Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంతో ఉత్కంఠతకు దారితీసిన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎమ్సీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మేయర్, డిప్యూటీ మేయర్... ఆఘమేఘాల మీద నగరంలోని ప్రగతి భవన్కు చేరుకున్నారు. గులాబీ దళపతి, తెలంగాణ గాంధీ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు ముద్దుగా పిలుచుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను వారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయన వారికి పుష్పగుచ్ఛాలిచ్చి సాదర స్వాగతం పలికారు. అభినందనలు, ప్రశంసల జల్లులతో ముంచెత్తారు. అనంతరం 'వినదగునెవ్వరు చెప్పిన' అనే టైపులో... 'పదవిలో ఉన్న వారు ఎంతో సంయమనంతో వ్యవహరించాలె. ఓపికతో, సహనంతో ఉండాలె... ఎట్టి పరిస్థితుల్లోనూ సహజత్వాన్ని కోల్పోవద్దు... వేష, భాషల్లో మార్పు అసలే రావద్దు. అసంబద్ధంగా, అవసరం లేని మాటలు మాట్లాడొద్దు... ప్రతీ ఒక్కరిని ఆదరించాలె.. అక్కున చేర్చుకోవాలె... వారికి సరైన గౌరవం ఇవ్వాలె...' అంటూ వారికి దిశా నిర్దేశం, మార్గదర్శనం చేశారు. సీఎం గారి సూచనలు, సలహాలను విన్న అధికార పార్టీ కార్పొరేటర్లు... 'ఆహా ఏం సెప్తిరి... ఏం సెప్తిరి...' అంటూ చప్పట్లు దంచి కొట్టారు. ఈ సూక్తి ముక్తావళి గురించి విన్న ఓ జూనియర్ జర్నలిస్టు, మరో సీనియర్ పాత్రికేయుడితో... 'గదేందన్నా... సీఎం సాబ్ గట్ల మాట్లాడిండు... పదవిలో ఉన్నవారు ఎంతో సంయమనంతోఉండాలె, ఓపికతో, సహనంతో వ్యవహరించా లంటుండు.. కానీ మీడియా సమావేశాలప్పుడు ఏ విలేకరైనా ప్రశ్న అడిగితే... తోక తొక్కిన తాచులా కస్సున లేచి, ఏ పేపర్బరు నీది...? ఏణ్నుంచి వచ్చినవ్...? అంటూ విరుచుకుపడతడు. అందరికీ సరైన గౌరవం ఇవ్వాలంటుండు... మరి శాసనసభలో, బయటా ప్రతిపక్షాల్ని ఇష్టమొచ్చినట్టు సూదులు, దబ్బనాల పార్టీలంటూ తిడతడు...? ప్రతి ఒక్కరినీ ఆదరించాలని చెబుతున్నడు... కానీ రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది, నిరుద్యోగుల గురించి అస్సలు పట్టించుకోవట్లేదు...?' అంటూ యక్ష ప్రశ్నలు వేశాడు. ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకూ జవాబు దొరకలేదు. వీటికి సమాధానాలు తెలిసీ మీరూ చెప్పలేదనుకోండి...? చందమామ పుస్తకంలోని బేతాళుడు, విక్రమార్కుడి కథ చదువుకోవాల్సిందే...
- బి.వి.యన్.పద్మరాజు