Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నగరంలోని హైదరాబాద్ విశ్వవిద్యాలయం భావి మేధావుల పురిటిగడ్డ. పరస్పర విరుద్ధ భావాలు సంఘర్షించుకునే కేంద్రం అది. దేశ భవిష్యత్ను తీర్చిదిద్దగలిగే విజ్ఞులను, మేధావులను అందించే క్షేత్రం. ప్రపంచంలో ఎక్కడాలేని కులం, అన్ని రకాల అసమానతలు అంతం కావాలని పరితపించే ఉడుకు రక్తం ఉరకలెత్తే హెచ్సీయూలో 2016 జనవరి 17న మనువాదులు భావి మేధావి, రీసెర్చ్ స్కాలర్ రోహిత్ను బలితీసుకున్నారు. రోహితవేముల భౌతికంగా దూరమై ఐదేండ్లు గడిచాయి.
హైదరాబాద్ యూనివర్సిటీలో ప్రపంచ ప్రఖ్యాత మేధావులు కారల్ మార్క్స్, బిఆర్ అంబేద్కర్ వారసులు నిరంతరంగా ఎదుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, అసమానతల మూలాలను వెతికి పట్టుకుంటున్నారు. ఆ కృషిలో భాగంగా భారత విద్యార్థి ఫెడరేషన్, అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియోషన్ నిరంతరం జరిగే విద్యార్థి సంఘ ఎన్నికల్లో తిరోగమన మనువాద విషపుత్రులైన ఏబీవీపీని ఓడించి అభ్యుదయ ప్రగతిశీల భావాలకు అండగా ఉంటున్నాయి. ఇది జీర్ణంకాక అదే యూనివర్సిటీలో వరి పొలంలో కలుపుమొక్కలాగా, పుట్టెడు మంచి నీళ్ళల్లో విషపు చుక్కలాగా ఈ సమాజాన్ని కులాలుగా, మతాలుగా విడదీసి, కుల మత వైషమ్యాలతో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డుకోవడం కోసం కాషాయ విషపురుగులు కూడా విహరిస్తున్నాయి.
వాటి మధ్య జరిగిన పరస్పర విరుద్ధ భావాలు, పురోగామి శక్తులు తిరోగామి శక్తుల మధ్య నిరంతరం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. అణిచివేత, కుల వివక్ష, సాంఘిక బహిష్కరణ వంటి తప్పుడు చర్యలకు విసి అప్పారావు, ఎంఎల్సి రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయల కుట్ర పన్నాగాలతో కేంద్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆదేశాలతో రోహిత్ వేముల బలయ్యాడు. 1993లో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియోషన్ హెచ్సీయూలో ఏర్పడింది, అప్పటికే భారత విద్యార్థి ఫెడరేషన్ హెచ్సీయూలో క్రియాశీలకంగా ఉంది. ఓ వైపు విద్యార్థుల సమస్యలపై పోరాడుతూనే, ప్రపంచ పరిణామాలపై పరిజ్ఞానం పెంచుకోవడం వంటి సమాజభ్యున్నతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎ సంఘాలు గెలుపొందుతున్నాయి. రాఖీలు కట్టడం, గణేష్ ఉత్సవాలు, గోవు పూజలు, సరస్వతి పూజలు చేస్తూ సనాతన, ఛాందస భావాలు, మూఢ విశ్వాసాలు పెంచి పోషించే మతోన్మాద ఏబీవీపీకి ఏనాడూ హెచ్సీయూలో స్థానం లభించలేదు. జీర్ణించుకోలేక కులవివక్ష, మతోన్మాదంతో మానసిక వేధింపులతో ఘర్షణను పెంచుతున్నారు. యాకుబ్ మెమన్ ఉరిశిక్షను నిరసించడం, ముజఫర్ నగర్ మత అల్లర్లను నిరసించడం, విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయడం మనువాదులకు కంటగింపుగా మారింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్19 ప్రకారం భావప్రకటన స్వేచ్ఛ తెలియజేస్తుంది. ఉరిశిక్షను వ్యతిరేకిస్తే దేశ ద్రోహులవుతారా? ఎంతో మంది శాస్త్రవేత్తలు, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉరిశిక్షను వ్యతిరేకించాయి. అంతమాత్రాన దేశద్రోహులు, కులోన్మాదులు తీవ్రవాదులు అవుతారా? భారత రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం గౌరవం, అభిమానం లేని సంఫ్ుపరివార్లో అంతర్భాగమైన ఏబీవీపీ దళిత విద్యార్థుల గొంతు నొక్కేయ్యాలని చూసింది. తరతరాల అమానుషాన్ని ప్రశ్నించి, ఎదురు తిరగడమే ఈ భావి మేధావి రోహిత్ చేసిన ''పాపం!''
