Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డెబ్బై రెండవ గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్న సమయం ఇది. రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు కనుక ఈ రోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత రాజ్యాంగ పునాదులను కూలదోయటం మరింత వేగవంతమైంది. జమ్ము కాశ్మీర్ని ఓ రాష్ట్రంగా భారత రాజకీయ చిత్రపటం నుంచి తొలగించటం, పౌరసత్వ సవరణ చట్టం మొదలు రైతు వ్యతిరేక చట్టాల వరకూ ఈ ధోరణి అడుగడునా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రత్యేకించి ఈ గత నెలరోజుల్లో కేంద్రం చేసిన రెండు ప్రకటనల నేపథ్యంలో భారత రాజ్యాంగపు మౌలిక లక్షణాల గురించిన చర్చను మరోసారి మననం చేసుకోవాల్సి ఉంది. డిశంబరులో జరగాల్సిన శీతాకాల పార్లమెంట్ సమావేశాలను రద్దు చేయటం, రైతు చట్టాలను ఏడాదిన్నర పాటు వాయిదా వేయటానికి తాము సిద్ధమని కేంద్రం ప్రకటించటం ఈ రెండు ఘటనలు. ఈ రెండు ప్రకటనలూ ప్రజల చేత ప్రజల కొరకు రూపొందించామని చెప్పుకుంటున్న రాజ్యాంగం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న గౌరవం ఏ పాటితో తెలియచెప్పే సంఘటనలు.
రాజ్యాంగం రూపొందించే క్రమంలో పరిపాలనా స్వరూప స్వభావాలు ఎలా ఉండాలన్న విషయంపై రాజ్యంగ పరిషత్లోనూ వివిధ ఉపసంఘాల్లోనూ విస్తృతమైన చర్చ జరిగింది. అనంతరం ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం స్వాతంత్య్రోద్యమ విలువలకు ప్రాతినిధ్యం వహిస్తున్నానంటూ ముందుకొచ్చింది. చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల్లో ఏ ఒక్క వ్యవస్థకూ సంపూర్ణ అధికారాలు కట్టబెట్టని అధికార విభజన మన భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రం. అంతిమంగా న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ ప్రజా సార్వభౌమత్వానికి ప్రతినిధిగా ఉన్న చట్టసభలకు లోబడి ఉండాలన్నది ఈ సూత్రం వెనక దాగి ఉన్న మౌలిక సిద్ధాంతం. కానీ ఈ మౌలిక సిద్ధాంతానికి చిల్లులు పెడుతూ నేనంటే నేను రాజ్యాంగ పరిషత్ వారసత్వానికి నిజమైన ప్రతినిధినంటూ మూడు వ్యవస్థలూ రాజ్యాంగం ఆమోదించిన తొలి ఏడాదిలోనే సమస్యను తెర మీదకు తెచ్చాయి. 1951 నుంచి 1975 వరకూ సుప్రీం కోర్టు పలు దఫాలుగా భారత రాజ్యాంగపు మౌలిక లక్షణాలు, స్వభావం ఏమిటో నిర్వచించే ప్రయత్నం చేసింది. చివరకు కేశవానంద భారతి కేసు ఈ వివాదాన్ని ఓ కొలిక్కి తేవటంతో భారత రాజ్యాంగ వ్యాఖ్యాన చరిత్రలో ఈ కేసుపై జరిగిన విచారణ, తీర్పు ఓ మైలు రాయిగా నిలిచిపోయింది. ఇక్కడ అధికారాల విభజన అంటే రాజ్యానికి మతానికి మధ్య స్పష్టమైన విభజనను పాటించటం, రాజ్యం మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు, మతం, మత విశ్వాసాల ఆధారంగా పని చేసే సంస్థలు రాజకీయాల్లో ప్రభుత్వ వ్యవహారాల్లో వేలుపెట్టకూడదు అన్న విభజనే. దీంతో పాటు రాజ్యాంగ యంత్రంలోని వివిధ వ్యవస్థలు, విభాగాల (పార్లమెంట్, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు) మధ్య రాజ్య భారాన్ని నిర్వహించటంలో పని విభజన కూడా.
కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు... వ్యక్తిగత స్వేఛ్చా స్వాతంత్య్రాలు, సమాఖ్య స్వభావం, ప్రజాస్వామిక గణతంత్ర ప్రభుత్వం, లౌకికతత్వం, అధికారాల వికేంద్రీకరణలను రాజ్యాంగపు మౌలిక స్వభావంగా, లక్షణంగా నిర్ధారించింది. ''రాజ్యాంగ సవరణ ద్వారా కూడా ప్రభుత్వం రాజ్యాంగపు మౌలిక స్వభావానికి భిన్నంగా వ్యవహరించరాద''న్నది ఈ తీర్పు సారాంశం.
