Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనస్తాపానికి గురి చేసే హక్కు అనేది ప్రత్యేకంగా ఉండదు. మనస్తాపానికి గురి చేసే హక్కు... లేదా పూర్తిగా మాట్లాడే హక్కు, సంపూర్ణ భావ ప్రకటనా స్వేచ్ఛ - స్వేచ్ఛగా మాట్లాడే హక్కులో కొన్ని అంశాలుంటాయి. అవి కొంతమందిని లేదా ఒక వర్గానికి చెందిన వారిని బాధ పెట్టవచ్చు. మరొకరి భావ ప్రకటనా స్వేచ్ఛ వల్ల ఒక వర్గం ప్రజలు బాధపడే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఇదే, ఈ విషయంలో కీలకాంశమని నా భావన.
నాగరికతా దృక్పథం నుంచి దీన్ని మనం చూసినట్లైతే, మనకు తర్కశాస్త్రం (తర్కం యొక్క తత్వ శాస్త్రం, చర్చించే కళ) అని పిలిచే పలు ఒప్పందాలు లేదా శాస్త్రాలు ఉన్నాయన్న వాస్తవాన్ని మన నాగరికత గర్వంగా చెప్పుకోవాలి. మనం చర్చించుకుంటాం, పరస్పరం ఎదుర్కొంటాం, విభేదించుకుంటాం. ఆ రకంగా మనం ఇప్పుడున్న ఈ నాగరికత అనేంతవరకు వచ్చాం.
భావ ప్రకటనా స్వేచ్ఛ కంటే కూడా ప్రస్తుతమున్న వాతావరణంలో మనం చేస్తున్నదేమంటే ఇతరులను బాధ పెట్టేలా చేయడం. 'నన్ను ముట్టుకోవద్దు' (టచ్ మి నాట్) అనే సమాజంగా మనం మారిపోయాం. నా గురించి, నా మతం గురించి, నా కమ్యూనిటీ, నా రాష్ట్రం, నా దేశం ఇలా... నా గురించి ఏదీ మాట్లాడవద్దు. ఎందుకంటే, మనకు మనం చాలా అభద్రమైన వాతావరణంలో ఉన్నామని భావిస్తున్నాం. మన మతం గురించి చాలా అభద్రతగా ఫీలవడం మొదలుపెట్టాం. అందువల్ల ఆ మతాన్ని దెబ్బ తీస్తుందని భావించే ఏ రకమైన భావ ప్రకటనా స్వేచ్ఛ నుండైనా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం అభద్రంగా ఉండడం వల్ల మనల్ని బాధపెట్టారనే భావన చాలా తేలికగా వచ్చేస్తుంది. మీరు ఐన్స్టీన్ను మూగవాడిగా పిలవవచ్చు. అతడు ఏమీ ఫీల్ అవడు. చాలా భద్రతగా ఫీల్ అవుతూ కూర్చుంటాడు. తానేం చేస్తున్నాడో తనకు తెలుసు. ఈ రకంగా మనం ఇక్కడే మన సొంత నాగరికతను, మన సొంత బలాన్ని, మన దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నామని నా భావన.
ఇతరులను బాధ పెట్టడం లేదా మనస్తాపానికి గురి చేయడం గురించి మనం మాట్లాడేటప్పుడు మన మనస్సులోకి వచ్చే మరో అంశం ఏమంటే - ఎవరిని బాధ పెడుతున్నాం? దేన్ని బాధ పెడుతున్నాం? నా భావనలో, ఇలా బాధ పెడుతున్నామన్న అంశానికి సంబంధించి మూడు కోణాలున్నాయి. మొదటిది, ప్రభుత్వాన్ని బాధపెట్టే హక్కు. వివిధ రూపాల్లో ఇప్పటికే మనం దీన్ని కుదించేశాం. ఒకవేళ ప్రభుత్వమైతే, మనకు దేశద్రోహ చట్టం - ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 124(ఎ) ఉంది. న్యాయ వ్యవస్థ అయితే, కోర్టు ధిక్కరణను ఉపయోగించి మనం దీన్ని కుదించేశాం. చట్టసభలైతే, హక్కుల తీర్మానం మనకుంది. ఆ రకంగా ఈ సంస్థలన్నీ ఇతరుల భావ ప్రకటనా స్వేచ్ఛ వల్ల మనస్తాపానికి గురయ్యే హక్కును తమకు తాముగా ఉంచుకున్నాయి. మనస్తాపానికి గురవడం వారి హక్కు. ఇటువంటి వివిధ సెక్షన్ల ద్వారా మనస్తాపానికి గురవుతున్న వారి హక్కును మనం పరిరక్షిస్తున్నాం.
