Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నారదుడు సత్యలోకంలోకి ప్రవేశించాడు. సరస్వతి, బ్రహ్మలకు నమస్కరించాడు. ''మాతా పితలారా! నాకోక ధర్మ సందేహము కలిగినది. దయచేసి నివృత్తి చేయండి!'' అని కోరాడు.
''అడుగు నాయనా! తప్పక నివృత్తి చేసెదము.'' అన్నారు సరస్వతీ, బ్రహ్మలు.
''జీవులు అనగా ఎవరు?'' ప్రశ్నించాడు నారదుడు.
''బ్రహ్మదేవుడు ఫక్కున నవ్వాడు.'' అయ్యో నారదా! ఇంత అమాయకుడివి ఎప్పుడయ్యావు? నాచే సృష్టించబడి, ప్రాణం కలిగినవన్నీ జీవులు నాయనా!'' అన్నాడు.
నారదుడికి ఆ సమాధానం సంతృప్తి కలిగించలేదు. తల అడ్డంగా ఊపాడు. బ్రహ్మ, సరస్వతి ఏవేవో వివరణలు ఇచ్చారు. కాని నారదుడి ధర్మసందేహం తీరలేదు. అసంతృప్తిగానే అక్కడి నుంచి బయలుదేరాడు. సరాసరి కైలాసం చేరుకున్నాడు. అక్కడ మహాశివుడు తపస్సులో ఉన్నాడు. పక్కనే పార్వతి భర్తకు పరిచర్యలు చేస్తున్నది.
''ఆది దంపతులకు ప్రణామాలు!'' నమస్కరించాడు నారదుడు.
''ఏమి నారదా! ఇలావచ్చితివి!'' తపస్సు చాలించి ప్రశ్నించాడు శివుడు.
''మహాదేవా!జీవులనగా ఎవరు?'' అంటూ ధర్మసందేహాన్ని వెలిబుచ్చాడు నారదుడు.
''పరమశివుడు చిన్నగా నవ్వాడు.'' జనన మరణములు, పొందునదే జీవులునారదా! వివరించాడు మహాశివుడు.
''నారదుడు షరా మామూలుగా తల అడ్డంగా తిప్పాడు. జీవక్రియల గురించి, జీవుల పెరుగుదల గురించి, పునరుత్పత్తి గురించి ఎంతో సోదాహరణగా వివరించాడు శివుడు. అయినా నారదుడికి సంతృప్తి కలుగలేదు. కైలాసం నుంచి వెనుదిరిగాడు. ఏమి చేయాలా అని ఆలోచించాడు.
ఇక మిగిలింది వైకుంఠం. వైకుంఠం చేరుకున్నాడు. అక్కడ నారదుడు అనుకున్నట్లే విష్ణుమూర్తి యోగనిద్రలోనూ, లక్ష్మీదేవి ఆయన పాదాలచెంతా ఉన్నది.
''నారాయాణ! నారాయణ!'' అంటూ లక్ష్మీదేవి, విష్ణువులకు నమస్కరించాడు నారదుడు.
''ఏమి నారదా! చాలా కాలానికి వేంచేశావు. ఏమివిశేషాలు?'' ప్రశ్నించాడు విష్ణుమూర్తి.
''దేవా! నాకొక ధర్మసందేహము కలిగినది! అట్టి సందేహ నివృత్తికి అన్నిచోట్లా ప్రయత్నించితిని. కాని నివృత్తికాలేదు. ఇక నీవు దక్క మరెవ్వరూ లేరు. దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయుము!'' అని ప్రార్థించాడు నారదుడు.
''అయ్యో! నారదా! ఎందుకు ఇంతగా వ్యాకుల చెందుతున్నావు. నీ ధర్మసందేహమేదో అడుగుము. తీర్చివేసెదను'' అన్నాడు విష్ణుమూర్తి.
''జీవులు అనగా ఎవరు?'' అడిగాడు నారదుడు.
