Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని కోరుతూ... జనవరి 1 నుంచి ఫిబ్రవరి 1 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 33జిల్లాలలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటి రైతుజాతా నిర్వహిస్తున్నది. 2020 నవంబర్ 26 నుంచి ఢిల్లీలో ఈ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ లక్షలమంది రైతులు, ప్రజలు ఆందోళనలకు మద్దతుగా తెలంగాణ రైతు సంఘం రైతులను, ప్రజలను చైతన్య పర్చటానికి, చట్టాలలోని ప్రమాదాలను ప్రజలకు వివరించడానికి ఈ ''రైతుజాతా''ను నడుపుతున్నది.
ఇప్పటికే కనీస మద్దతు ధర లభించక, రుణగ్రస్తులై ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులను మరింత సంక్షోభంలోకి నెట్టడానికి, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ పరం చేయడానికే ఈ చట్టాలను తెచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టి రైతులను భూముల నుంచి వీలైనంత త్వరగా బయటకు పంపించటానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ నల్ల చట్టాలు. ఆర్డినెన్స్లు వచ్చినప్పటి నుంచే పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఆందోళనలు సాగుతున్నాయి. చట్టాల ప్రతులను తగలబెట్టడం, కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలు తగలబెట్టడం, రాస్తారోకోలు, దీక్షలు, నిరహార దీక్షలు, దేశవ్యాప్త బంద్లు, ట్రాక్టర్ల ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యమానికి కార్మికవర్గం, వ్యవసాయ కూలీలు, మహిళలు, విద్యార్థులు, యువజనులు, చేతివృత్తులవారు, సామాజిక తరగతులు, మేథావులు, మధ్యతరగతి వర్గాలు, 25రాజకీయ పార్టీలు, 500కు పైగా రైతు సంఘాలు పాల్గొని మద్దతు తెలుపుతున్నారు. ఈ మహౌద్యమం లో భాగంగానే తెలంగాణ రైతు సంఘం రైతుజాతాను తలపెట్టింది.
జనవరి 1న సంగారెడ్డి పట్టణంలో ఈ రైతుజాతాను రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, (మాజీ ఎమ్మెల్యే) ప్రారంభించగా, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు సి.రాములు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, రాష్ట్ర నాయకులు కార్యవర్గ సభ్యులు మూడ్ శోభన్, యం.లక్ష్మీ, జిల్లా కార్యదర్శి జయరాజు ప్రారంభసభలో పాల్గొన్నారు. ప్రారంభసభ అత్యంత ఉత్సహంగా జరిగింది. లక్షలాది కరపత్రాలు, 25వేల బుక్లెట్స్ ఈ ప్రచార సందర్భంగా ప్రింట్ చేయించడం జరిగింది. ప్రతిరోజూ 7 నుంచి 8 గ్రామాలు, పట్టణాలలో జాతా పర్యటిస్తోంది. ప్రతి సభలో 300 నుంచి 500మంది ప్రజలు పాల్గొంటున్నారు. ప్రజలు జాతాలు తమ గ్రామానికి వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానిస్తూ వెళ్ళేటప్పుడు విడ్కోలు చెపుతున్నారు. జాతాలో పాల్గొన్న వారికి భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. స్థానిక రైతు నాయకులతోపాటు పలు రాజకీయ పార్టీల నాయకులు కూడా పాల్గొని ఉపన్యాసాలు చెపుతున్నారు. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, సిద్ధిపేట, భువనగిరి, జనగాం జిల్లాల గుండా జాతా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 120 గ్రామాలు, పట్టణాల గుండా ఈ బస్సుజాతా సాగింది. ప్రతి గ్రామంలో ప్రదర్శనకు వచ్చిన రైతులు, ప్రజలు కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల తీవ్ర ఆసంతృప్తిని వెలిబుచ్చారు. ఢిల్లీకి ప్రదర్శనకు వెళ్ళడానికి సుముఖత వెలిబుచ్చుతున్నారు. స్థానికంగా జిల్లా స్థాయిలో కూడా ట్రాక్టర్ ర్యాలీలు, మోటార్ సైకిల్ ర్యాలీలు నిర్వహించి బస్సుజాతాకు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో డిసెంబర్ 30న రైతులతో పెద్ద బహిరంగ సభ జరిగింది. డిసెంబర్ 14 నుంచి 31 వరకు 18 రోజులు వరుసగా నిరవధిక దీక్షలు హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద నిర్వహించడం జరిగింది. ఆన్లైన్లో మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన వెబినార్లు 40 వరకు జరిగాయి. ఆన్లైన్ బహిరంగ సభలు జిల్లాల స్థాయిలో 20వరకు జరిగాయి.