మనకు స్వాతంత్య్రం లభించక ముందు నుంచీ వారసత్వంగా మనకు ఈ దేశద్రోహ చట్టం ఉందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. విమర్శలను ఎదుర్కొనే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదొక రక్షణ. అందువల్ల ఏ తరహా విమర్శ అయినా దాన్ని దాడిగా పరిగణించవచ్చు, ప్రభుత్వం ప్రభుత్వ ఆదేశిత హింసకు పాల్పడవచ్చు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోదగిన, నాన్ బెయిలబుల్ నేరాలు. ప్రభుత్వం మెచ్చనిదాన్ని మీరు చెప్పారంటే వెంటనే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చు. బెయిల్ తిరస్కరించవచ్చు. ప్రభుత్వం గురించి మీరు మాట్లాడినా, విమర్శించినా, ప్రభుత్వానికి ఇష్టం ఉండదు. అప్పుడు మిమ్మల్ని జైల్లో పెట్టవచ్చు.
రెండోది, మనస్తాపం చెందడానికి ఒక కమ్యూనిటీకి ఉండే హక్కు. 153-ఎ సెక్షన్లో ఇది ఇమిడి ఉంటుంది. రెండు కమ్యూనిటీల మధ్య సామరస్యతను పెంపొందించడానికి ఉద్దేశించినందున ఇది ఇప్పటికీ అంగీకారమే. 295-ఎ సెక్షన్ అసంబద్ధమైనది, ఎందుకంటే మతాన్ని అవమానించడానికి సంబంధించినది ఇది. నేను మతాన్ని అవమానించేలా ఏదైనా అంటే దాన్ని వెంటనే హింసాత్మక చర్యగా పరిగణిస్తారు. జైల్లో పెడతారు. మళ్లీ ఇక్కడ కూడా పరిగణనలోకి తీసుకోదగ్గ నేరమే, నాన్ బెయిలబుల్ కేసే. మనం మన పురాణాలను చదివినట్లైతే, శివపురాణం చదవండి. బ్రహ్మ గురించి ఏం చెబుతున్నదో దృష్టి పెట్టండి. నా లెక్క ప్రకారం, శివ పురాణం రాసిన వాడిని ఈ సెక్షన్ కింద జైల్లో పెట్టాలి. లేదా రాముని కాలం నాటి పరిస్థితులను చూడండి, ఒక చాకలివాడు ఏకంగా రాజుకే ప్రశ్నలు సంధించాడు. ఆ చాకలివాడు లేవనెత్తిన ప్రశ్నతో నేను ఏకీభవించను. కానీ, ఆ వ్యక్తి రాజును ప్రశ్నించగలిగాడు. అందుకుగానూ ఆ చాకలి తల నరకలేదు. జైల్లో పెట్టలేదు. ఆ ప్రశ్న ఏంటో విన్నారు. దానిపై చర్చించారు.
ఇక మూడోది, పరువు నష్టం. ఐపీసీలోని 499, 500 సెక్షన్లు - ఇవి సివిల్బీ క్రిమినల్ పరువు నష్టాలను పేర్కొంటున్నాయి. ఈనాడు మనకున్నది మనస్తాపానికి గురయ్యే హక్కును ప్రోత్సహించే చట్టబద్ధమైన చట్రపరిధి. నేను మీ మీద నిందలు, అపవాదులు మోపవచ్చు. ప్రభుత్వంతో నాకు తగిన సంబంధాలుంటే మీరు వేధింపులకు గురవుతారు. ఈ అధికారాల్లో చాలా వాటికి ఎలాంటి అడ్డూ అదుపు లేదు. ఇక్కడ నాకు - దేశద్రోహం కేసుల నమోదుకు కొన్ని మార్గదర్శకాలు విధించాల్సిన అవసరం ఉందంటూ సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టు అన్న- ఒక విషయం గుర్తుకు వస్తోంది.
