Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనవరి 29న ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ పట్టణంలో ఒక ముఖ్యమైన ఘటన చోటుచేసుకుంది. లక్ష మందికి పైగా హాజరైన రైతుల 'మహాపంచాయతీ' సభలో ప్రముఖ ముస్లిం రైతు నాయకుడు గులాం అహ్మద్ ఓలా, నరేష్ తికాయత్, జయంత్ చౌదరి కలిసి వేదిక పంచుకున్నారు. నరేష్ తికాయత్ ఉత్తరప్రదేశ్ ప్రముఖ రైతు నాయకుడు మహేంద్రసింగ్ తికాయత్ కొడుకు. భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు. అలాగే జయంత్ చౌదరి చౌదరి చరణ్సింగ్ మనవడు అంటే అజిత్సింగ్ కొడుకు. ఈ ముగ్గురూ ఆ వేదికపై బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రద్దయ్యేవరకు ఐక్యపోరాటం కొనసాగుతుందని ప్రతిజ్ఞ చేసారు.
మహేంద్రసింగ్ తికాయత్కు గులాం అహ్మద్ ఓలా సన్నిహిత సహచరుడు. ఇద్దరూ రైతాంగంపై బాగా పట్టున్న నాయకులు. తికాయత్ ఎలక్ట్రిసిటీ బిల్లులు, చెరుకు మద్దతు ధరలు తదితర సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిన నాయకుడు. ఆయన కృషిలో ఢిల్లీ బోట్క్లబ్లో 5లక్షల మంది రైతుల ప్రదర్శన ప్రముఖమైనది. రాజీవ్గాంధీ ప్రభుత్వ హయాంలో తికాయత్ తన పోరాటాల ద్వారా అనేక రాయితీలు రైతాంగానికి సాధించగలిగారు. ఒకసారి తికాయత్ 2008లో అప్పటి ముఖ్యమంత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసాడు. ఆయనను అరెస్ట్ చేయాలని మాయావతి ఆదేశించారు. ఆ అరెస్టు చేయటానికి ఆయన గ్రామం సిసౌలీ చుట్టూ 6వేల మంది పోలీసులు మొహరించాల్సి వచ్చింది. ప్రజలపై ఆయన పట్టు అలాంటిది. అయితే తరువాత ఆయన క్షమాపణ చెప్పి జైలు నుంచి విడుదల అయ్యారనుకోండి. అది వేరే సంగతి. మహేంద్రసింగ్ తికాయత్ 2011లో కాన్సర్తో మరణించాడు. ఆయన కుమారుడు నరేష్ తికాయత్ బీకేయూ (భారతీయ కిసాన్ యూనియన్) అధ్యక్షుడయ్యాడు. మరో కుమారుడు రాకేష్ టికాయత్ ఆ సంఘానికి మరో ముఖ్యనాయకుడుగా స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. ఇప్పుడు సాగుతున్న రైతాంగ ఉద్యమంలో వారు చురుకైన పాత్ర వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యక్తులు, నాయకుల ప్రాధాన్యతల కంటే వారు ప్రాతినిథ్యం వహిస్తున్న సామాజిక సమూహాలు, అవి నేటి రైతు ఉద్యమంలో కలిసిపోయిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంది. వర్గ ఐక్యత పునాదిగా ఈ సామాజిక సమీకరణం జరగటం అనేది భారత భవిష్యత్తు రాజకీయాలలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని మనం గ్రహించాలి. ఈ విషయం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ఏడు సంవత్సరాలు వెనక్కు వెళ్లాల్సి ఉంటుంది.
2013లో ముజఫర్నగర్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆధ్యర్యంలో మతదాడులు జరిగాయి. చాలా పెద్దయొత్తున మారణకాండ, ఆస్తుల లూటీలు జరిగాయి. 62మంది చనిపోయారు. 50వేల మంది నిర్వాసితులయ్యారు. ఈ మారణకాండకు నిరసనగా ముస్లిం నాయకుడు గులాంఅహ్మద్ ఓలా, తన నాయకుడు మహేంద్రసింగ్ తికాయత్ నుంచి విడిపోయాడు. వేలాదిగా రైతులతో విడిగా సంఘం స్థాపించి నడుపుతున్నాడు. తరువాత జరిగిన వివిధ ఎన్నికల్లో ముస్లింలకు వ్యతిరేకంగా తికాయత్ అనుచరులు, జయంత్ చౌదరి తదితరులు బీజేపీకి మద్దతు ఇచ్చిన సందర్బాలున్నాయి. ఇప్పుడు వీరంతా ఆ శత్రుత్వాలన్నీ మర్చిపోయి జరుగుతున్న రైతాంగ పోరాటంలో కలిసిపోయారు. కుల, మత వైరుధ్యాలకంటే వర్గవైరుధ్యం ప్రముఖంగా మందుకు వచ్చిందనేది ఇక్కడ గమనించాల్సిన ముఖ్యాంశం.
లక్షమందికి పైగా హాజరైన ముజఫర్పూర్ మహాపంచాయతీ సభలో గులాంఅహ్మద్ ఓలా ఇలా ప్రసంగించాడు.. ''నేను 27ఏండ్లపాటు మహేంద్రసింగ్ తికాయత్తో కలిసి పనిజేసాను. నరేష్, రాకేష్లు నాకు కొడుకుల్లాంటి వారు. కానీ వాళ్లు 2013తర్వాత తప్పుదారి ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు నరేష్ తన తప్పు ఒప్పుకున్నాడు. అలాగే జయంత్ ఈ సభలో నా కాళ్లు తాకాడు. దీంతో ఆనాటి గాయాలు మానిపోతాయనే భావిస్తున్నాను. ఇక్కడ హాజరైన లక్షమంది రైతాంగంలో ముస్లింలు 30వేలకు పైగా ఉన్నారు. వాళ్లంతా తాము 'ముందుగా రైతులమనీ ఆ తర్వాతే ముస్లింలమనీ' అనుకుంటున్నారు''. ఇలా సాగింది గులాంఅహ్మద్ ప్రసంగం. రైతాంగ పోరాటం సామాజిక ఐక్యతనెలా సాధించిందో చెప్పటాకికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ కాదా? ఇలాంటి మహా పంచాయతీలు ఉత్తర భారత దేశంలో ముఖ్యంగా యూపీ, హరియానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వందల కొద్దీ జరుగుతున్నాయి. వీటన్నింటిలో ఇతర రైతు నాయకులతో పాటు సీఐటీయూ, ఏఐకేఎస్, ఐద్వా నాయకులు విస్తృతంగా పాల్గొంటున్నారు, ప్రసంగిస్తున్నారు. ఈ సభల్లో అన్ని మతాలవారు, కులాలవారు, స్త్రీలు, పిల్లలు, గిరిజనులు, దళితులు అన్ని సామాజిక వర్గాల తరగతుల వారూ ఐక్యంగా వేల సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ ఐక్యత ఇలాగే కొనసాగాలి. అలా కొనసాగితే భారత రాజకీయాల స్వరూపమే మారిపోతుంది. ఇప్పటివరకూ కుల, మత ప్రాతిపదికలపైన జరుగుతున్న విభజన రాజకీయాలు మారిపోయి వాటి స్థానంలో వర్గ ప్రాతిపదికన సమరశీల పోరాటాలకు నాంది పలుకుతాయి.
రైతాంగ పోరాటం రోజురోజుకు మరింత ఉదృతమవుతోంది. జనవరి 26న లక్ష ట్రాక్టర్ల ప్రదర్శన సందర్భంగా ప్రభుత్వ ప్రోద్బలంతో జరిగిన కొన్ని ఘటనలను సాకుగా చూపి పెద్దఎత్తున నిర్బంధం ప్రయోగించి ఉద్యమాన్ని అణచాలని ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నం తిరగబడి ప్రభుత్వం అభాసుపాలైంది. ఉద్యమం మరింత ఉదృతమై ఢిల్లీ సరిహద్దులలో ధర్నాల సంఖ్య మరింతగా పెరిగింది. ఫిభ్రవరి 6న రాస్తారోకో అత్యంత జయప్రదమైంది. ఉత్తరాన కాశ్మీర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకూ, తూర్పున త్రిపుర బెంగాల్ నుంచి పశ్చిమాన గుజరాత్ మహారాష్ట్ర వరకూ అన్ని జాతీయ రహదారులూ స్తంబించాయి. అలాగే ఫిబ్రవరి 18న జరిగిన రైల్రోకో కూడా బాగా జయప్రదమైంది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ వగైరా ఉత్తరాది రాష్ట్రాలలో వందలాది రైళ్లను ప్రభుత్వమే నిలిపేసుకోవాల్సి వచ్చింది.
