Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులలో ఈ రోజుకి ఎంతో ప్రాధాన్యత కలదు. కానీ సైన్స్ దినోత్సవంకి గల ప్రాధాన్యత గురించి సరైన చర్చ, తగు అవగాహన నేడు లేకపోవడం ఒక విషాదకర వాస్తవం. మనదేశ ప్రముఖ శాస్త్రవేత్త సివి రామన్ 1928 నాడు ఇదే రోజున తన ప్రఖ్యాత నోబుల్ బహుమతి ప్రయోగం - రామన్ ఎఫెక్ట్ను ప్రతిపాదించిన రోజుగా దీనికి ఒక గుర్తింపు ఉంది. కానీ ఈ ఫిబ్రవరి 28 కేవలం రామన్ సంస్మరణ దినోత్సవం కాదు. దేశ ప్రగతిలో శాస్త్ర పరిశోధనలకు గల సముచిత పాత్రను గుర్తించడం ఈ రోజు ప్రాధాన్యత. అలాగే దేశ ప్రజలలో శాస్త్రీయ స్పృహను పెంపొందించడానికి కూడా ఈరోజు ఒక సరైన సందర్భం. ఆ విధంగా మన దేశ సామాజిక జీవనంలో ఒక నిర్దిష్ట ఆలోచనకు, భావజాలానికి ప్రాధాన్యం ఇవ్వడం, ప్రచారం చేయడం ఈ సైన్స్ డే యొక్క విశిష్టత. వ్యక్తుల, ఘటనల, విజయాల యొక్క ప్రశంసలకు, ప్రచారాలకు పరిమితం కాకుండా నిర్దిష్ట భావజాలానికి పెద్దపీట వేయడాన్ని ఈ జాతీయ సైన్స్ దినోత్సవ స్ఫూర్తిగా మనం గ్రహించాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో శాస్త్ర ప్రచారానికి పర్యాయపదంగా నిలిచిన జన విజ్ఞాన వేదిక కూడా తన ప్రస్థానాన్ని ఈ రోజునే అనగా ఫిబ్రవరి 28, 1988 నాడు ఉద్దేశపూర్వకంగానే ప్రారంభించింది.
నేటి కాలపు శాస్త్ర వైరుధ్యం
21వ శతాబ్దంలో కూడా శాస్త్రరంగం యొక్క ప్రాధాన్యత గురించి ప్రజలలో ఇంకా ప్రచారం చేయవలసిన అవసరం ఉందా? ఆదిమ మానవుడి నుంచి ఆధునిక మానవుడిగా పరిణామం చెందడంలో శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క ప్రాధాన్యతను బట్టి ఎవరైనా సులభంగా ఈ విషయం అర్థం చేసుకోగలరు. కాని క్షేత్రస్థాయిలో ప్రజలపై ప్రభావం చూపుతున్న అనేక అంశాలను గమనిస్తే నేడు సమాజంలో పెరుగుతున్న అనేక మౌఢ్య, సంకుచిత ధోరణులు బహిర్గతం అవుతాయు. నేడు మన దేశంలో రోజు ఏదో ఒక చోట కులం-మతంపై భక్తితో, దేవుడు-దయ్యంపై భయంతో దాడులు, హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇవి మన ప్రజలలో ఇంకా సజీవంగా ఉన్న అనేక అశాస్త్రీయ ప్రభావాలను సూచిస్తున్నాయి.
నేడు ప్రపంచ మహమ్మారిగా పరిణమించిన కరోనాకు కేవలం వైద్యశాస్త్రమే పరిష్కారాలు చూపుతున్నది. ఇది ప్రపంచ ఉమ్మడి అనుభవం కూడా. కరోనా లాక్డౌన్ నేపద్యంలో డిజిటల్, ఆన్లైన్ సాంకేతికత నేడు విద్యార్థుల జీవితంలో విడదీయరాని అంశంగా మారింది. అలాగే గడప దాటి బయటకు రాలేని నేటి పరిస్థితులలో కూడా మనం అంగారకుడిపైకి, చంద్రుడిపైకి ప్రయాణం చేయగలుగుతున్నాం. కానీ నాణానికి ఇదంతా ఒక కోణం మాత్రమే.
