Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజమే.. దేశం కోసం, దేశప్రజల్ని సకల పీడనల్నించి విముక్తి చేయడం కోసం విప్లవించాల్సిన సమయమిది. అన్నిరకాల పెత్తనాలనీ, అణచివేతల్నీ, కపట నినాదాల్నీ ప్రతిఘటించాల్సిన సందర్భమిది. యువతలో స్ఫూర్తి నింపేందుకు సుభాష్చంద్రబోస్ 125వ జయంతిని 'పరాక్రమ దివస్'గా జరుపుకోవాలని కేంద్రం తలపెట్టిన నిర్ణయం వారి ఎజెండాలో అంతర్భాగం. ఆ ఎజెండా అసలు స్వభావాన్ని తేటతెల్లం చేయడం కోసం ఈ సందర్భాన్ని ఉపయోగించు కోవాలి. దేశ స్వాతంత్య్ర సమరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు ఇవాళ ప్రజలకు మరింత స్ఫూర్తిదాయకం. ఎత్తుగడల రీత్యా, వ్యూహరీత్యా నేతాజీ కొన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకొని వుండవచ్చు గానీ ఆయన అవిశ్రాంత సమరయానం ముందు అవి చాలా చిన్నవి. అందుకే సుభాష్చంద్రబోస్ ఉద్యమదీప్తిని అంది పుచ్చుకోవాల్సిన శ్రేణులు నిర్లిప్తంగా ఉంటే ఇతరులు వారిని హైజాక్ చేస్తారు. బ్రిటిషు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బోస్ జరిపిన రాజీలేని పోరాటాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. స్వాతంత్య్రం కోసం పోరాడటమే కాదు, స్వాతంత్య్రానంతరం భారతదేశం సామ్యవాద పంథాలో నడవాలని ఆశించిన సుభాష్చంద్రబోస్ ఆలోచనలసారంపై పునర్విశ్లేషణ అనివార్యం.
హిందూత్వ ప్రతీకలు
ఈ దేశానికి దీపధారులయిన వారిని హిందూత్వ ప్రతీకలుగా చూపుతూ దశాబ్దాలుగా జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి కాషాయమూకలు. ఈ జాతి జీవనంలోని లౌకిక సంప్రదాయ వారసత్వాన్ని అవహేళన చేస్తూ హిందూత్వ పేరిట తీవ్రజాతీయవాదాన్ని రెచ్చగొట్టడం గమనార్హం. ఫలితంగా తటస్థంగా ఉండేటువంటి వేల, లక్షల మంది 'జాతి' అనే సంకుచిత భావనలకు మెదళ్ళను అప్పగిస్తున్నారు. ఈ క్రమాన 'విశ్వమానవ శ్రేయస్సు' అనే భావనకు నీళ్ళొదులుతున్నారు. కొన్ని మతాల, కులాల గాటన చేర్చి 'భారత జాతి' అనే భావన చుట్టూరా సంకుచిత కథనాలు అల్లారు. ఆ కథనాలకు హిందుత్వ రంగులద్దుతూ 'హిందూ జాతి' అనే కృతకమైన భావనని పరివ్యాప్తం చేశారు. 'హిందూ జాతి', 'భారత జాతి' అనేవి సమానమనే భ్రమలతో ముంచెత్తారు. 'చదువుకున్న' మధ్యతరగతి జనావళి ఈ భ్రమలతోనే సంఘీయులకు అధికారాన్ని కట్టబెట్టింది. రోజురోజుకీ ఈ కృతక భావనలే యువతలోనూ పాదుకొని తీవ్ర జాతీయవాదానిది పైచేయి కావడం మనకాలపు విషాదం.
రాజకీయ విదూషకత్వం
ఈ వికృత వైపరీత్యానికి జనసమూహాల్ని లోను చేసే పకడ్బందీ వ్యూహంలో భాగంగానే సుభాష్చంద్రబోస్ 125వ జయంతిని 'పరాక్రమ దివస్'గా నిర్వహించ తలపెట్టింది కాషాయ ప్రభుత్వం. బీజేపీ దీర్ఘకాలిక రాజకీయ క్రీడలో భాగంగా తీసుకున్న నిర్ణయమిది. జాతీయోద్యమంలో కీలకపాత్ర పోషించిన సుభాష్ని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పాచికగా చేసుకోడం వర్తమాన భారత రాజకీయాల్లోని విదూషకత్వం. పశ్చిమ బెంగాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో గెలవడం బీజేపీకి అవసరం. హిందూత్వ ఎజెండా అప్రతిహతమైనదని చెప్పడం కోసం సకల అస్త్రాల్ని ప్రయోగించడం ఆ పార్టీ కౌటిల్యం. ఈ కౌటిల్యానికి మంచీచెడు, సిగ్గూ బిడియం ఏమీ ఉండవు. మాయోపాయాలతో నెగ్గితీరాలనుకున్నవారు తమని వ్యతిరేకించేవారిని సైతం తమ ఐకాన్లుగా చేసుకుంటారు. జనాల్ని పక్కదారి పట్టిస్తారు.
