Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిగా, సాహితీవేత్తగా సుప్రసిద్ధులయినప్పటికీ ఇటీవలి కాలంలో మీరు మానవవాద రచయితగా బాగా వ్యాప్తిలోకి వచ్చారు. అందువల్ల ఒక మానవ వాద రచయితకు ఏవేవి అవసరమవుతాయో చెప్పండి!
మానవాద రచయితగా నిలబడాలంటే చాలా అవసరమవుతాయి. ముందు తను మనిషినని గుర్తుంచు కుని, మనిషి కేంద్రంగా జరుగుతూ వచ్చిన అన్ని పరిణామాల్ని ఆకళింపు చేసుకుని, మనిషి సాధిస్తూ వచ్చిన - వస్తున్న విజయ పరంపరలోని స్ఫూర్తిని స్వీకరిస్తూ సమాజంలో మానవీయ విలువల ప్రతిష్టాపనకు తనను తాను అంకితం చేసుకుని రచనలు చేసిన వారు మాత్రమే మానవవాద రచయితలు కాగలరు. ఒకవైపు ప్రగతిశీల భావజాలం ఉండాలి. మరోవైపు హేతువాది అయి ఉండాలి. వీటికంటే ముఖ్యంగా వైజ్ఞానిక దృక్పథం గలవారై ఉండాలి!
కవిత్వం, కళల్ని, పక్కనపెట్టి మూఢనమ్మకాల నిర్మూలనకు మాత్రమే పనిచేయాలంటారా?
లేదు. వాటిని పక్కనపెట్టాల్సిన పనిలేదు. అయితే మానవవాద దృక్పథం ఇప్పుడు చాలా చాలా అవసరం అనేది మాత్రం తక్షణం గుర్తించుకోవాలి! మనిషిలోని సున్నితత్వాన్ని, మృదు భావాన్ని గుర్తించగల నేర్పుతో పాటు, అన్యాయంపై ఆక్రోషించే గుండెధైర్యం కూడా ఉండాలి. సామాజిక స్పృహ ఉండటం తప్పనిసరి. అయినా, అంతకు మించి రాజకీయ, ఆర్థిక అసమానతలను విశ్లేషించుకోగల నేర్పుగలవారే మానవ వాద రచయితలు కాగలుగుతారు. సాహిత్యం, కళలు, సంస్కృతీ సంప్రదాయాలపై అవగాహన ఉంచుకుటూనే, ఆధునిక సమకాలీన సమాజానికి పనికిరాని వాటిని నిర్ద్వందంగా వదులుకోగలగాలి. తొలి నాళ్ళలో ఆది మానవుడు ప్రాథమిక దశలో ఏర్పరుచుకున్న విశ్వాసాల గుట్టు విప్పి చెపుతూ మూఢ నమ్మకాల నిర్మూలనకు కలం పట్టాలి. మరీముఖ్యంగా నిజాయితీ, నిబద్దతాలేని రచయితలు మానవవాద రచయితలు కాలేరు.
అసలు ఒక మానవవాది పరిధి ఏమిటి? ఆ వాదాన్ని సమర్థించే రచయితలు ఏయే విషయాల మీద రాయాలంటారు?
విశ్వమంతా తనది. విశ్వమానవులంతా తనవారు. ఎవరికీ ఏ ప్రత్యేకతలూ లేవు. అగ్ర వర్ణాలు, నిమ్నకులాలు అంటూ ఏవీలేవు. మానవులంతా ఒకటే. మానవ జాతి అంతా ఒకటే. అయితే అంతా ఒక మిశ్రమ సంతతేనన్న నిజం గ్రహించిన వారే మానవవాదు లవుతారు. మళ్ళీ మానవవాదులంతా రచయితలు కాలేరు. కార్యకర్తలు కాలేరు. జనానికి స్ఫూర్తినివ్వగల ఉపన్యాసకులు కాలేరు. ఎవరెవరు ఏఏ పనులు బాగా చేయగలిగితే, ఆయాపనులు ఎంచుకోవడం అవసరం. వారి వారి స్థాయిలో, వారి వారి పరిధిలో పనిచేస్తూ ఉండటం అవసరం. దేశ కాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, వారి వారి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమస్యలకు పరిష్కారాలు వెతకగలగాలి. దీన్ని మూఢత్వంపై ప్రకటించిన పోరాటంగా భావించాలి. ఒక్కో మానవవాది ఒక్కో పోరాట యోధుడు కావాలి. అప్పుడే ప్రపంచ సమాజంలో, ముఖ్యంగా మన భారతీయ సమాజంలో ఒక కొండలాగా ఉన్న అంధవిశ్వాసాల్ని బద్దలు కొట్టగలం. అందుకే తక్షణం మానవవాదాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఏర్పడింది.
తరచూ మానవతావాదం, మానవవాదం అనే రెండు పదాలు వినిపిస్తుంటాయి. ఈ రెండూ ఒకటేనా? లేక తేడా వుందా? వాటిగురించి చాలామందికి స్పష్టమైన అవగాహన వుండటం లేదు. కొంచెం విపులంగా వివరించండి!