విష్ణుమూర్తి కొద్దిసేపు ఆలోచించాడు. నిజానికి ఇది చాలా చిన్న సందేహమే! నారదుడికి తెలయనంత పెద్ద సమస్య కాదు. కాని నారదుడు ఎప్పుడూ, ఏది చేసినా లోకకల్యాణము కోసమే చేస్తాడు! ఈ ధర్మసందేహాన్ని సందర్భంగా చేసుకుని ఒక గొప్ప సందేహాన్ని, సకల చరాచర విశ్వానికి అందచేయాలని, నారదుడి ద్వారా జీవరహస్యాన్ని అందచేయాలని నిర్ణయించుకున్నాడు.
''నారదా! నీవు అడిగిన ధర్మ సందేహం! ఎంతో మహత్తరమైనది! ప్రతి జీవి తెలుసుకోదగినది! అందుకే నీకు జీవరహస్యము తెలియచేస్తాను వినుము!'' అంటూ ప్రారంభించాడు విష్ణుమూర్తి!
''మన కంటికి గోజరమవుతున్న ఈ విశ్వము ఇదే విధంగా సృష్టించబడిందని అందరూ నమ్ముతుంటారు! అది యధార్థము కాదు. దేనినీ ఎవరూ సృష్టించలేరు! కేవలం మార్చగలరు అంతే! అదే విధంగా సకల చరాచర జీవరాసులు ఇప్పుడు కన్పిస్తున్న రూపంలోనే ఉద్భవించలేదు. పరిణామక్రమంలోనే అభివృద్ధి చెందుతూ, ఈ దశకు వచ్చాయి. కొంతకాలం తర్వాత మరింత మార్పు సంభవించవచ్చును'' అన్నాడు విష్ణుమూర్తి.
''స్వామీ! నారదుడు అడిగింది సృష్టి రహస్యము కాదు. జీవ రహస్యము వివరిస్తానని చెప్పి, మీరు ఇతర విషయాలు చెబుతున్నారు!'' అన్నది లక్ష్మీదేవి.
''దేవీ సృష్టి రహస్యమని చెప్పబడుతున్నది, నిజానికి జీవ రహస్యమే! అందుకే దాన్ని గురించే వివరిస్తున్నాను'' అన్నాడు విష్ణుమూర్తి.
''జీవము పుట్టుక ఒక్క రోజులో జరగలేదు! నిర్జీవ పదార్థము అనేక విధాలుగా మార్పుచెందుతూ, అనేక మూలకాలతో సంయోగము చెందుతూ కంటికి కన్పించని, ప్రాథమిక స్థాయిలో జీవ పదార్థముగా ఏర్పడి, క్రమంగా మార్పు చెందుతూ, ఇప్పుడున్న అనేక రూపాలకు పరిణామం చెందినది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడున్న మనిషి ఇలాగే పుట్టలేదు! ఏకకణ జీవిగా ఉన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగాడు!'' వివరించాడు విష్ణుమూర్తి.
''దేవా! నేను జీవుల గురించి అడిగితే నీవు జీవుల పుట్టుక గురించి వివరిస్తున్నావు!'' అంటూ సందేహాన్ని వెలబుచ్చాడు నారదుడు.
''అక్కడికే వస్తున్నా నారదా! భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామం ఎంతో అని ఒక మహాకవి ప్రవచించాడు. జీవుల నిర్వచనం ఎక్కడో లేదు. జీవుల పుట్టుకలోనే దాగి ఉంటుంది. అందుకే నీకు ముందుగా జీవులు ఎలా ఏర్పడ్డాయో వివరించాను. ఏక కణ జీవిగా ఉన్న జీవ పదార్థం మానవుడిగా అత్యున్నత స్థాయికి అభివృద్ధి చెందిన పరిణామ క్రమంలో ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో ప్రతిఘటనలూ ఎదురయ్యాయి. వాటిని తట్టుకుంటూ, అధిగమిస్తూ, పురోగమించింది'' వివరించాడు విష్ణుమూర్తి.
నారదుడు, లక్ష్మీదేవి శ్రద్ధగా వింటున్నారు.
