షపాత సమర్థకులు. రైతు విమర్శకులు. నిటి అయోగ్ సభ్యుడు డా.అశోక్ గులాటి, డా.ప్రమోద్ జోషి వ్యవసాయ ఆర్థికనిపుణులు. ప్రపంచీకరణను, వ్యవసాయరంగంలో కార్పొరేట్లను సమర్థించిన అనిల్ ఘనవత్ శెత్కరి (రైతు) సంఘటన అధ్యక్షులు. భూపిందర్ సింఫ్ు మాన్ చట్టాలను సమర్థిస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) అధ్యక్షులు. జనసంఫ్ు క్రియాశీల కార్యకర్త. ఈయనను బికెయు 14న తొలగించింది. కమిటి నుంచి తప్పుకున్నారని ట్వీటింది. అశోక్ ఆలోచనలో పడ్డారట! కోర్టు ప్రభుత్వ ఉద్దేశాలతో ప్రభావితమైందన్న అనుమానాలకు తావిచ్చింది. రైతుల కమిటీ బహిష్కరణకు కారణాలు అందించింది. పూర్వ ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోధా ఆధ్వర్యంలో పాత్రికేయుడు పి.సాయినాథ్, వ్యవసాయ నిపుణులతో కమిటి వేస్తామని సుప్రీంకోర్టు గతంలో సూచించింది. ఆరేండ్ల నుంచి ప్రభుత్వ ప్రతినిధులు ప్రజావ్యాజ్యాలు దాఖలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. కమిటి నిర్మాణంలో కోర్టు తన హామీకి భిన్నంగా ప్రవర్తించింది. 11న కమిటి నిర్మిస్తామని చెప్పి 12న ప్రతివాద న్యాయవాదులు లేని సమయంలో ఏకపక్షంగా కమిటిని నిర్ణయించింది. ఈ సభ్యుల జాబితా కోర్టుకు ఎవరిచ్చారు? ఇందులో ప్రభుత్వ హస్తముందని అనుకునే అవకాశం లేదా?
కోర్టు ఆదేశం జైల్లో ఉన్న వ్యక్తికి బెయిల్ ఇచ్చినట్టు, రాజకీయ సంక్షోభం నుంచి మోడీ ప్రభుత్వాన్ని సంరక్షించింది. పార్లమెంటు చేసిన వివాదాస్పద సాగు చట్టాలమీద ప్రభుత్వానికి రైతులకు మధ్య ఎనిమిది తడవల చర్చలు జరిగాయి. ఫలితం శూన్యం. ఇప్పుడు ఈ కమిటి ఏం చేయగలదు? ఇది నిర్దేశించని భూభాగంపై, దేశం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యపై కోర్టు దాడి. చట్టాలు రాజ్యాంగవిరుద్ధమైతే అమలునే కాదు చట్టాలనే కోర్టు నిలపవచ్చు. అయితే కోర్టు కావాలనే చట్టాల రాజ్యాంగ విరుద్ధతను విచారించలేదు. గత ఆరేండ్లలో ఎన్నో అప్రజాస్వామిక, రాజ్యాంగవిరుద్ధ చట్టాలు చేయబడ్డాయి. వాటిపై నోరెత్తని కోర్టు సాగు చట్టాల అమలుపై మాత్రమే ఎందుకు స్టే విధించింది? ఎవరూ స్టే, కమిటీలను కొరలేదు. అన్ని వ్యవసాయ సంఘాల ప్రతినిధులు, నిరసనలో పాల్గొన్నా పాల్గొనకపోయినా, సాగు చట్టాలను సమర్తిస్తున్నా, వ్యతిరేకిస్తున్నా, కమిటి ముందు హాజరై తమ అభిప్రాయాలు తెలపాలని కోర్టు కట్టడిచేసింది. సాగు చట్టాల గురించి రైతుల బాధలు, ప్రభుత్వ ఉద్దేశాలు తెలుసుకొని కమిటి కోర్టుకు సిఫారసుల నివేదిక సమర్పిస్తుందని కోర్టు చెప్పింది. ప్రభుత్వ పక్షపాత కమిటి సభ్యుల సిఫారసులు రైతులకు అనుకూలంగా ఉండవు. ఉంటే అవి అమలుకు నోచుకోవు.
''సమస్య నుంచి దృష్టి మళ్లించటానికికోర్టు ద్వారా ప్రభుత్వం తెచ్చిన కమిటి ఇది.చట్టాల అమలు నిలుపుదల ఆహ్వానించదగ్గదే. కాని అది పరిష్కారం కాదు. ఏ క్షణంలోనైనా చట్టాలు అమలు కావచ్చు. మాకు కోర్టుపై నమ్మకముంది. ప్రభుత్వంపై లేదు. మేము ఇక్కడి నుంచి పొగానే చట్టాలను అమలు చేస్తుంది. (మంత్రులు విఫలమైతే) మోడీ మాట్లాడాలి. సమస్య సాగు చట్టాల చట్టబద్దత కాదు. ప్రజల జీవనమే సమస్య. మోడీ ఔరంగజేబులా, రావణునిలా ప్రవర్తిస్తున్నారు. కమిటి ముందు హాజరు కాము. ప్రభుత్వాన్ని ఒడిస్తాం. లేదా చస్తాం.'' అని రైతు నాయకులు స్పందించారు. అటార్నీ జనరల్ కూడా ఈ తాత్కాలిక నిలుపుదలను విమర్శించారు. ఈ చర్యతో కోర్టుల విశ్వసనీయత దెబ్బతింటుంది. రైతు ఉద్యమం వాయిదా పడుతుంది. నేటి ప్రభుత్వ సరళి, కమిటి సభ్యుల నేపథ్యం, స్వయం ప్రతిపత్తి కోల్పోయిన కోర్టులను గమనిస్తే కోర్టులో తమకు అనుకూల నిర్ణయం జరుగుతుందన్న నమ్మకం రైతులకు లేదు. తప్పు ఒప్పుకోని రాజ్యాంగవిరుద్ధ సాగు చట్టాలను రద్దుచేయమని, 26న మరో జలియావాలా బాగ్ నరమేధానికి ఆస్కారం ఇవ్వద్దని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి మల్లికార్జున ఖట్జూ 14న ప్రధానికి సలహా ఇచ్చారు.
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి