Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1855లో భారతదేశంలో అతి పురాతన 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్' విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారత రెవిన్యూ, ఆర్థికశాఖ పరిధిలో పనిచేస్తున్న సెంట్రల్ ఎక్సైజ్ లేదా సెంట్రల్ జీఎస్టీ విభాగం ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, కస్టమ్స్ డ్యూటీ, నార్కొటిక్స్ డ్యూటీ, జీఎస్టీ లాంటి పన్నులు వసూలు చేయడంతో పాటు మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రించే అతి ముఖ్యమైన కృషిని చేస్తున్నది. 24 ఫిబ్రవరి 1944న 'సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ చట్టం-1944' ఏర్పడిన సందర్భానికి గుర్తుగా ప్రతి ఏటా ఫిబ్రవరి 24న దేశవ్యాప్తంగా 'సెంట్రల్ ఎక్సైజ్ డే' నిర్వహిస్తున్నారు. ఈ రోజున సెంట్రల్ ఎక్సైజ్శాఖ పట్ల సామాన్యులకు అవగాహన కల్పించే క్రమంలో భాగంగా సదస్సులు, కార్యశాలలు, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు, అవార్డుల ప్రదానాలు వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వస్తు ఉత్పత్తి పరిశ్రమల వ్యాపారాల్లో అవినీతిని కట్టడి చేయడం, పారదర్శకత పెంచడం, సత్సాంప్రదాయాలను నెలకొల్పడం, సంబంధిత చట్టాలను పటిష్టంగా అమలు చేయడం అనే గురుతర బాధ్యత సెంట్రల్ ఎక్సైజ్శాఖ ఉద్యోగుల మీద ఉంది. ఈ శాఖలో కస్టమ్స్ ఆక్ట్-1962, కస్టమ్స్ ట్రాఫిక్ ఆక్ట్-1975, సెంట్రల్ ఎక్సైజ్ ఆక్ట్-1944, సర్వీస్ టాక్స్ ఆక్ట్ లాంటి చట్టాలను గట్టిగా అమలు చేస్తూ, లంచగొండితనాన్ని నివారించడం సమర్థవంతంగా జరగాలి.
- డా: బుర్ర మధుసూదన్ రెడ్డి,
కరీంనగర్.