చిత్తూరు జిల్లా మదనపల్లిలో పునర్జన్మ, దైవం పేరుతో హత్యకు గురైన ఇద్దరు అక్కాచెల్లెళ్ల విషాదాంతం. ఢిల్లీలో ప్రభువు పిలుస్తున్నాడని ఒకే కుటుంబంలో దాదాపు 11మంది ఆత్మహత్య. గోదావరి జిల్లాల్లో ప్రార్థనలతో చచ్చినమనిషి బతికి వస్తారని రోజంతా ప్రార్థనలు. ఇవే కాకుండా స్వస్థత కూటములు, పవిత్ర జలం, రంగురాళ్లు, న్యూమరాలజీ, తాయత్తులు, బాణామతి మొదలగు పేరుతో ప్రజలపై జరుగుతున్న ధన, మాన దోపిడీ, హత్యలు.. ఇవన్నీ నాణానికి మరోవైపున నిత్యకృత్యం. మన ప్రజల ఆలోచనా దృక్పధంలో, ప్రవర్తన రీతులలో ఇది ఒక పెద్ద శాస్త్ర వైరుధ్యం. ఈ వైరుధ్య పరిష్కారం పైనే ప్రజలలో శాస్త్రీయ స్పృహ పెరుగుదల సాధ్యం. అంతిమంగా అది దేశ ప్రగతికి సోపానం.
శాస్త్రీయ దృక్పథం - రాజ్యాంగ రక్షణలు
వాస్తవానికి స్వాతంత్య్రానంతర తొలి పాలకులు, ప్రధానంగా పండిట్ నెహ్రూ మన దేశ ప్రగతి శాస్త్ర రంగం ద్వారానే సాధ్యమని గ్రహించారు. ఆధునిక ఉదారవాద భావాలు, హేతువాద దృక్పథం, ప్రపంచ అవగాహన మెండుగా గల నెహ్రూ, శాస్త్రంపై ఆధారపడి మన దేశ ప్రగతికి పునాదులు వేశారు. ఆనాటికి అభివృద్ధి చెందిన ప్రపంచస్థాయి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మన దేశం వివిధ రంగాలలో స్వావలంబన సాధించేలా ప్రణాళికలు రూపొందించారు. వ్యవసాయం, పరిశ్రమలు, నీటిపారుదల, రోదసి, అణుశక్తి, విద్య, వైద్యం మొదలగు అనేక రంగాలలో మన దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు. ఈ సందర్భంగా నెహ్రూ గురించి ఒక విషయం చెప్పాలి - నేడు ప్రపంచమంతా చాలా విరివిగా వాడుతున్న ''శాస్త్రీయ దృక్పథం'' సైంటిఫిక్ టెంపర్ అనే పద ప్రయోగాన్ని తొలిగా ఉపయోగించింది కూడా పండిట్ నెహ్రూనే.
1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ కొన్ని విధులను 51ఏ అధికరణం ద్వారా ప్రజలకు ఇచ్చారు. 51ఏ (హెచ్) అధికరణం ''ప్రజలందరూ శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతను, ప్రశ్నించే తత్వం (జిజ్ఞాస), సంస్కరణాభిలాష కలిగి ఉండాలని'' పేర్కొంటున్నది. ఈ విధంగా మనసమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందేలా అనేక రాజ్యాంగ నిర్ణయాలు, ప్రభుత్వ విధానాలతో మన దేశం తన సుదీర్ఘ ప్రస్థానాన్ని ప్రారంభించింది. దీనికి మనం ఎంతో గర్వించాలి. కానీ ఎంతో విశిష్టమైన ఈ శాస్త్రీయ స్పృహను నీరుగార్చే చర్యలకు, విధానాలకు తర్వాత దశలో ప్రభుత్వాలే పూనుకోవడం ఒక చారిత్రక విషాదం. దీని ఫలితమే నేడు ప్రజానీకంలో గందరగోళం, అశాస్త్రీయ ధోరణులు, విరుద్ధ భావజాల ప్రభావం వేగంగా పెరుగుతున్నాయి.