అయినా మోడీ ప్రభుత్వం మాత్రం తన వంకరబుద్దిని వదులుకోవటం లేదు. అనేక విధాలుగా ఉద్యమాన్ని అప్రదిష్టపాలుజేయటానికి, నిర్భందాలు ప్రయోగించటానికి పూనుకుంటున్నది. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మోడీ రైతులను 'ఆందోళనజీవుల'నీ, 'పరాన్న బుక్కుల'నీ నిందించాడు. ఆందోళనలు లేకుండా మన దేశ స్వాతంత్య్రంతో సహా ఏ హక్కూ, ఏనాడూ సాధించబడలేదన్న సత్యం మోడీ తెలుసుకోవాలి. ఏ కష్టం చేయకుండా ఇతరుల మీదపడి బతికేవాడు పరాన్నబుక్కు తప్ప తన కష్టంతో మొత్తం దేశానికే అన్నం పెడుతున్న అన్నదాత పరాన్నబుక్కు ఎలా అవుతాడు? కాబట్టి రైతులను పరాన్న బుక్కులని నిందించేవాడి ఇంగితజ్ఞానాన్నే ప్రశ్నించాల్సి ఉంటుంది తప్ప ఇలాంటి కువిమర్శల వల్ల రైతాంగ ఉద్యమానికి జరిగే హాని ఏమీ ఉండబోదని గ్రహించాలి.
ఇక ఉదృతమవుతున్న ఈ ఉద్యమాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్న మన పాలకులు అడ్డగోలు దాడులకు నిర్బంధాలకు పూనుకుంటున్నారు. అలాగైనా ఉద్యమకారులను భయపెట్టవచ్చునేమోనని ఆశపడుతున్నారు. భారత రైతాంగ పోరాటానికి ప్రపంచ వ్యాప్తంగా అభ్యుదయ వాదుల మద్దతు పెరుగుతోంది. విదేశీ ప్రముఖులు రైతాంగ ఉద్యమానికి మద్దతు ఇవ్వటాన్ని జీర్ణించుకోలేకపోతున్న ప్రభుత్వ నేతలు దానికి విరుగుడుగా మన దేశ సెలబ్రిటీలతో ముఖ్యంగా సినీ, క్రికెట్ రంగాలవారితో రైతాంగానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేయించటానికి వారిపై వత్తిడి తెస్తున్నారు. సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్ లాంటి కొందరు ప్రముఖులు అలాంటి వత్తిడికి గురైనవారిలో ఉన్నారు. కొంతమంది ఈ వత్తిడులకు లొంగినా అనేకమంది అందుకు తిరస్కరించి రైతాంగానికి మద్దతు ఇస్తుండటం మనం చూస్తున్నాం. అంతర్జాతీయ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్ భారత రైతాంగ ఉద్యమానికి మద్దతుగా ప్రతిపాదించిన ఉద్యమ కార్యాచరణ 'టూల్కిట్'ను షేర్ చేసినందుకు బెంగుళూరుకు చెందిన 'ఫ్రైడే ఫ్యూచర్' కార్యకర్త దిశారవిని అరెస్ట్ చేయటం, ఢిల్లీ ప్రదర్శన సందర్బంగా 122మంది అమాయక రైతులపై అక్రమకేసుల బనాయింపు, ఇంకా అనేకమందిని అరెస్ట్ చేస్తూ 'ఖలిస్థాన్'వాదులుగా ముద్రలు వేయటం జరిగింది. సింఘా సరిహద్దులో ట్రేడ్ యూనియన్ కార్యకర్త నవ్దీప్ కౌర్ను అరెస్ట్చేసి ఉద్యోగంలోంచి తీసెయ్యడం, ఇంకా కవులు, కళాకారులపై కేసులు ఈ విధమైన నిర్బంధాలకు ప్రభుత్వం తెగబడింది. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తోంది. సింఘా సరిహద్దుకు సందర్శనకు వెళ్లిన 15మంది పార్లమెంట్ సభ్యుల బృందాన్ని 3కి.మీ. ముందే అడ్డుకున్నారు.
