Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో జీవిత బీమా రంగానికి సంబంధించి రెండు ప్రమాదకర ప్రతిపాదనలు చేశారు. ఒకటి బీమారంగంలో ప్రస్తుతం ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49శాతం నుంచి 74శాతానికి పెంచడం. రెండు, జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)ను వాటాలుగా విభజించి కొంత భాగాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా(ఐపీఓ) మార్కెట్లో అమ్మి వేయడం. జీవిత బీమా రంగంలో ఎల్ఐసీతో పాటు మరో 23కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇవన్నీ విదేశీ పెట్టుబడులు కలిగి ఉన్న ''స్వదేశీ యాజమాన్యపు ప్రయివేటు కంపెనీలు.'' ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74శాతానికి పెంచడంతో ఈ స్వదేశీ ప్రయివేటు కంపెనీలన్నీ విదేశీ ప్రయివేటు కంపెనీలుగా మారబోతున్నాయి. ఎల్ఐసీని వాటాలుగా జేసి ఎంత శాతం అమ్మినా, అది ''ప్రభుత్వ అజమాయిషీ కలిగిన ప్రయివేట్ కంపనీ'' అవుతుంది. దీని వలన కష్టమొచ్చినప్పుడల్లా, ఇదివరకటిలా ఆదుకొమ్మని అడిగే హక్కు ప్రభుత్వానికి ఉండదు. అలా అడిగితే ప్రయివేటు పెట్టుబడికి ప్రాతినిధ్యం వహించే డైరెక్టర్లు ఒప్పుకోరుగా! అందుచేతనే సీతారామన్ ప్రతిపాదన ఆత్మ నిర్భరత నుంచి వేరే వాళ్ళ అనుమతిపై ఆధారపడే ''ఆత్మ దుర్భరత'' వైపు ప్రయాణం అని అనవలసి వస్తున్నది.
బీమా రంగంలోకి ప్రయివేటు కంపెనీలను అనుమతించే హక్కు ప్రభుత్వానికి ఉంది. ఆ పని 1999 నుంచి చేస్తూనే వస్తున్నది. కానీ ఎల్ఐసీని వాటాలుగా చేసి అమ్ముకునే హక్కు ప్రభుత్వానికి ఉన్నదా? వాస్తవానికి ఉండకూడదు. ప్రభుత్వం చట్ట ప్రకారం యజమాని అయినప్పటికీ, లావాదేవీల్లో ఐదుశాతం డివిడెండ్కే పరిమితం. ఎందుకంటే, ఎల్ఐసీ ఒక కో-ఆపరేటివ్ వ్యవస్థలా ఎదిగింది తప్పా దాని ఎదుగుదలలో ప్రభుత్వ ప్రత్యక్ష పాత్ర లేదు. ఈ రోజు పది పన్నెండు లక్షల కోట్ల వరకు ఎల్ఐసీ విలువ ఉండవచ్చనీ, అందులో పదిశాతం అమ్ముకుందామనీ చూస్తున్న ప్రభుత్వం... ఇది పాలసీదారుల సొమ్ముతో ఏర్పడిన నిధిగా చూడాలి తప్పా తమకెలాంటి హక్కులేదని గుర్తించాలి. అలా కాదని, పార్లమెంటులో చట్టం చేసుకుని తన ఖాతాలో వేసుకోవడం అన్యాయం, అక్రమం. పాలసీదారులకు సంఘాలేవి ఉండవు, ఎవరూ అడగక పోవచ్చు... అలాగని దీర్ఘకాలం ఈ సంస్థలో స్థిరంగా పాలసీదారులు తమ సొమ్మును కొనసాగించడం వలన ఏర్పడిన దిగ్గజ సంస్థకు విలువ కట్టించి అట్టి విలువను వాటాలుగా అమ్మి సొమ్ము చేసుకోవడం న్యాయమవుతుందా? ఇన్సూరెన్స్ చట్ట సవరణను ప్రత్యేకంగా చర్చించకుండా ఆర్థిక బిల్లులో ఇన్సూరెన్స్ ఆక్ట్ 1938, 1956, 1999లకు మార్పులు చేస్తూ 27 ప్రతిపాదనలను పెట్టి గంప గుత్తగా, గుట్టుచప్పుడు కాకుండా ముందుకెళ్తున్నారు. అందరికీ బీమా కల్పించాలన్న ఆబ్జెక్టీవ్ నుంచి లాభాపేక్షే ప్రధానంగా నిధుల వినియోగాన్ని మార్చే విధానం దేశానికి మేలెలా అవుతుంది? వచ్చిన మిగులులో 95శాతం విధిగా పాలసీ దారులకు పంచాలన్న నిబంధనను మార్చడం ఎవరికి లాభమవుతుంది?
