Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ప్రభుత్వం 2016 నుంచి చేపట్టిన హరిత హారం ఆదివాసీ ప్రజల మెడకు ఉరితాడుగా మారుతున్నది. 230 కోట్ల మొక్కలు నాటి ( పెంచటం కాదు) ప్రపంచ రికార్డ్ నెలకొల్పుతున్నట్టు చెప్పుకొన్న ప్రభుత్వం తెలంగాణలో 24శాతమే అటవీ భూమి ఉందని, అందులో ఈ అయిదేండ్లలో 100కోట్ల మొక్కలు నాటి అడవుల్ని దట్టంగా తయారు చేస్తామని ప్రకటించింది. హరితహారం లక్ష్య ప్రకటనలోనే ''అటవీ భూముల్ని దురాక్రమణ నుంచి'' కాపాడుతామన్నది. ఇక్కడ దురాక్రమణ దారులనగానే ఎవరో మైనింగ్ మాఫియా అనో, ''రియల్'' మాఫియా అనో మనం పొరపడకూడదు. వారి దృష్టిలో దురాక్రమణదారులంటే జీవిక కోసం పొడు చేసుకుని బతికే పేద గిరిజన ఆదివాసులే. హరిత హారానికి ఈ ఏటితో ఐదేండ్లు పూర్తవుతాయి. ఇప్పుడు రాష్ట్రం నందనవనం కాలేదు, అడవులు సందు లేకుండా దట్టంగా కాలేదు. కానీ హరిత హారం పేరుతో ప్రభుత్వం మాత్రం ఈ అయిదేండ్లుగా ఏజెన్సీ ప్రాంత ఆదివాసుల అనుభవంలోని లక్షలాది ఎకరాల పోడు భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకుంటూనే ఉంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం అన్నారం అనే ఒక్క హమ్లెట్ గ్రామంనుండే హరితహారానికి ఏటా 50ఎకరాల చొప్పున ఇప్పటిదాకా 250ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. భూమి కోల్పోయిన వాళ్లంతా కోయలు. అదే మండలంలో పది చిన్న గ్రామాల మద్య గల ఉమ్మడి శివారులో గల 500 ఎకరాల భూమిపైకి గత జూన్ నుంచి అటవీ అధికారులు పోలీసులతో వస్తున్నారు. ఈ భూమిపై పోడు కొట్టారని ఇరవై మందిపై 2001లోనే కేసులు, అరెస్టు అయ్యాయి. ఇంకా ఆ కేసుల్లో వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ ప్రకారంగా అయినా వాళ్ళు అప్పటి నుంచి పోడు చేసుకున్నట్టే లెక్క. 2006లో అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 వరకు అనుభవంలో ఉన్న పోడు భూముల్లో కుటుంబానికి నాలుగు హెక్టార్ల చొప్పున పట్టాలు ఇవ్వాలి. అలా 500ఎకరాల్లో అందరికీ పట్టాలు రావాల్సి ఉండగా 50ఎకరాలకి మాత్రమే పట్టాలు ఇచ్చారు. అన్ని కేసుల మధ్య కూడా కనీసం 200 ఎకరాలను అప్పటినుంచి ప్రజలు కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు, వారికి పట్టాలు లేవని అటవీ అధికారులు ఆ భూముల స్వాధీనానికై దాడులు చేస్తున్నారు. పట్టాలు ఉండి, పట్టాలు లేకుండా కలగలసి పోయి ఉన్న భూముల్లో విచక్షణ లేకుండా కందకాలు తవ్వటం, భూమిని తమ స్వాధీనంలోకి తీసుకున్న గుర్తుగా దున్నేయటం చేస్తున్నారు. ఇంకా నిత్య ఉద్రిక్తత, కేసులు నడుస్తున్నాయి.