ఎవరి ప్రతీక
తన నేలనీ, ప్రజనీ బానిసలుగా చేసిన బ్రిటిషు వారి పాలనా యంత్రాంగంలో భాగం కాలేనని ఇండియన్ సివిల్ సర్వీసు (ఐసిఎస్) లోని అత్యున్నత పదవికి రాజీనామా చేసిన ధీరోదాత్తుడు సుభాష్ చంద్రబోస్. తన ప్రతిభా సంపత్తులతో ఐసిఎస్ పరీక్షల్లో నాలుగో ర్యాంకు సాధించిన మేధావి. తన తెలివితేటలు, ప్రతిభా సామర్థ్యాలు సామ్రాజ్యవాదులకు తాకట్టు పెట్టేందుకు ఇష్టపడకనే ఇండియాకు తిరిగి వచ్చిన సుభాష్ తొలుత జర్నలిస్టుగా పనిచేశాడు. తన అభిప్రాయాల్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసేందుకు స్వరాజ్, ఫార్వర్డ్ వంటి పత్రికలు నడిపాడు. పత్రికాస్వేచ్ఛకు అత్యున్నత ప్రాధాన్యమిచ్చిన బోస్ని ఇవాళ ఒక ఐకాన్గా బీజేపీ చెప్పడం విరోధాభాస. అభిప్రాయాల వ్యక్తీకరణనీ, అసమ్మతి స్వరాల్ని అణచివేసే కాషాయ పరివారానికీ సుభాష్చంద్రబోస్ పేరు ఎత్తే నైతిక అర్హత అస్సలు లేదు. ఒకవైపున ఆయన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తూ, మరోవైపున ఆయన భావజాలానికి విరుద్ధంగా ఈ దేశాన్ని కార్పోరేట్ల పరం చేసే బీజేపీ ప్రభుత్వ కుతంత్రం క్షమించరాని నేరం.
స్వాతంత్య్రం - సామ్యవాదం
స్వాతంత్య్రానంతరం ఈ దేశ ప్రధానిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ చరిత్ర మీద సిరామరకలు పూసే కాషాయ పరివారం నెహ్రూ కన్నా అతి తీవ్ర జాతీయవాదిగా ప్రసిద్ధి చెందిన సుభాష్ చంద్రబోస్ని శిరోధార్యంగా భావించడం విడ్డూరం కాదు, దురుద్దేశపూర్వక కుటిలత్వం. బ్రిటిషు సామ్రాజ్యవాదాన్ని ఈ దేశం నుంచి పారదోలే క్రమాన గాందీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్లు విభిన్నమైన పంథాని అనుసరించారు. 'మధ్యేమార్గం' లేదని సంపూర్ణ స్వరాజ్యం ఒక్కటే మార్గమని ఘంటాపథంగా చెప్పిన సుభాష్ చంద్రబోస్ నాడు యువ కిశోరాలకు ఆరాధ్యుడు. కాలం గడుస్తున్న కొద్దీ సుభాష్ అనుసరించిన ముక్కుసూటి విధానం పై చేయి సాధించింది.
గాంధీ-నెహ్రూలతో పోల్చుకుంటే సుభాష్ చంద్రబోస్ ఆనాడు మరింత పరిణతితో వ్యవహరించారని నాటి ఆయన ఆలోచనల్ని, పోరాటగమనాన్ని పరిశీలిస్తే బోధపడుతుంది. స్వాతంత్య్రానంతరం తను ఆలోచనలకు తగినట్టుగా మధ్యేమార్గంలో మిశ్రమ ఆర్థికవ్యవస్థని అనుసరించాడు నెహ్రూ. అది ఆయన పరిమితి. అయితే స్వాతంత్య్రానంతర భారతం మీద బోస్కు స్పష్టమైన దార్శనికత ఉన్నది. దేశానికి రాజకీయ స్వాతంత్య్రం సాధించడంతోనే సరిపోదని, కనీసం ఇరవయ్యేండ్ల పాటు సామ్యవాద నియంతృత్వం (సోషలిస్టు అథారిటేరియనిజం) కొనసాగాలన్నది సుభాష్ ఆకాంక్ష.