బీమా జాతీయీకరణ- అదుపు లేకుండా ప్రజలకు జరుగుతున్న మోసాలకు చరమగీతం పాడిన శాస్త్రీయ చర్య. ఎల్ఐసీ దేశానికి ఇంతగా ఉపయోగపడుతుందని నాటి ప్రభుత్వం కూడా ఊహించలేదు. ప్రజలను ప్రయివేటు వ్యక్తులు మోసం చేసే తీరు అప్పటిలాగానే ఉన్నది. కానీ ప్రభుత్వమే తన సామాజిక బాధ్యతను కొందరు పెట్టుబడి దారుల ఆశ్రితత్వానికి తాకట్టు పెడుతున్నది. బ్యాంకింగ్ రంగం కన్నా బీమా రంగం నిధులు సమకూర్చడంలో ఒక మెట్టు అధికస్థాయిలో ఉంటుంది. బ్యాంకు డిపాజిటర్లలా తమ నిధులను ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేయకుండా బీమా చేసిన వ్యక్తులు దీర్ఘకాలిక కాంట్రాక్టు రూపంలో క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రంగంలో నిధుల సేకరణ పెరుగుతూనే ఉంటుంది. ఇలా సేకరించిన నిధులను ప్రభుత్వం కొంత మేర మౌలిక రంగాల అభివృద్ధికి ఉపయోగించడానికి వీలుంటుంది. ప్రయివేటీకరించబడిన తరువాత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సాలుకోసారి ఉచిత కంటి పరీక్షలు వంటివి నిర్వహించి చేతులు దులుపుకుంటారు గానీ మౌలిక రంగాలకు నిధులెందుకిస్తారు! అలాగని ఎల్ఐసీ తన మొత్తం నిధులను ప్రభుత్వానికేమీ ఇవ్వదు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయానుసారమే ఇన్వెస్ట్మెంట్లు జరుగుతాయి. ఈ రోజు స్టాక్ మార్కెట్లో అత్యధిక కంపనీలలో అత్యధిక వాటాలను కలిగి వున్న సంస్థ ఎల్ఐసీనే. ఈ విధంగా ఎల్ఐసీ పాలసీ దారులు పరోక్షంగా స్టాక్ మార్కేట్ లావాదేవీల్లో పాలు పంచుకుంటున్నట్లే, స్టాక్ మార్కెట్లలో పాల్గొనే సాధారణ ప్రజలూ ఎల్ఐసీ ద్వారా అభివృద్ది చెందుతున్న కంపెనీలలో వాటాదారులవటం వల్ల పరోక్షంగా ఎల్ఐసీలో భాగస్తులౌతున్నట్టే.