ఈ రెండు పదాలు వేరు వేరు. దయ, జాలి, కరుణ, జీవకారుణ్యం వంటి లక్షణాలు గల వారినెవరినైనా మానవత్వం గలవారిగా గుర్తిస్తాం. మానవత్వం ప్రదర్శించిన వారంతా మానవవాదులు కారు. దేవుడిని, మానవాతీత శకుల్ని నమ్మేవారు కూడా కొందరు మానవత్వంతో ప్రవర్తిస్తారు. అదొక లక్షణం మాత్రమే. ఇంగ్లీషులో దీన్నే HUMANITARIANISM అని అంటున్నాం. కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని చోట్ల మానవత్వంతో వ్యవహరించడం తాత్కాలికం కావొచ్చు. అది జీవన విధానం కాదు. దీని పరిధి చిన్నది. ఇక మానవవాదులు - అంటే HUMANISTS. వీరు ఏ అతీంద్రియ శక్తుల్ని నమ్మరు. కేవలం మనిషి కేంద్రంగా వారి ఆలోచనలు, ఆచరణలు సాగుతాయి. కార్యకారణ సంబంధాన్ని వెతుక్కుంటూ, ప్రశ్నను ఒక దివిటిగా చేసుకుని ముందుకు పోయేవారు మానవవాదులు. ఎల్లవేళలా మానవత్వంతో వ్యవహరిస్తారు. ఇదొక జీవన విధానం. మానవ వాదం పరిధి చాలా పెద్దది. ఎన్నో వాదాల్ని కలుపుకుంటూ పోతేగాని, అది మానవవాదం కాదు.
- పర్యావరణ సమస్యలు, కాలుష్య సమస్యలు వంటివెన్నో సామాజిక సమస్యలుగా మారిపోయ్యాయి. ఇలాంటి వాటిని మానవవాదం ఏ దృష్టితో స్వీకరిస్తుంది?
మానవవాదాన్ని నిర్వచించుకున్న సందర్భంలో మనం కొన్ని అక్కడ చెప్పుకున్నాం. అలాగే మానవవాదంలో ఇమడని ప్రపంచ సమస్యే లేదు. మనం ఆ పరిధిలో, ఆ స్థాయిలో ఆలోచించగలిగితే విషయం అర్థమవుతుంది. అణుయుద్ధం, వివిధ దేశాల సంబంధాలు, ఆర్థిక ఒడిదొడుకులు, రాజకీయాలు, కరువులు, కాటకాలు, ఉప్పెనల.. దగ్గరి నుంచి ఉద్యమాలు, హక్కులు, పోరాటాలు వంటి వాటినన్నింటినీ మానవవాదం ఇముడ్చుకుంటుంది. అంటే, మానవ జీవితానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ఎలాంటి విషయమైనా, అది విశాల ప్రాతిపదికన మానవ వాదానికి సంబంధం కలుపుకుంటుంది. ఉదాహరణకు అంతరిస్తున్న వన్యప్రాణులైనా పరోక్షంగా మానవ జీవితంపై ప్రభావం చూపుతాయి కదా? అందువల్ల అదికూడా మానవ వాదంలోని విషయమే! ప్రత్యక్షంగా మానవాళి జీవితం దుర్భరం చేస్తున్న గాలి, నీటి, ఆహార కాలుష్యాలు ఎలాగూ మానవ వాదంలో భాగమవుతాయి. జీవకోటి మనుగడ కోసం తమను తాము అర్పించుకుని, పరిశోధనల్లో నిమగమైన శాస్త్రవేత్తల జీవితాలు, సామాజిక కార్యకర్తల జీవితాలు, సమాజ ఉద్ధరణకు కార్యరంగంలోకి దూకిన మహానుభావులందరి జీవితాలు మానవవాదులకు స్ఫూర్తి నిచ్చే విషయాలే!
- మానవ వాదాన్ని కేంద్రంగా చేసుకుని, ఉధృతంగా రాస్తున్న మీరు ఇటీవల ప్రకటించిన గ్రంథాలేవీ? చదవా లనుకునే వారి సౌకర్యం కోసం వివరంగా చెప్పండి.
ఓ - తప్పకుండా. 'మానవవాదం - జీవన నినాదం', 'మానవవాదం - జీవనాధారం' అనే రెండు పుస్తకాల్ని నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్ వారు ప్రచురించారు. 'మూఢనమ్మకాల్ని వదిలిద్దాం!'- జనవిజ్ఞాన వేదిక ప్రచురించింది. ప్రజాశక్తి, నవ తెలంగాణ బుకహేౌస్లలో దొరుకుతుంది. 'సామాజిక జీవనంలో వైజ్ఞానిక స్పృహ' నవ చేతన పబ్లిషింగ్ హౌస్ ప్రచురిం చింది. 'మూఢనమ్మకాలు - సైన్సు' - 'ఎయిడ్స్' - 'విజ్ఞాన పథంలో విజయఘట్టాలు', 'నేనంటే ఎవరు?', 'మనిషి - మతం - విజ్ఞానశాస్త్రం' లాంటివన్నీ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ వారు ప్రచురించారు. వీటిలో కొన్ని పునర్మద్రణలు పొందుతున్నాయి. 'భారతీయ వైజ్ఞానిక వికాసం' - అనే పుస్తకాన్ని తెలుగు అకాడమీ ప్రచురిం చింది. దీని ఆధారంగా ఎస్సీఈఆర్టీ వారు భారతీయ శాస్త్రజ్ఞుల మీద ఒక డాక్యుమెంటరీ వీడియో రూపొందిం చారు. కావల్సిన వారు యూట్యూబ్లో చూడొచ్చు.