గత ఏడేండ్లల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ నిర్ణయాలు, చేసిన చట్టాల నేపథ్యంలో పైన ప్రస్తావించుకున్న లక్షణాలు ఎలా ఎంత వేగంగా కనుమరుగవుతూ వస్తున్నాయో అర్థం చేసుకోవటం గణతంత్ర దినోత్సవ స్పూర్తిని సజీవంగా నిలిపి ఉంచాలనకుంటున్న ప్రతి ఒక్కరి బాధ్యత. భీమా కోరెగాం మొదలు పౌరసత్వ వ్యతిరేక ఉద్యమాలు, జమ్ము కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చట్టం వరకూ కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత స్వేఛ్చా స్వాతంత్య్రాలను తిరస్కరిస్తూ చట్టాలు చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్య్రాల్లో భాగంగానే నచ్చిన మత విశ్వాసాలు పాటించటం, విచారణ లేకుండా నిరవధిక ఖైదీగా ఉండకుండా స్వేచ్ఛాగా సంచరించే హక్కు వంటివి కూడా కలిసి ఉన్నాయి. కానీ కేంద్రంలో బీజేపీ అధికారానికి వచ్చిన గత ఏడేండ్లల్లో ఈ వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఏలా హననమవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.
ఇక నచ్చిన మత విశ్వాసాన్ని పాటించే హక్కు గురించి ఎంత తక్కువగా చర్చించుకుంటే అంత మంచిది. పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు మతాంతర వివాహాలపై ఆంక్షలు విధిస్తూ చేస్తున్న చట్టాలు.. రాజ్యాంగ స్ఫూర్తితో పాటు సుప్రీం కోర్టు నిర్వచించిన రాజ్యాంగపు మౌలిక స్వభావ సిద్ధాంతానికే పూర్తి భిన్నమైనవి. అయినా ఈ చట్టాలు చలామణీ అవుతూనే ఉన్నాయి. సుప్రీం కోర్టు సైతం జోక్యం చేసుకునేందుకు సాహసించటంలేదు. రాజకీయాలు, మతం మధ్య చెరగని గీతలుండాలన్న మౌలిక లక్షణం బీటలు వారటం ఏనాడో ప్రారంభమైంది. చివరకు రామమందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో ఓ ట్రస్టు ఏర్పాటు చేయటంతో ఈ సూత్రం అధఃపాతాళానికి చేరింది. ఓ వైపున నిరసన తెలపటం పౌరుల ప్రాధమిక హక్కు అంటూనే మరో వైపున రిపబ్లిక్ డే సందర్భంగా ట్రాక్టర్స్ పేరేడ్ను అడ్డుకోవటానికి, అదుపు చేయటానికి మీకున్న అధికారాలు, అవకాశాలు నేను గుర్తు చేయాలా అని ఢిల్లీ పోలీసులను ప్రశ్నించిన సుప్రీంకోర్టును గమనిస్తే ఏకంగా న్యాయ వ్యవస్థే పంజరంలో చిలకగా మారిపోయిన వైనం తేటతెల్లమవుతున్నది.
ఇక రాజ్యాంగ యంత్రంపై ప్రజల సార్వభౌమాధికారం, ప్రజలెన్నుకున్న చట్టసభల అధికారం స్థానంలో కార్యనిర్వాహకవర్గం సంపూర్ణ సార్వభౌమాధికారం చెలాయించటం ఈ కాలంలో ముందుకొచ్చిన మరో ప్రమాదకరమైన ధోరణి. ఉదాహరణగాపైన ప్రస్తావించుకున్న రెండు ఘటనలు ఈ ధోరణి తీవ్రతను తెలియచేస్తున్నాయి. చట్టసభలు ఆమోదించిన చట్టాల అమలు తాత్కాలికంగా వాయిదా వేయాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు, వాటికి సుప్రీం కోర్టు స్పందన గమనిస్తే కనీసం చట్టసభల అభిప్రాయాన్ని తీసుకోమనని సలహా ఇవ్వాలన్న ఆలోచన అత్యున్నత న్యాయవ్యవస్థకు రాకపోవటంలో పెద్దగా ఆశ్చర్యమేమీ కలగదు. రైతులతో పదో దఫా జరిగిన చర్చల్లో ఈ చట్టాల అమలును ఏడాదిన్నర పాటు వాయిదా వేయటానికి సిద్ధమనీ, దానికిగాను రైతులు తమ ఆందోళనలను విరమించాలని కేంద్రం షరతు విధించింది. ఈ వ్యవహారం రైతుల ఆందోళనను నీరుగార్చే ప్రయత్నం తప్ప వాళ్లు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం అంగీకరించి చట్టాలు అమలు నిలిపి వేయటం లేదన్న వాస్తవాన్ని అటుంచితే పార్లమెంట్ పట్ల వీసమెత్తు గౌరవం కూడా బీజేపీ ప్రభుత్వానికి లేదన్న వాస్తవాన్ని మాత్రం ఈ ప్రకటనలు బట్ట బయలు చేస్తున్నాయి.