ఈ ఫిబ్రవరి మొదటి వారంనుండే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాల్పల్లి, మహబూబాబాద్ జిల్లాలల్లో రానున్న వర్షాకాలానికి ముందస్తు ఏర్పాట్లుగా జేసీబీలను, ప్రొక్లెయినర్లను ఆదివాసీ భూముల పైకి తరలిస్తున్నారు. భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఒక్క పునుకుడు చెలక గ్రామం నుండే 250ఎకరాల పోడు భూములను స్వాధీనం చేసుకోబోతున్నామని చెప్తూ, రబీకి విత్తనాలు వేయకముందే హరితహారం మొక్కల కోసం గుంటలు తీయటానికి బయలు దేరారు. కేవలం ఈ గ్రామంనుంచే గత నాలుగు ఏండ్లలో 450ఎకరాల పోడు భూమిని ఆదివాసులనుండి లాక్కున్నారు. స్వాధీనం చేసుకోగా మిగిలిన భూమి ఇక మీకే ఉంటుందని ప్రతి సంవత్సరం చెప్తూనే వస్తున్నారు. అదే మండలం బొజ్జాయి గూడానిదీ ఇదే పరిస్థితి. పాతిక, ముప్పై ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు గతంలో అతి కొద్ది మందికి, సెంట్లల్లో భూమి ఇచ్చారు. అప్పటి నుంచి పట్టాలు రాకుండా ఉన్న భూములను, పట్టా లేదు కాబట్టి మీకిక ఆ భూమిపై హాక్కు లేదని, పోలీసుల సాయంతో దౌర్జన్యంగా అక్రమిస్తున్నారు. అడ్డువచ్చిన ప్రజలపై లాఠీలు, కేసులు ప్రయోగిస్తున్నారు. తాజాగా ఫిబ్రవరి 5న మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు గ్రామంలో హరిత హారమంటూ గిరిజనుల భూములపైకి వస్తున్న జేసీబీలు, ప్రొక్లైనర్లను అడ్డుకున్నందుకు మహిళలతో సహా 13మందిపై పొలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఫిబ్రవరి 8న గూడూరు మండలం లైన్ తండాలోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వానికిదో ఆట, ప్రజలకది జీవన్మరణ సమస్య.
ఆదివాసులకు సహజసిద్దంగా అన్నీ అయి ఉండిన అడవిని తమ స్వంత ఆస్తిగా ఒకప్పుడు బ్రిటిష్ వాళ్లు, తర్వాత నిజాం, ఇప్పుడు ఈ కాలపు ప్రభుత్వాలు భావించుకుంటూ అడవితో ఆవిభాజ్యంగా అల్లుకున్న జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారు. ఇంకా అదే మైదాన ప్రాంతపు ఆధిపత్యం, రాజ్యంలోని ప్రతీదీ రాజు స్వంత ఆస్తిగా ఊహించు కునే ఫ్యూడల్ సమాజపు అవశేషాలూ అలాగే కొనసాగుతున్నాయి. ఇలా ఎవరిది కానిదంతా తనదే అనుకునే రాజ్యపు అసంబద్ధ భావనే ఆదివాసులను తర తరాలుగా కోలుకోనివ్వకుండా చేస్తున్నది.
చరిత్ర పూర్వయుగం నుంచీ ఆదివాసులకు అడవి అంటే కేవలం అందమైన చెట్లు, పచ్చదనం కాదు. అడవే వారి మాతృ భూమి, ఇల్లు, వాకిలి, జీవనాధారం. ఇంకా, వారి సంస్కృతి, ఆచారాలు, మతం, దేవుళ్ళు, అన్నీ. ఒక్క అదివాసులకేమిటి! ఈరోజు మైదాన ప్రాంతపు గ్రామీణ, నగర వాసులందరు కూడా శతాబ్దాల కింద అడవుల్లో జీవించిన వాల్లే కదా! వ్యవసాయానికి, ఆవాసానికీ తమ చుట్టూ ఉన్న అడవుల్ని నరుకుతూ మైదానాలుగా మార్చేశారు. అది నాగరికతైంది. అదేపని ఇప్పుడు ఆదివాసులు చేసుకుంటే తప్పెలా అవుతుంది. మన చుట్టూ ఉన్న ప్రాంతం మనదైనప్పుడు వారి చుట్టూ ఉన్న ప్రాంతం వారిది కాదా!