భారతదేశం తన రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత సెక్షన్ 124-ఎ తన కాలానుగుణ్యతను కోల్పోయిందని నేను భావిస్తున్నా. రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత ఈ చట్టాన్ని ప్రవేశ పెట్టినట్లైతే ఇది పరిశీలనలో ఉండేదని నేను అనుకోను. హింసను నివారించడంలో నీకు సాయపడేందుకు ఐపీసీలో చాలా సెక్షన్లు ఉన్నాయి. హింసను రెచ్చగొట్టడానికి వ్యతిరేకంగా సెక్షన్ 505 ఉంది. కానీ, ఒక మతాన్ని అవమానించడాన్ని ఎన్ని రకాలుగానైనా అన్వయించుకోవచ్చు. ఎవరైనా దీనిపై ఫిర్యాదు చేయవచ్చు. కనీసం ప్రయివేటు ఫిర్యాదులకైనా మనం చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. సెక్షన్ 53 లేదా 295 కింద దాఖలైన ప్రయివేటు ఫిర్యాదును తప్పనిసరిగా అటార్నీ జనరల్ లేదా కనీసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వంటి సీనియర్ లా అధికారికి పంపాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు వారి అనుమతి తీసుకోవాల్సి ఉంది.
వ్యక్తిగతంగా ఇక్కడ నాకు సంబంధించిన కేసు ఒకటి ఉంది. ''షేమ్ ఆన్ యు, ప్రైమ్ మినిస్టర్'' అన్న వ్యాసం రాసినందుకు సెక్షన్ 295 కింద నా మీద కేసు దాఖలైంది. సెక్షన్ 295-(ఎ)ను ఎందుకు వర్తింపచేశారో నాకు తెలియదు. ఎందుకంటే 295-ఎ మతాన్ని అవమానించడానికి సంబంధించినది. కానీ ఎవరో గుజరాత్లోని రాజ్కోట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 295-ఎ కింద కేసు నమోదైంది. దీన్ని ఫిర్యాదు స్థాయిలోనే నివారించడానికి చూడాలి. ఈ సెక్షన్లలో చాలావరకు - ప్రభుత్వాన్ని, కమ్యూనిటీని, న్యాయవ్యవస్థను, చట్టసభను, వ్యక్తులను మనస్తాపానికి గురిచేసే హక్కు - భావ ప్రకటనా స్వేచ్ఛలోని భాగమే.
ప్రస్తుతమున్న వ్యవస్థను, ప్రభుత్వాన్ని, అధికారంలో వున్నవారిని సవాలు చేయడానికి మనల్ని మనమే అనుమతించుకోకపోతే మనం ఎన్నటికీ ఎదగలేం. మెరుగు పడలేం. అధికారంలో వున్న వారిని నిరంతరం సవాలు చేస్తున్నందునే మనం ఇంత దూరం వచ్చాం. వారు మొగల్ పరిపాలకులైనా, బ్రిటిష్ వారైనా లేదా ప్రస్తుత పాలకులైనా ఎవరైనా కానివ్వండి. మనం నిరంతరంగా సవాలు చేస్తూనే ఉండాలి. విమర్శిస్తూనే ఉండాలి. అధికారంలో వున్నవారి సున్నితత్వాన్ని (సెన్సిబిలిటీస్) తరచూ బాధపెడుతూ ఉండాలి. ఆ రకంగానే మనం ఇంత దూరం రాగలిగాం. ఈ హక్కును మనం అట్టిపెట్టుకుంటేనే మనం మరింతగా ఎదగగలుగుతాం. లేనిపక్షంలో, 'నన్నంటుకోకు' (టచ్ మి నాట్) అన్న సమాజం స్థాయికే మనం కూడా దిగజారిపోతాం.
- కన్నన్ గోపీనాథన్
వ్యాసకర్త - 2012 బ్యాచ్ ఐఎఎస్ అధికారి