Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ ఆ తర్వాత కూడా ఎందరో గొప్ప నేతలు ఉన్నా దాన్నే పేరుగా నిలుపుకున్న ధీమంతుడు సుభాస్ చంద్రబోస్ ఒక్కరే. బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకమైన ఐసీఎస్ చదివి కూడా అన్నీ వదులకుని స్వాతంత్య్ర పోరాటంలో దూకారు. గాంధీజీ విధానాలతో విభేదించి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసి గెలిచారు. అప్పట్లో ఆయనకు కమ్యూనిస్టులు ఇతర అభ్యుదయ వాదుల మద్దతు లభించడం అందుకు కారణమైంది. అయితే ఆ విజయం తర్వాత ఆగ్రహించిన గాంధీజీ కాంగ్రెస్లో సంక్షోభం సృష్టించడంతో సుభాస్ చంద్రబోస్ రాజీనామా చేసి బయిటపడ్డారు. ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించారు. 1940లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీజర్మనీకి బ్రిటన్ శత్రుదేశం గనక ఆ దేశం సహాయంతో భారతదేశాన్ని విముక్తి చేయొచ్చని ఒక అవాస్తవమైన ఆలోచనచేసి హిట్లర్తో చేతులు కలిపారు. నక్క జిత్తులకు మారుపేరైన నాజీ హిట్లర్ తన దగ్గరున్న భారతీయ ఖైదీలను బోసుకు అప్పగించారు. వారితో రెండవ ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఎ) ఏర్పడింది. అంతకు ముందే జపాన్ సహాయంతో ఏర్పడిన మొదటి ఐఎన్ఎ కొంత నీరసపడి ఉంటే దానికి కొత్త ప్రాణం పోశారు. ఇంకా అనేక మంది దేశభక్తులను చేర్చుకున్నారు. ఆగేయాసియాలోని సింగపూర్లో స్థావరం ఏర్పాటు చేసుకుని బ్రిటన్పై పోరాడేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఈ క్రమంలో 1945 ఆగస్టు18న విమానంలో బయిలుదేరిన నేతాజీ పార్మోజా దీవి(ఇప్పటి తైవాన్)లో మరణించారు. జపాన్కు చెందిన తనోషీ యోషీమా నాయకత్వంలోని సైనికవైద్య బృందం అన్ని పరీక్షలు జరిపి మరణించినట్టు ప్రకటించింది. ఆయన అంత్యక్రియలు నిర్వహించి చితాభస్మాన్ని భద్రపర్చారు. అయితే ఆ ప్రమాదంలో ఆయన మరణించలేదనీ, ఉత్తర ప్రదేశ్ దగ్గర సాధువు రూపంలో జీవించి ఉన్నారని అప్పట్లో ఒక వదంతి బయిలుదేరింది. ఈ కథలు సజీవంగా ఉంచేందుకు పాలకపక్షాలు చేయగలిగినంతా చేస్తూనే వస్తున్నాయి.
