Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని సంవత్సరాలుగా 'జాతి - వ్యతిరేకి' అనే పదం వ్యవహారిక పదంగా ఉంటుంది. నేడు ఆరెస్సెస్ను, దాని సంతానాన్ని విమర్శించే వారిని జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు. హిందూ జాతీయవాదానికి నెలవుగా ఉన్న ఈ దేశభక్తిని మతంతో ముడి పెట్టడంలో ఆరెస్సెస్ మరింత శక్తివంతంగా తయారవుతుంది. ఈ జాతికి విధేయులుగా ఉన్న హిందువులను అభినందించే క్రమంలో, ముస్లింల గురించి ముఖ్యంగా 'వారు పాకిస్థాన్కు విధేయులుగా ఉంటారు' లాంటి సున్నిత మైన, నేర్పైన మాటలను ప్రచారంలో పెడుతున్నారు.
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, తన తెలివైన పదాల వ్యక్తీకరణలతో మతం కారణంగా, హిందువులు స్వభావ రీత్యానే దేశభక్తి యుతంగా ఉంటారని పేర్కొన్నాడు. అదేవిధంగా గాంధీ జీ దేశభక్తి మూలం హిందూ మతంలోనే ఉందని చెప్పేందుకు, ఆయన గాంధీజీ మాట్లాడిన వాక్యం యొక్క అర్థాన్నేమార్చాడు.
''భారతీయులందరూ మాతభూమిని ఆరాధిస్తారు. కానీ, నా దేశభక్తి నా మతం నుండే వచ్చిందని, గాంధీజీ అన్నాడు. కాబట్టి, నీవు హిందువు అయితే నీవు స్వయం చాలిత (ఆటోమేటిక్) దేశభక్తునివి అవుతావు. నీవు చైతన్య రాహిత్యం ఉన్న హిందువు కావచ్చు, నీకు ఒక మేల్కొలుపు అవసరం ఉండొచ్చు, కానీ హిందువు ఎప్పటికీ భారతదేశానికి వ్యతిరేకిగా ఉండడు.''
ఈ సమాచారంలో దాగి ఉన్న నేర్పైన మాటలను విశ్లేషించే ముందు మనం, ఆరెస్సెస్ ప్రారంభ దశలో దాని సిద్ధాంతకర్త, యంఎస్ గోల్వాల్కర్ బాగా ఆలోచించి నాజీలను పొగుడుతూ, యూదుల పట్ల నాజీలు వ్యవహరించిన విధంగానే, మనం ఈ దేశంలోని ముస్లింలు, క్రైస్తవుల పట్ల (ఆరెస్సెస్ ప్రకారం వారు విదేశీ మతస్థులు) వ్యవహరించాలని సిఫార్సు చేశాడన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి.
బీజేపీ, వీహెచ్ పీ, ఏబీవీపీ, వన్వాసిస్ కళ్యాణ్ ఆశ్రమ్ల లాంటి తన అనుబంధ సంస్థల ద్వారా, వివిధ ప్రభుత్వ సంస్థలు, మీడియా, విద్యా వ్యవస్థలలో చొరబాటు ద్వారా ఇప్పుడు ఆరెస్సెస్ బలోపేతం అవుతున్నది. హిందూ జాతీయ వాద భావజాలాన్ని అందించే క్రమంలో అది ఉపయోగించే భాష చాలా నేర్పుగా ఉంటుంది. గోల్వాల్కర్ ఔవ శీతీ ఉబతీ చీa్ఱశీఅ ష్ట్రశీశీస ణవళఅవసలో నొక్కి చెప్పిన విధంగానే దాని అర్థం, భావం ఉంటుంది, కానీ దానిని తెలియజేసే విధానంలో అలంకరించబడిన, సున్నితమైన భాషను (సమాజంలో అనేక మంది గందరగోళ పడే విధంగా) ఉపయోగిస్తారు.
