Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం దేశంలో ఒక అసాధారణ పరిస్థితిని చూస్తున్నాం. ఆహార ధాన్యాలు పండించి ప్రజాపంపిణీ వ్యవస్థకు సరఫరా చేయాలని కోరుకునే వినియోగదారులు ఒకవైపున, పంట మార్పిడితో లాభాలు ఉంటాయని రైతులను ఉసిగొల్పుతుంటే, పంటలను మార్పిడి చేయడం తమకిష్టం లేదని చెపుతున్న రైతులు మరొక వైపు ఉన్నారు. ఈ రెండు విరుద్ధమైన ప్రయోజనాలకు ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించాల్సి ఉంది. ప్రస్తుతం భారత దేశంలో ఆహార పంటలను కాదని, రైతులు పంటలను మార్చాలనుకోవడం లేదు. వినియోగదారులు కూడా ఆహార ధాన్యాలను పండించి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సరఫరా చేయాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించాల్సి ఉందనే దానిపై వారి మధ్య భిన్నమైన ప్రయోజనాలు లేవు. అయినా ఆహార పంటల నుంచి ప్రజాపంపిణీ వ్యవస్థను నాశనం చేసే వ్యాపార పంటలకు మార్పు చేసుకోవాలని ప్రభుత్వం రైతులను ఒత్తిడి చేస్తుంది.
అటువంటి పంటల మార్పిడి కచ్చితంగా చేయాలనే లక్ష్యంతో చేసినవే ప్రస్తుత వ్యవసాయ చట్టాలు. ఈ చట్టాలకు అనుకూలంగా మాట్లాడుతున్న ప్రభుత్వ ఆర్థిక వేత్తలు పంటల మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాల గురించి అదేపనిగా చెపుతున్నారు. ఇక్కడ ప్రజల మధ్య ఉండే విరుద్ధ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించడం కాకుండా, ప్రభుత్వమే తన స్వప్రయోజనాల కోసం ప్రజలు, వినియోగదారులపైన ఆ చట్టాలను బలవంతంగా రుద్దుతుంది. అందుకే ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇది ప్రజలకూ, ప్రజలకూ మధ్య ఉన్న స్థితి కాదు, ఇది ప్రభుత్వానికీ, పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలకు మధ్య ఉండే ఒక వింతైన పరిస్థితి.
అదేవిధంగా రైతులు ఏకగ్రీవంగా ఒప్పంద వ్యవసాయాన్ని తిరస్కరిస్తున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం రైతుల ప్రయోజనాల కోసమే అని ఒప్పంద వ్యవసాయాన్ని ఈ చట్టాల ద్వారా ముందుకు తీసుకొని వస్తోంది. ఇదేదో ప్రజల డిమాండ్కు ప్రభుత్వ స్పందన కాదు, ప్రభుత్వ స్వప్రయోజనాల కోసమే ఈ చట్టాలను ప్రజలపై రుద్దుతుంది.
ప్రభుత్వ స్వంత ప్రయోజనం ఏమిటి? ప్రభుత్వ స్వంత ప్రయోజనాలు, కార్పొరేట్లు, అంతర్జాతీయ వ్యవసాయ వ్యాపార ప్రయోజనాలు ఒకే విధంగా ఉన్నాయని స్పష్టం అయినప్పుడు, ప్రభుత్వం ఆ చట్టాలు 'జాతి ప్రయోజనాల కోసం' అనే సమాధానం చెపుతుంది. ఆ విధంగా కార్పొరేట్ల ప్రయోజనాలు 'జాతి ప్రయోజనాల'తో గుర్తించబడు తున్నాయి. ఇది మోడీ నిర్మించిన, మోడీని అధికారంలో కూర్చోబెట్టిన, కార్పొరేట్-హిందూత్వ కూటమి నాయకత్వంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలన యొక్క లక్షణం.