శూద్రులు విద్యానభ్యసించారాదు చదివితే నాలుక కొయ్యాలి, వింటే చెవుల్లో సీసం పోయాలి అనే మనువాద మానసిక చట్టాలను పాతాళంలో పాతరేసి ఒక్కొక్కమెట్టు ఎక్కుతూ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన ఐదుగురు దళిత విద్యార్థులను వీసి అప్పారావు సాంఘిక బహిష్కరణ చేశాడు. ఎందుకు ఈ సాంఘిక బహిష్కరణ? ఏమి నేరం చేశారు ఈ దళిత విద్యార్థులు? తమకు రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రంతో ఉరిశిక్షను వ్యతిరేకించడం దేశద్రోహమా? చాలా ఏండ్లుగా మార్క్స్ అంబేద్కర్ భావాలు మతోన్మాద మనువాద భావాలకు మధ్య నిత్యఘర్షణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో దానిని అడ్డం పెట్టుకొని సాంఘిక బహిష్కరణ చేశారు.14రోజుల పాటు నిండుచలిలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద(వెలివాడ)లో టెంట్ కింద తలదాచుకున్నారు. అనేక రూపాల్లో తెలిపిన నిరసనలకు సామాజిక ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. అయినా ఏమాత్రం కనికరించని వీసి అప్పారావు ఏడు నెలలుగా రోహిత్ వేములకు రావాల్సిన ఫెలోషిప్ను నిలిపివేశాడు. అనేక ఆర్థిక ఇబ్బందులు పెరగడం, సాంఘిక బహిష్కరణ ఎత్తివేయకపోవడంతో రోహిత్ వేముల మనస్తాపంతో బలయ్యాడు. ఇది ముమ్మాటికీ బీజేపీ రాజకీయ జోక్యంతో జరిగిన హత్య. కత్తులు గొడ్డళ్లు తుపాకులు లేవు కదా అని భావించగూడదు. కులవివక్ష అంటరాని తనం మత చాందస భావాలు వేధించి వెంటాడి బలి తీసుకున్నాయి. రోహిత్ వేముల వీసి అప్పారావుకు రాసిన లేఖలో హెచ్సీయూలో అడ్మిట్ అయ్యే ప్రతీ విద్యార్థికి కొంచెం విషం ఒక ఉరిత్రాడు ఇవ్వండి అంటూ రాయడం ఆయన ఎంత మనోవేదనకు గురయ్యోడో తెలియజేస్తోంది.
దేశంలో తమను ఎవరు ప్రశ్నించినా దేశ ద్రోహిగా ముద్రలు వేయడం, మేధావులైన దబోల్కర్ పన్సారే, కల్బుర్గి వంటి వారిని పొట్టనబెట్టుకోవడం ఈ మనువాదులకు మామూలుగా మారింది. కవులు, జర్నలిస్టులు వంటి ఎందరినో అక్రమకేసులతో నిర్బంధించడం జరుగుతుంది. రోహిత్ వేముల చనిపోయిన ఐదురోజుల తర్వాత కండ్లు తెరిచిన ప్రధాన మంత్రి భరతమాత ఓ ముద్దు బిడ్డను కోల్పోయిందని సెలవిచ్చారు, ఎవరి వల్ల ఆ బిడ్డ నెలకొరిగాడో, ఆ దుండగులను ఎలా శిక్షించాలో మాట్లాడకుండానే మొసలి కన్నీరు కార్చాడు. రోహిత్ మృతికి కారకులైన వీసి అప్పారావును కనీసం సస్పెండ్ చేయలేదు. ఇది మోడీ కపట నీతి. దేశంలో ఒక భయానక వాతావరణం నెలకొన్నది. రోహిత్ వేముల మరణం తర్వాత ప్రధాన యూనివర్సిటీలు మనువాదుల కుట్రలకు వ్యతిరేకంగా కదం తొక్కాయి. ఢిల్లీ జేఎన్యూ, తమిళనాడు పెరియార్ యూనివర్సిటీ విద్యార్థులు మతోన్మాదుల ఆగడాలను ప్రతిఘటించారు. కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్ వంటి వారిపై రాజద్రోహం కేసులు భౌతిక దాడులు చేశారు. గత సంవత్సరం కింద జేఎన్యూలో ఎస్ఎఫ్ఐ అధ్యక్షురాలిపై మాస్కులతో వచ్చిన మతోన్మాద గుండాలు మూక దాడికి పాల్పడ్డారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరిగాయి. ఉన్నత విద్యాసంస్థల్లో వెల్లి విరుస్తున్న ప్రగతిశీల, సోషలిస్టు భావజాలాన్ని అణిచివేయాలనే కుట్రలను త్రిప్పికొడుతున్నారు. భౌతికదాడుల ద్వారా అణిచివేత అసాధ్యమని తెలిపోయింది. విజ్ఞులైన ప్రతీ ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏమంటే రోహిత్ వేముల బలి కావడం వ్యవస్తీకృత హత్య గానే చూడాలి. దళిత బలహీన వర్గాల విద్యార్థులకు రక్షణ కవచంగా ఉన్న రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, రిజర్వేషన్లను పరిరక్షించుకోవాలి. ఉన్నత విద్యాలయాల్లో ప్రజాస్వామిక శాంతి వాతావరణం నెలకొల్పాలి. ఉన్నత విద్యాసంస్థలన్నీ పేద విద్యార్థుల భవిష్యత్కు బాటలుగా నిలవాలి.
భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్న ప్రతిపౌరుడు రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాల వైపు పయనించాలి. కుల మత వైషమ్యాలు సృష్టించే విచ్ఛిన్నకర మతోన్మాద శక్తులను తిరస్కరించాలి స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు పంచుకొనే వేదికలుగా యూనివర్సిటీలు ఉండాలి. మరో రోహిత్ బలికాకుండా మనువాదాన్ని పాతరెయ్యాల
- టి. స్కైలాబ్ బాబు
సెల్:9177549646