నేతాజీ సహాయకుడైన ఉత్తమచంద్ మల్హోత్రా ఆయనను గుర్తించాడని చెబుతుంటారు. ఆ సాధువు ఎప్పుడూ బయిటకు వచ్చేవాడు కాదనీ, ఏదో నిగూఢంగా ప్రవర్తించేవాడని ఏవేవో కథనాలు... గాందీజీ అంత్యక్రియలకు హాజరైనాడని మరో కథనం... ఇదంతా తెలిసి కూడా మొదటి ప్రధాని నెహ్రూ కావాలనే ఈ విషయంలో ఆసక్తి చూపకుండా తొక్కిపడుతున్నాడని ఆరోపణలు. తాను రష్యాలో ఉన్నాననీ తప్పించుకోవడానికి సహాయపడాలని నేతాజీ రాసిన లేఖకు కూడా నెహ్రూ స్పందించలేదనేంతవరకూ ఈ ఆరోపణలు వెళ్లాయి. దీనిపై నెహ్రూ ప్రభుత్వం 1956లో షా నవాజ్ కమిషన్ను నియమించింది. విస్తృతంగా విచారణలు జరిపిన మీదట ఆ కమిషన్ నేతాజీ మరణించాడని నిర్థారించింది. తర్వాత కూడా ఈ ప్రచారాలు ఆగకపోవడంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం 1970లో జస్టిస్ ఖోస్లా కమిషన్ను నియమించింది. ఈ కమిషన్కూడా అనేక మందిని విచారించి అనేక పర్యటనలు జరిపి నేతాజీ మరణించినట్టు నిర్ధారించింది. 1977లో జనతా ప్రభుత్వం ఏర్పడినప్పుడు పార్లమెంటు సభ్యుడైన సమర్ గుహా నేతాజీ బతికి ఉన్నట్టు ఒక చిత్రం విడుదల చేశారు. అది ఆయన సోదరుడైన శరత్ చంద్రబోసుదని బెంగాలీ పత్రికలు పోలికలతో సహా ప్రకటించాయి. ఆ తర్వాతి కాలంలో నేతాజీ చితాభస్మం తెప్పించి నదుల్లో విలీనం చేశారు. వాజ్పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2000లో జస్టిస్ ఎంఎస్ ముఖర్జీ కమిషన్ను నియమించినా వారు కూడా తేల్చిందేమీ లేకపోయింది. నరేంద్ర సిక్దర్ అనే పాత్రికేయుడు ఒక అఫిడవిట్ సమర్పించాడు. భారత కమ్యూనిస్టు ఉద్యమ తొలివ్యవస్థాపక బృందంలో ఒకరైన వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ కుమారుడు నిఖిల్ చటోపాధ్యాయ తను నేతాజీని రష్యాలో కలుసుకున్నానని తనతో చెప్పినట్టు ఆ అఫిడవిట్లో ఉంది. మరి నేతాజీ ఇండియాకు ఎందుకు రాలేదంటే నెహ్రూకు భయపడటం వల్లనట. ఈ విషయం నెహ్రూ సన్నిహితుడైన కృష్ణమీనన్కూ తెలుసట. అలాగే నేతాజీని యుద్ధ నేరస్తుడుగా రష్యాకు పట్టుకుపోయారని నెహ్రూ సంతకంలేని లేఖలో బ్రిటిష్ ప్రధాని అట్లీకి రాశారని మరో కథ. వినడానికే విడ్డూరంగా ఉండే ఈ కబుర్లపై వాజ్పేయి ప్రభుత్వం కూడా స్పందించలేదు. వారు నియమించిన ముఖర్జీ కమిషన్ నేతాజీ ఆ రోజున విమాన ప్రమాదంలో మరణించలేదనీ, అయితే సరిగ్గా ఏం జరిగిందనేది చెప్పడానికి ఆధారాలు లేవనీ నివేదించింది. ఆయన మరణించాడనే భావిస్తున్నట్టు 2013లో ప్రభుత్వమే లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. నేతాజీ సైన్యంలో పనిచేసిన కెప్టెన్ లక్ష్మీ సైగల్ కూడా ఆయన మరణించారనే చెప్పడం ఈ వ్యాసరచయిత చాలా సార్లు విన్నారు, అనువదించారు కూడా.