చివరిగా రాజ్యాంగ మౌలిక స్వభావంలో కీలకమైన సమాఖ్య స్వభావం గురించి క్లుప్తంగా ప్రస్తావించుకుందాం. మన రాజ్యాంగంలోనే బలహీనమైన రాష్ట్రాలు, బలమైన కేంద్రం అన్న భావనకు బలమైన పునాదులున్నాయి. ఈ పునాదుల ఆధారంగానే నాటి ఇందిరా ప్రభుత్వం అన్ని వ్యవస్థలను చాపచుట్టి చంకన బెట్టి అత్యవసర పరిస్థితి విధించింది. ఈ అత్యవసర పరిస్థితి నేపథ్యంలో దాఖలైన కేసులు విచారిస్తున్న సమయంలోనే సుప్రీం కోర్టు రాజ్యాంగపు మౌలిక స్వభావం అన్న సిద్ధాంతాన్ని తెరమీదకు తెచ్చింది. నేటి బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్వభావాన్ని ఏ స్థాయిలో పాతరేస్తుందో రుజువు చేయటానికి వ్యవసాయక చట్టాలను మించిన ఉదాహరణ అక్కర్లేదు. వ్యవసాయం ఉమ్మడి జాబితాలోని అంశమే. వ్యవసాయం విద్య, ఆరోగ్యం వంటి కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించటం, వారి ఆమోదాన్ని పొందటం సమాఖ్య స్వభావంలో కీలకమైన ఆచరణాత్మక రూపం. బీజేపీ రెండో దఫా అధికారానికి వచ్చిన తర్వాత ఈ సమాఖ్యకు దారుణంగా తూట్లు పడ్డాయి. ఇందిరా హయాంలో ఈ ప్రయత్నం జరిగినా అప్పుడప్పుడే తెరమీదకు వస్తున్న ప్రాంతీయ పార్టీలు, వాటి వెనక నిలిచిన శక్తులు ఏదో ఓ మోతాదులో ప్రతిఘటించాయి. సర్కారియా కమిషన్ నియమించేలా కేంద్రాన్ని ఒత్తిడి చేయగలిగాయి. కానీ నేటి ప్రాంతీయ ప్రభుత్వాలు తమ కాళ్ల కింది నుంచి భూమి కదిలిపోతున్నా స్పందించలేని దుస్సహాయ స్థితికి చేరాయి.
చివరిగా రాజ్యాంగ మౌలిక స్వభావం అన్న చర్చ తెరమీదకు వచ్చిన నేపథ్యాన్ని క్లుప్తంగా ప్రస్తావించుకుందాం. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మన్ పాలకుడిగా పగ్గాలు స్వీకరించిన హిట్లర్ నాటి జర్మనీ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేశాడు. అలా మార్చటానికి రాజ్యాంగంలో ఉన్న అవకాశాలనే వినియోగించు కున్నాడు. దాని పర్యవసానాలు, యూదుల ఊచకోత, ప్రపంచం చవిచూసిన విపత్తు చరిత్ర పుటలనిండా రక్తాక్షరాలతో విస్తరించివుంది. ఈ నేపథ్యంలో రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకుంటున్న జర్మన్ పాలకవర్గం రాజ్యాంగంలో కొన్ని అంశాలు తిరుగులేనివని, ఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినా ఈ మౌలిక స్వభావానికి లోబడే వ్యవహరించాలని తీర్పునిచ్చింది. నాటి నుంచీ ప్రతి ప్రజాస్వామిక ప్రభుత్వం తమతమ రాజ్యాంగాల్లో కొన్ని లక్షణాలను మౌలిక లక్షణాలుగా గుర్తిస్తూ వస్తున్నాయి. మరి నేటి బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగపు మౌలిక లక్షణాలను, స్వభావాన్ని పునాదులతో సహా పెకలించి వేయబూనుకోవటం ఏ ఉత్పాతానికి హెచ్చరిక కాబోతోంది?
- కొండూరి వీరయ్య
సెల్: 9871794037