ఎన్నో అవమానాలు, మోసాలు గుర్తించి, గుర్తించకుండా భరిస్తూ, అనుభవిస్తూ అడవిపై తమకు గల హక్కుల్ని కోల్పోతూ క్రమంగా అడవిలో మిగిలిన ఒకే ఒక జీవనాధారమైన స్థిరవ్యవసాయానికి ఆదివాసులు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. వారికవసరమైన వ్యవసాయ భూమిని వారి స్వంత శివారు అయిన అడవి నుంచి తీసుకోవటం వారి సహజ హక్కు కదా. అవి కూడా ఎత్తైన, లోతట్టు ప్రాంతాల్లో దొరికే రాళ్ళు రప్పలతో కూడిన భూములే. ఈ భూములకు ఏ సాగునీటి ఆధారము ఉండదు. పూర్తిగా వర్షాదారం. ఇందులో వచ్చే దిగుబడి మైదాన ప్రాంతాల్లో వచ్చే దిగుబడిలో అక్షరాలా పది నుంచి ఇరవై శాతమే ఉంటుంది. ఇటువంటి ప్రాంతాల్లో మరో జీవనాధారం లేక ఆ పోడు భూములనే నమ్ముకున్న ఆదివాసులను దురాక్రమణదారులుగా చిత్రిస్తూ పరిపాలకులు వారి భూముల్లో ట్రాక్టర్లు పెట్టి దున్నించి, చుట్టూ కందకాలు తవ్వుతూ అంతా చిన్నాభిన్నం చేస్తున్నారు. ఏకైక ఉపాధిగా మిగిలిన వ్యవసాయాన్ని కూడా చేసుకోనివ్వకపోతే వారెలా బతకాలి, ఏం కావాలి?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం పునుకుడు చెలక, బొజ్జాయి గూడెం రెండు గ్రామాల పరిధిలో 80 మందిదాకా డిగ్రీ పూర్తి చేసిన, చదువుతున్న పిల్లలున్నారు. ఒక్కరికీ ఉద్యోగం రాలేదు. వచ్చే సూచనలు కూడా లేవు. పోలీసులు వారికి క్రికెట్, వాలీబాల్ కిట్లు ఇస్తూ తమ కనుసన్నల్లో ఉంచుకుంటున్నారు. ఇంకా కొంతమందిని నెలవారీగా జీతాలు ఇస్తూ పోలీస్ ఇన్ఫార్మర్లుగా మారుస్తున్నారు. దాని పరిణామాలు మనం ఊహించుకోవాల్సిందే. ఒకవైపు అర్హతలున్న యువతకు ఉద్యోగాలివ్వకుండా, మరో వైపు కనీస వ్యవసాయానికి కూడా దూరం చేస్తూ హరిత హారం, అడవుల సంరక్షణ పేరుతో వారి బతుకుదెరువును విచ్ఛిన్నం చేసే నైతిక అర్హత ప్రభుత్వానికి ఉందా?
నిజానికి, పచ్చదనం పెంచాలనుకుంటే రాష్ట్రంలో పలుచగా ఉన్న అటవీ ప్రాంతంలో మొక్కలు నాటుతూ, వాటిని రక్షిస్తూ దట్టంగా మార్చవచ్చు. ఇంకా, వ్యవసాయ భూముల్లో కూడా కొంత భాగంలో అటువంటి వక్షాలు పెంచటాన్ని తప్పనిసరి చేయ వచ్చు. ప్రతీ గ్రామ శివారులో ఉమ్మడి అటవీ ప్రాంతానికి కొంత భూమి కేటాయించవచ్చు. ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చేముందు ప్రతి ఇంటికి ఒక వక్షమైనా పెంచాలని షరతు పెట్టవచ్చు. రియల్ ఎస్టేట్ లేఅవుట్లో 10శాతం భూమిలో భారీ వక్షాలు ఉండాలని నియమం పెట్టవచ్చు. రోడ్ల పక్కన నాటే వాటిలో 80శాతం మొక్కలు బతకటం లేదు. వాటిని బతికించవచ్చు.
అడవి నుంచి ఆదివాసీలను నిరాశ్రయులను చేయటం అంటే వారి మాతృభూమిపై రాజ్యం దురాక్రమణ చేయటమే అవుతుంది. ఆదివాసీల జీవించే హక్కును కాలరాసే, అందరి అవసరాలకూ ఆదివాసులనే బలిచేసే విధానాన్ని పాలకులు మానుకోవాలి. ప్రతి కుటుంబానికి కనీసం నాలుగు హెక్టార్ల స్వంత భూమి వుండేటట్టు చూడాలి. ఆ భూమికి సాగు నీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలి.
- డా||ఎస్. తిరుపతయ్య
సెల్: 9849228212