Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంపై అనేక దేశాలు దండెత్తాయని చరిత్రలో చదువుకున్నాం. సుసంపన్నమైన మన దేశ వనరులను వరుసకట్టి కొల్లగొట్టారని తెలుసుకున్నాం. పోర్చుగీసు, డచ్, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలు వ్యాపారంపేర వచ్చి దోపిడీ చేశాయని, వీళ్లను తలదన్నే రీతిలో ఈ స్టిండియా కంపెనీ మనల్ని లూఠీ చేసిందన్న విషయం అక్షరాలు దిద్దుతున్న పిల్లోడికి కూడా తెలుసనడంలో అతిశయోక్తి లేదు. వ్యవసాయాధారిత దేశంగా ఉన్న మనల్ని ఏ విధంగా పీల్చిపిప్పి చేశారో చరిత్ర పుటల్ని తిప్పిన వారికెవరికైనా అర్థమవుతుంది. ఇంకా చెప్పాల్సి వస్తే ఈస్టిండియా కంపెనీ స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా భారత్లో పాలన ప్రారంభించాక మనం చవిచూసింది విధ్వంసమే. ఈ దశలో జరిగిన ఒక ఉదంతం గుర్తు చేసుకుంటే వాస్తవం తెలుస్తుంది. శిస్తు రూపంలో రైతుల నుంచి వసూలు చేసిన మొత్తం నవాబుల కాలంలో 8 లక్షల పౌండ్లు ఉంటే..ఈ స్టిండియా కంపెనీ మొదటి సంవత్సర పాలనలో ఆ మొత్తం 14లక్షల పౌండ్లకు పెరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం పర్మినెంట్ సెటిల్మెంట్ పద్ధతి తెచ్చాక అలా వసూలు చేసిన మొత్తం 31లక్షల పౌండ్లు. విదేశీ పాలకులు మన రైతుల్ని పీడించి పిండుకున్న మొత్తం ఏఏ దశల్లో ఎలా పెరిగిందో కండ్లకు కడుతున్న లెక్కలివి. బ్రిటిష్ సర్కారు ప్రత్యక్షపాలనలోకి వచ్చాక తమ దేశంలో ఉత్పత్తయిన సరుకులను మన దేశానికి 25రెట్లు పెంచింది. ఇక్కడి ముడిసరుకును కారుచౌకగా తన్నుకుపోయింది. భారతీయ శ్రామికులతో వెట్టి చేయించి కోటానుకోట్లు వెనకేసుకుంది. వ్యాపార వాణిజ్యం, ధన కాంక్షతో ఇక్కడికొచ్చి ఏకంగా రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకుంది. స్వయంపోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థగాను మన దేశం విదేశీ పెట్టుబడులు, పాలకులు రంగ ప్రవేశం చేశాక పూర్తి నిర్వీర్యమైంది. పాడిపంటలతో తులతూగుతున్న దశ నుంచి ఆకలిచావులు, వరస కరువులు తాండవించే స్థితికి నెట్టివేయబడింది. 1857 తర్వాత వరుసగా మూడు కరవులొచ్చాయన్న విషయాన్ని స్వాతంత్య్రోద్యమ చరిత్రలో చూడొచ్చు. ఈ మూడు కరువుల్లో వరుసగా 10లక్షలు, 50లక్షలు, 10లక్షల చొప్పున భారతీ యులు చనిపోయారు. ఇదంతా తెల్లదొరల పాలన...
