Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు చేస్తున్న పీఆర్సీ ఫిట్మెంట్ డిమాండ్ 45శాతం అనేది పూర్తిగా హేతుబద్ధతతో కూడిన డిమాండ్. న్యాయంగా రావాల్సిన డిమాండ్. ఏదో అంకెల గారడీతో గొంతెమ్మ కోరికలతో చేస్తున్న డిమాండ్ కాదు. వాస్తవంగా ప్రస్తుతం ఉన్న ధరల సూచి, కుటుంబ ప్రాతిపదిక, ద్రవ్యోల్బణం తదితర అంశాల పరంగా చూస్తే ఇది సాంకేతికంగా, న్యాయంగా ఉన్న డిమాండ్. ఉద్యోగులు తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా అంశాలలో ప్రభుత్వం ఎంత మొండి వైఖరితో ఉన్నా కూడా ఓపిక పడుతూ సర్దుకుపోతున్నారు. వేతనాలు ఆలస్యంగా ఇవ్వడం, డీఏలు పెండింగ్లో పెట్టడం, ఉద్యోగులకు రావలసిన ప్రయోజనాలు నెలలతరబడి ఆలస్యం చేస్తుండడం మొదలైన అంశాల్లో ఉద్యోగులలో ఆగ్రహం ఉన్నాకూడా ప్రభుత్వం తమకు మెరుగైన పీఆర్సీ ఇస్తుందని ఓపికతో ఉంటున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన బిస్వాల్ కమిటీ కేవలం 7.5శాతం పీఆర్సీ ఫిట్మెంట్ సిఫార్స్ చేయడం, హెచ్ఆర్ఏ స్లాబ్లో కోత పెట్టడం తదితర సిఫారసులతో పాటు గత పీఆర్సీ కమిటీల సిఫార్సులకు భిన్నంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోకెల్లా అత్యధిక వేతనాలు ఉన్నాయని, ఉద్యోగులకు ఇంత భారీ వేతనాలు అవసరం లేదని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదని మొదలైన అసంబద్ధమైన వాదనలు చేస్తూ ఉద్యోగుల పట్ల చులకనగా ప్రవర్తించడం ఉద్యోగులు, ప్రజలు ఎవరూ కూడా జీర్ణించుకోలేని విషయం.
బడ్జెట్లో ఉద్యోగుల వేతనాల ఖర్చు 50శాతం ఉంటుందంటూ ప్రచారం చేయటం తగదు. ప్రభుత్వం ఖాళీ పోస్టులకు కూడా వేతనాల ఖర్చు చూపిస్తూ తప్పుదోవ పట్టిస్తోంది. ఉద్యోగ నియామకాలు లేవు. రాష్ట్రంలో రిటైర్మెంట్లు తప్ప రిక్రూట్మెంట్లు లేవు. పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగులను, కాళీ పోస్టులకు ఖర్చుల చూపిస్తూ ఉద్యోగులను ప్రజలలో దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వం కుట్రలకు తెర లేపుతోంది. వాస్తవంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉద్యోగుల వేతనాల ఖర్చు బడ్జెట్లో కేవలం 26శాతం మాత్రమేనని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి కూడా. మొత్తం బడ్జెట్లో ఉద్యోగులకు సింహభాగం ఖర్చు పెడుతున్నామనే ప్రచారం అవాస్తవం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉద్యోగులు ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు. పైగా వాటి అమలులో ఉద్యోగులదే కీలకపాత్ర. అలాంటి ఉద్యోగులను ఆడిపోసుకోవడం తగదు. ఉద్యోగులు కూడా మనుషులే. వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి అనే విషయం గుర్తుంచుకోవాలి
- పి.రాజు, హనుమకొండ.