పెరుగుతున్న కుహనా సైన్సు వాదనలు
గత కొన్ని సంవత్సరాలుగా మనదేశంలో పాలకులే స్వయంగా అనేక అశాస్త్రీయ, కుహనా సైన్సు అభిప్రాయాలను చాలా బలంగా ముందుకు తెస్తున్నారు. స్వయంగా ప్రధానమంత్రి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లలో ఈ రకమైనటువంటి అశాస్త్రీయ అంశాలను మన ప్రాచీన ప్రగతి పేరుమీద ప్రచారంలో పెట్టారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని సామెత. ఈ విధంగా అనేకమంది నాయకులు తమవంతుగా యధాశక్తిన వివిధ సందర్భాలలో సైన్స్ వ్యతిరేక అభిప్రాయాలను నిజమైన సైన్స్గా ప్రజల మీదకి రుద్దుతున్నారు. వీరితో కొందరు శాస్త్రవేత్తలు కూడా తమ గళం కలపడం చాలా శోచనీయం. పురాణ కాలంలోనే మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో ప్రగతి సాధించిందనేది వీరి కుహనా సైన్స్ వాదనల సారాంశం. కౌరవుల జననం - స్టెమ్ సెల్ సాంకేతికత అని, వినాయకుడికి ఏనుగు తల అతికించడం - ప్లాస్టిక్ సర్జరీ అని, ఆ కాలంలోనే పుష్పక విమానం లాంటి విమానాలు మన పూర్వీకులు వాడారని.. ఇలా అనేకానేక కట్టు కథలను, కల్పితాలను మన ప్రాచీన భారతదేశ శాస్త్ర ప్రగతిగా వారు పదే పదే పేర్కొంటూ వచ్చారు. ఈ విధంగా చరిత్రను - పురాణాలను, విశ్వాసాలను - విజ్ఞానాన్ని కలగాపులగం చేసి మనదేశ ప్రజలలో ఒక గందరగోళాన్ని, అయోమయాన్ని, జాతీయ దురహంకారాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నాలతో రెండు ప్రమాదాలు ఉన్నాయి 1. వేల సంవత్సరాల ఘనమైన చరిత్రగల మన ప్రాచీన భారతదేశ నిజమైన విషయాలు, శాస్త్ర సాంకేతిక విజయాలు ఈ హౌరులో మరుగున పడిపోతాయు. 2. రోజు రోజుకి అభివద్ధి చెందుతున్న ప్రపంచ వైజ్ఞానిక సమాజం దృష్టిలో మన దేశం నవ్వుల పాలవుతుంది. ఈ తరహా సూడో సైన్స్ వాదనలను ఇండో-బ్రిటిష్ రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్ కూడా తీవ్రంగా ఖండించాడు. వీటికి పరిష్కారం జనవిజ్ఞాన వేదిక లాంటి సంస్థలు చేసే ప్రజాసైన్స్ ఉద్యమాలేనని ప్రకటించాడు కూడా. మన సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు సర్కస్లాగా మారిపోయాయని తన ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా అనుభవాలు
కరోనా విషయంలో మనదేశ వైఖరి పరిశీలిద్దాం. చివరిలో సైన్స్ సూచించే పరిష్కారాలను అంటే శాస్త్రీయ పద్ధతిలో తయారయ్యే వ్యాక్సిన్ ద్వారానే కరోనాను నిరోధించగలమని మన పాలకులు అంగీకరించారు. అందు కోసం దాదాపు 35వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ఇది సంతోషం. కానీ కరోనా ప్రారంభమైన కొత్తలో దీని గురించి అవగాహన కలిగించడంలో, దీని ప్రభావాన్ని తగ్గించడంలో చాలా అశాస్త్రీయ వైఖరులను ప్రచారంలో పెట్టారు. ఉదాహరణకు దీపాలు వెలిగించడం, పళ్ళాలు కొట్టడం, సాంప్రదాయ వైద్యం పేరుతో నిరూపణ లేని చిట్కా వైద్యాలు ప్రచారం చేయటం, ఆవు మూత్రం తాగడం, పవిత్ర గ్రంథాలు చదవడం లాంటి వాటితో కరోనాని దూరం చేయొచ్చంటూ అనేక అశాస్త్రీయ భావాలను ప్రచారం చేసారు.
ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ వారి రాష్ట్రీయ కామధేను ఆయోగ్ తలపెట్టిన గో సైన్స్ పరీక్షా ప్రహసనం ఈ కోవలోదే. చివరకు ఈ ప్రహసనంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తే సరికి ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ప్రభుత్వం పునరాలోచన చేయడం అందరికీ ఒక ఉత్సాహాన్నిస్తుంది. ఈ రకమైనటువంటి ఒత్తిడిని దేశ విశాల ప్రయోజనాల కోసం శాస్త్రవేత్తలు, సైన్సు ప్రేమికులు, సైన్స్ సంస్థలు మరింత పెద్ద ఎత్తున చేపట్టాలి. ప్రఖ్యాత బెనారస్ విశ్వవిద్యాలయం వారు భూతవైద్యంలో కోర్సు ప్రవేశపెట్టడం కూడా ఈ కోవలోదే. మనదేశంలో పాలకవర్గాల మద్దతుతో విశంఖలంగా పెరిగిపోతున్న అశాస్త్రీయ, మౌఢ్య ధోరణులకు ఒక పరాకాష్ట.