జాతీయ సోషలిజం-కమ్యూనిజం భావనల సమాహారం సుభాష్ ఆలోచనా విధానమని ఆయన జీవితాన్ని, తాత్వికతని అధ్యయనం చేసినవారు చెబుతారు. ఇపుడు సోషలిజపు ఛాయల్ని చెరిపేసే రీతిన వ్యవహరించే బీజేపీ పాలకులు సుభాష్ జయంతిని ఏడాది పొడుగునా 'పరాక్రమ దివస్'గా జరుపుతామని చెప్పడం హాస్యాస్పదం. ఈ నేలని నమ్ముకున్న రైతులు దాదాపు రెండునెలలుగా ఆందోళన చేస్తున్నా కిమ్మనని కాషాయ నేతలు బోస్ పేరు ఎత్తడమే నగుబాటు. ఈ నేలనీ, ఈ దేశ ప్రకృతి సంపదల్నీ కార్పొరేట్ల పరం చేసే పాలకగణాలకు బోస్ పేరు ఎత్తే అర్హత ఎక్కడిది? బోస్ జయంతిని నిర్వహించాలనుకుంటే తొలుత అంబానీ, అదానీలకు దాసోహమనే వైఖరిని విడనాడాలి. ఇందుకు వారు సిద్ధంగా లేరని రైతుల ఉద్యమాలపై వారి స్పందనారాహిత్యమే చెబుతున్నది.
బోస్ దేశభక్తి స్ఫూర్తిదాయకం
బ్రిటిషు పాలకులకు వినతిపత్రాలు సమర్పించడంతో మొదలైన కాంగ్రెస్ ప్రయాణాన్ని ధిక్కారపంథామీదకు తీసుకురావడంలో సుభాష్ చంద్రబోస్ చూపిన చొరవ, సాహసం, సమయోచిత ప్రజ్ఞ, వివేచన అనుపమానం. బోస్ గురించి ఎవరో అల్లిన కథనాల్లోంచి కాకుండా సరికొత్తగా పునర్విశ్లేషించాలి. ఈ క్రమంలోనే కొన్నేండ్ల కిందటనే ప్రసిద్ధ దర్శకుడు శ్యామ్ బెనెగల్ 'సుభాష్ చంద్రబోస్: ది ఫర్గాటెన్ హీరో' అనే చిత్రాన్ని నిర్మించాడు. స్వాతంత్య్ర సమర సాధన కోసం 'అజాద్ హింద్ ఫౌజ్' వంటి సైన్యాన్ని నిర్మించడానికి దారితీసిన పరిస్థితుల్ని వాస్తవికంగా చిత్రించింది ఈ సినిమా. రెండో ప్రపంచ యుద్ధ సమయాన బోస్ పాత్రపై పలురకాల కథనాలు, విశ్లేషణలు చూస్తాం. అయితే అంతిమంగా భారతదేశం సంపూర్ణ స్వరాజ్యం సాధించాలన్న ఆయన నిజాయితీ, తపన అబద్ధం కావన్నది అంగీకరించాలి.
తన స్వాతంత్య్ర పోరాటానికి మద్దతు కూడగట్టే క్రమంలో బోస్ అనుసరించిన ఎత్తుగడలు, వ్యూహాల మీద ఎంతయినా చర్చించవచ్చు. కానీ ఆయన స్వేచ్ఛాపిపాసనీ, సమరశీలతనీ శంకించలేం. 1940లో కాలంలో బ్రిటన్లోని కన్జర్వేటివ్ పార్టీ భారత్కు స్వాతంత్య్రం ఇవ్వడాన్ని ఇష్టపడలేదు. లేబర్పార్టీ భారత స్వాతంత్య్రానికి సమ్మతించింది. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులే గాక, లేబర్పార్టీలోని ప్రభావితశక్తులతో బోస్కు గల సంబంధాలు ఇందుకు దోహదం చేశాయి. ఒక స్వతంత్ర దేశంగా భారత్ వెలుగొందాలన్నది బోస్ ఆకాంక్ష. ఒకవైపున బ్రిటిషు సామ్రాజ్యవాదులతో తలపడుతూనే, మరోవైపున దేశాల, జాతుల స్వేచ్ఛని ఆశించే శక్తులతో, వ్యక్తులతో సన్ని హితంగా మెలగడం బోస్లోని అంతర్జాతీయ దౌత్యనీతికి తార్కాణం. అగ్రరాజ్యాల ఆధిపత్యాన్ని మాటమాత్రంగా నైనా ప్రశ్నించలేని ఇవాళ్టి పాలకులు బోస్పేరు తలబోయడం వైచిత్రి.