మితవాద ప్రభుత్వాలు కూడా సమాజంలోని ఒక వర్గానికి చెందిన ప్రజల ప్రయోజనాలను సమర్థిస్తూ కార్పొరేట్ విధానాలకు అనుకూలంగా ఉంటున్నాయి. కార్మిక సంఘాల ఆరోపణలతో పెద్ద సంఖ్యలో గాయపడిన ప్రజలు, వారి కారణంగా ఏర్పడిన ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసే సాధనంగా, కార్మిక సంఘాలపై చేసిన దాడిని మార్గరేట్ థాచర్ సమర్థించు కుంది. కానీ భారతదేశం సమాజంలోని ఏ ప్రజా సమూహాలు డిమాండ్ చేయకుండానే, ఏకపక్షంగా, అనవసరమైన చర్యలను విధిస్తూ ఉండడాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అవి ప్రజాపంపిణీ వ్యవస్థను కూల్చివేసే చర్యలుగా మనకు హెచ్చరికలు చేస్తున్నాయి. ఆ చర్యలను ప్రజలు పెద్దసంఖ్యలో వ్యతిరేకిస్తూ, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఈ చర్యలన్నీ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను ముందుకు తీసుకొని పోయేందుకు ఉద్దేశించబడినవే. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి చర్యలు గతంలో ఎప్పుడూ జరుగలేదు.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించింది కాబట్టి తన ఇష్టానుసారంగా 'సంస్కరణలను' తీసుకొని వచ్చే విధంగా ప్రజలు ఆదేశాలిచ్చారని ప్రభుత్వం చెపుతుంది. కానీ ఇది తప్పుడు పద్ధతి అని చెప్పేందుకు అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది, ఎన్నికల్లో గెలుపు, ప్రభుత్వం తనకిష్టం వచ్చినట్టు చేసేందుకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చినట్టు కాదు. ఇది సూత్ర ప్రకారం తప్పు. రెండవది, ముఖ్యంగా 2019లో 'వ్యవసాయ సంస్కరణల' సమస్యల ఆధారంగా ఎన్నికల్లో పోటీ జరగలేదు. వాస్తవానికి పాలక పార్టీ ఎన్నికల ప్రచారంలో ఈ వ్యవసాయ సంస్కరణల ప్రస్తావన రాలేదు. ఈ ఎన్నికల ప్రచారంలో పాలక పార్టీ పుల్వామా దాడి, బాలాకోట్ యుధ్ధ విమానాల దాడిపైనే కేంద్రీకరించింది. మూడవది, చట్ట సభలలో మెజారిటీ ఉన్న పార్టీలు కూడా ప్రాధాన్యతను కోల్పోవడంతో, రాజకీయాలు కూడా సరుకీకరణ (కమోడిటైజేషన్) చేయబడుతున్నాయి.
ఎన్నికల్లో పోటీ చేయడం అనేది అసాధారణమైన ఖర్చుతో కూడినదిగా మారింది. ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీల నుంచి ఫిరాయింపులు సర్వసాధారణం అయ్యాయి. ఇది కూడా ఖర్చుతో కూడిందే. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది పెద్ద సమస్యే కాదు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ కోసం ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఈ అన్ని కారణాల వల్ల ఎక్కువ డబ్బు ఉన్న పార్టీకి, ఇతర పార్టీల కంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి డబ్బును సమకూర్చేందుకు కార్పొరేట్ శక్తులు పెద్ద వనరుగా ఉంటాయి కాబట్టి అటువంటి శక్తులతో ఆయా పార్టీ/పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు ఒక కూటమిని ఏర్పరచుకుంటాయి. అందుకు గాను ఒకరినొకరు 'నీకిది, నాకది' (క్విడ్ ప్రో కో ) అనే పద్ధతిలో ఒప్పందాలు చేసు కుంటారు. మతతత్వ సమీకరణ ఎజెండాతో హిందూత్వ శక్తులు (కార్పొరేట్ ఫైనాన్స్ ప్రోత్సాహంతో) సరుకీకరణ రాజకీయ ప్రపంచంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తాయి. వారితో చేసుకున్న 'క్విడ్ ప్రో కో' ఒప్పందంలోనే 'రైతుల వ్యవసాయంపై అదుపు' కూడా కలిసి ఉంది.
కార్పొరేట్లు మొత్తంగా, ఉన్నత స్థానంలోని పలుకుబడి కలిగిన వారి నుంచి సాధారణంగా ఇతరుల కంటే ఎక్కువ లాభం పొందుతారు. జర్మనీలో 1930వ దశకంలో, ఆయుధ సామగ్రిని, సరుకులను ఉత్పత్తి చేసే పరికరాలను ఉత్పత్తి చేసే పనిలో నిమగమైన గుత్త పెట్టుబడిదారీ వర్గంలోని ఒక వర్గం నాజీలతో ఏర్పాటు చేసుకున్న కూటమి వలన లాభం పొందారని డేనియల్ గెరిన్ (ఫాసిజం Ê బడా వ్యాపారులు) రుజువు చేశారు. జపాన్లో 'షింకో జైబత్సు' లాంటి కొత్త కంపెనీలు అంతకు ముందున్న మిత్సూరు లాంటి పాత కంపెనీల కంటే ఎక్కువ లాభాలు (1931లో అధికారంలోకి వచ్చిన ఫాసిస్ట్ పాలనలో) పొందారు. ప్రస్తుత భారతదేశం 1930 దశకంలో జర్మనీ, జపాన్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ కూడా కొత్త కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి. కానీ అవి రైతుల ఆగ్రహాన్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి.