ఈ మూడు వ్యవసాయ చట్టాల వల్ల రైతులు మార్కెట్లలో కనీస ధరలకు కూడా నోచుకోక రుణగ్రస్తులై భూములు కోల్పోతారు. 2006లో బీహర్లో మార్కెట్ వ్యవస్థను రద్దు పర్చడంతో అక్కడి రైతులు కనీస మద్దతు ధరకు నోచుకోవటం లేదు. మొక్కజొన్నలు క్వింటాలు రూ.1850కి యంఎస్పి ఉండగా క్వింటాలుకు రూ.1000 లేదా 1200లకు అమ్ము కుంటున్నారు. ధాన్యం క్వింటాలు యంఎస్పికి 500-600 తక్కువకు అమ్ముకుంటున్నారు. ఆ పరిస్థితి తమకు కూడా దాపురిస్తుందని తెలంగాణలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కేంద్ర నిర్ణయించిన యంఎస్పి మార్కెట్లలో అమలు కావడం లేదు. మార్కెట్ కమిటీ నుంచి రక్షణ చర్యలు ఉన్నప్పటికీ యంఎస్పి రాక నష్టపోతున్నారు. రైతు ఒప్పంద చట్టం కింద గతంలోనే కాంట్రాక్టు వ్యవసాయం తీసుకు రావడం జరిగింది. దాని ఫలితంగా విత్తనోత్పత్తి రైతులు దివాళ తీశారు. కానీ విత్తన కంపెనీలు లాభాల్లోకి వెళ్ళాయి. నిత్యావసర సరుకుల చట్ట సవరణతో నిత్యావసర సరుకుల ధరలు 50 నుంచి 100శాతం పెరిగాయి. ఈ మూడు మాసాలలోనే ఈ చట్టాల అమలు వల్ల రైతులు నష్టాలను చవి చూస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేశాక మధ్య దళారీలు, ప్రాసెసింగ్ యూనిట్స్ వారు, కొనుగోలు చేసిన కార్పొరేట్ సంస్థలు వేల కోట్ల లాభాలు అర్జిస్తున్నారు. ప్రత్యక్షంగా రైతులపై కార్పొరేట్ సంస్థల దోపిడి నగంగా కనబడుతున్నది.
విద్యుత్ సవరణ చట్టం అమలులోకి వస్తే ప్రస్తుతం రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్, పేదలకు ఇస్తున్న క్రాస్ సబ్సిడీ, డిస్కాంలకు రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు రద్దు అవుతాయి. అధిక ధరకు అమ్మే సంప్రదాయ విద్యుత్ను వినియోగదారులకు సరఫరా చేస్తారు. దేశీయ విద్యుత్ కాకుండా క్రాస్ బార్డర్ విద్యుత్ను కూడా దిగుమతి చేసుకొని వినియోగదారులపై భారాలు వేస్తారు. ప్రతి వినియోగదారుడు ''కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్'' ప్రకారం బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. ఉదహరణకు తెలంగాణలో 1.60కోట్ల కనక్షన్లలో దాదాపుగా 80లక్షల కనెక్షన్లు రాయితీ పొందుతున్నాయి. ఇవి ఆ సబ్సిడీని కోల్పోయి విద్యుత్ వినియోగం నుంచి దూరం అవుతాయి. అందువల్ల 2003 విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టకూడదని రైతుసంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. బస్సుజాతాలో ఈ అంశాన్ని కూడా చర్చించి ప్రచారం చేయడం జరుగుతున్నది. ఫిబ్రవరి 1వ తేదీ వరకు రాష్ట్రంలో గల 33జిల్లాలలో ప్రచారం చేసి హైదరాబాద్లో రైతుజాతా ముగుస్తుంది. జనవరి 18న మహిళా రైతుల ప్రదర్శనలు, 23 సుభాష్ చంద్రబోస్ జయంతి రోజున దీక్షలతోపాటు ర్యాలీలు జరుగుతాయి. 26న రైతుల పరేడ్ ప్రతి జిల్లా కేంద్రంతో పాటు, హైదరాబాద్లో గవర్నర్ కార్యాలయం వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమాల జయప్రదానికీ, ఈ చట్టాలపై రైతుల పోరాటానికీ బస్సుజాతా గొప్ప స్ఫూర్తినిస్తుందనడంలో ఏలాంటి సందేహం లేదు.
- టి. సాగర్
సెల్:9490098055