భారత దేశంలో పరిశ్రమలు నెలకొల్పడానికి నిధులు కావాలంటే, చిన్న మొత్తాల ద్వారా అత్యధిక ప్రజల నుంచి సమకూర్చుకోవడమే సరైన మార్గమనీ, దానికి ప్రభుత్వ రంగాల ఏర్పాటే శరణ్యమని నాటి పెద్దలు భావించారు. అలాంటి దీర్ఘ కాలిక పొదుపును సేకరించడంలో ఎల్ఐసీదే అందెవేసిన చెయ్యి. మొక్కవోని విశ్వాసంతో దాదాపు 12లక్షల మంది ఏజెంట్లు భీమా సేవలో నిమగం కావడం వల్ల కూడా ఇది సాధ్యమై 42కోట్ల పాలసీ దారులనూ, 31లక్షలకోట్ల ఆస్తులనూ కలిగి ఉన్నది. అనవసరమైన లగ్జరీలకు పోకుండా ఆఫీసులన్నింటినీ అత్యంత తక్కువ ఖర్చుతో నడిపించడం కూడా స్థిరమైన వృద్ధికి సంకేతం. అయితే విపరీతమైన విస్తరణ కలిగిన భారత బీమా మార్కెట్లోకి అడుగిడి లాభాలను ఎగరేసుకు పోవాలని అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు మన దేశంలోని పెట్టుబడిదారులతో కలిసి ఈ రంగంలోకి ప్రవేశించాలని కోరుకుంటున్నాయి. దీనికి స్పందిస్తూ 1999లో వాజ్పేయి ప్రభుత్వం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 26శాతానికి అనుమతించింది. ఇప్పటి వరకూ 23 ప్రయివేటు కంపెనీలు నమోదై ఎల్ఐసీతోపాటు పని చేస్తున్నాయి. అయితే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎఫ్డీఐ పరిమితి 26 నుంచి 49శాతానికి పెంచడం జరిగింది. పెంచిన తర్వాత కూడా అదనంగా ఒక్క కంపెనీ కూడా ఐఆర్డీఏ దగ్గర రిజిస్టర్ చేసుకోలేదు. దీనికి ప్రధాన కారణం ఏమంటే భారతదేశంలో సామాన్య ప్రజానీకం ప్రభుత్వ రంగాన్ని విశ్వసించినంతగా ప్రయివేటును విశ్వసించడం లేదు. ప్రభుత్వరంగంలో లభిస్తున్నంత తక్కువ ప్రీమియంకు ప్రయివేటు రంగంలో పాలసీలు లభించడం లేదు. ప్రభుత్వ రంగం చెల్లిస్తున్న క్లేయిమ్ల శాతంతో ప్రయివేటు రంగం పోటీ పడలేకపోతున్నది. గత 20ఏండ్ల కాలంలోనూ 23ప్రయివేటు కంపెనీలు కలిపి 25శాతం మార్కెట్ వాటా పొందడానికి తంటాలు పడుతున్నవి. ఈ అనుభవాన్ని చూసి కూడా మరిన్ని ప్రయివేటు కంపెనీలకు ఆహ్వానం పలకడంలో అర్థం లేదు. కేవలం ఎల్ఐసీ గుడ్విల్ విలువ నలభై బిలియన్ డాలర్లుగా ఉండవచ్చన్నది అంచనా. ఇంతటి గొప్ప సంస్థ ద్వారా తమ రాబడిని మార్కెట్లో రెట్టింపు చేసుకోవాలన్న ఆలోచన పెట్టుబడిదారులది. ఏటేటా కేవలం ఓ పదివేల కోట్లు కార్పొరేట్ టాక్సు, మరో మూడు వేల కోట్లు డివిడెండుతో ఎందుకు సరిపెట్టుకోవాలి, ఎల్ఐసీకి ఉన్న విలువను అమ్ముకుని ఓ పది లక్షల కోట్లను తీసుకోవాలన్నది ప్రభుత్వ యోచన. ఈ క్రమంలో పాలసీదారుల ప్రయోజనాలు ప్రభుత్వ జవాబుదారి తనం నుంచి ప్రయివేటు జవాబుదారితనం వైపు మళ్ళీంచబడుతున్నాయి. ఈ ఇరవై ఐదేండ్ల కాలంలోనే ఐదు ప్రయివేటు కంపెనీలు దుకాణం ఎత్తేశాయి.
బీమా రంగం ఉత్పాదక రంగం కాదు, దీర్ఘ కాలిక సేవా రంగం. అందులోనూ పెట్టుబడి అవసరంలేని రంగం. బీమా వ్యాపారం అనేది దేశ ప్రజల పొదుపులను సేకరించి వాటిని సరైన పద్ధతిలో పెట్టుబడులుగా మార్చి గడువు తీరిన తర్వాత బాధ్యతతో చెల్లించవలసిన కార్యం. ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా చేస్తుంది కాబట్టే ఎల్ఐసీకి ఇంతటి జేజేలు అందుతున్నాయి. అంచేత ఒక దిగ్గజ సంస్థను వాటాల రూపంలో అమ్మేయడం తిరోగమన నిర్ణయం, చారిత్రక తప్పిదం.
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016