మోడీ కార్పొరేట్ కంపెనీలను ''సంపద సృష్టికర్తలుగా'' పరిగ ణించడం ద్వారా కార్పొరేట్ ప్రయోజనాలను, జాతిప్రయోజనాలతో గుర్తించేందుకు ఒక ప్రాతిపదికను తయారు చేసుకున్నాడు. అంటే ఆయన ఉద్దేశ్యంలో 'జాతి' సంపద అని అర్థం. కేవలం ఇలాంటి వివరణతోనే ఆయన పోగుపడిన ప్రయివేట్ సంపదను ఒక జాతీయ సేవగా, ఆ సంపదను పోగుచేసిన వారిని 'జాతికి' విశేషాధికారాలు గల సభ్యులుగా, వారి ప్రయోజనాలే అత్యంత ప్రాముఖ్యతమైనవిగా గుర్తించాడు. కార్పొరేట్లందరికి లాభం చేసేందుకే ఈ సంపదను పోగేసినట్టు, ప్రజలందరి ప్రయోజనాల కోసమే, ఉన్నత స్థానాల్లో ఉన్న వారి డిమాండ్లను సమ్మతించే విధంగా అన్ని వర్గాల ప్రజలను ఒప్పించారు.
ఆ విధంగా నరేంద్ర మోడీ, ప్రజలతో గుర్తించాల్సిన 'జాతి' భావనను కార్పొరేట్లతో ముఖ్యంగా ధనవంతులైన కార్పొరేట్లతో గుర్తించి ఆ భావనను తలక్రిందులు చేశాడు. వ్యవసాయ బిల్లుల ద్వారా ఈ మార్పుపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఇది మన వలసవాద వ్యతిరేక పోరాటానికి ద్రోహం చేసినట్లే. 17వ శతాబ్దంలో అభివద్ధిచెందిన 'జాతి' భావన, చక్రవర్తి పాలనను సమర్థించింది. అది 'అంతర్గత శత్రువు'ను గుర్తించింది.
ఆనాడు 'జాతి భావన'ను దేవతగా భావించి, ప్రజలు దాని కోసం త్యాగాలు చేసేంత యోగ్యత ఆ భావనకుండేది. దానికి భిన్నంగా, భారతదేశం లాంటి దేశాల్లో వలసవాద వ్యతిరేక జాతీయ భావాలు మిగిలినవాటి కంటే ప్రత్యేకంగా కనిపించాయి. లౌకికతత్వం ప్రధానమైన అంశంగా ఉండే కలుపుకొని పోయే భావన, ప్రజల జీవన స్థితిగతులలో అభివద్ధే ముఖ్యమైన అంశాలుగా జాతీయ భావాలు ఉండేవి. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వ అవగాహనలో జాతిభావన అంటే నిస్సందేహంగా వీటికి వ్యతిరేకంగా ఉంటూ, ఫాసిజమే అంతిమ లక్ష్యంగా ఉన్న యూరోప్ జాతి భావనకు దగ్గరగా ఉంటుంది.
ఢిల్లీ చుట్టూ చేరిన రైతులు, ప్రతీ విషయంలో మోడీ ప్రభుత్వం యొక్క ప్రాపంచిక దృక్పథాన్ని వ్యతిరేకిస్తున్నారు. హిందువులు, సిక్కులు, ముస్లిం రైతులందరూ భుజం భుజం కలిపి చేస్తున్న పోరాటం, వారు లౌకికతత్వాన్ని సమర్థిస్తున్న విషయాన్ని రుజువు చేస్తుంది. వారు వ్యవసాయం లోకి కార్పొరేట్ శక్తులు అక్రమంగా చొరబడడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అదే విధంగా, కొన్ని కార్పొరేట్ కంపెనీలతో 'జాతిని' గుర్తించే తీరును కూడా వారు నిరాకరిస్తున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను (పీడీఎస్) సమర్థించడం ద్వారా, ప్రజలకు సేవలందించడానికి ఈ పీడీఎస్ వ్యవస్థను అత్యంత ప్రాధాన్యతగల అంశంగా రైతులు పరిగణిస్తున్నారు. మోడీ ప్రభుత్వ అదుపులో ఉన్న జాతి భావనను తిరిగి చేజిక్కించుకునేందుకు రైతు ఉద్యమం ప్రయత్నిస్తుంది.
- ప్రభాత్ పట్నాయక్
'ద టెలిగ్రాఫ్' పత్రిక సౌజన్యంతో
బోడపట్ల రవీందర్
సెల్:9848412451