ఇప్పుడేలుతున్నది మన పాలకులే. కానీ జరుగుతున్నదేమిటి? స్వాతంత్రోద్యమానికి ముందు, స్వాతంత్రం వచ్చాక తొలినాళ్లలో ఏ విదేశీ పెట్టుబడులు, స్వదేశీ గుత్తాధిపతులు ఆర్థిక వ్యవస్థ, సహజవనరుల విధ్వంసానికి పాల్పడ్డారో మళ్లీ వారికే పెత్తనమిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి అసలు మన జాతి సంపద సృష్టికర్తలే వారు అని సెలవిస్తున్నది. రైతు చెమట చుక్క పడకుండా ధాన్యం గింజ పండదనీ, కార్మికులు స్వేధం చిందించకుండా ఉత్పత్తే జరగదని వీళ్లకు తప్ప వేరెవరికైనా తెలుస్తుంది. ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. 'దేశ అభివృద్ధి ప్రస్థానంలో పాలు పంచుకోవడానికి ప్రయివేటురంగం చాలా ఉవ్విల్లూరుతోంది. ప్రభుత్వంగా మనం వారి ఉత్సాహాన్ని, ప్రయివేటురంగానికి ఉన్న శక్తిని గౌరవించాలి' అని ముఖ్యమంత్రులకు పిలుపు నిచ్చారు. దేశ ఆర్థికరంగానికి ఇరుసుగా ఉన్న వ్యవసాయంలో, పరిశ్రమల్లో పనిచేస్తున్న రైతులూ, కార్మికులను గౌరవించండి అని ఈ ఏడేండ్ల కాలంలో ఏనాడూ నోరు రాలేదే.! దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ఠాకూర్ కూడా ఇవే వ్యాఖ్యలను అనుసరించారు. 'ప్రపంచ దేశాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా భారత్ను తీర్చిదిద్దాలంటే మరిన్నిపెట్టుబడులు పెట్టాలని నిర్మలమ్మ ప్రయివేటు కంపెనీలకు పిలుపునివ్వగా.. ప్రయివేటీకరణను ఎంత పెంచితే అంత పెద్దమొత్తంలో ఉద్యోగాలు సృష్టించవచ్చని, ప్రజలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చని అనురాగ్ ఠాకూర్ సెలవిచ్చారు. ఏలేటోళ్లు తప్ప దేశంలో ఏ ఒక్కరూ ఇది నిజమని నమ్మరు. ప్రయివేటీకరణ యుగంలో ఇన్నేండ్ల ఫలితాలు, పర్యవసానాలతో దివాళా తీసిన 130కోట్ల ప్రజల జీవితాలే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న కీలకవ్యక్తులుగా ఉన్న ఈ ముగ్గురు వరుసగట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 'నష్టాల్లో ఉన్న పరిశ్రమలను ప్రయివేటు పరం చేస్తాం.. లాభాల్లో ఉన్నవాటిని అమ్మేస్తాం' అనే ఎజెండాతో నేటి పాలన సాగుతోంది. నిటి ఆయోగ్ను ఏర్పాటు చేసిందే అందుకోసం. 2021-22 బడ్జెట్కు వారం రోజుల ముందు స్వయంగా ఆ సంస్థ ఉపాధ్యక్షులు రాజీవ్కుమార్ మాట్లాడుతూ 'దేశంలోని 45 ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రయివేటుపరం చేస్తాం' అని కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు రహస్యమేమీ లేదు. ప్రధాని సహా కీలక స్థానాల్లో ఉన్న అధినేతలంతా బహిరంగ ప్రకనలు చేసే వరకూ బరితెగించారు. ఈ ప్రకటనలను తూచా తప్పక ఆచరణలో పెడుతున్నారు. గత ఏడేండ్ల నడక చూస్తే ఇదే తెలుస్తోంది. 2017-18లో 72 వేల కోట్లు, 2018-19లో 1.5 లక్షల కోట్లు, తర్వాతి ఏడాది 85 వేల కోట్ల ప్రభుత్వ రంగ వాటాల్ని తెగనమ్మారు. గతేడాది 2 లక్షలా 10 వేల కోట్ల ప్రభుత్వ వాటాల్ని అమ్మేసిన కేంద్రం తాజా బడ్జెట్లో మరో లక్షాడెబ్భైయి అయిదువేల కోట్లు అమ్మబోతున్నట్టు ప్రకటించింది. పాడి గేదెలాంటి ఎల్ఐసీని కూడా ఫణంగా పెట్టింది. ఎంవీ యాక్ట్ సవరించి రవాణా వ్యవస్థను ప్రయివేటుకు అప్పగిస్తున్న కేంద్రం చివరికి రాష్ట్రాల్లోని బస్సులనూ అమ్ముకునే వీలు కల్పించింది. బస్సులు, రైళ్లు, చివరికి విమానాలను కూడా కార్పొరేట్లకు కట్టబెడుతోంది. గడిచిన ఐదేండ్లలో అప్పులకోసం అడుగడుగునా ఆర్బీఐ గడపతొక్కిన కేంద్రం ఇప్పుడు ఏకంగా బ్యాంకులనే అమ్మకానికి పెట్టింది. యూపీఏ కాలంలో బొగ్గురంగంలో 40 వేల కోట్ల వాటాలను అమ్మచూసిన మన్మోహన్పై నిప్పులు చెరిగిన మోడీ ఇప్పుడు కోల్ ఇండియా మొత్తాన్నే అమ్మేస్తున్నాడు. అందులో 100శాతం ఎఫ్డీఐకి అనుమతిచ్చారు. టెలికాం, పోస్టల్, విశ్వవిద్యాలయాలు, ఆఖరకు అడవులను కూడా అమ్మబోతున్నారు. ఓఎన్జీసీలో వాటాల అమ్మకానికి మర్చంట్ బ్యాంకర్లకు ఆహ్వానం పలికింది. రిలయెన్స్ డిఫెన్స్ లిమిటెడ్తో చేతులు కలిపి మన హాల్(హెచ్ఏఎల్)ను నిర్వీర్యం చేస్తోంది. అందాల కశ్మీర్నూ వదిలిపెట్టలేదు. మొత్తం భారత ఆర్థిక వ్యవస్థను, ప్రభుత్వ రంగాన్నీ అంగడి సరుకు చేసి టోకుగా అమ్మేయడమే లక్ష్యంగా బీజేపీ పాలన సాగుతోంది. పర్యవసానం... మన ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది. వెంటిలేటర్పై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ విధానాలతో మనోళ్లు చెప్పినట్టు ఉపాధి పెరగలేదు. ప్రజల బతుకులు మారలేదు. పెట్రోల్ లీటర్ రూ.100కు చేరింది. వంట నూనె కిలో రూ.130 దాటింది. వంటగ్యాస్ రూ.వెయ్యికి దగ్గరవుతోంది. ఫలితం కోటానుకోట్ల ప్రజలకు తిండికి కూడా తిప్పలవుతోంది. మరోవైపు 76శాతం దేశ సంపద కేవలం 1శాతం జనుల చేతికి వెళ్లింది.