ఈ తరహ కుహనా సైన్స్ ప్రచారాలతో పాటుగా వేలకోట్ల టర్నోవర్ వ్యాపారాన్న కూడా పతంజలి సంస్థ నడుపుతున్నది. కరొనీల్ పేరుతో కరోన నివారణ ''మందును'' పతాంజలి సంస్థ ఈనెల 19న మార్కెట్లోకి మరోసారి ప్రవేశపెట్టింది. ఈ సమావేశానికి స్వయానా వైద్యుడగు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్ కూడా పాల్గొన్నారు. కరొనీల్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్టిఫికెట్ కూడా ఇచ్చిందని ఒక అసత్య ప్రచారాన్ని లంఘించుకున్నారు. బాబా రాందేవ్తో కేంద్ర మంత్రులు కూడా కరోనా పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మన దేశ ఆయుర్వేదానికి తలవంపులు తెచ్చే ఈ అసత్య ప్రచారాలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్తో పాటుగా ప్రజా వైద్యులు, శాస్త్ర ప్రచారకులు తీవ్రంగా ఖండించారు.
మరి కింకర్తవ్యం?
మన దేశానికి దాదాపు ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంత సుదీర్ఘ ప్రస్థానంలో గణితం, ఖగోళం, వైద్యం, మెటలర్జీ మొదలగు రంగాలలో అనేక శాస్త్ర విజయాలు సాధించాం. అలాగే భావజాల రంగంలో మన దేశానికే గర్వకారణమైన ఒక గొప్ప హేతుబద్ధ తాత్వికతను రూపొందించుకున్నాం. వీటి సహాయంతో గతమంతా అనేక అశాస్త్రీయ, మౌఢ్య సంకుచిత భావాలను తిరస్కరిస్తూ వచ్చాం. ఈ క్రమంలో భిన్నత్వాన్ని గౌరవించడం, ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించడం వంటి మనదేశ ప్రత్యేక స్వభావాన్ని సంతరించుకున్నాం. ఇలా గతమెంతో ఘనం. మరి నేడు మన ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. సవాళ్లలో అవకాశాలు చూసుకోవడమే తెలివి. అలాంటి తెలివితేటలు, దూరదృష్టి, విశాల స్వభావం నేడు మనం పెంపొందించుకోవాలి.
ఈ ఆశయాల సాధన కోసం కొన్ని నిర్దిష్ట చర్యలు చేపట్టాలి :
1. శాస్త్రీయ విద్య ఆవశ్యకత : నేడు మన పాఠశాలలో బిడ్డలు నేర్చుకుంటున్న విద్య ఎంతో లోపభూయిష్టమైనది. గుడ్డి కంఠస్థాలు, మార్కుల కోసం తిప్పలు - నేటి విద్యలో ప్రధాన భాగాలు. ఇలాంటి నిస్సారమైన చదువులున్నప్పుడు వాటి సారం పిల్లలకు ఎలా వంట పడుతుంది? అందుకనే నేడు విద్యావంతులలో కూడా మూఢనమ్మకాలు బాగా పెరిగిపోతున్నాయి దీనికి పరిష్కారం బడి విద్యను సంస్కరించడం. జ్ఞాపకశక్తి కాకుండా పరిశీలన, ప్రయోగాల ఆధారంగా శాస్త్రీయ విద్యా బోధన ఉండాలి. అటువంటి చదువు ద్వారానే విద్యార్థికి నిజమైన వికాసం కలుగుతుంది. సమాజం ప్రగతి సాధిస్తుంది.
2. ప్రశ్నించే తత్వాన్ని ప్రజలలో పెంపొందించాలి : నేడు అసహనం పెరిగిపోతోంది. ప్రశ్న పట్ల ద్వేషం, విముఖత పెరుగుతున్నాయి. ప్రశ్నించే వాళ్ళందరనీ తమ ద్రోహులుగా, అభివృద్ధిని ఆటంకపరిచే శక్తులుగా చూస్తున్నారు. ఇది సరికాదు. ప్రశ్న ప్రగతికి సోపానం. మనదేశ ప్రాచీన తాత్విక దర్శనం ఉపనిషత్తులు కూడా ప్రశ్నకు పెద్ద పీట వేశాయి. విభిన్న ఆలోచనలు అన్ని దిశల నుంచి రావాలని రుగ్వేదం చెబుతోంది. మన సాంస్కృతిక వారసత్వం విభిన్నతకు ప్రతిబింబం. కాబట్టి అభిప్రాయ భేదాలను, ప్రశ్నలను అణచివేసే ప్రయత్నాలను మానుకోవాలి. శాస్త్ర ప్రగతికి తొలిమెట్టు ప్రశ్న అన్న విషయం మరచిపోరాదు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లేది కూడా ప్రశ్నతోనే. కాబట్టి శాస్త్రీయ, ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మించుకోవడం నేటి సైన్స్ డే స్ఫూర్తి.
- రాజా
సెల్: 9490098908