చరిత్ర చోదకశక్తులు
చరిత్రలో చోదకశక్తులుగా నిలిచిన వ్యక్తుల, సంస్థల క్రియాశీలతని తమకు అనువుగా మలుచుకునే తంత్రం గత ఆరేండ్లుగా కొనసాగుతున్నది. వీలయితే తమకు అనువుగా మార్చుకోడం, లేదంటే వారి ప్రతిష్టని మంట గలిపే రీతిన మసిపూయడం అనే రెండంచెల పద్ధతిని సంఫ్ు పరివారం అనుసరిస్తున్నది. అందువల్లనే చరిత్రకు వక్రభాష్యాలు చెబుతున్నది. మేరునగం వంటి నేతలని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మతం ఉద్ధారకులుగా కుదిస్తున్నది. నిశ్శబ్దంగా సాగిస్తున్న ఈ కుట్రలపై ప్రజానుకూల శక్తుల మౌనం, పట్టింపులేని తనం వల్ల సమరయోధులెందరో సంకుచిత 'జాతి' భావనల ఐకాన్లుగా చిత్రితమవుతున్నారు. వీటిని పట్టించుకోనందున యువతకు స్ఫూర్తిగా నిలవాల్సిన స్వామి వివేకానంద బీజేపీ యువత ఐకాన్గా కుదించబడ్డాడు. సర్దార్ వల్లభాయిపటేల్ బీజేపీ సైద్ధాంతిక స్వరంగా పేరు బడ్డాడు. ఆయనకులేని హిందూత్వని ఆపాదించే ధోరణి రాజ్య ం చేస్తున్నది. ఇక ఇపుడు సుభాష్ చంద్రబోస్ వంతు వచ్చింది.
చరిత్ర చోదకశక్తుల్లో కీలక భూమికని పోషించారు సుభాష్ చంద్రబోస్. కానీ ఆయన చరిత్రనీ, ఆయన పోరాటశీలతనీ తమ వర్గపు భావజాలపరిధుల్లోకి కుదించే వ్యూహానికి తెరదీసింది సంఫ్ుపరివారం. ఈ కౌటిల్యం పట్ల మౌనం వహించడం ప్రతీపశక్తుల వీరంగానికి దారితీస్తుంది. ప్రతీఘాతుక శక్తుల దుర్మార్గాన్ని మౌనంగా ఆమోదించినట్టవుతుంది. ఇప్పటికే చరిత్రలో శివాజీ, రాణా ప్రతాప్ల చరిత్రని 'జాతి' 'మత' భావనలకు అనుగుణంగా కుదించారు. సామ్రాజ్యవాదులను గడగడలాడించిన కాకలు తీరిన యోధుడు సుభాష్ చంద్రబోస్ కొందరి సొత్తు కావడం ఆక్షేపణీయం.
దీప్తిమంతం బోస్ శౌర్యం-పరాక్రమం
నేతాజీలో రగుల్కొన్న రీతిన యువతలో దేశభక్తి భావనలు ప్రజ్వరిల్లాలి. వాటిని రగిలింపజేయాల్సిన బాధ్యత నిజమైన దేశభక్తులు, ప్రజానుకూల శక్తులు స్వీకరించాలి. అహరహం దేశం గురించి తపించిన సుభాష్ చంద్రబోస్ మాదిరిగా స్వేచ్ఛా, సమానత్వాల కోసం యువత సంఘటితం కావాలి. సామ్రాజ్య వాదశక్తుల్ని ప్రతిఘటిస్తూ బోస్ చూపిన ధిక్కారం, తిరుగుబాటు చైతన్యం యువతకు దీప్తి, స్ఫూర్తి. కనుకనే జాతి జనుల సంపదనీ, శ్రమనీ దోచుకునే ప్రైవేటీకరణనీ, కార్పోరేటీకరణ పన్నాగాల్ని నిరసిస్తూ యువకిశోరాలు ముందుకు రావాలి. నిజమైన స్వేచ్ఛ కోసం, బోస్ స్వప్నించిన సామ్యవాద వ్యవస్థ సాకారం కోసం రణనిన్నాదాలు చేస్తూ సంఘటితం కావాలి. ఈ దేశాన్ని సామ్రాజ్యవాదులకీ, కార్పోరేట్లకీ కట్టబెట్టే పాలకుల కుట్రల్ని ప్రతిఘటించే పరాక్రమాన్ని ప్రదర్శించాలి. ఇందుకు అనువుగా యువచైతన్యాన్ని ప్రోది చేసే క్రియాశీలతనే సుభాష్ చంద్రబోస్కు నిజమైన నివాళి.
- గుడిపాటి
సెల్: 9490099327