ఇంత జరిగిన తర్వాత మరోసారి నేతాజీ సుభాస్ చంద్రబోస్ ప్రమాద మరణంపై ఈ కథనాలకు సంబంధించిన 64 ఫైళ్లను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2015లో ఎన్నికల ముందు విడుదల చేశారు. ప్రధాని మోడీ కూడా కొన్ని ఫైళ్లు రోజుకు కొన్ని చొప్పున బయిటపెట్టారు. నేతాజీ కుటుంబ సభ్యులను విందుకు పిలిచి మరీ కొన్ని ఫైళ్లు చేతిలో పెట్టారు. బెంగాల్ ఎన్నికల్లో ఉపయోగపడు తుందనే కేంద్ర రాష్ట్రాలు ఈ చర్య తీసుకున్నట్టు మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి. ప్రతిపక్షాలు కూడా అదే విమర్శ చేశాయి. ఇప్పుడు కూడా ఎన్నికల ముంగిట్లో అదే ప్రహసనం పునరావృతమవుతున్నది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో మమతా బెనర్జీ నేతాజీ స్మరణ ఉధృతం చేశారు. బెంగాలీలు నేతాజీని ఎంతగానో ప్రేమిస్తారు గనక వారి మనోభావాలు చూరగొనేందుకు వేసిన తెలివైన ఎత్తుగడగా పత్రికలు దీనిని అభివర్ణించాయి. అయితే ఆ ఫైళ్లలో కొత్తగా బయిటపడిన విషయాలు ఏమీ లేవని కూడా దాదాపు అందరూ అభిప్రాయం వెలిబుచ్చారు. వాస్తవానికి బతికి ఉన్నాడని అనుకున్నవారి లేఖలు కథనాలు మాత్రమే ఇందులో ఉన్నాయి తప్ప అందుకు ఆధారాలు లేనేలేవు. బ్యాంకాక్ నుంచి ఒక ప్రసార వ్యవస్థలో మాట్లాడాడని కొందరు రాస్తే - పెకింగ్ రేడియో నుంచి రోజూ నేతాజీ మాట్లాడతాడని సాయింత్రం ఒక వాక్యం వినిపించేదని ఆయన బంధువు శిశిర్ బోస్ అప్పట్లో చెప్పారు. 1949లో బ్లిట్జ్ పత్రిక ఆయన బతికేవున్నట్టు అనుమానం వెలిబుచ్చుతూ ప్రచురించిన కథనం మరొకటి. నిజానికి బ్లిట్జ్ వారపత్రిక ఆ రోజుల్లో నిరాధార సంచలనాలకు పెట్టింది పేరు. తనకు నిర్దిష్టమైన ఆధారాలేమీ దొరకలేదని కూడా బ్లిట్జ్ నివేదికలో ఉంది. కనుక మొత్తంపైన ఇవన్నీ కథనాలు ఊహాగానాలే. ఒక్కటంటే ఒక్కటి కూడా ఇదమిద్దంగా ఫలానా వారు ఆయనను చూసినట్టు లేదా ఫలానా చోట ఉన్నట్టు చెప్పేవి కావు. కనుకనే 12 వేల పేజీలకు పైగా వున్న 64 ఫైళ్లను విడుదల చేసిన తర్వాత కూడా నూతన సమాచారం శూన్యం.
కానీ ఈ ఫైళ్ల విడుదలతో మళ్లీ కథలు ఊపందుకున్నాయి. నేతాజీ 1968లో బతికే ఉన్నాడని చాలా పత్రికలు 2016లో పెద్ద శీర్షికలు ఇచ్చాయి. ఈసారి స్టాలిన్ను తీసుకొచ్చారు. కొన్ని ఇంగ్లీషు పత్రికలు రాసిన కథనాల్లో నేతాజీ సహాయకుడైన సత్యనారాయణ్ సిన్హాతో మరెవరో ఆయనను చూసినట్టు చెప్పారని ఉంది. సారాంశం చెప్పుకోవాలంటే విమాన ప్రమాదం తర్వాత సోవియట్ ప్రభుత్వం నేతాజీని సైబీరియాలో ఒక ఖైదులో ఉంచిందట. అది కూడా ప్రపంచంలో అతి శీతలమైన యాకుత్సులో 45వ జైలు గదిలో స్టాలిన్ ఆయనను బంధించాడట. అక్కడ ఆయనను చూసినట్టు కోజ్లోవ్ అనే గూఢచారి తనకు చెప్పాడని డా.