మానవ వాదాన్ని జనంలోకి ఎలా తీసుకుపోవాలంటారు? కార్యకర్తలకు ఏవైనా సూచనలివ్వండి.
అవును. అది చాలా ముఖ్యం. అన్ని మాధ్యమాల ద్వారా తీసుకుపోవాలి. ముఖ్యంగా బాల బాలికలకు, యువతీ యువకులకు.. వాస్తవానికీ, అవాస్తవానికీ మధ్య తేడాను గుర్తించగలగడం నేర్పించాలి. మన పూర్వీకుల్లాగా కట్టుకథలు నమ్ముతూ బతికే అవసరం కల్పించొద్దు. ప్రతిదాన్నీ ప్రశ్నించు కుంటూ, తర్కబద్ధంగా విషయాన్ని చర్చించు కుంటూ, వారి జీవితాల్లో మానవీయ విలువల్ని నిలుపుకునేట్లు చేయాలి. నైతికతకు కట్టుబడి ఉండేట్టు చేయాలి. మూఢ విశ్వాసాలకు దూరంగా ఉంటూ, మానవుడి విజయ పరంపరను శోధించుకునేట్లు చేయాలి. ఆలోచనా ధోరణి మారితే ఎలాగూ జీవనశైలి మారుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మార్పు వస్తూ ఉంది. తప్పదు. ఇక మన దగ్గరకూడా మార్పు వస్తుంది. ఎందుకంటే, కొత్తతరం ప్రశ్నిస్తోంది. ఆలోచిస్తోంది. అన్వేషిస్తోంది. అధ్యయనం చేస్తోంది. రాబోయే తరాలే ఇక ఈ మానవవాదాన్ని నిలబెట్టాల్సి ఉంది. దానికి ముందు, ప్రశ్నను, తర్కాన్నీ నిలబెట్టుకోవాలి!
- మీరు చెప్పేదానికీ నేటి ప్రభుత్వాల వైఖరికి వైరుధ్యం వేంది కదా?
ఉంది. ఉంటుంది. కానీ, అంతిమ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు బలవంతులయితే ప్రభుత్వాలు ఏమీ చేయలేవు. అబద్దపు ప్రచారాలతో మనుగడ సాగిస్తున్న ప్రభుత్వాలు ప్రజా బలం ముందు తలవంచక తప్పదు. సమాజంలో మనం నిత్యం చూస్తున్న అమానుష చర్యలు ఆగిపోవాలంటే ముందు జనమంతా వివేకవంతులు కావాలి. క్రమశిక్షణ గల నీతిమంతులు కావాలి. ప్రజల్లో రావాల్సిన మార్పు కోసం మనమంతా కలిసికట్టుగా అనునిత్యం కృషి చేస్తూ ఉండాలి. క్రీ.పూర్వమే మన చార్వాకులు, బుద్ధుడు చేప్పిన బోధనలు నాశనం కాకుండా కొనసాగి ఉంటే.. మనదేశం ప్రపంచంలో ఒక ఆదర్శ మానవవాదదేశంగా నిలబడి ఉండేది. సరే ఘోరమైన తప్పిదాలు జరిగాయి. అందుకు కారకులయిన వారిని నిందిస్తూ సమయం వృధా చేయడం కంటే... సమాజాన్ని పునరుద్ధరించుకోవడం మేలు! ఆధునికంగా పైపైన ఎన్ని మార్పులు వస్తున్నా, అంతర్గతంగా మానవత్వాన్ని, మానవవాదాన్నీ నిలుపుకోవాలి. మనిషిని బతికించు కోవాలి. మనిషి మనుగడకు అవసరమైన వాటినన్నింటినీ పరిరక్షించుకోగలగాలి! తప్పదు - మరో మార్గం లేదు!! ముందు మనిషే అంతరించిపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. అందుకే అన్ని రకాలుగా మనిషిని బతికించుకోవాలి అంటున్నది. ఇక, దేశంలో శత్రువు అడ్డదారిలో బలపడుతున్నప్పుడు భావసారూప్యం గల సంస్థలు, సంఘాలు, వ్యక్తులు సంఘటితమై సంఘర్షిం చాల్సిన సమయం వచ్చింది. ఇటీవల లాల్-నీల్ ఏకమై పనిచేయడం మంచి పరిణామం. అలాంటివి ఇంకా ఇంకా జరగాలి. లేకపోతే మళ్ళీ ఆటవిక, అనాగరిక సమాజంలోకి నెట్టివేయబడతాం!
- ఇంటర్వ్యూ: డి. హనుమంతరావు,
సెల్: 8247848044