నేడు భారత ఆర్థిక వ్యవస్థకు ఇరుసుగా ఉన్న వ్యవయాయరంగాన్ని కూడా వదలడం లేదు. 2019-20 బడ్జెట్ సాక్షిగా '0' బడ్జెట్ వ్యవసాయం అమలు అని ప్రకటించిన నిర్మలమ్మ ఎరువులు, విత్తనాల సబ్సిడీలు ఇక ఉండబోవని సెలవిచ్చారు. వ్యవసాయోత్పత్తుల కొనుగోలులో ఇప్పుడు అంబానీ, అదానీ, ఐటీసీ, బేయర్లాంటి సంస్థలకు గుత్తాదిపత్యం కట్టబెట్టబోతోంది. అందులో భాగమే తాజాగా మందబలంతో తీసుకొచ్చిన మూడు చట్టాలు. ఇవి అమలయితే భారత్లో మరింత దారిద్య్రం, ఆకలి పెరుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా సర్కారు చెవికెక్కించు కోవడం లేదు. స్వాతంత్రమొచ్చిన తొలినాళ్లలో భారత బడా పెట్టుబడిదారులు ప్రభుత్వ రంగాన్ని ఇంధనంగా వాడుకొని బలిశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ రంగం అవసరం తీరింది. దీంతో విదేశీ పెట్టుబడిదారులతో కుమ్మక్కయి మన ప్రభుత్వరంగాన్ని, మార్కెట్లను, వనరులను కొల్లగొట్టడం లక్ష్యంగా చేసుకున్నారు. వాళ్ల లక్ష్య సాధనకు ఏలేటోళ్లు తోడ్పడుతున్నారు. అందుకు అవసరమైన పద్ధతిలో విధానాలు రూపొంది స్తున్నారు. పైగా దేశాన్ని లూటీ చేస్తున్న ఈ కార్పొరేట్ అధిపతులను మనమంతా గౌరవించాలని చెప్పుకొస్తున్నారు. అసలు సంపద సృష్టికర్తలే వాళ్లు అంటున్నారు. చెప్పండి.. వీళ్లనేమనాలి. స్వాతంత్రో ద్యమం మిగిల్చిన ఏ ఒక్క కర్తావ్యాన్నీ నెరవేర్చకపోగా ఆర్థిక వ్యవస్థను తెల్లదొరల కాలం నాటి దుర్భర స్థితికి నెట్టారు. మనకు స్వాతంత్రమొస్తే తిండికీ, బట్టకూ, ఇల్లుకూ కరువుండదని భావించిన కోట్లాది ప్రజల కలలు నెరవేరలేదు. కనీస సౌకర్యాలు దక్కని ప్రజలు కోట్లల్లోనే ఉన్నారు. భారత్లో నెలకొన్న ఆకలిపై నేడు ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వెలిబుచ్చుతోంది. సారాంశంగా చూస్తే నాడు తెల్లదొరలు మాత్రమే జాతి సంపదను, వనరుల్ని కొల్లగొట్టారు. నేడు వాళ్లూ వీళ్లు కలిసి లూఠీ చేస్తున్నారు. అవును.!నిజంగా నేడు నల్లదొరల పాలనే సాగుతోంది.!!
- కొలిపాక నామ్దేవ్
సెల్:9490099387