సత్యనారాయణ సిన్హా అనే మాజీ ఎంపీ ఖోస్లా కమిషన్కు చెప్పినా దానికి తగిన విలువ ఇవ్వకుండా దాటేశారట. ఈ సిన్హా ఆ రోజుల్లో ఎలాగో సోవియట్లో ప్రవేశించి వారి సైన్యంలో పనిచేసిన సందర్భంలో ఇదంతా జరిగిందనేది కథనం. ఈ సిన్హా నెహ్రూ తరపున అంతర్జాతీయ బృందాలలో పనిచేసేవాడు. ఈ విషయాలు తాను నెహ్రూకు చెబితే పెద్ద విలువ ఇవ్వలేదనీ, అంతా అమెరికా ప్రచారమై ఉంటుందని తోసిపారేశాడనీ సిన్హా ఖోస్లా కమిషన్కు చెప్పాడు. ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్టు నేతాజీ సంబంధం పెట్టుకున్న జర్మనీ జపాన్ గాక నాటి సోవియట్ యూనియన్ను దాని అధినేత స్టాలిన్ను ఈ వ్యవహారంలో దోషిగా చూపించే ప్రయత్నం కుత్సితమైంది. ఆనాడు ప్రపంచంలో తిరుగులేని నాయకుడుగా వున్న స్టాలిన్కు నేతాజీ వంటి అనధికార నేత పట్ల అంత ఆసక్తి ప్రదర్శించే అవసరమే ఉండదు. పైగా ఆ రోజుల్లో సోవియట్ యూనియన్కు నెహ్రూ ప్రభుత్వం పట్ల పెద్ద సదభిప్రాయం లేదు. అప్పటికింకా ఆ ప్రభుత్వం బ్రిటిష్ అనుకూల విధానాలను అనుసరిస్తుండడమే అందుకు కారణం. ఈ వ్యవహారంలోకి చైనాను కూడా లాగి ఉత్తుత్తి ప్రమాదం తర్వాత ఆయన చైనా వెళ్లారని మావో నడిపించిన విప్లవ పోరాటంలో పాల్గొన్నారని సరికొత్త వూహాగానాలు సృష్టించారు. వినడానికి ఎంత ఆసక్తి కుతూహలం కలిగించినా నేతాజీ మరణానికి సంబంధించిన ఇవన్నీ కథలు మాత్రమే. విమర్శనాత్మకంగా చూడక తప్పదు. నేతాజీ మనవడు కృష్ణబోస్ కుమారుడు ఎంపీ సాగత్ రారు నేతాజీ మరణించాడనే గట్టిగా నమ్మడమే గాక, ఈ పునర్విచారణ తతంగాలన్నిటినీ ఖండిస్తున్నారు. ఇది చాలా తక్షణ సమస్య గనక వెంటనే విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిందంటే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది.
ఈ కట్టుకథలన్నీ వాతావరణం కలుషితం చేస్తున్నాయి గనకనే 1997లో నేతాజీ శతజయంతి సందర్భంలోనే నాటి వామపక్ష ప్రభుత్వ హయాంలో బెంగాల్ శాసనసభ ఈ ఫైళ్లను బయిటపెట్టాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానించింది. హిట్లర్తో చేతులు కలపడం సరికాదని ఆ రోజుల్లో నేతాజీని విమర్శించినప్పటికీ ఆయన దేశభక్తిపట్ల కమ్యూనిస్టులకు పూర్తి గౌరవం ఉంది. వామపక్ష ప్రభుత్వం ప్రతిఏటా ఆయన సంస్మరణ నిర్వహించేది కూడా. కానీ, నెమ్మదిగా నెహ్రూ గాంధీ వారసత్వాన్ని తగ్గించాలనే వ్యూహం బీజేపీది కాగా, బెంగాల్ ఎన్నికలలో నేతాజీని ఉపయోగించుకోవాలన్నది మమత ఉబలాటం. ఇప్పుడు 125వ జయంతి అందుకు మరోసారి కలసివచ్చినట్టు కనిపిస్తోంది. నేతాజీ ఘన వారసత్వాన్ని కాపాడుకోవడం దేశ భక్తులుగా మన బాధ్యత.
- తెలకపల్లి రవి