గాంధీజీకి సంబంధించినంతవరకు మతం అనేది వ్యక్తిగతమైన విషయంగా భావించి, తనను తాను సనాతన హిందువుగా చెప్పుకున్నాడు. కానీ తన హిందూ మతం ఉదారంగానూ, అందరినీ కలుపుకొనిపోయేదిగా ఉంటుంది. ఆయన మతం అనేక నైతిక విలువలతో కూడి ఉంటుంది. ఆయన తన ఆధ్యాత్మిక శక్తిని అన్ని మతాల నుండి సాధించాడు. ''నన్ను నేను మంచి వానిగా పరిగణిస్తాను, ఒక ముస్లింను నా లాంటి ఒక హిందువుగా పరిగణిస్తాను. ఆ మాటకొస్తే నన్ను నేను ఒక క్రైస్తవుడు, ఒక ఫార్శీతో సమానమైన మంచి మనిషిగా పరిగణిస్తాను'' అంటాడు ఆయన. హిందూ మతాచారాలలో ఇతర మతాలకు చెందిన ప్రజలను గౌరవించడం, వారిని కలుపుకొనిపోయే విధానం ఉంటాయి. ఇది ఆరెస్సెస్ ఆచరించే (మిగిలిన మతాల ప్రజలను మినహాయించే, సంకుచితమైన అవగాహనకు) హిందూ మతాచారాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. వారి ఆచరణ నిరంతరం, ప్రజలు మర్చిపోయిన సమస్యలను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి, ఇతర మతాలకు చెందిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. గాంధీజీ మతాచార, సాంప్రదాయాలు ఉదారంగా, అందరినీ కలుపుకొని పోయే విధంగా ఉంటాయి. కాబట్టే, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భిన్న మతాలకు చెందిన ప్రజలకు నాయకత్వం వహించగలిగాడు.
ఆయన ఎప్పుడూ మతాన్ని, జాతీయతతో, దేశభక్తితో కలిపి చూడలేదు. అంటే దానర్థం దేశం పట్ల, దేశ ప్రజల పట్ల ఉండే ప్రేమ, 'దేశభక్తి' మూలాలు మతంలో లేవు. కానీ మతం మూలం లేని 'జాతీయత'లో ఉంది. ఆయన ఉపయోగించిన పదం 'మతం' రెండు స్థాయిలను కలిగి ఉంటుంది. మొదటిది, ప్రముఖ ఆచారాలు, గుర్తింపు, విశ్వాసం మొదలైన వాటి భావన, రెండవది, మత బోధనలలోని స్వాభావిక నైతికత. మతాలకు నైతికతే ప్రధానమైనది అనే విషయంపై ఆయనకు స్పష్టత ఉన్నప్పటికీ, బీజేపీ, ముస్లిం (ముస్లిం లీగ్ మొదలైన) మతతత్వ వాదుల ఇష్టాలు ఆయన ఉపయోగించిన పదాన్ని కేవలం ఆచారాలు, పవిత్ర స్థలాల స్థాయిలోనే తీసుకున్నాయి.
హిందూ జాతీయవాద భావజాలంలో భాగంగా ఉంటూ, ఆరెస్సెస్కు దగ్గరగా ఉండే సిద్ధాంతకర్తలు, 'భారత దేశాన్ని ఒక జాతిగా నిర్మించిన' గాంధీజీతో పాటు ఇతర జాతీయ నాయకుల మాటలు కూడా ఆరెస్సెస్ భావజాలానికి దగ్గరగా, వాటినే పోలి ఉంటాయని చెప్పేందుకు చాలా కష్టపడుతున్నారు. స్వాతంత్య్రపోరాట ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులకు, 'భారతదేశం ఒక జాతిగా ఏర్పడిన విధానాలకు', వారి భావజాలానికి పోలిక ఉందని చూపించడం ద్వారా వారి సిద్ధాంతానికి చట్టబద్దతను పొందే ప్రయత్నంలో వారు ఆరెస్సెస్ సిద్ధాంతాన్ని నిలుపుకుంటున్నారు.