తనను వ్యతిరేకించేవారిని, ప్రశ్నించేవారిని కేసుల్లో ఇరికించటానికి, తప్పుడు సాక్ష్యాలు సృష్టించటానికి మోడీ ప్రభుత్వం ఎంతగా దిగజారి ప్రవర్తిస్తుందో భీమా కోరేగాం కేసులో వ్యవహరించిన తీరు చూస్తే అర్ధమవుతుంది. తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత వరవరరావుతో సహా 16మంది భీమాకోరేగాం కేసులో నిందితులుగా ఉన్నారు. ప్రధాని మోడీని హత్యచేయటానికి, ప్రభుత్వాన్ని కూలదోయ టానికి, ఇందుకు అవసరమైన డబ్బు పోగేయటానికి ఈ నిందితులు కుట్రచేసారనేది వారిపై మోపబడిన ఆరోపణ. ఇందుకు సాక్ష్యంగా ఈ నిందితులలో ఒకరైన రోనా విల్సన్ దగ్గర స్వాధీనం చేసుకున్న ఆయన కంప్యూటర్ హార్డ్వేర్లోని లేఖలను చూపారు. పదేపదే ఎన్నోసార్లు కోరిన మీదట నిందితులకు కోర్టు ఇచ్చిన ఆ హార్డ్డిస్క్ల కాపీల ద్వారా 'అసలు నిజాలు' బయటపడ్డాయి. ప్రభుత్వం చూపిన ఆధారాలు, సాక్ష్యాలన్నీ అభూత కల్పనలేనని స్పష్టంగా రుజువయింది. అంతర్జాతీయ ప్రమాణాలతో పనిజేస్తున్న ప్రతిష్టాత్మక 'ఆర్సెనాల్ కన్సల్టింగ్ ఇన్స్టిట్యూట్' అనే అమెరికా ఫోరెన్సిక్ లేబరేటరీ సంస్థ ఆ హార్డ్డిస్క్లను తమ లేబరేటరీలో విశ్లేషించి 16పేజీల నివేదిక ద్వారా ఈ నిజాలను బయటపెట్టింది.
ఆ నివేదిక సారాంశమేమిటంటే కొందరు హాకర్లు (హ్యాకర్లంటే కంప్యూటర్లలో అక్రమంగా ప్రవేశించి నేరాలు చేసేవాళ్లు - ఈ కేసులో ప్రభుత్వ ఏజంట్లు) 2016 జూన్ 13న ఒక ఫేక్ మెయిల్ ద్వారా రోనా విల్సన్ కంప్యూటర్లోకి ప్రవేశించారు. అంతకు ముందే ఇదే హ్యాకర్లు వరవరరావు కంప్యూటర్లో ప్రవేశించారు. ఈ ఇద్దరి మధ్య వారి ప్రమేయం లేకుండానే ఉత్తరాలు నడిపారు. ఆ ఉత్తరాల్లో మోడీ హత్యకు, ప్రభుత్వ కూల్చివేతకు సంబందించిన విషయాలన్నీ ఉన్నాయి. ఆ ఉత్తరాలనే వారి నుంచి స్వాదీనం చేసుకుని కోర్టులో సాక్ష్యాలుగా ప్రవేశపెట్టారు. ఇందులో కొసమెరుపు ఏమిటంటే ఎన్నడూ హిందీలో రాయని వరవరరావు హిందీలో ఉత్తరాలు రాయటం. ఈ విషయాలన్నీ ఆర్సెనాల్ సంస్థ బయటపెట్టినా ఇప్పటికీ ప్రభుత్వం నోరుమెదపక పోవటం, ప్రధాన మీడియా పట్టించుకోకపోవటం మనం గమనించాలి. మన ప్రభుత్వం యొక్క, ప్రధాన మీడియా యొక్క వర్గనైజాన్ని ఇది బయటపెడుతోంది.
ఈ రైతాంగ పోరాటం మన పాలక వర్గాలు అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడితో కుమ్మక్కై భారత వ్యవసాయ రంగాన్ని కబళించటానికి చేస్తున్న కుట్రను బయట పెట్టింది. ఈ పోరాటం ఒకవైపు కార్పొరేట్ శక్తులతో మిలాఖతైన బడాబూర్జువా వర్గాలకు, మరోవైపు ధనికరైతాంగంతో సహా మొత్తం రైతాంగానికి మద్య వైరుధ్యంగా ముందుకొచ్చింది. కార్మికోద్యమం ఇతర శ్రామిక వర్గాలతో కలిసి మరింత ముందుకెళ్లటానికి ఈ వైరుధ్యం తోడ్పడుతుంది. ఇది కార్మిక వర్గానికి కొత్త మిత్రులను సమీకరించుకోవటానికి, భారత రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయటానికి అవకాశం కల్పిస్తోంది.
- తమ్మినేని వీరభద్రం