''తన మనుగడ కోసం జీవ పదార్థం, తనకెదురైన ప్రతికూల పరిస్థితులపై పోరాటం చేసింది. అభివృద్ధి చెందింది. మరికొన్ని సార్లు ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలచుకుంది. ఈ పోరాటాలు సర్దుబాట్లు జరిగే క్రమంతో ఇంత నష్టం జరిగింది. ఐనా జీవ పదార్థం నిలదొక్కకుని, పురోగమిస్తున్నది. ఇంకా ఒక్కమాటలో చెప్పాలంటే జీవం అంటే తన మనుగడ కోసం పోరాటం చేసే లక్షణం కలిగినది. ఈ పోరాటం తన చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితులకోసమో, తనను అంతం చేయాలని చూసే సాటిజీవరాసులపైన కూడా జరుగుతుంటుంది'' వివరించాడు విష్ణుమూర్తి.
నారదుడి ధర్మసందేహం తీరింది! సంతోషపడ్డాడు. వెంటనే మళ్ళీ ఒక అనుమానం వచ్చింది.
''అయితే ఆందోళనా జీవులు అనే కొత్తజాతి పుట్టిందంటున్నారు. నిజమేనా దేవా!'' ప్రశ్నించాడు నారదుడు
విష్ణుమూర్తి చిన్నగా నవ్వాడు.
''జీవం అంటేనే పోరాటం! అని ఇంతకు ముందు చెప్పాను. ఆందోళన అంటే కూడా పోరాటమే! జీవ పదార్థం చేసే పోరాటం అంతర్గతంగా, బహిరంగంగా జరుగుతుంది. అంతర్గతంగా చేసే పోరాటం కంటికి కనిపించదు. తొమ్మిది నెలలు నిండిన తర్వాత తల్లి బిడ్డను ప్రసవిస్తుంది. అయితే తొమ్మిది నెలల పాటు తల్లి గర్భంలో ఎంతో పోరాటం జరుగుతుంది. ఇది అర్థం చేసుకోలేని మూర్ఖులు అప్పుడే బిడ్డ పుట్టింది అంటారు. అదేవిధంగా అంతర్గతంగా జరిగే పోరాటం గురించి తెలియని మూర్ఖులు, బహిరంగ పోరాటం జరుగుతున్నప్పుడు, కొత్తగా పోరాటం జరుగుతుందని, ఆందోళనచేసే జాతి ఏర్పడిందని అంటుంటారు! ఆందోళనా జాతి కొత్తగా ఏమీ పుట్టదు. అది కూడా జీవం యొక్క లక్షణమే. ముందే చెప్పినట్టు ఆందోళన అనేది పోరాటము యొక్క రూపమే!'' వివరించాడు.
''అయితే ఆందోళనా జీవులు అనబడుతున్న రైతు జీవులు యొక్క భవిష్యత్ ఏమిటి దేవా!'' మరో సందేహం వెలిబుచ్చాడు.
''చాలా స్పష్టమే! పోరాటం జీవం యొక్క లక్షణం! విజయం పోరాటం యొక్క ఫలితం! ఇది పరిణామక్రమం'' అన్నాడు విష్ణువు.
ఇది కూడా పూర్తిగా వివరించండి దేవా! అన్నాడు నారదుడు.
పరిణామం ఎలా ఉంటుందో ఒక్క ఉదాహరణ తెలుపుతాను వినుము. క్రికెట్ దేవుడిగా ఘనత వహించిన సచిన్ టెండూల్కర్ ఎవరో తెలియదని, టెన్నిస్ క్రీడాకారిణి షరపోవా ప్రకటించగానే షరపోవా ఎవరో మాకు తెలియదని కోట్లాది మంది నెటిజన్లు సామాజిక మాధ్యమాలల్లో ప్రకటించారు. అదే సచిన్ టెండూల్కర్, రైతులకు వ్యతిరేకంగా ఒక్క ట్వీట్ చేయగానే, అదే కోట్లాది మంది నెటిజన్లు షరపోవాకు క్షమాపణలు చెబుతూ, సచిన్ టెండూల్కర్ ఎవరో మాకు తెలియదంటూ సామాజిక మాధ్యమాల్లో హౌరెత్తించారు. చూశావా పరిణామక్రమం అంటే ఏమిటో! పోరాట ఫలితం కూడా అలాగే వస్తుంది. రైతు విజయం తథ్యం! ప్రకటించాడు విష్ణుమూర్తి!
సందేహాలన్నీ తీరి సరికొత్త ఉత్సాహంతో నారదుడు సెలవు తీసుకున్నాడు.
- ఉషా కిరణ్