కాబట్టి, హిందువులు సహజంగానే దేశభక్తి కలిగి ఉంటారు, వారు జాతి వ్యతిరేకులుగా ఉండరనేది ఇప్పుడు సూత్రీకరణ చేస్తుంటే, మరోవైపు ఇతర మతాలకు చెందిన వారి జాతీయత, దేశభక్తి ఇప్పుడు అనుమానాస్పద మైంది. ఇది ఆధునిక భారతదేశ నిర్మాణంలో ముస్లింలు, క్రైస్తవులు అందించిన గొప్ప సేవలను నిర్లక్ష్యం చేస్తుంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిలవడమే కాకుండా భారతదేశ విభజనను వ్యతిరేకించిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్లను అనుసరించిన మిలియన్ల సంఖ్యలో ఉన్న ముస్లింలను ఎక్కడ పెడతారు? షిబ్లీ నొమాని, హస్రత్ మొహని, అశ్ఫఖుల్లాఖాన్లను ఎక్కడ ఎలా చూడాలి? మహ్మదలీ జిన్నా పాకిస్థాన్ను విభజించాలని చేసిన తీర్మానాన్ని వ్యతిరేకించేందుకు ముస్లింల మహాసభను నిర్వహించేందుకు సాధనంగా ఉపయోగించిన అల్లాబక్ష్ సేవలకు ఏం విలువ కట్టాలి? స్వాతంత్య్రోద్యమ పోరాటంలో పాల్గొనేందుకు ముస్లింలు అసంఖ్యాకమైన సంస్థలను ఏర్పాటు చేశారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో, పారిశ్రామిక, విద్యా, క్రీడా, సాంస్కృతిక రంగాలలో దేశాన్ని ముందుంచేందుకు స్వాతంత్య్ర భారతదేశంలో అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు సమానమైన ఉత్సాహంతో సేవలు అందించారు. వారంతా దేశభక్తి కలిగిన పౌరులు, జాతీయ భావాలు కలిగిన వారు కాదా?
మరోవైపు, మోహన్ భగవత్ సూత్రీకరణ, జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన, తమ శాఖలో శిక్షణ పొందిన నాథూరాం గాడ్సేను సమర్థిస్తుంది. సుప్రీంకోర్టు బాబ్రీ మసీదు కూల్చివేతను నేరంగా పరిగణించింది. అప్పుడు ఈ కూల్చివేతకు నాయకత్వం వహించిన వారిని, దానిలో భాగస్వాములైన వారిని ఏమనాలి? భగవత్ చెప్పిన ప్రకారం, గాంధీజీ, కల్బుర్గీ, నరేంద్ర దబోల్కర్, గౌరీలంకేశ్, గోవింద పన్సారే లాంటి వారిని హత్య గావించిన చర్యలను, దేశభక్తి యుతమైన చర్యల జాబితాలో చేర్చాలా? రహస్య సమాచారాన్ని చేరవేసే వారు, స్మగ్లింగ్, బ్లాక్ మార్కెటింగ్ చేసే అనేక మంది హిందువులను ఏ స్థానంలో ఉంచాలి?
ఆసక్తికరంగా, ఆరెస్సెస్ గాంధీని గౌరవిస్తుంది, దాని శిక్షణ పొందిన ప్రచారక్లు, సిద్ధాంతకర్తలు, ఇతర అనుబంధ సంస్థలు మాత్రం బహిరంగంగా నాథూరాం గాడ్సేను గౌరవిస్తారు. గాడ్సేను కీర్తిస్తూ పెద్ద సంఖ్యలో ట్వీట్లు మనం చూస్తున్నాం, అది కూడా హిందువుల నుండే ఎక్కువ. ఇది ఆరెస్సెస్ యొక్క భావ జాలాన్ని వ్యాప్తి చేసే సామర్థ్యాన్ని తెలుపుతుంది. అటువంటి సంస్థ మాత్రమే ఏకకాలంలో గాంధీజీ పట్ల విధేయతను ప్రదర్శిస్తూ, గుట్టుచప్పుడు కాకుండా ఆయన హత్యకు దారి తీసిన భావజాలాన్ని వ్యాప్తి చేసుకోగలుగుతుంది.
- రామ్ పునియాని
అనువాదం:బోడపట్ల రవీందర్,
సెల్:9848412451